నాచన సోమన (నాచన సోమనాథుడు)
నాచన
సోమన (నాచన సోమనాథుడు)-1వ భాగము
నేనిపుడు నవీన గుణ సనాతుడగు నాచన సోమనాథుని గూర్చి వ్రాయుటకు
కారణమున్నది. దీపావళి సమీపించినది. అది నరకాసురవధకు అనుబంధము. ఆ కథకు
ఉత్తరహరివంశముతో సంబంధము. దానిని అనుసరించినది పోతన భాగవతములోని
నరకాసుర వధ ఘట్టమున. అంటే ఆయన రచించిన 'ఉత్తరహరివంశములోని
నరకాసుర వధ ఘట్టము పోతన భాగవతములోని సత్యభామా విజయమునకు మాతృక
అని చెప్పుకొనవచ్చును.
గొప్పగొప్పవారు ప్రశంశించిన కవికుల తిలకుడు నాచన సోమన. శత్రుత్వము,
చంపుకోవడము, ఈర్ష్య, అసూయ, ద్వేషములకు ఆలవాలమని తలచే కడప ప్రాంతము
వాడు. అసలు పోతన కడప జిల్లా ఒంటిమిట్ట దాపుల నివంచినాడనుటకు ఎన్నో
సాక్ష్యాధారాలను చూపినాడు మహానీయుడగు వావిలికొలను సుబ్బారావు గారు.
వావిలికొలను, బమ్మెర, శనగరము, ఓరుగంటి, మొదలగు ఎన్నో తెలంగాణా లోని
ఊర్లపేర్లను తమ ఇంటి పేర్లుగా కలిగిన బ్రాహ్మణులు నేటికినీ కడప జిల్లాలో తమ
కుటుంబములతో నివసించుచున్నారు. వీరి వలస తురుష్కులు ఎందఱో పెళ్ళయిన
పెళ్ళికాని స్త్రీలను చేర్చి తమ ఆనందమునకు బలిచేయుర్తచే భయపడి తెలఘాణ్యమును
వదలినారు. జ్వాజ్వాలాయమానమగు అఖండల దీప్తిని నింపి అనంతకాలము ప్రజ్వరిల్ల
జేసి యుంచిన కావ్యములు వ్రాసిన మహాకవులు ఏ ప్రాంతానికి చెందినా ఆంధ్రభాషా
భూషణులే కదా!
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు నాచన సోముని కవితా వైభవాన్ని “ఒకడు
నాచన సోమన” అనే చక్కటి విశ్లేషణాత్మక గ్రంథంలో వ్రాసారు. “సాహిత్య సురభి” అనే
పద్యసంకలన గ్రంథంలో సోమన గురించి విశ్వనాథవారు ఇలా అన్నారు “కొందఱితనిని
తిక్కన్న కన్నా గొప్పవాడని యనుకొనువారు కలరు. కొన్ని విషయములలో నట్లే
యనిపించును. తిక్కన్నగారికంటే ప్రౌఢుడు. కాని తిక్కన్నకు శిష్యుని వంటివాడు. ఎఱ్ఱన్న
– నన్నయగారి ననుసరించినట్లుగా నాచన సోమన్న తిక్కన్నగారి ననుసరించెను. కాని
ఎఱ్ఱయ్య నన్నయ్యకు కొంత తగ్గిపోవునని చెప్పవలయును. సోమన్న తిక్కన్నను
కొన్నిచోట్ల మించి పోవునని చెప్పవలయును” అన్నారు. దీన్ని బట్టి సోమనాథుడు
ఎంతటి మహాకవో మనం గ్రహించవచ్చును.
ఇక ఈ ఉపోద్ఘాతముతో నాచన సోమన గొప్పదనమును రేపటి నుండి తెలుసుకోన
ప్రయత్నిద్దాము.
మిగిలినది రేపు.........
నాచన సోమన (నాచన సోమనాథుడు)-2
1. నాచన సోమనాధుని కాలము, ఆయన ఎక్కడివాడు అన్న విషయమును గూర్చి
కాస్త చెబుతారా?
నాచన సోమన తెలుగు సాహిత్యంలో తిక్కన యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి పరిశోధకులలో భేదాభిప్రాయములు ఉండినవి. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నాచన సోమనకు చేసిన దానశాసనం క్రీ.శ.1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో నాచన సోమన కాలం 1300 నుంచి 1380ల మధ్యదని అంచనా వేసినారు అంటే 14వ శతాబ్దమన్న మాట.
