Monday, 4 January 2021

పాద పూజ - నీ పాదకమల సేవయు

 

పాద పూజ - నీ పాదకమల సేవయు

https://cherukurammohan.blogspot.com/2021/01/blog-post.html

శ్రీకృష్ణుని చరిత్ర అంతా మనకు భాగవతములోని దశమస్కందములో మొదలౌతుంది. బలరామ కృష్ణులు కంసుని ఆహ్వానమును అకౄరునిచే అందుకొని మధురా నగరము ప్రవేశించి అచట గల తమ భక్తుల తాపముల దీర్చుతూ కంసుని అంతపురమువైపు అడుగులు వేస్తూ వుంటారు. ఆ సందర్భమున వారికి తమ ప్రియభక్తుడగు పుష్పమాలికలు కట్టే సుదాముడు (కుచేలుడు కాదు) గుర్తుకొస్తాడు. దైవస్వరూపులకు భక్తుని భక్తి ప్రాధాన్యము కానీ నేటి ఐశ్వర్యవంతులవలె అంతస్తు ప్రాధాన్యము కాదు కదా!

 బలరామ కృష్ణుల అడుగులు  సుదాముని ఇంటికి దారి తీస్తాయి. .

వారిని చూచిన వెంటనే తత్తరపాటుతో తన ఆసనము నుండి లేచి  నమస్కారముచేసి అర్ఘ్య పాద్యాలను , తాంబూలాలను , పూలు , గంధము మొదలైన వస్తువులను ఆనందభరితుడై వారికి ఇచ్చి, పరిమళాలు వెదజల్లే పూలమాలలతో వారి గళసీమను అలంకరించుతాడు .

అవధి లేని ఆనంద పారవశ్యముతో ఆతను "మీ రాకతో నా ఇల్లు పావనమయ్యినది , తపస్సు పండినది , నా ఇల్లు సిరి సంపదలతో నిండినది. మీరు నాయింట్లో ఉంటె శ్రీమహాలక్ష్మి కూడా మాయింట ఉన్నట్లేకదా! , నా కోరికలన్నీ తీరినాయి. నేను మీకు ఏ విధమైన సేవ చేయగలవాడను" అని ఎంతో వినమ్రతతో కూడిన ఉచ్ఛారణతో అనునయ పూర్వకముగా పలికినాడు. ఎంతో సంతోషించిన బలరామకృష్ణులు ఏ వరము కావాలో కోరుకొమ్మన్నారు .

ఆ సందర్భంలో సుదాముని నోటినుండి వచ్చిన మాటలు పద్య రూపంలో మన కందించినాడు మహనీయుడు పోతన.

నీ పాదకమల సేవయు

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూతదయయునుఁ

దాపసమందార! నాకు దయచేయఁ గదే! భాగవతము - 10.1-1272

తాపసులకు కల్పవృక్షం వంటివాడా! శ్రీకృష్ణా! కమలముల వంటి నీ పాదాల పరిచర్యను, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమినీ, సర్వ ప్రాణులమీద అపరిమితమైన దయనూ నాకు ప్రసాదించు.

 

ఒకానొక కాలములో ఈ పద్యమురాని తెలుగువాడు ఉండేవాడు కాదు. నేడు ఆపద్యము వచ్చినవాడు దొరికేది దుర్లభమైపోయింది.

ఏమయినా కోరి యుండవచ్చు. నిస్వార్థ భక్తి కలిగిన మహనీయులు కళ్ళారా భగవంతుని జూచిన తరువాత వేరేమి కోరుతారు.ఆ ముగ్ధమోహన దేవతామూర్తుల దర్శనంతో కోరికలన్నీ నశిస్తాయి . వారి పాదసేవ వినా పరిశుద్ధ మనస్కులు వేరేమీ కోరలేరు.

 భగవద్వర్ణన , మనుష్య వర్ణనలను ఎట్లా ఆరంభించాలనేదానిపై మన పూర్వులు ఒక నియమం ఏర్పరచినారు.

'అలంకార శేఖరము' అన్న లక్షణ గ్రంధములో ఈవిధముగా చెప్పబడినది.

చిరంతన స్యాసితథా శివచంద్రస్య బాలతా l

మానవా మౌళితో వర్ణ్యాదేవాశ్చరణతః పునః ll

దైవాకార వర్ణన పాదాలతో మొదలుపెట్టవలెనట. మానవాకార వర్ణన మోము తో మొదలుపెట్టవలెనట,

మూక పండితుని ‘పంచశతి’లోని పాదారవింద శతకం కేవలం కంచి కామాక్షీ దేవి పాద వర్ణనకే రచించబడింది. శంకరాచార్యులవారి ‘పాదావికేశాంతస్తవంలోనూ.. పాద మహిమాభి వర్ణన ఉంది. పాదపూజ- పాద పవిత్రత యింత గొప్పది కాబట్టే- పూర్వ పూర్వులైనవారు,

పూర్వము యోగ్యులగు వారికి, వయసులో పెద్దలకు పాద స్పర్శ చేతులతో చేసి నమస్కరించేవారు.  నేడు ఆ తేడాలేకుండా ఎక్కువగా అయోగ్యుల పాదసేవ చేయుచున్నారు.

స్వస్తి

No comments:

Post a Comment