Saturday, 25 December 2021

మహాభారతములో యుయుత్సుడు

 

 

మహాభారతములో యుయుత్సుడు

https://cherukurammohan.blogspot.com/2021/12/blog-post_25.html

యుయుత్సుడు మహాభారతంలోని ప్రముఖ పాత్రలలో ఒకడు. యీతడు ధృతరాష్ట్రునికి 

వైశ్య వర్ణస్తురాలగు దాసీ కుమారుడు. ఇతను ధర్మపరుడు. మహాభారత యుద్ధపు 

ప్రారంభసమయమున. యుధిష్ఠిరుని పిలుపుతో, అతను కౌరవ సైన్యాన్ని విడిచిపెట్టి

పాండవ సైన్యంలో చేరి వారి తరపున పోరాడుతాడు.

గాంధారి గర్భమున నూరుమంది శిశువుల పిండము ఒకటిగా ఉండినది. గర్భవతిగా 

ఆపిందమును మోయుట బరువై తానూ సహజముగా అనుదినమూ చేసే పతిసేవ 

చేసుకోనలేక పోయినది. అందుచే అంధుడగు తన పతిసేవకొరకు,  ఆమె సేవ కోసం 

ఒక వైశ్య యువతిని దాసిగా ఉంచినది. ధృతరాష్ట్రుడు అట్టితరి  ఆమెకు చేరువ 

కావటము తటస్థించినది. తత్ఫలితముగా  యుయుత్సుడు ఆమెకు జన్మించినాడు. 

అతను ధృతరాష్ట్ర కుమారుడగుటచే దాసీ పుత్రుడైనా. విదురునికి రాచ గౌరవము 

లభించినట్లే, యుయుత్సుడికి కూడా రాచగౌరవము ఇవ్వబడినది.

యుయుత్సుడు కూడా అందుకు తగినట్లుగా, విద్యావంతుడు, బుద్దిమంతుడు మరియు 

అన్నివిధములా యోగ్యునిగా నిరూపించుకొన్నాడు. అతను ఏరోజూ  దుర్యోధనుని 

అనుచిత ప్రవర్తనను ఇష్టపడలేదు. సమయము వచ్చినపుడల్లా  ఆతనిని 

వ్యతిరేకించేవాడు. ఈ కారణంగా దుర్యోధనుడు మరియు అతని ఇతర సోదరులు 

అతనికి తగిన ప్రాముఖ్యత ఇవ్వలేదు, పైపెచ్చు, అతనిని ఎగతాళి చేసేవారు.

యుయుత్సుడు అకారణ అధర్మ మహాభారత యుద్ధమును ఆపుటకు తన స్థాయిలో 

ఎంతో కృషిచేసి విఫలుడైనాడు.

ఆంద్ర మాహా భాగవతము, ప్రహ్లాదచరిత్రమున ఈ దిగువన చెప్పినరీతిగా

అంధేందూదయముల్ మహాబధిరశంఖారావముల్ మూకస

ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతఘ్నావళీ

బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడస

ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్తవ్యర్థసంసారముల్.

లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం; చెవిటివాడికి శంఖ ధ్వని వినబడదు

మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు; నపుంసకుడికి కాంత మీద కోరిక ఫలించదు

కృతఘ్నుడికి బంధుత్వం కుదరదు; బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగ 

మైనవి; పిసినిగొట్టు వాడికి సంపదపనికి వచ్చేది కాదు; పందికి పన్నీరు వంటి 

సువాసనలు తెలియనే తెలియవు; అన్నచందమున, అమృతోపమానములగు ఆయన 

మాటలు దుర్యోధనాదుల చెవికెక్కలేదు.

 మహాభారత యుద్ధము ప్రారంభం కానున్న సమయంలో యుయుత్సుడు కూడా 

దుర్యోధనుడి పక్షాన పోరాడేందుకు రంగములోనికి దిగినాడు. కానీ, అదే సమయంలో

యుద్ధం ప్రారంభానికి ముందు, ధర్మతత్పరుడగుయుధిష్ఠిరుడు తనపై నేరము 

ఉంచుకొనకుండా, కౌరవ సైన్యమును ఉద్దేశ్యించుతూ, ఇలా ప్రకటించినాడు - "నాది 

ధర్మపక్షము. ధర్మము కోసం పోరాడాలనుకునే వారు ఇప్పటికీ నా వైపు రావచ్చు. నేను 

అట్టివారికి స్వాగతము పలుకుతాను." ఈ ప్రకటన విని యుయుత్సుడు మాత్రమే కౌరవ 

పక్షం నుండి బయటకు వచ్చి పాండవుల పక్షంలో చేరినాడు. యుధిష్ఠిరుడు ఆతనిని 

ప్రియమార కౌగిలించుకొని స్వాగతము పలికినాడు. కౌరవులు అతన్ని వైశ్యస్త్రీ కొడుకు 

అనీ పిరికివాడు అనీ గేలిచేసినా అతను తన నిర్ణయమును మార్చుకోలేదు.

 

ఇక్కడ ఒక్కమాట యుధిష్ఠిరుని గొప్పదనమును గూర్చి చెప్పవలసియున్నది.

ధృతరాష్ట్ర పుత్రుడయ్యును పాండవ పక్షమున నిలచినది యుయుత్సుడొక్కడే!

అందుచేత ఆతనిని తమతోబాటూ యుద్ధము చేయించ నిచ్చగించినచో ఆతను టా 

అన్నదమ్ములనే చంపవలసిరావచ్చును లేకుంటే వారి చేతిలో తాను మరనిచవచ్చును. 

ధృతరాష్ట్రుని ఏకైక వారసునిగా ఆతనిని నిలుపుటకుగానూ ఈవిధముగా చేసిన 

ధర్మనిష్ఠాగరిష్ఠుడు.

ధర్మజుడు ఆతనిని, యోధుల కోసం ఆయుధాలు మరియు రవాణా సరఫరాలను 

చూసేందుకు నియమించినాడు. అతను చాలా బాధ్యతాయుతంగా ఈ బాధ్యతను 

నిర్వర్తించినాడు. యుద్ధము తర్వాత కూడా అతని పాత్ర ముఖ్యమైనది. మహారాజగు 

యుధిష్ఠిరుడు అతన్ని మంత్రిగా చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడి కోసం విదురుడు 

పోషించిన పాత్ర, యుధిష్ఠరుడి కోసం యుయుత్సుడు పోషించినాడు. ఇది మాత్రమే 

కాదు, యుధిష్ఠిరుడు స్వర్గారోహణ నిర్ణయము తీసుకోన్నప్పుడు, పరీక్షిత్తును రాజుగా 

చేసి, యుయుత్సుని ఆతనికి సంరక్షకునిగా చేసినాడు. యుయుత్సుడు కూడా తన 

జీవితపు చివరి క్షణం వరకు ఈ బాధ్యతను పూర్తి భక్తితో మరియు అంకితభావంతో 

నిర్వహించినాడు.

ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలలో మరియు రాజస్థాన్‌లోని తూర్పు 

ప్రాంతాలలో నివసించే జాట్ ప్రజలు తాము ఆ  మహాత్ముడగు యుయుత్సుని 

వారసులుగా నమ్ముతారు.

స్వస్తి.

Friday, 24 December 2021

శకుని (వ్యాస భారతము లోని శకునిని గూర్చి తెలుసుకోండి)

వారము రోజుల ప్రయత్నము ఈ శకుని వ్యాసము. తెలిసినంతవరకూ తెలియబరచినాను. యువకులు చదివి తెలుసుకొనగలిగితే నా ప్రయత్నము సఫలమైనట్లే. యువతుల కక్కరలేదా అంటారేమో. వాళ్ళే కాబోయే తల్లులు. తప్పక చదివి తీరవలసినవారు . ఇక పెద్దలు తమ పిల్లలతో చదివింప జేసి మన ఇతిహాసమును భవితకందిస్తారని ఆశిస్తాను.

  శకుని

https://cherukurammohan.blogspot.com/2021/12/blog-post_24.html

గాంధార రాజ్యము మహాభారత కాలములో భారత దేశమునకు పశ్చిమమున వున్న రాజ్యము. పుష్కలావతి ,తక్షశిల,పురుషపురములు ఇందలి ముఖ్య పట్టణములు. శ్రీరామ చంద్రుని తమ్ముడు భరతుడు ఈ భూభాగామునేలినట్లు ఐతిహ్యము. మహాభారత కాలానికి సుబలుడు గాంధార రాజు. ఆయనకు అచల,వృక్షక, వృహద్వల, సౌబల అన్న కొడుకులుంటారు. సౌబలుడే శకుని అని పెద్దలనగా విన్నాను. గాంధారి పెద్దది. శకుని అందరికన్నా చిన్నవాడు.

మహాభారత సమయములో, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయవలెననుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది. కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.

ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ములు చిత్రాంగద  విచిత్రవీర్యులకు ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండవచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చితి’నని బంధువుల మధ్య ప్రకటించినాడు. గాంధారి ఆ మాట విని తండ్రి మాటపై గౌరవముతో ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేయుటతో గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది. చక్రవర్తుల సంబంధమగుటచే శకుని హస్తినలోనే నిలిచి పోయెను. ఇంకొక విషయము ఇక్కడ వున్నది . శకుని గాంధారికన్నా చాల చిన్నవాడు. తోడుగా ఉండుటకు కూడా వుండిపోయి ఉండవచ్చును.

ఇక్కడ ఒకచిన్న ప్రస్తాపన. గాంధార రాజైన సుబలుడు ఆస్థాన జ్యోతిష్యులతో తన కుమార్తెకు పెళ్ళయిన తక్షణమే వైద్యము వచ్చునని ఎరిగినవాడై ముందామెను ఒక మేకపోతుకు కట్టి దాని చంపినపిమ్మట ధృతరాష్ట్రునికిచ్చి పెళ్ళిచేసెనని ప్రతీతి. కౌరవ పాండవులు బాల్యమందు మాత్సర్యముచే కౌరవులు 'రండా పుత్రు' లని తిడితే పాండవులు వారిని 'ముండాపుత్రు'లన్నారనీ ఆ కోపముతో వయసు వచ్చిన తరువాత దుర్యోధనుడు గాంధారము పై యుద్ధము ప్రకటించి సుబలుని అతని కుమారులందరినీ చెరసాలలోబంధిస్తే, వారికి వేసే తిండి మెతుకులు అన్నీ కలిపి శకునికి పెట్టి వారు మరణిచినారనీ సుబలుడు చనిపోతూ తన వెన్నెముక లోని ఎముకలతో పాచికలు తయారుచేసుకొని శకునిని వుంచుకొమ్మన్నాడని, దుర్యోధనుని వినాశము కోరినవాడై ఆ పాచికలతో ధర్మరాజును ఓడించి ఆ తరువాత వచ్చే యుద్ధములో దుర్యోధనుని పాండవులు మట్టుపెడతారని ఊహించియే అట్లు చేసినాడని ఒక ప్రచారముంది. దీని మూలములు భారతము నందు కనిపించవు. పైగా సుబలుడు తన పరివారముతో రాజసూయమునకు వచ్చినాడని, యాగము ముగిసిన తరువాత గౌరవంగా అతనిని ధర్మజుడు సాగానంపినాడని భారతమున కలదు. భారత యుద్ధములో సుబలుని వారసులు కౌరవుల పక్షమున పోరాడినారని కూడా యున్నది.

శకుని జన్మనామము సౌబలుడని ముందే చెప్పుకొన్నాము. ఇది కూడా సుబలుని కుమారుడైనందువల్ల నేమో! శకుని గాంధారికన్నా బాగా చిన్నవాడు అని ముందుగానే చెప్పుకోన్నాము. దుర్యోధనునికన్నా బహు కొద్ది సంవత్సరములు పెద్దవాడు అయివుండవచ్చు. అందువల్లనే అతని సహవాసము దుర్యోధనునితో ఎక్కువ బావయైన ధృతరాష్ట్రునితో తక్కువ. బావను చేరి తన మాట వినిపించిన ఉదంతమేదియు భారతమున కానరాదు. సార్వభౌమత్వము పై కామము,తనను అది చేరనందువల్ల క్రోధము అదే సర్వస్వమన్న మోహము తో నున్న దుర్యోధనునకు, మదించిన దుశ్శాసనుడు,తాను పొందిన రాజ్యము దానినిచ్చిన సార్వభౌమునికి తానే సన్నిహితునిగా ఉండాలన్న లోభము కలిగిన కర్ణుడు,తనకు దక్కినస్థానము వేరెవరికీ దక్క కూడదనుకొన్న శకుని దుర్యోధనుని ఆవహించియుండగా అతనికి బంధ విముక్తి బొందె వదిలితేనే కదా. కావున అన్ని విధములైన కుతంత్రములలో మొదలు శకుని పిదప కర్ణుడు ఆపై తందానా తానాకు దుశ్శాసనుడు, చచ్చేవరకు అంటిపెట్టుకొనే ఉండిపొయినారు.

మయ సభలో జరిగిన అవమానమునకు ప్రతీకారముగా జూదమాడి తాను రాజ్యాన్ని సంపాదించి పెడుతానని శకుని దుర్యోధనునితో అంటాడు. సభా పర్వములోని 20,21,22 శ్లోకాలు ఏమితెలుపునంటే 'దుర్యోధనా! జూడమాడుటలో నాకు ఎవరూ సాటి రారు. మీ తండ్రిని ఒప్పించి ధర్మరాజుతో జూదమునకు ఏర్పాటు చేయి.ధర్మజుని రాజ్యలక్ష్మిని సంపూర్తి గా నీకు స్వాధీనమొనర్తు'నని శకుని ఒప్పించినాడు. ఇక్కడే మనకర్థమౌతుంది. శకునికి ధృతరాష్ట్రునివద్ద కానీ, మిగిలిన కురు వృద్ధ ,గురు వృధ్ధ బాంధవుల వద్ద కానీ ఎటువంటి పరపతీ లేదని. దుర్యోధనుడు అందరినీ ఒప్పించుటలో కృతకృత్యుడైనాడు. ఇక శకుని జూదములొ గెలుచుటయే ఆలస్యము.

ఆచార విధానాలు రెండు విధములు. ఒకటి శిష్ఠాచారము రెండవది వామాచారము. ధర్మరాజుది శిష్టాచారమైతే శకునిది వామాచారము. పాచికల విషయములో 'అక్షహృదయ'మను విద్య శిష్టాచారమునకు సంబంధించినదైతే 'పాశాధిష్ఠాత్రి' అనునది వామాచారమునకు సంబంధించిన విద్య. జూదమాడే సమయమునకు ధర్మ రాజుకు 'అక్షహృదయము' తెలియదు కానీ శకునికి 'పాశాధిష్ఠాత్రి' సమగ్రంగా తెలుసు. అందుకే అతను, దుర్యోధనుని చేత, మొదటి సారి మాత్రమే పందెము పెట్టించినాడు. తరువాత వరుస విజయములచేత పందెము పెట్టించే అవసరమే కలుగలేదు శకునికి. ( ఈ విషయమును బ్ర.శ్రీ.వే. మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ద్వారా తెలుసుకొన్నది. ) ఇంతటి ఘాతుకమును తలపెట్టిన శకుని ప్రాణములను యుద్ధములో తీసెదనని ప్రతిన పూనుతాడు సహదేవుడు.

ధర్మజుడు ఈ అక్షహృదయమనే విద్యను అరణ్య వాసములో వున్నప్పుడు బృహదశ్వుడు అను మహర్షి అనుగ్రహముతో నేర్చుకొంటాడు కానీ ఆ తరువాత ఈ ఆట ఆడే అవసరము ధర్మరాజుకు ఏర్పడలేదు.

రాయభారము విఫలమగుటతో ఇరువైపులా యుద్ధమునకు సిద్ధమౌతారు. భీష్ముడు శరతల్పగతుడౌతాడు. ద్రోణుడు విగతుడౌతాడు కర్ణుడు సైన్యాధ్యక్షుడౌతాడు. 17వ రోజున యుద్ధము భీకరంగా జరుగుతూ వుంటుంది. ఆ మహాసంగ్రామములో సహదేవుడు శకునికి ఎదురౌతాడు .

శకుని కుతంత్రుడే కానీ కువీరుడు కాదు. అతడు సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గ్రుచ్చుతాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లగా అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును నాశనం చేయసాగుతాడు. అది చూసి కౌరవసేనలు పారి పోగా సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పుతాడు .సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించుతాడు. శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపించఉతాడు. శకుని కుమారుడైన ఉలూకుడు సహదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించగా సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండించుతాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేయగా సహదేవుడు ఆ మూడు బాణములను ఖండించి శకుని విల్లు విరిచి వేస్తాడు. శకుని మహా కోపంతో సహదేవునిపై కత్తిని, గదను, బల్లెమును ప్రయోగించూతాడు. సహదేవుడు వాటిని మధ్యలోనే ఖండించగా అది చూసి శకుని తన రధ రక్షకులతో సహా అక్కడి నుండి పారి పోతాడు. సహదేవుడు అతడిని నిలువరించి " ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారి పోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది. నాడు జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలలల ఫలితం చూచితివి కదా! మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరిని పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. ఆ సుయోధనుడు చూస్తుండగా నీ తల తెగి నేలను ముద్దాడేలా కొడతాను " అని అంటూ సహదేవుడు శకుని రధాశ్వములను, కేతనమును, విల్లును ఖండించగా అది చూసి శకుని అత్యంత భయంకరమైన శక్తి ఆయుధమును సహదేవుడి మీద విసిరుతాడు. సహదేవుడు ఆ శక్తి ఆయుధమును ఖండించి రెండు చేతులలో రెండు బల్లెములను తీసుకొని అత్యంత వేగంగా శకుని మీద వేసి అతడి తల ఖండించి వేస్తాడు. శకుని తల నేల పడగానే శరీరం కూడా నేల మీదకు వాలిపోతుంది. మహాభారత యుద్ధానికి కారణ భూతుడైన గాంధార రాజు శకుని సహదేవుడి చేతిలో మరణించినాడు.ఆ విధంగా సహదేవుడు తన ప్రతిజ్ఞ నేరవేర్చుకొంటాడు.