నేను గ్రహించిన మేరకు ఈయన బుక్కరాయల ఆస్థాన
విద్వాంసుడు.
విద్యారణ్యుల సహపాఠి. కాంచీపుర విద్యార్థి.
బుక్కరాయలు ఆయనకు, కడప మండలమునకు చెందిన పెంచికలదిన్నె లేక బుక్క పట్నం అన్న
అగ్రహారమును బహూకరించినాడు. ఆతరువాత ప్రౌఢదేవరాయలు ఆయనకు తరిమెళ్ళ దిన్నె
అన్న అగ్రహారమును బహూకరించినట్లు తెలియవచ్చుచున్నది. రెండూ కడపలోనివే! అందుచేత ఆయన
కడప జిల్లా వాసిగా తెలియవచ్చుచున్నది. ఆయనకు తిక్కనపై గల అబిమానము అపారము. అందుకే
ప్రతి ఆశ్వాసము చివరిలో
'ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర
బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరంబున శ్రీమత్ సకల భాషాభూషణ సాహిత్య రసపోషణ చక్రవర్తి
సంపూర్ణకీర్తి నవీనగుణసనాథ నాచన సోమనాథ ప్రణీతంబైన యుత్తరహరివంశంబునందు' ... అని వ్రాస్తారు.
తెలుగులో భారత, భాగవతాలకు ఉన్నంత ప్రజాదరణ గల మరో గ్రంధం హరివంశం. ఇందులో
కేవలం కృష్ణునికీ, అతని
వంశీకులకూ సంబంధించిన కొన్ని కథలు వివరించబడినాయి. తెలుగులో హరివంశ కావ్యాన్ని
రచించిన వారు ఇద్దరు. ఒక్కరు ఎఱ్ఱాప్రగ్గడ. రెండవ కవి నాచన సోమన. ఎఱ్ఱన హరివంశమును
సంపూర్ణముగా వ్రాస్తే , సోమన ఉత్తర భాగం మాత్రమే వ్రాసినాడు.
అందుకే దానిని ‘ఉత్తర
హరివంశం’ అని
ఎక్కువగా అంటారు.
లక్షణగ్రంథాల్లో ఇచ్చిన ఒకటి రెండు ఉదాహరణల్ని బట్టి
నాచన సోమన్న “వసంతవిలాసము” అనే మరోకావ్యం రచించినట్లు తెలియవచ్చినా అది ఇంతవరకూ బయటపడలేదు.ఆయన ఘనతను దెల్పుటకు ఈ కావ్యమొకటి చాలదా!
ఎకోపి గుణవాన్ పుత్రః నిర్గుణేన శతైరపి
ఏక చంద్ర ప్రకాశేన నక్షత్రైః కిం ప్రయోజనం
అన్నారు పెద్దలు. ఆ కావ్యమును మర్రి విత్తనముతో పోల్చ
వచ్చును. అంటే రాశిలో చిన్నదిగా కనిపించినా వాసిలో మాత్రమది అసమానము.
2. అంత
ప్రాధాన్యత ఆ కావ్యమునకు ఎట్లు వచ్చినది?
తెలుగు సాహిత్యంలో నాచన సోమన స్థానము ప్రత్యేకమైనది.
ఈయన కవిత్రయము లోని నన్నయ తిక్కన తరువాతి వాడు. బహుశ తిక్కన వార్ధక్యములో ఈయన
యువకునిగా ఉండియుండవచ్చును. ఎర్రన ఈయన తదుపరి వచ్చినట్లుగా తెలియవచ్చుచున్నది.
శబ్ద
రత్నాకర కర్త బహుజనవల్లి
సీతారామాచార్యులు గారు ఇతన్నీ, ఇతని గ్రంధాన్నీ పరిచయం చేస్తూ “అది మిక్కిలి ప్రౌఢము గానూ, భారతము కంటె ఎల్ల విధముల విశేషించినది
గానూ కానంబడుచున్నది. ఇతనిని సర్వజ్ఞుడందురు. అట్లనుటకు సందేహింప బని లేదు” అని అంటాడు. పరవస్తు చిన్నయ సూరి ఐతే “ఘను నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున (నొసలు) యక్షిని దాచినట్టి
సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్” అన్నాడు. యుద్ధ వర్ణనలోనూ, రాయభారాలు నిర్వహించిన పట్టుల లోనూ, నాచన సోమన తిక్కన ప్రజ్ఞను పుడికి
పుచ్చుకున్నాడని కొందరు పెద్దలు భావించినారు.
3. ఆయనకు
బిరుదులు ఏమయినా ఉన్నాయా?
ప్రాచీన తెలుగు కవుల్లో నాచన సోమన ఒక విలక్షుణుడైన
కవి. తెలుగు సాహిత్యంలో అతనికి ఒక ప్రత్యేకమైన స్థానమున్నది. ఆయన రచించిన ఉత్తర
హరివంశం ఒక విశిష్టమైన కావ్యం. ఆశ్వాసాంతాల్లో సోమన తనను గురించి నాలుగు
విశేషణాల్లో చెప్పుకున్నాడు. సకల భాషా భూషణ, సాహిత్య రస పోషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాధ అనేవి ఆ నాలుగు విశేషణాలు. హరివంశమనేది
భారతానికి పర భాగం కాబట్టి, తిక్కన
సోమయాజి పూర్తి గావించిన భారతానికి తాను రాసిన ఉత్తర హరివంశం కొనసాగింపుగా
సంభావింపబడాలని భావించిఉంటాడు. అందుకని ఆశ్వాసాంతాల్లో తిక్కనను పేర్కొనడమే గాక, ఆయన సృష్టించి అంకితమిచ్చిన
హరిహరనాధునికే తన హరివంశాన్నీ అంకితమిచ్చి తద్వారా తాను తిక్కన సోమయాజికి
విధేయుడనని చెప్పుకొంటూనే అంతటి వాడినని ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకున్నాడు.
ఉత్తర హరివంశంలో సోమన ప్రయోగించిన సామెతలూ, జన బాహుళ్యంలో అంతగా ప్రచారంలో లేని
పలుకుబడులూ, జాతీయాలు ఆయన నవీన ప్రియత్వాన్ని
పట్టిచూపుతాయి. అంతటి పలుకుబడులను జాతీయములను తెలుగు నేలకు పరిచయము చేసి తన కవిత
నవీన గుణ సనాధకత్వమును ఋజువు చేసుకున్నాడు.
మిగిలినది తరువాత.......
ఇందులకు గానూ ఒక చిన్న ఉదాహరణ తెలుపుతాను.
నరకాసురుడు స్వర్గం మీద దండయాత్ర చేసినపుడు దిక్పాలకులందరూ అతని సైన్యంతో యుద్ధం
చేస్తారు. వరుణునితో హయగ్రీవుడనే దనుజుడు తలపడతాడు. ఆ రాక్షసుని ధాటికి మూర్చ పోయి
లేచి, ఇక
యుద్ధములో ఉండలేక వరుణుడు “బీరపు
బొత్తయు గట్టుకుని పోయె, పోయిన
పోకై” అంటాడు
సోమన. బీరపు బొత్త అంటే మేకతోలుగా మనము ఎంచుకొనవచ్చు. యుద్ధంలో నిలవనూ లేడు, ఓటమి
ఒప్పుకోనూ లేడు. పిరికితనము , బడాయితనము
పొత్తము (బొత్త) అంటే రెంటినీ పొట్లంగా చేసుకుని పోయిన పోకై – అదే
పోతగా వెళ్ళిపోయినాడట. ఇలాంటి సందర్భంలోనే, ఇదే
విధంగా యుద్ధంలో ఓడిపోయి యముడూ మరలి పోతాడు. “ఇట్టిక
సూడని వాడో, యొట్టిడుకున్నాడొ
యనుచు ఉల్లసమాడం బట్టగుచు మగిడి చూడక పట్టణమునకేగె లజ్జ బండతనమునన్” – ఇటువైపు
ఇక చూడను అని, ఒట్టు
పెట్టుకున్నట్లు, తిరిగి
చూడకుండా పారిపోయినాడట పైగా లజ్జ బండతనమునన్, అంటే
ఒకవైపు తలెత్తుకోలేనంత సిగ్గూ, మరో
వైపు ఆ సిగ్గు బైటకు కనిపించనీయని నిర్లక్ష్యవైఖరి నటించుతూ వెళ్లిపోయినాడట.
ఇటువంటి ప్రయోగములు ఆయన రచనలలో పుంఖానుపుంఖములు.
ఆయన సంభాషణా రచనా పాటవమును ఒకసారి గమనించుతాము.
యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించుచున్న ఋషిముని వరేణ్యుల వద్దకు పోయి
హవిస్సులు అన్నీ తనకే చెందవలె నంటాడు నరకుడు. అందుకు వారు “కనికని
కొర్రెవడింటి కంబము చేయున్” అంటారు.