స్వస్తి.

Tuesday, 21 December 2021

భారతీయ విశ్వశాస్త్రం మీద పాశ్చాత్యుల వ్యాఖ్యానాలు, అభిప్రాయములు

 

 

భారతీయ విశ్వశాస్త్రం మీద

పాశ్చాత్యుల వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు

https://cherukurammohan.blogspot.com/2021/12/blog-post.html

భారతీయ విశ్వశాస్త్రం , సృష్టి జ్ఞానం మాహాద్బుత విషయాలుగా పాశ్చాత్యులు  పరిగణిస్తారు. ఆర్తర్ హోంస్, ఆలన్ వాట్స్, రోజర్ బెర్ట్ స్చౌసన్, డిక్ టెరిసీ, గయ్ సోర్మన్, కౌంట్ మౌరైస్ మేటర్లింక్, కార్ల్ సేగన్ వంటి మేధావులు, శాస్త్రవేత్తలు భారతీయ విశ్వశాస్త్రంపై అభిరుచి పెంచుకుని, అధ్యయనం చేసి, విషయాలను అవలోకనం చేసుకుని, తమదృక్పథాలను , అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించినారు.

ఆర్తర్ హోంస్ (1895 - 1965), డర్హాం విశ్వవిద్యాలయం ఆచార్యుడు, భూగోళజ్ఞుడు, తాను రచించిన "ది ఏజ్ అండ్ ఆర్ట్" (1913 లో) పుస్తకంలో  "పశ్చిమంలో వైజ్ఞానిక పరమగు దృక్పథము కలుగక పూర్వమే, హిందూ మేధావులు, ఆశ్చర్య పరిచే విషయాలు విశదీకరించి చెప్పుటయేకాక, అందులో భూమి వయస్సు, అనంత కాల పరిమాణములు , బ్రహ్మాండముమరియు  సృష్టి స్థితి, లయ గురించి కూలంకషంగా వివరించినారు " అని విడమరిచి చెప్పినారు.

ఆలన్ వాట్స్, సాన్ ఫ్రాన్సిస్కో లోని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఏషియన్ స్టడీస్, అధ్యక్షుడు మరియు  ఆచార్యుడు. హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో రీసర్చ్ ఫెలోగా మన వేదాంతాన్ని పశ్చిమానికి, చాటుతున్న మేటి. ఆయన  "సాపేక్షత" (Theory of Relativity) భారతీయ తత్వ-వేత్తలకి కొత్తేమీ కాదు. "సాపేక్ష సిద్ధాంతము" (Theory of Relativity)వారికి తెలిసికూడా  దానిని  ఆత్మసాధనకు  ఉపయోగించినారు కాని ఆటం బాంబులు తయారు చేయడానికి కాదు " అని నొక్కి చెప్పినారు.

రోజర్ బెర్ట్ స్చౌసెన్ భారతీయ విశ్వశాస్త్రం మీద తన దృక్పదాన్ని ప్రకటిస్తూ "హిందువులు ఈ జగత్తు యొక్క అపారమైన కాలమానాలు విశధీకరించినారు. Saint ఆగస్టైన్ ప్రకారం ప్రపంచం 5000బీ.సీ లో మొదలయ్యింది.ఈ వివరించిన కాలం భారతీయ కాలమానాలతో పోలిస్తే చలా తక్కువ. ఒక్క బ్రహ్మ రోజు

43, 20,000,000 యేళ్ళు; బ్రహ్మ ఆయుర్ధాయం 311040,00,00,00,000 యేళ్ళు అంటే 311 ట్రిలియన్ యేళ్ళు అనగా 3లక్షల 11వేల 40 కోట్ల సంవత్సరములు. ఇది అత్యంత  అసాధారణ విషయము.

ప్రముఖ రచయిత డిక్ టెరిసీ వైజ్ఞానిక, పరిజ్ఞానిక రంగాలలోఎన్నో వ్యాసాలు, పుస్తకాలు వ్రాసినారు. అందులో "ది గాడ్ ప్రాక్టికల్", "ఇండియన్ కాస్మాలజిస్ట్స్" కూడా ఉన్నాయి. భారతీయ విశ్వశాస్త్రవేత్తల ఆవిష్కరణలను ఉదాహరిస్తూ, భూమి వయస్సు 4 బిలియన్ యేళ్ళ గా ఇచ్చిన వివరణ  నేటి అణు శాస్త్రానికి అనుగుణంగా ఉందని తెలిపినారు . భారతీయ అణు, పరమాణువుల పద్ధతులు, భారత దేశము నుండి పర్షియాకు ,పర్షియా నుండి నుండి పాశ్చాత్య దేశాలకు చేరింది ", అని విశ్లేషించినారు.

అమెరికాలోని స్టాంఫోర్డ్, హూవర్ ఇన్స్టిట్యూషన్ విచ్చేసే ఫ్రాన్స్ దేశ లిబరలిజం నాయకుడు, మేధావి, గై సోర్మన్ " భారతీయ విశ్వశాస్త్ర ప్రతిభ అసాధారణం " అన్న ఖితాబునిచ్చినారు.

1911 లో సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందిన బెల్జియం కవి కౌంట్ మౌరైస్ మేటర్లింక్ (1862 - 1949) తన పుస్తకం "మౌంటెన్ పాత్స్" లో భారతీయ విశ్వశాస్త్రములోని జగత్సృష్టి విషయాలు అత్యంత ప్రాచీన మైనవనీ, అత్యద్బుత సృష్టిని వర్ణిస్తూ, "ఇది ఏ యూరోపియన్ ఊహకు కూడా అందని విషయము’ అంటూ తన విస్మయమును వ్యక్తము చేసినారు. ఈ పుస్తకములో కర్మను గూర్చి వారు వ్రాసిన విశ్లేషణ చదివితీరవలసినదే!

ఈ విధంగా,  సృష్టి ,కాలము, విశ్వము  మొదలగు ఎన్నో విషయాలను  జగతికి చాటిన  మహాద్బుత మేధావులు. ప్రముఖ విశ్వశాస్త్రవేత్త, అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయం ఖగోళ శాస్త్ర ఆచార్యుడు కార్ల్ ఎడ్వర్డ్ సేగన్, భారతీయ విశ్వశాస్త్రాన్ని కొనియాడుతూ " వారి గణితం ఎంతో పురోభివృద్ధి చెందింది. ఆ కాలంలోనే వారు భూమి వయస్సు, ఈ జగత్తు కాలమానం, దాని అనంత కాల పరిమాణాన్ని విశిదీకరించి చెప్పారు. నేడు ఉపగ్రహాలు పంపి, పరిశోధను చేసి ఈ కాలమానాలనే ద్రువీకరించారు. ఇట్టి అసాధారణ ప్రజ్ఞ, జ్ఞానం అలనాటి భారతీయ శాస్త్రవేత్తలలోసర్వసధారణం".

ఒక స్నేహితుడు ,నీ కుర్చీ టేబులు రేడియో టివి ఇలా ఎన్నో పాశ్చాత్యులు కనిపెట్టినారుకదా వారిని దూషించడ మెందుకు అని అడిగినాడు. బల్లలు కుర్చీలు మన వడ్రంగులు పీటలని బల్లలనీ ఆసనములనీ ఇంకా ఎంతో అందమైన విగ్రహాలని చెక్కి మన తరములకందించిన మహానుభావులు. జగదీశ్ చంద్రబోసు వేదశాస్త్రముల సహాయముతో రేడియో కనిపెడితే ఆ గౌరవము మార్కొనీకి దక్కించినారు పాశ్చాత్యులు. మ్క్యన విజ్ఞాన నిధియగు గ్రంధాలయమును ఒక చదువురాని మొరకు. చాపక్రింద నీరై సంస్కృతమున ఉన్న మన విజ్ఞానమునెల్ల దొంగిలించి మనకు సంస్కృతమే కాక సంస్కృతియే లేకుండా చేయుచున్నవారు పాశాత్యులు. ఈ వాస్తవము గమనిచండి  

ఒక క్రొత్త వస్తువు కనుగొంటే దానిమీద పరిశోధనచేసి ఇంకా ఇంకా క్రొత్త వస్తువులు తయారు చేస్తూనే వున్నారు కదా. తపన ఉత్సుకత ఉన్న మానవుడు ఎదో ఒక క్రొత్త అన్వేషణలో వుండనేవుంటాడు. విదేశీయులు మనపై దండయాత్ర చేయునంత వరకు మనది సంపూర్ణ నాగరికత. ఇప్పటికి మనపైన విజాతీయులు చూపే మాత్సర్యమును  గమనించుతూనేవున్నాముకదా!