కొర్రు అంటే పూర్వము పాకలు లేక కోష్టములు అనగా కొట్టములు నిర్మించుకుని ప్రజలు
నివసించేవారు . అదే విధముగా పర్ణశాలలు అన్న పేరుతో ఋష్యాశ్రమములు నిర్మింప
బడేవి. వాని నిర్మాణములో చల్లదనము నిచ్చే తాటి యాకుల మండలను గానీ బోద అనబడు ఒక
విధమైన జంబును గానీ పైకప్పునకు వాడేవారు. ఆ కప్పు నిలుచుటకు పొడవాటి వెదురు
బొంగులను ఉపయోగించేవారు. అంటే అవి కర్ర వలె కనిపిస్తున్నా లోపల అంతా డొల్ల. దానిని
ఆ చూరు నిలుచుటకు వాడే వారు. దానిని కొర్రు అంటారు అంటే సన్ననైన కర్ర అన్న
అర్థమును గ్రహించ వచ్చును. దానిని స్తంభంగా ఎవరైనా వాడతారా అని అవహేళన
చేస్తున్నారు ఋషులు. మరి నరకుని కూడా సోమన తక్కువ తిన్న వానిగా చూపక అతనితో
సమాధానము ఈ విధముగా ఇప్పించుచున్నాడు: యుద్ధంలో దేవతలందర్నీ జయించిన నాకు కాక, ఓడిన
వారికివ్వడము , “శిరస్సుండగ మోకాలున సేసలు వెట్టుట” లాంటిదట.
అంటే తలకు కాక తలంబ్రాలను మోకాటికి పోసినట్లున్నదట. ఎంత సమయోచితంగా పద ప్రయోగమూ
గమనించండి. సంభాషణలను నడిపించుటకు ఆయన కాయనే సాటి.
పరమ కిరాతకులు రాక్షసులైన హంసడింభకుల అత్యాచారాలను
గూర్చి తెలుపుతూ దుర్వాసో మహాముని శ్రీకృష్ణునితో
“హంస
డిభకుల చేత మేము పొందిన పాట్లని వేరే చెప్పకరలేదు. ఇదిగో యీ మా వస్తువులని చూడు.
“ముంజేతి కంకణానికి అద్దమెందుకు” అన్న
పదప్రయోగము నేడు మనకు నానుడియై కూర్చుంది. అది ఆయన రచనా వైశిష్ట్యము.
నకట మోమోట లేక తా రంతజేసి
బ్రదికి
పోయిరె! పులి పేదవడిన బసుల
వాండ్రె
యెక్కాడి రను కత వచ్చె నాకు;
మునుల
లోపల నాలుక ముల్లు విరిగె
“తమను
నిర్జించు వారలు లేరన్న ధైర్యముతో భయం ఏ కోశానా లేకుండా ఆ హంసడింభకులు అంతటి
దౌష్ట్యమును మాపై నెరపుతున్నారంటే ఏమనాలి. శక్తి హీనమైన పులిని పసువుల కాపర్లు
కూడా వెక్కిరించారట! అలా అయ్యింది నాపని! మునుల నాలుక ముళ్ళు, అంటే
కిన్నాలుక అని గానీ కొండ నాలుక అని గానీ మనము ఉపయోగించే మాటకు బదులుగా నాలుక ముల్లు అని
వాడి నాడు ఆ నవీన గుణ సనాధుడు. కొండనాలుక నిజంగా మనము గమనించితే ముల్లు లాగానే
వుంటుంది. మల్లు తిరుగబడిన కొండ రూపము లోనే కదా వుంటుంది.
అందకే నాలుక ముల్లు ఈ నాడు విరిగిపోయింది అంటే ఇక
మాటలాడలేము . ” అని
చెప్పకనే చెబుతున్నాడు దూర్వాసోమహాముని.
4.
ఆయన తన కావ్యములో నాలుగు విశేషణములు తనను గూర్చి చెప్పుకున్నాడని అన్నారు. అవి
ఆయనకు ఏవిధముగా అన్వయమౌతాయో చెప్పగలరా?
ఆయన తను గూర్చి నాలుగు విశేషణాలు చెప్పుకున్నాడు.
1. సకల భాష భూషణ 2. సాహిత్య రస పోషణ ౩. సంవిధాన చక్రవర్తి 4. నవీన గుణ సనాథ, ఇవి
ఒక్కొక్కటిగా విశ్లేషించుకుందాము.
1. సకలభాషా భూషణ: ఇది వాస్తవమై ఉండవచ్చును, ఎందుకంటే
ఆయన చెప్పిన మిగతా విశేషణములు వాస్తవములు కావున ఇది
కూడా నిజమై యుండ నగును. పైపెచ్చు తానూ అవసరము అనుకొన్న చోట అరబ్బీ ఫార్సీ భాషా
పదములు కూడా వాడుట తటస్థించినది. మరి అప్పుడు ఆయన చెప్పిన మాట వాస్తవమే కదా!
2. సాహిత్య రసపోషణ: స హితమైనది సాహిత్యము. హితము తో
కూడినది సాహిత్యము. దాని అంతిమ లక్ష్యము సమాజ హితవే. మరి సోమన అదేవిధముగా
పరమార్థము ,పారలౌకికము, పరమాత్మ
గుణ విశేషములని గీర్తించి ఈ గ్రంథమున సంపూర్ణ ,సమగ్ర
సాహిత్య పోషణము గావించినాడు. అంతే కాక ఈయన లోకోత్తర చమత్కార శబ్ద విన్యాసముతో తన
కవిత రథమును రథ్యలు అంటే రాచబాటలపై నడిపినాడు. రసమునకు మూల ప్రాతిపాదిక
నాట్య శాస్త్రము. అందుకే సోమన నాట్య రసాన్నే సాహిత్య రసము అన్నాడు.
‘విభావైరనుభావైశ్చ
సాత్వికైః ర్వ్యభిఛారిభిః
అనీయ మానః స్వాదుత్వం స్థాయీ భావో రసస్మృతః’
అన్నాడు ‘దశరూపక’ కర్త ధనంజయుడు. స్థాయి అంటే చెదరక
స్థిరముగా వుండే అనుభూతి. నాట్య శాస్త్ర నిర్మాత భరతుడు’ నహి రసాదృతే కశ్చిదగ్ధః
ప్రవర్తతే ’ అని రసాన్ని ప్రశంసించినాడు తన నాట్య శాస్త్రములో .
వాక్కు చేత గానీ అంటే కావ్య గత, కథ, కథన, శబ్ద, భావ, అలంకార, సహితమగు
కవనము చేత గానీ, నాట్యము
చేత గానీ, నాటకము
చేత గానీ, సంగీతము
చేత గానీ, ఒక
భావము ప్రదర్శించి నపుడు ఆ అనుభూతిని మన మనసున ఆవిష్కరింపజేసే ప్రయోగ సిద్ధికి
రసము అని పేరు. అందుకే పెద్దలు ‘రసోవై సః’ అన్నారు. రసము అంటే అదే అని అర్థము. ఆ
రసజ్ఞత కు చెప్పబడిన నిర్వచనమునకు నికరమైన కావ్య రూపము ఉత్తర హరివంశము. ఆ రస, రసాల
సాలమే నాచన సోముడు. ఉత్తర హరివంశములో ధీరోదాత్తుడైన కృష్ణుడు నాయకుడు. ఇటు వీరము అటు
శృంగారమునకు రెండింటికీ పెద్ద పీటవేసి తన కవనమను బండికి ఆ
రెంటినీ జోడెడ్లగా పూన్చినాడు. అట్లని ఇతర రసాలను చిన్న చూపు చూడలేదు. ఉదాహరణలు
తరువాత ఇచ్చుకుంటాను. అందుచేత ఆయన చెప్పుకున్న సాహిత్య రసపోషణ మనకు ఉత్తర
హరివంశములో అడుగడుగునా కాన వస్తుంది. అందుకే ఆయన తనను సాహిత్య రసపోషణా చక్రవర్తిగా
చెప్పుకున్నాడు.