ఉత్తిష్ఠత! జాగ్రత !ప్రాప్యవరాన్ నిబోధతl

క్షురస్య ధారా నిశితా దురంతయా దుర్ల పథస్తత్కవ యోవదంతిll

లెండి! మేల్కొనండి! గమ్యాన్ని చేరే వరకూ విశ్రమించకండి. ప్రస్థానం చేయవలసిన మార్గం దుర్గమమైంది. అయితే సంకల్ప బలం ఉన్న హృదయానికి సంభవం కానిది ఏముంది?

ఈ కఠోపనిషత్తు వాక్యమును స్వామీ వివేకానంద ఎప్పుడూ గుర్తుచేసేవారు. మేల్కొనండి మన పూర్వులగొప్పదనమును గుర్తించండి, దానిని లోకానికి చాటండి.

స్వస్తి.

Wednesday, 29 September 2021

తెలుగు - తమిళము

 

తెలుగు - తమిళము

 https://cherukurammohan.blogspot.com/2021/09/blog-post_29.html

ఇంగిలీసులోన ఎంతెంతయో వీకు

తెలుగు లోన పూరు తెలియజేయ

కాకినడక పోయె గన హంస నడకయు

‘గొర్రెదాటు జగతి’ గొప్పలిట్లు

ఇటీవల ఒక, అరవమును మాతృభాషగా కలిగిన, వ్యక్తి ఈ విధముగా వ్రాయుట 

జరిగినది. If all the Sanskrit words are taken out from Telegu they will be left 

with 20% whose origin is Tamil’. తెనుగును గూర్చి ఎంతో సుదీర్గముగా, 

సవిస్తారముగా, నేను వ్రాసిన ‘సరసరస’ వ్యాస సంపుటిలో తెలియబరచినాను ఆంధ్రము 

యొక్క మూలములు అసలు  క్రీ.పూ. 10,000 - క్రీ.పూ. 8,000 నుండియే మనకు 

కానవస్తూ ఉన్నాయి.  పాత రాతి యుగమును పరిశీలించితే, కడప, కర్నూలు, 

గుంటూరు, నెల్లూరు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పైన 

తెలిపిన కాలంనాటి పనిముట్లు దొరికినాయి. కడప, కర్నూలు ప్రాంతాలలో 

పలుగురాయి, కృష్ణానది ఉత్తరాన సున్నపురాయి అధికంగా వాడినారు. డోర్నకల్ సమీపంలోని నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రం అనిపిస్తున్నది. క్రీ.పూ. 8,000 - క్రీ.పూ. 6,000 - సూక్ష్మ రాతి యుగము కాలంలో చిన్న పరిమాణం ఉన్న పనిముట్లు వాడినారు. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను పైన తెలిపిన కాలమునాటి  అవశేషాలు లభించినాయి.

క్రీ.పూ. 6,000 - క్రీ.పూ. 2,000 - కొత్త రాతి యుగము - గిద్దలూరులోను, బళ్ళారి జిల్లా 

సంగనకల్లులోను ఈ కాలం అవశేషాలు లభించినాయి. ఈ యుగంలో పెక్కు నూతన 

పరికరములను వాడినారు. నాటికే పశుపెంపకము  పుష్కలముగా ఉండేది. 

మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను 

కనుగొన్నారు. క్రీ.పూ. 2,000 - క్రీ.పూ. 1,000 - రాగి యుగము - బ్రహ్మగిరి, పుదుచ్చేరిల 

వద్ద రాగి, కంచు పనిముట్లు లభించినాయి. కర్నూలు జిల్లా పాతపాడు వద్ద 

అలంకరించిన మట్టి పాత్రలు లభించినాయి.

క్రీ.పూ. 1,000 - క్రీ.పూ. 500 - ఇనుప యుగము - "రాక్షసిగుళ్ళు" అనే సమాధులు ఈ 

కాలంలో నిర్మించినారు. దాదాపు ఆంధ్రదేశం (విశాఖ మినహా) అంతటా ఈ కాలం 

ఆనవాళ్ళు లభించినాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు 

అధికంగా దొరికినాయి. వ్యవసాయం అభినృద్ధి చెందింది. ఆంధ్రులు తాము మాట్లాడు 

భాషను ఏనాడూ ద్రావిడ భాషగా చెప్పుకోలేదు. లేని విషయమునకు కొత్తపదమును 

సృష్టించినది మతప్రచారమునకు వచ్చిన కాల్డ్వెల్ మహాశయుడు. మరి పాశ్హాత్యుని 

మాట మనకు శిరౌధార్యము కదా! అందుచే ద్రావిడ భాష సనాతనమని దాని పెద్దబిడ్డ గా తమిళమును చెప్పవచ్చునని తెలుగు కన్నడము మళయాళము దానినుండి పుట్టినవని తెలిపినారు కొదరు భాషా పండితులు. మరికొందరు తెలుగు సంస్కృత జన్యమేనని వాక్కాణించినారు. పాండిత్యమున కానీ కవిత్వమున కానీ అశేష శేముషీ యుతులగు శ్రీనాథ, పండిత రాయ, శ్రీకృష్ణదేవరాయల కన్నా మిన్న కాదని నా నమ్మకము. వారే సకల భాషలకు జనని సంస్కృతము అని నుడివినారు. మరి గతమునకు ఆధారము పెద్దల మాటయే కదా! ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని ‘ జనని సంస్కృతంబు సకల భాషలకు’ అని ఏ భాషకు చెందినా ఏ పండితుడూ తన మాత్రు భాషను గూర్చి చెప్పుకోలేదు. ఎన్నో వేల సంవత్సరముల ముందునుండి వున్నా తెనుగు ‘Italian of the East’ కాదు, కావాలంటే వారు వారి భాషను ‘Telugu of the West’ అని అనుకోవచ్చును. ఎందుకంటే మనభాష వారిభాష కంటే పురాతనమైనది.  

అసలు మనము రెండు భాషల లిపులను గూర్చి ఆలోచిస్తే మనది వృత్తాధారమైన భాష, 

అంటే వంపులు సొంపులు వయ్యారాలను ఒలికిస్తూ వుంటుంది. వారిది చతురస్రముపై 

ఆధారపడిన లిపి. దాని సొబగు దానిది. వారి అక్షరముల సంఖ్య మనతో పోల్చితే బహు 

తక్కువ. అందువల్ల ఒక పదమును వ్రాసి దానిని వారికనుగునమగు రీతిన 

ఉచ్చరించుకొంటారు. మనము 'కూటము' అని తెలుగులో వ్రాసిన మాటను వారు వారి 

భాషలు వ్రాస్తే దానిని 'కూటము' గూటము' కూడము' గూడము అని 

ఏవిధముగానయినా పలుకవచ్చు. ప్రాసయుక్తమగు సంభాషణకు ఇది సౌలభ్యమును 

సమకూరుస్తుంది. కానీ వేదాధ్యయనమునకు తెలుగుకన్నా స్వచ్ఛమయిన భాష వేరొకటి 

లేదు.

మరి ఇంతటి చారిత్రిక ఆధారాలను కలిగిన తెలుగు లేక ఆంధ్రమునకు పైన తెలిపిన తమిళ వ్యక్తి, వాక్రుచ్చిన  ప్రకారము అసలు స్వకీయమైన ఉనికి లేదా!

తమిళనాడు ఉచ్ఛన్యాయస్థానము సంస్కృతముతో బాటూ తమిళము కూడా దేవ

 భాషయని శాసించింది. నిజానికి ప్రతి భాషా గొప్పదే! దేని ప్రత్యేకత సాహిత్యము దానిదే! 

సమస్య ఎప్పుడు వస్తుందంటే మా భాష మాత్రమే గొప్పది అన్నపుడే! ఇందులోని 

నిజానిజాలు కాస్త శోధించుదాము ‘అరవ’ భాషను నాటి దేశకాల పరిస్థితులకు 

అనుకూలముగా నాటి జన సామాన్యమునకు వాడుకభాషగా, వింధ్య మదమణచ వచ్చి 

దక్షిణాదిన నిలచిపోయిన అగస్త్యులవారు ఏర్పరచి, ‘తోల్కాపియం’ పేరుతో వ్యాకరణ 

గ్రంధమును వ్రాసి అందజేసినారు అని వారే చెప్పుకొంటారు. ‘కాప్పియం’ సంస్కృత శబ్దమగు ‘కావ్యం’ నుండి పుట్టినది. అసలు ‘తొలి’ ‘తొల్లి’ అనునవి తెలుగు పదములు. మరి ఇందులో ‘తమిళము ఏదీ! సంస్కృతములో ‘పూర్వము’ అంటే ‘భూత కాలము’ అపరం’ తరువాత పిదప, పిమ్మట (ఈ మూడూ తెలుగుపదాలే!) లేక ‘భవిష్యత్ కాలము’ అని అర్థము. మరి తరువాత అన్న అర్థము వచ్చుటకు అదే అర్థముతో అదే సంస్కృత పదమును వారు వాడుతారు. మరి అప్పుడు సంస్కృతముతో సమానముగా ‘తమిళము’ దేవభాష అన సాధ్యమా! వారు నీటికి వాడే ‘నీర్’ ‘తన్నీర్’ ‘జలం’ అన్నవి సంస్కృత శబ్దములు. 