౩. సంవిధాన చక్రవర్తి : విధానము అంటే చేయుట, పూజ, తీరు, ఉపాయము
అనే అర్థములు వున్నాయి. ఇక్కడ సంవిధానము అన్న మాటకు చక్కగా కూర్చుట అన్న అర్థమును
తీసుకొనవచ్చును. మహా పండితుడైన భవభూతి తన నాటకములలో విచిత్ర సంఘటనము ఏర్పడినపుడు
‘అహో సంవిధానకం’ అన్న ప్రయోగమును విరివిగా వాడినాడు. ఇదే పదమును
సోమన కూడా తన కావ్యములో అనిరుద్ధుని గొని పొమ్మని, బాణాసురుని
కుమార్తె ఉషా దేవి యొక్క చెలికత్తె చిత్ర రేఖకు చెబుతూ, నారదుడు
ఈ విధముగా అంటాడు “.........నా చేసిన సంవిధానంబున నీవు నిశ్చింతంబుగా ననిరుద్ధుం
గొని పొమ్ము.” ఆయన తీసుకున్న ఆరు కథలూ కేళీ విక్రమ చక్రవర్తి యగు శ్రీకృష్ణ
ప్రాధాన్యత సంతరించుకొన్నవి. అసలక్కడే మనకు సోమన కథాకథన సంవిధాన నైపుణ్యత
కనిపించుతుంది ఆ ఆరు ఆశ్వాసాలనూ తడిమితే! మూల హరివంశములో ముందు అనిరుద్ధుని
వివాహము పిదప రుక్మిణి కృష్ణుని పుత్ర సంతతి కోరుట వుంటుంది. దీనిని సవరించి ముందు
ప్రద్యుమ్నోదయము పిదప అనిరుద్ధ జననము జెప్పి వరుస క్రమమును తప్పకుండా కథనము సాగించినాడు.
మిగతది మరొకసారి.....
నాచన సోమన (నాచన సోమనాథుడు)-3
నవీన గుణ సనాధత : నిజమునకు ఈ గుణములు తనకు గాక తన కావ్యమునకు చెందుతాయి. సోమన కవితాధారలో, ఆయనకు పూర్వ కవులు వ్రాసిన
ప్రసిద్ధ కావ్యములలో కనిపించని అనేక గుణములు కనిపించుతాయి. అవే
నవీన గుణములు అని రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు తెలిపిన మాట. దృశ్యమును మనోనయన
రంజకముగా చెప్పుట, తదనుగుణములైన
పదములను వాడుత ఆయనకే చెల్లినది. ఉదాహరణమునకు కావ్యమున మనము జూచే గదా యుద్ధము, జూదము, పిశాచద్వయ వర్ణన నిరుపమానము.
చిన్న ఉదాహరణము : ఉష ఈ విధముగా అంటుంది ‘తలపునకు జక్కనుండెడి తలపు లేదు , లజ్జ
బోద్రోవ లజ్జకు లజ్జ లేదు.’ పుంఖాను పుంఖములైన ఆయన రచనా మాయాజలాలపు
అల్లికలో ఇది యొక పోగు మాత్రమే. ఈయన
సీస పద్య రచన పోతనాదులకే అనుసరణీయమైనది. హరి పాంచజన్య పూరణమును వర్ణించుతూ ఆయన
చెప్పిన సీసము లోని ఈ పాదము గమనించితే , ఇది 4వ ఆశ్వాసములోని 216వ
పద్యము, ఉర్రూతలూగెడు
నుదయాస్తగిరులతో నాకాశలక్ష్మి కోలాటమాడ’ ఇట్లు చెప్పుకుంటూ పోతే
ఎంత సమయమైనా చాలదు. అందుకే ఆయన నవీన గుణ సనాధుడైనాడు.
5. ఆయన తన కవిత్వములో వక్రత అనబడదగిన ఆలంకారమును వాడినాడట. దానిని కాస్త ఉదాహరణముతో వివరించగలరా?
వక్రత
కుజము కుంజరముచే కూలునో కూలదో?
కూలు; కుంజరము నీ కుజము గూల్చె!
మ్రాను పేరేటిచే మడుగునో మడుగదో?
మడుగు; పేరేటి నీ మ్రాను మడచె!
గాలునో యొకనిచే గాలదో సాలంబు?
గాలు; నీ సాలంబు గాల్చె నొకని!
దునియునో పరశుచే దునియదో వృక్షంబు?
తునియు; నీ వృక్షంబు తునిమె బరశు!
ననుచు దమలోన జర్చించు నమరవరుల
కభిమతార్థ ఫలార్థమై యంద వచ్చు
పారిజాతంబు నా మ్రోల బండియుండ
నంద గంటి నా కోర్కుల నంద గంటి!
ఇది కృష్ణుడు శివుని స్తుతించే పద్యం. పద్యం చదివిన వెంటనే ఇందులో కవి
చెప్పదలచుకున్న విషయమేమిటన్నది బోధపడదు. వాక్య నిర్మాణంలోనూ, చెప్పిన విధానంలోనూ ఉన్న
వక్రత దీనికి కారణం. శివుని పారిజాతవృక్షంతో పోలుస్తున్నాడు కృష్ణుడు. చెట్టు
ఏనుగు చేత కూలుతుందా కూలదా? కూలుతుంది.
కాని ఇక్కడ చెట్టు ఒక ఏనుగుని కూల్చింది! అలానే తర్వాత పాదాలలో చెట్టు పెద్ద
ఏరువల్ల వంగిపోవడం, అగ్ని
వలన కాలడం, గొడ్డలిచేత
విరగడం శివుని విషయంలో తారుమారవ్వడం కనిపిస్తుంది. మొదటి పాదంలో ప్రశ్నకి రెండవ
పాదం మొదటి పదంతో సమాధానం చెప్పడం, ఆ తర్వాత దానికి వ్యతిరేకమైనది శివుని
విషయంలో జరగడాన్ని ప్రస్తావించడం ఇక్కడ పద్య (వాక్య) నిర్మాణంలో సోమన చూపించిన
వక్రత. ఇదే అస్పష్టతకి దారితీస్తోంది. అలాగే ఇక్కడ ప్రస్తావించబడిన అంశాలు
అర్థమవ్వాలంటే కొంత పురాణ జ్ఞానం అవసరమవుతుంది. శివుడు గజాసురుని సంహరించడం, గంగ గర్వాన్ని అణచడం, మన్మథ దహనం – ఇవి
మొదటి మూడు పాదాలలోని అంశాలు, ప్రసిద్ధమైనవే. నాల్గవ అంశం శివుడు పరశువుని
ఖండించడం. దక్ష యజ్ఞ ధ్వంసమప్పుడు శివుడు విష్ణుమూర్తి పరశువుని ఖండించాడని ఒక కథ
ఉంది. ఇక్కడ ప్రస్తావించినది అదే. ఈ కథలు
తెలియకపోతే పద్యం అసలు అర్థం కాదు.
ఉత్తరహరివంశంలో ప్రతి కథలోనూ అనేక రసాలు కనిపిస్తాయి. ఏ ఒక్క రసమూ ప్రథాన
రసంగా కనిపించదు. ఒకే సన్నివేశంలో రెండు రసాలని సమ ప్రాథాన్యంతో నిర్వహించడం
కనిపిస్తుంది. ఒకోసారి, ఒకటి
ప్రథాన రసమవుతుందని సాధారణంగా అనుకునే చోట మరొక రసానికి అధిక ప్రాథాన్యం ఉంటుంది!
ఇది రస నిర్వహణలో సోమన చూపించిన వక్రత. ప్రతి కథా దీనికి ఉదాహరణే.
6. ఆయన వక్రత ప్రదర్శించిన వేరు సన్నివేశములు వేరు ఏమయినా ఉన్నాయా?
ఉన్నాయి. ఇంద్రుని జయించి సభకు ఊర్వశిని రప్పిస్తాడు నరకుడు. అప్పుడు ఈ
పద్యములో వినిపిస్తాడు సోమన నరకుడి చేష్టలను.
దనుజేంద్రుడా తలోదరి
గనుగొని చొళ్ళెంబు నిమురు గ్రమ్మున బైకొం
గనువు పఱుచు గేదగి రే
కు నఖంబుల జీఱు గులుకు గోర్కుల దేలన్
సభకి రప్పించిన ఊర్వశిని చూడగానే నరకుడు చేసిన చేష్టలివి. కొప్పు నిమరడం, పైకొంగుని సర్దడం, గేదగి(కేతకి = మొగలి
పువ్వు) రేకులని గోళ్ళతో చీరడం. నరకుడు ఎవరి కొప్పు నిమిరాడు? ఎవరి పైకొంగుని సర్దాడు? ఊర్వశి వని విశ్వనాథతో సహా
చాలామంది అర్థం చెప్పారు. మరి చివరనున్న గేదగి రేకులని చీరడమేమిటి? లేత చెక్కిళ్ళని గేదగి
(మొగలి) రేకులతో పోల్చడం ఆనవాయితీ. నరకుడు ఊర్వశి బుగ్గ గిల్లినాడన్నమాట, అని వివరించినారు.
బుగ్గలని చెప్పకుండా, వాటిని
పోల్చే గేదగి రేకులని మాత్రమే చెప్పి ఊరుకోవడము వర్ణనలోని వక్రత. అయితే యీ
పద్యాన్ని మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు.