వారు వాడే నక్షత్రముల పేర్లు ఒకపరి పరికించండి.

அஸ்வினி (అస్ విని)

பரணி (పారని లేక బరణి కానీ మనవలె భరణి అని పలుకరు)

கார்த்திகை (కార్తిగై అనగా కృత్తిక)

ரோஹிணி (ரோகினி అని తొలుత వ్రాసేవారు.  తొలుత రోగిణి లేక రోకిణి అని వ్రాసి పలికేవారు. తరువాతి కాలములో  (హ) అన్న అక్షరమును అదనముగా చేర్చుకొన్నారు. అప్పుడు రోహిణిలో ‘హ’  వ్రాయ మొదలిడినారు.              

மிருகசீர்ஷம் ( ‘మృగశిర’ ను ‘మిరుక శీర్షం’ లేక ‘మిరుగ శీర్షం’ అంటారు. ఈ‘’ ‘ష’ కూడా తరువాతి కాలములో అక్షర మాలలో చేర్చుకొన్నారు.)

திரு ஆதிரை (ఆర్ద్ర అన్నపేరును పలుకుటకు సులభముగా ‘ఆదిరై’ అని వ్రాసుకొన్నారు. ‘తిరు’ అన్న మాటను పవిత్రతకు, గౌరవ సూచకము గానూ వాడుతారు ఆర్ద్ర నక్షత్రము శివాభిషేకమునకు చాలా ముఖ్యమైన నక్షత్రము అందుకే ‘అదిరై’ ముందు తిరు అన్న శబ్దమును వాడినారు.

 புனர் பூசம்   పునర్వసు లోని ‘పునర్’  అన్న శబ్దమును యథాతథముగా తీసుకొని ‘వసు’ కు 

బదులు ‘పూసం’ అన్నారు ant ఆ నక్షత్రమును ‘పునర్ పూసం’ అని ఉచ్చరించుతారు.. అదేవిధముగా ‘శ్రవణ’ నక్షత్రమును ‘తిరు ఓనం’ అంటారు. ఎందుకంటే 

ఇది విష్ణువుకు అంత ముఖ్యమైనది. ఈ రెండు నక్షత్రములకు మాత్రమె ‘తిరు’ అన్న శబ్దమును 

వాడినారు.)  

பூசம்  (పుష్యమి నక్షత్రమును కూడా, పైన ‘వసు’ ను ‘పూసం’ అన్నట్లే, ‘పూసం’ అన్నారు.

ஆயில்யம்  (‘ఆశ్లేష’  ను ‘అయిలయం’  అన్నారు.) ఈ ప్రకారముగా అన్ని నక్షత్రములకూ పేర్లను సంస్కృతము నుండియే తీసుకొన్నారు. కానీ వారి అక్షరముల సంఖ్య బహు స్వల్పము కావున తమ ఉచ్ఛారణకు అనుగుణముగా వారి లిపిలో వ్రాసుకొన్నారు.  

మిగతది మరొకమారు........

తెలుగు  తమిళము-2

తమిళమున  అనంతమగు పదములు సంస్కృతము నుండి తీసుకొనబడినవి. కానీ ఆ 

పదములను, వారి ఉచ్ఛారణ కనుగుణముగా వ్రాసుకొనుటచేత  ఆ సంస్కృత పద 

స్వభావము మారిపోయి తమ పదమే అన్న భ్రమను కలిగించుచున్నది. ఈ విషయమును 

జ్ఞాపకము ఉంచుకొనేది.     సంస్కృతము నుండి తమిళమునకు తీసుకొన్న అనేకానేక పదములలో అతి కొద్దిగా మీకు  ఉదాహరణ క్రింద చూపించుచున్నాను.

Aggini - Fire - Agni

Amaran - Immortal - Amar

Anniyan - Stranger - Anya

Aboorvam - Rare - Apoorva

Aadithan - Sun - Aadhithya

Aachariyam - Surprise - Ascharya

Aayudam - Weapon - Aayudh

Aadaaram - Support - Aadhar

Asthiram - Missile - Asthra

 

Idayam - Heart - Hridaya

Iraththam - Blood - Rakhtha

Iyanthiram - Machine - Yanthra

Irasayanam - Chemistry - Rasayana   

Kurodam - (!!!!) - Krodha

Kanni - Virgin - Kanya

 

Sooriyan - Sun - Surya

Solpam - Little - Swalpa

Saththam - Noise - Shabda

Yandiran – Robot (రజనీకాంత్ సినిమా, తమిళములో అది యందిరన్.) – యాంత్రికుడు.

మహాకవి కన్నదాసన్ వ్రాసిన తమిళ సినిమా పాటలు:

‘దైవమె దైవమె......’ ఒక తమిళ పాట ‘దైవం’ సంసృత పదము.

శింగార పున్నాగై ....... శృంగార పున్నాగ సంస్కృతము

లచ్చిమీ కల్యాణం ..... లక్ష్మీ కల్యాణం   సంస్కృతము

చిత్తిరమే చిత్తిరమే ...... చిత్రమ్ సంస్కృతము

ఒరే రాగం ఒరే తాళం ..... రాగం తాళం ......  సంస్కృతము

ఈ విధముగా ఆ మహానుభావుడు వ్రాసిన పాటలలో  ఎన్నో సంస్కృత పదాలను చూడవచ్చు.

ఇపుడు తమిళ భాషను తెలుగువారు "అరవం"అని ఎందుకు అంటారు? అన్న విషయమును 

పరిశీలించుదాము.

తమిళమును అరవము అనడము అసలు అవమానముగా భావించుతారు తమిళులు. కానీ ‘తమిళము’ అన్న మాటను నిర్వచించిన అనేక తమిళ పండితులలో ఒక్కొక్క తమిళ పండితుడు

ఆ శబ్దమును ఒక్కొక్క విధముగా నిర్వచించినారు, కానీ మనము మనభాషను  ఆంధ్రులు పరిపాలించిన దేశమున వాడబడిన భాష కావున ఆంధ్రమని అంటాము. ఆంద్ర దేశము వలె తమిళ దేశము అన్న పేరుతో ఏ దేశమూ పరిపాలింపబడలేదు. ఇప్పుడు ‘తమిళ నాడు’ అని వారు పిలుచుకొనే పదమును ఆధునిక తమిళ పండితులు సృష్టించుకోన్నదే! అంతకు మునుపు అది అరవ నాడే! మన మునుపటి తరం తెలుగు వాళ్ళు తమిళాన్ని అరవం అనీ తమిళ వారిని అరవవాళ్ళు అనీ పిలవటం మనకు సుపరిచితమే! చాలా సార్లు వినే ఉంటాం. ఇలా  ఎందుకు పిలుస్తారంటే - పూర్వం తమిళ ప్రాంతాలను 'మండలం' అనే పేరుతో వ్యవహరించేవారు. ఈ మండలాలు ఈనాటి మన రాష్ట్రాలలాగా అన్నమాట. చోళ మండలం, పాండ్య మండలం ఇలా వివిధ ప్రాంతాలకి వివిధ పేర్లు ఉండేవి. అటువంటిదే ''తొండై మండలం'' కూడా, ఈ తొండై మండలంలోనిదే అరువనాడు, కొంగునాడు మొదలగునవి. ఈ ప్రాంతం తెలుగుదేశానికి దక్షిణ సరిహద్దులో ఉండేది. ఈ అరువనాడు ప్రస్తుత చిత్తూరు, నెల్లూరులోని కొంత భాగం వరకు విస్తరించి ఉండేది. తెలుగు వారికి అతి సమీపంలో ఉన్న రాజ్యం అరవనాడే కావడంతో ఆ రాజ్య ప్రజలను అదే పేరుతో పిలుస్తారు. అరవప్రజలు మాట్లాడే భాష మనకు అర్థం కాదు కనుక అదే రాజ్యం పేరు మీద అరవభాష, అరవం అని పిలుస్తున్నారు. అంతకు తప్పించి ‘ఆ భాష రవము లేనిది కాదు’. ఆభాష పలుకుబడి కొంత క్లిష్టముగానే ఉంటుంది. తెనుగున మార్దవము ఎక్కువ.

ఇక్కడ సంబంధము ఉన్నా లేకున్నా ‘కొంగునాడు’ ను గూర్చి కొద్దిగా చెబుతాను. ఈ ప్రానతమున తెలుగువారగు ఆర్యవైశ్యుల జనాభా ఎక్కువ. అసలు ‘కరూర్ వైశ్యా బాంక్’ స్థాపకులు వారే! ఆ కాలములో వీరిలోని అధికాశము బంగారపు వ్యాపారము చేసేవారు. వీరివద్ద శ్రేష్ఠమగు బంగారము లభించేది. ఆ కాలములో ఎవరయినా ‘నీ నగలు మెరిసి పోతున్నాయి’ అంటే ‘ఇవి కొంగు బంగారముతో చేయించినవి’ అనేవారు. అసలు అనేకులు నిత్యపారాయనము చేసే సూర్యనారాయణ దండకములో కూడా చివరన ఫలశ్రుతిలో ‘కామ్యార్థ ముల్ కొంగుబంగారు జున్నై ఫలించున్’ అని చెబుతారు. ఆ కాలములో ‘కొంగు బంగారానికి, తంగేడు కట్టెతో కాచే జున్నుకు, అంత ప్రత్యేకత ఉండేది.

తిరిగీ విషయానికి వస్తే, అసలు అచ్చతెలుగు అనగా సంస్కృత సంపర్కమేలేని తెనుగు ఎవరయినా మాట్లాడితే, వ్రాసిన పుస్తకము చదివితే అర్థము చేసుకొను స్థితిని పూర్తిగా దాటిపోయినాము. వాడుకలో నిలిచిపోయిన కొన్ని పదములు తప్ప తేనెలూరు తెనుగు తెరమరుగైపోయినది. ఒకవేళ అది అంతో ఇంతో ఎంతోకొంత ఉన్నా దక్షిణ తమిళనాట మాత్రమె ఉన్నది. వారు ఎక్కువగా గ్రాంధికమైన తెలుగు మాట్లాడుతారు. మనకు తెలియదు కాబట్టి వారిని ఎగతాళి చేస్తాము. నిజానికి సిగ్గుపడవలసినది మనము.

మనము మాత్రమే కాదు తమిళులను ఇలా రాజ్యం పేరుతో పిలిచేది, కన్నడిగులు తమిళులను కొంగ అని పిలుస్తారు ఎందుకంటే కొంగునాడు ప్రాంతం కర్నాట దేశానికి సరిహద్దుల్లో ఉంటుంది కనుక వారికి తెలిసిన తమిళులు ఈ ప్రాంతం వారే కనుక వారు తమిళులను కొంగ అని అంటారు. అలాగే మలయాళీలు తమిళులను పాండీ అంటారు, వీరికి పాండ్యనాడు సరిహద్దు కాబట్టి పాండ్యనాటి తమిళులను పాండీ అని మలయాళీలు పిలుస్తారు.

ఇవి చారిత్రికముగా ఇవి వచ్చిన పేర్లే తప్ప తమిళవారిని తూలనాడటానికో లేదా కించపరచటానికో వాడే పదాలు కావు.

ఇపుడు కాస్త ఒక సందేహ నివృత్తి చేసుకొనే ప్రయత్నమూ చేద్దాము. తెనుగున 

అనుభూతికి చెందిన పదములన్నీ సంస్కృతములోనే ఉన్నాయి. తెలుగునకు 

అనుభూతులకు సమానార్థకములగు పదములు లేవా! అన్నది ఒక తమిళ పండితుని 

ప్రశ్న.  

ఎందుకు లేవూ? మన ఆశ్రద్ధవల్ల అన్నీ పోగొట్టుకొన్నామన్నదే జవాబు. అన్నీ 

కాకపోయినా కొన్నింటిని గూర్చి తెలుసుకొందాము.

 ముగింపు మరొకమారు..........

తెలుగు  తమిళము-3

గూగుల్ నుండి సేకరించిన ఈ సమాచారమును యథా తథముగా మీముందు ఉంచుచున్నాను.

Feelings, Emotions and psychological states in Pure Telugu

Happiness - అలరాట, అలరిక, గెలివి, మురుపు (अलराट, अलरिक, गेलिवि, मुरुपु - alarāṭa, alarika, gelivi, murupu)

Eagerness coupled with enthusiasm (ఉత్సాహం) - కెరలిక, అంగవం, ఉఱ్ఱూత. పొంగు (केरलिक, अंगवम्, उर्रूत, पोंगु - keralika, angavam, uRRūta உற்றூத, pogu)

Sorrow - అంగద, ఉమ్మలిక, ఒందిలి, బాము, మలికితం (अंगद, उम्मलिक, ओंदिलि, बामु, मलिकितम्  agada, ummalika, ondili, bāmu, malikitam)

To weep/ to sob - ఏడ్చు, పొక్కు, నొగులు, పొగులు (एड्चु, पोक्कु, नोगुलु, पोगुलु  echu, pokku, nogulu pogulu)

To lament - పనవు, వాపోవు, వలపోవు, వలవందు (पनवु, वापोवु, वलपेवु, वलवन्दु  panavu, vāpovu, valavandu)

To suffer/ be pained - అలఁదురు, కుందు, కునారిల్లు, కుమారిల్లు, వందు, వందురు, వనరు, నొచ్చు (अलँदुरु, कुन्दु, कुनारिल्लु, कुमारिल्लु, वन्दु, वन्दुरु, वनरु, नोच्चु -alanduru, kundu, kunārillu, kumārillu, vandu, vanduru, vanaru, nocchu)

Agitation (క్షోభ) - కలఁత, కలగుండు, అక్కిలి (कलँत, कलगुण्डु, अक्किलि  kalanta, kalaguṇḍu, akkili)

Worry - (ఆందోళన) కళవెళపాటు, కలవరం, అలజడి (कळवळपाटु, कलवरम्, अलजडि  kaaveapāṭu, kalavaram, alazai)

Panic - కంగారు (कंगारु  kagāru)

Fear - వెఱ, వెఱపు, అంజిక, అళుకు, జంకు (वेर, वेरपु, अंजिक, अळुकु, जंकु  Vera, veRapu, añjika, auku, zaku)

Terror - అడలు/ హడలు (अङलु/ हडलु  aalu, haalu)

Hectic - హడావిడి/ అడావిడి (अडाविडि/ हडाविडि  aḍāvii, haḍāvii)

Thought - తలఁపు (तलँपु  talampu)

Idea - ఆవపారిక (आवपारिक  āvapārika)

Feeling - అనిపింపు, సవింత (अनिपिंपु, सविन्त  anipimpu, savinta)

Crisis - (కల్లోలం) అలబలం (अलबलम्  alabalam)

To languish (అఘోరించు) - అలమటించు (अलमटिंचु  alamaiñchu)

Repentance - ఆరటం, ఉదిల, ఉదిలగోలు (आरटम्, उदिल, उदिलगोलु  āraam, udila, udilagolu)

Giddiness - తలదిమ్ము (तलदिम्मु  taladimmu)

Dizziness - తలతిప్పు (तलतिप्पु  talatippu)

Breathless - ఉక్కిరి బిక్కిరి (उक्किरि-बिक्किरि  ukkiri-bikkiri)

Fainting/ Passing out (మూర్ఛ) - సొలయిక, సొమ్మసు (सॊलयिक, सॊम्मसु solaika, sommasu)

Mercy (దయ) - జాలి, కనికరం, అక్కటిక (जालि, कनिकरम्, अक्कटिक  zāli, kanikaram, akkaika)

Cruel - పెలుచ/ పెల్చ (पॆलुच/ पॆल्च  pelucha, pelcha)

Like (ఇష్టం) - మక్కువ, ఇంపు, నచ్చిక, మెచ్చు (मक्कुव, इम्पु, नच्चिक, मेच्चु  makkuva, impu, nacchika, mecchu)

Gratitude (కృతజ్ఞత) - నెనరు (नॆनरु  nenaru)

Bahumaana - ఆదట (आदट  ādaa)

Hope (ఆశ) - కచ్చు (क्रच्चु  kratsu)

Romantic love - మరులు/ మర్లు, వలపు (मरुलु/ मर्लु, वलपु  marulu/ marlu, valapu)

Pangs of separation (విరహం) - విరాళి (विराळि  virāḷi)

Love in general - కాదిలి, అరితి, అర్మిలి, కూర్మి, (कादिलि, अरिति, अर्मिलि, कूर्मि  kādili, ariti, armili kūrmi)

Affection (ఆప్యాయత) - ఎలమి (एलमि  elami)

Elderly love (వాత్సల్యం) - అరులు/ అర్లు (अरुलु/ अर्लु  arulu/ arlu)

Lust - మసకం (मसकम्  masakam)

Sexual act - పైసరం (पैसरम्  paisaram)

Nymphomaniac (అతికాముకి) - నసగూటి (नसगूटि  nasagūṭi)

Woman’s wish for a second orgasm - తిమ్మదియ్యం (तिम्मदिय्यम्  timmadiyyam

Intoxication - మంపు. లాహిరి ( मंपु, लाहिरि  mampu, lāhiri)

Consciousness (చైతన్యం) - తెప్పఱం, తెలివి (तॆप्परम्, तॆलिवि  teppaRam, telivi)

The state of being enthralled (పరవశం) - మైమఱ, మైమఱపు, అన్నువు. (मैमर, मैमरपु, अन्नुवु  mymaRa, mymaRapu, annuvu)

Courage - తేఁకువ (तेकुव  teykuva)

Timidness - కొంకు, కోఁౘతనం (कॊंकु, कोच-तनम्  koku, kochatanam)

Hesitation - ౙంకు (जंकु  zaku)

Confidence - దీమసం (दीमसम्  dīmasam)

Diffidence - బిడియం (बिडियम्  biiyam)

Shyness - సిగ్గు, సిబ్బితి, నాన (सिग्गु, सिब्बिति, नान  siggu, sibbiti, nāna)

Guilty feeling - గిలి (गिलि  gili)

Comfort - హాయి (हायि  hāyi)

Facility (సౌకర్యం) - వెసులుబాటు (वॆसुलुबाटु  vesulubāṭu)

Adventure (సాహసం) - తెంపు, తెగింపు, తెంపరితనం (तॆम्पु, तेगिंपु, तॆम्परितनम्  tempu, tegimpu, temparitanam)

Tolerance - ఓరిమి, ఓర్పు, తాళిమి, తాళిక, తట్టుకోలు (ओरिमि, ओर्पु, ताळिमि, ताळिक, तट्टुकोलु  orimi, orpu, tāḷimi, tāḷika, taṭṭukolu)

Forbearance - నిబ్బరం (निब्बरम् - nibbaram)

Insatiable thirst (తృష్ణ) - ఆబ (आब  āba)

Satisfaction - తనివి, ఆపోక, ఎదనిండు (तनिवि, आपोक, यदनिण्डु  tanivi, āpoka, edaniṇḍu)

Vacillation/ dilemmma (డోలాయమాన స్థితి/ సందిగ్ధం) - ఊగిసలాట, గుంజాటన (ऊगिसलाट, गुंजाटन  ūgisalāṭa, gunzāṭana)

Wonder/ Surprise - వెరగు, వెరగుపాటు, అరుదుపాటు, విస్తు, చిట్ట, ఱిచ్చ, కోళిగం (वॆरगु, वॆरगुपाटु, अरुदुपाटु, विस्तु, चिट्ट, रिच्च, कोळिगम्  veragu, veragupāṭu, vistu, chiṭṭa, Ritsa, koigam)

Arrogance (మదం) - పొగరు, ఆము, పోతరం, కావరం (पॊगरु, आमु, पॊतरम्, कावरम्  pogaru, āmu, potaram, kāvaram)

Anger - కినుక, కనలిక, కినియుట, అలుక (किनुक, कनलिक, किनियुट, अलुक  kinuka kanalika, kiniyua, aluka)

Fury (ఆగ్రహం) - మండిపాటు (मण्डिपाटु  maṇḍipāṭu)

Curse - పదరు, పదరిక (पदरु, पदरिक  padaru, padarika)

Vikaaram (विकारम्) - ఉలుకరం/ ఉలగరం (उलुकरम्/ उलगरम्  ulukaram/ ulagaram)

Pride - టెక్కు, మిడిసిపాటు, ఎగసిపాటు, విరగబాటు, విఱ్ఱవీగుడు, విక్కు, నిక్కు, నీటు, పిలుకు, పులసరితనం, మిడిమేలం, గీఱ (टॆक्कु, मिडिसिपाटु, यगसिपाटु, विरगबाटु, विर्रवीगुडु, विक्कु, निक्कु, नीटु, पिलुकु, पुलसरितनम्, मिडिमेलम्, गीर  ekku, miisipāṭu, egasipāṭu, viragabāṭu, viRRavīguu, vikku, nikku, nīṭu, piluku, pulasaritanam, miimeylam, gīra)

Un-yielding-ness - బెట్టుసరితనం. (बॆट्टुसरितनम्  beṭṭusaritanam)

Obsession (పొద్దస్తమానం అదే పిచ్చి) - రంది (रन्दि  Randi)

Humility (వినయం) - అణఁకువ, మేవడి, మందట (अणकुव, मेवडि, मन्दट  aakuva, meyvai, mandaa)

Clear/ Clarity - తేట, తెల్లం, తేటం, తేటతెల్లం (तॆट, तॆल्लम्  teya, tellam)

Fun - మేలం (मेलम्  meylam)

Entertainment - సొగయిక (सॊगयिक  sogaika)

Hardship - కడిఁది, కడింది, కడగండి, ఇక్కట్టు, తిప్ప (कडिँदि, कडगण्डि, इक्कट्टु, तिप्प  kaidi kaindi, kaagaṇḍi, ikkaṭṭu tippa)

Tricky situation (సంకటం) - ఇరకటం, ఇరకాటం, ఇంటరం/ ఇంట్రం (इरकटम्, इंटरम्, इंट्रम्  irakam, irakāṭam, iṇṭaram, iṇṭram)

Easy - తేలిక, చులాకు (तेलिक, चुलाकु  teylika, tsulāku)

Jealousy - కుళ్ళు, ఎరుసు, ఇడుగడ, కన్నుకుట్టు, కళ్ళమంట, కాంతాళం, చూపోపమి, 

ఓర్వలేమి कुळ्ळु, यरुसु, इडुगड, कन्नुकुट्टु, कळ्ळमण्ट, कान्ताळम्, चूपोपमि, 

ओर्वलेमि  kuḷḷu, erusu, iugaa, kāntāḷam, tsūpopami, orvaleymi)

Self-deceit - తనుమ్రుచ్చిలిక (तनुम्रुच्चिलिक - tanu-mrucchilika)

Soft heart (आर्द्रता) - ఈమిరి, అనుకు (ईमिरि, अनुकु  īmiri, anuku)

Stony heart - మ్రుక్కడి (म्रुक्कडि - mrukkai)

Chastity - ఈలువు ईलुवु (Chaste woman - ఈలువిత - ईलुवित  īluvita)

Character (శీలం/ సుశీలం) - ఆలుడి (आलुडि  ālui)

Consent - ఒడబాటు, ఒప్పుదల, ఈకోలు (वडबाटु, वप्पुदल, ईकोलु  oabāṭu, oppudala, īkolu)

Approval (ఆమోదం) - మైకోలు (मैकोलु - mykolu)

Curiosity - హాళి (हाळि  hāḷi)

Interest - వెంటం (वॆंण्टम्  veṇṭam)

Excitement/ emotion - ఒడికారం, ఎసరేక (वडिकारम्, यसरेक  oikāram, 

esareyka)

Imagination - ఉజ్జ, ఉజ్జాయింపు (उज्ज/ udzāyimpu)

To fictionalize (కల్పించు) - పుండలించు (पुण्डलिंचु  puṇḍaliñchu)

Anxiety - ఆరాటం (आराटम्  ārāṭam)

Disappointment/ frustration - ఉసూరు (उसूरु  usūru)

Repulsive/ odious (అసహ్యం) - ఎబ్బెట్టు, ఱోత, ఏవ, ఎఱబఱికం (यब्बेट्टु, रोत, एव, 

यरबरिकम्  ebbeṭṭu, Rota, eyva, eRabaRikam)

To torture - కాఱించు, ఏర్చు (कारिंचु, एर्चु  kāriñchu, eyrchu)

Violence (హింస) - కాఱియ (कारिय  kāRiya)

Cautious/ attentive (సావధానం/ జాగ్రత్త) - హెచ్చరా, హెచ్చరం (हॆच्चरा, हॆच्चरम्  hetsarā, hetsaram)

Commonsense - సోయి (सोयि  soyi)

Friendship - చెలిమి, నేస్తం, నేస్తఱికం, నెయ్యం (चॆलिमि, नेस्तम्, नेस्तरिकम्, नेयम् 

 chelimi, neystam, neystaRikam, neyyam)

Hatred - కంటు, ఒడ్డారం (कण्टु, वड्डारम्  kaṇṭu, oḍḍāram)

Vengefulness - పగ (पग  paga)

Coercion/ forcible (బలవంతం) - కడ్డాయం (कड्डायम्  kaḍḍāyam)

Differences of opinion - అంకాపొంకాలు, పొఱపొచ్చాలు (अंकापोंकालु, 

पॊरपॊच्चालु  akāpokālū, poRapocchālu)

Fortunately, at least a half of these words are still vibrantly alive in different 

rural dialects of AP-TS, as the peasants don’t know Sanskrit.

Mind, Intellect and Heart in Pure Telugu

It is with these 3 things that we get all feelings and undergo our mental states. Ancient Telugus called the mind ఉల్లం (उल्लम् - ullam) and intellect కఱద (करद - karada). They called the emotion-bearing heart as డెందం (डॆन्दम् - Dendham). These are very interesting words from an etymological point of view.

Ullam (Mind) - In ancient Telugu (Proto-Telugu), ullan meant ‘inside’. The present post-position ’లోన్/ లోపలన్’ (लोन्/ लोपलन् - lon/ lopalan) owes its origin to this word.

Dendham (Heart) - Actually it was ఎడద (एडद), ఎడందన్ (ऎडन्दन् - edandhan) which meant ‘on the left’. (ఎడమ వైపు). We are all familiar with the fact that heart is located on the left side of our bodies.

ఆర్య ద్రావిడ వర్గీకరణ అసత్యమని తేలిపోయినది. ఆసేతు శీతనగ పర్యంతమూ ప్రతి 

పౌరుని DNA ఒకటిగానే ఉన్నదని శాస్త్రబద్ధముగా ధృవీకరించబడినది.  ఇక 

ఆర్యులేవారు.  ద్రావిడులెవరు? శంకరులవారు తమను ‘ద్రావిడ’ అని చెప్పి, మూడు 

ప్రక్కలా ద్రవము అనగా నీరు నిండియుండుటచే ఆ భూభాగము ‘ద్రమిళ’ లేక 

ద్రవిడమైనది. ఆ ప్రాంతమును పాండ్యులు, చోళులు మున్నగు వారివలె ‘ద్రవిడులు’ 

పరిపాలించలేదు. ఇవన్నీ మతప్రచారమునకు వచ్చిన ‘కాల్డువెల్ అను క్రైస్తవ 

మతప్రచారకుడు, శ్రమించి పనికట్టుకొని మన భాషలను, సంస్కృతులను తన శక్తికి 

మించి నాశనము చేసినాడు. అగ్నికి ఆజ్యము తోడయినట్లు మన తెలుగు వాడయిన, 

రామస్వామి నాయకర్ గారు, కరుణానిధిగారు, దేవనాయగం గారివంటివారు 

ధార్మికమైన వేద సంస్కృతినే పెడత్రోవ పట్టించినారు. రాముని పేరు పెట్టుకొని రామునే 

అవమానించి తమిళ ప్రజలను తప్పుదారి పట్టించిన రామస్వామి నాయకుడు 

తెలుగువాడు. ఈయన అసలు పేరు ఈరోడ్ వేంకట రామస్వామి. నాయక వర్గమునకు 

చెందినవాడగుటచే పేరుకు చివరన వర్గ చిహ్నమును ఉంచుకొన్నాడు. కారణములు 

ఏమయినా ఆయన మణిఅమ్మా అన్న 32 సంవత్సరముల యువతిని తన, దాదాపు 70 

సంవత్సరముల వయసులో పెళ్ళిచేసుకొన్నాడు. ఆస్తిని ఇచ్చుటకే అయితే దానిని 

ప్రజాహితమునకు పంచియుండవచ్చు. ఇక కరుణానిధి గారిని గూర్చి తెలుపవస్తే, ఆ పేరే 

ఆయనకు ఒకవిధముగా శతృ భాషయగు సంస్కృత శబ్దము. ఆయన బిరుదు ‘కలైజ్ఞర్’ 

అన్నది ‘కళాజ్ఞ’ అన్న సంస్కృత శబ్దమునకు ప్రతిరూపము. ఆయన పార్టీ చిహ్నమగు 

‘ఉదయ సూరియన్’ సంస్కృత శబ్దము. వీరి పూర్వులు నాయకరాజుల 

పరిపాలనాకాలములో మంగళవాద్య కళాకారులుగా ప్రకాశం జిల్లా నుండి వలస 

వెళ్ళినారని పెద్దలు చెప్పగా విన్నాను. ఆ విధముగా ఈ మహనీయులు ఇరువురూ 

‘ఇంట్లోవాడు పెట్టేరా కంట్లో పుల్ల’ అన్న నానుడిని సార్థకము జేసినారు.

ఈ విధముగా తెలుగు తమిళ భాషలు రెంటి కినీ మాతృక సంస్కృతమే! ఈ మాటను నడిచేదేవునిగా ఖ్యాతిజెందిన మహా జ్ఞాని, విద్వాంసుడు, సనాతన ధర్మ ప్రతినిధి, ప్రాతః స్మరణీయుడునగు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాములవారు చెప్పినది అని తెలిపి ముగించుచున్నాను.

తేట తెనుగు గూర్చి తెలియక నొక్కడు

'దేవభాష లేక తెలుగు లేదు'

అనగ నతని కొరకు ఆంధ్రభాషా ఘనత

తెలియజేయ బూని తెలిపినాను

స్వస్తి.

Nagaraja Sastry Gollapinni

ఇవేకాదు దేవతల పేర్లు కూడా తధ్భవీకరించి, తమ సొంత పేర్లు గానే చెలామనీ చేసుకోన్నారు.

మణవణ్ణన్,ఆర్ముగం,

Reply11h

Cheruku Rama Mohan Rao

Nagaraja Sastry Gollapinni garu, నేను సంస్కృతము నుండి వారు యథా తతముగా తీసుకొని కృతకము జేసి తమ భాషలో చేర్చుకొని తమవే అంటున్న లెక్కకు మిక్కుటమైన అనేక పదములలో కొన్ని ఉటంకించినాను. అసలు తెలుగునుండి తీసుకొన్న పదములు కూడా అనేకములే! మీ చేయూతకు ధన్యవాదములు.

Reply10hEdited

Nagaraja Sastry Gollapinni

 

Reply10h

Nagaraja Sastry Gollapinni

Cheruku Rama Mohan Rao శ్రీవైష్ణవులు పారాయణ చేసే ద్రవిడవేదం(దివ్య ప్రబంధాలు లోని విష్ణువు పేర్లూ, అలానే శైవ వాజ్మయం లోని పెరియ పురాణంలోని శివసంబంధ,కుమారస్వామీ వినాయకుని పేర్లు తధ్భవీకరించిన పేర్లే. తమిళ సాహిత్యంలో అతి సుప్రసిద్ధ

మైన రచనలు రెండూ మణిమేఖలై, శిలప్పధికారం ఈ పేర్లూ తత్సమాలే.కానీ గడుసుదన మేమంటే మా భాషే ప్రాచీనమంటూ దబాయింపు.

Reply10h

Cheruku Rama Mohan Rao

Nagaraja Sastry Gollapinni garu, మీతో సంపూర్ణముగా ఎకీభావిన్చుచున్నాను. అగస్త్య మహర్షి వ్రాసినాడని చెప్పుకొనే వారి 'తోల్ కాపియం' లోని 'కాప్పియం ' కావ్యము యొక్క తత్సమ రూపమే కదా! అసలు 'తోల్' అన్నమాట తొలి నుండి పుట్టినదే. వారి 'సంఘం కవుల' రచనలలో అనేకములు తెలుగు పదములే! అన్నది నాతో రైలు ప్రయాణము చేసిన ఒక తమిళ Doctorate తీసుకొన్న తెలుగు పండితుడు చెప్పిన మాట.

అన్నిటికీ కారణము మన యువత జడత్వమును ఆశ్రయిన్చినారేమో! మీకు మరొకమారు ధన్యవాదములు.

Reply8h

Nagaraja Sastry Gollapinni

Cheruku Rama Mohan Rao కాప్పియం తధ్భవ రూపం మన్న మాట సుస్పష్టం చేసినందుకు ధన్యవాదాలు.తమిళం ,తెలుగు,కన్నడం మళయాళం(మణిప్రవాళభాష) ఇవన్నిటికీ ప్రాకృతం ఆధారం అనుకొంటా.వీరనే ద్రవీడభాషకు అది మూలంకావచ్చు

Reply6h

Cheruku Rama Mohan Rao

Nagaraja Sastry Gollapinni garu, నాది చాలా పరిమిత పరిజ్ఞానము. అయినా నాకు తెలిసినంతవరకు 'ద్రావిడ అన్న శబ్దమును మొట్టమొదట, జగద్గురువులగు శంకరాచార్యులవారు వాడినారు, సందర్భము, మూడువైపులా నీటిచే పరివేష్టితమైనది అని చెప్పవలసినపుడు. ఆమాటకు తూర్పున గుజరాతు, పశ్చిమమున బంగాళము వరకు. శంకరుల కాలము క్రీ.పూ.509-477 అని నిర్ద్వాన్ద్వాముగా నిరూపించినారు కీర్కోతి శేషులు, వేదమూర్తులునగు కోట వెంకటాచలం గారు. నాటి ద్రావిడ శబ్దమును నేటి విమర్శకులు తమకనువుగా వాడుకొని నాలుగు ప్రాంతాలకు లేక నాలుగు భాషలకు పరిమితము చేసినారు.

మీరనుకోన్నట్లు ప్రాకృతము తెలుగు కన్నడము మరాఠీలకు మాతృక కావచ్చునేమో! అయినా ఈ విషయములో నిర్ధారించగలిగిన పాండిత్యము నాకు లేదు. తెలుగుకన్నడమునకన్నా ముందుభాష అయినా మొదటి కావ్యము కన్నడిగులదే! అసలు చిలుకూరు నారాయణవు గారు తెలుగు సంస్కృత జన్యమని నిరూపించి, తెలుగులోనే తన పరిశోధనను మద్రాసు విశ్వవిద్యాలయమునకు సమర్పించి Doctorate సాధించిన మొదటి వ్యక్తిగా నిలచియున్నారు.

అల్పమతినగు నా పరిశీలనలో తమిళము సంస్కృతము కన్నా ఆమాటకొస్తే తెలుగునాకు మూలరూపమగు ప్రాకృతము కన్నా ముందుది కానేరదు.

సహనముతో కూడిన మీ స్పందనకు త్రికరణశుద్ధిగా నమస్సులు.

స్వస్తి.