నరకుడు తన కొప్పుని నిమురుకున్నాడు. తన పైకొంగుని సర్దుకున్నాడు. తన చేతిలోని
గేదగి పూరేకులను గోళ్ళతో చీరీనాడు. ఇవి కూడా అందమైన స్త్రీని చూస్తే రసికుడు చేసే
శృంగార చేష్టలే. నిజానికి యీ అర్థమే నాకు ఎక్కువ సమంజసమనిపిస్తోంది. ఎక్కడో
సింహాసనం పైనున్న నరకుడు కిందగి దిగి ఊర్వశి వద్దకు వచ్చి, ఇంకా మాటలైనా
మొదలుపెట్టకుండానే ఊర్వశితో అంత చనువు తీసుకున్నాడా అని నా అనుమానం. మొత్తానికి
పద్యాన్ని రెండు విధాలు గానూ అర్థం చేసుకోవచ్చు. ఇది పద్య నిర్మాణంలో ఉన్న
విలక్షణత, వక్రత.
ఇలా పద్యాలని ప్రహేళికల్లా నిర్మించడం చాలా చోట్ల కనిపిస్తుంది.
ఇదే వక్రత సంభాషణలలోనైతే, కాకువుని(శోక భయాదులచే కలిగించు ధ్వని) ధ్వనించి
నాటకీయతకి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, తన కొడుకుని యముని బారినుంచి కాపాడలేకపోయిన
అర్జునుడితో బ్రాహ్మణుడు పలికే మాటలు:
నీ వేమి సేయు దీ గాం
డీవము నీకిచ్చి యిమ్ము డెప్పరమైనన్
లావు గలదంచు బలికిన
పావకుజే గాదె కోలుపడితి కుమారున్
ఉరుమురిమి మంగలమ్మీద పడ్డట్టు, తన దుస్థితికి అగ్నిని దోషిగా నిలబెడుతున్నాడా బ్రాహ్మణుడు! ఇది సంభాషణలోని వక్రత. అర్జునుడిని నిందించే సందర్భంలో అతనికి గాండీవాన్ని ఇచ్చిన అగ్ని దేవుడిని కూడా తన నిందలోకి లాగడం, ఆ బ్రాహ్మణుడి అమాయకపు ఆవేదనని చక్కగా స్ఫురింపజేస్తోంది. ఇలాగే, హంసడిభకుల కథలో హంసుడు జనార్దనునితో చెప్పే మాటలు, జనార్దనుడు దూతగా యాదవ సభలో మాట్లాడిన మాటలు వక్రతతో నిండి వారి వారి రాజకీయ చతురతని బాగా పట్టిస్తాయి.
ఇంకా ఉన్నది............
నాచన సోమన (నాచన సోమనాథుడు)-4
7. నరకాసుర
వధ లో వీర శృంగార రసములను మేళవించి వ్రాసిన తీరు అమోఘమని అంటారు. కాస్త
వివరించండి.
నరకాసుర వధ ఘట్టంలో ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇందులో శృంగార వీర
రసాలని రెంటినీ నిర్వహించాడు సోమన. సాధారణంగా వీర రసం ఇక్కడ ప్రథానమవ్వాలి, కానీ శృంగార రసమే మనకి ఎక్కువ
కనిపిస్తుంది. ఉదాహరణకి, సత్యభామ కొంతసేపు యుద్ధం చేసిన తరువాత
కృష్ణుడు సంతోషించి ఏమి చేస్తాడో చూడండి:
చెలువచెక్కుల నెలకొన్న చెమట దుడిచి
తరుణి నుదుట బైకొన్న కుంతలములొత్తి
రమణి కుచమధ్యమునకు హారముల ద్రోచి
పొలతిపయ్యెద కొంగు పైబొందుపరచి
దురదృష్టవశాత్తూ యీ కావ్యానికి విపుల వ్యాఖ్యానమేమీ వచ్చినట్టు లేదు.
మల్లంపల్లి శరభయ్యగారు చేసినారని విన్నాను కానీ అలభ్యము.
8.ఈ విధమగు వేరేదయినా అలంకారాన్ని సోమన ఉపయోగించినారా?
సూక్ష్మత
చెప్పే విషయాన్ని చాలా క్లుప్తంగానో, గుప్తంగానో చెప్పడం
సూక్ష్మత. నాచన సోమన కవిత్వ లక్షణాలలో సూక్ష్మత ఒకటంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు.
సోమన కవిత్వంలో శబ్దాడంబరం తప్ప మరేమీ లేదన్న విమర్శకులున్నారు. అతను ఏ
విషయాన్నైనా సమగ్రంగా వర్ణించకుండా ఉండలేడు అన్న వారున్నారు. కాని, వాటి వెనక సూక్ష్మంగా, సోమన తాను చెప్ప దలచుకున్న
విషయాన్ని ఎలా ఆవిష్కరించినాడో గమనిస్తే అతని కవిత్వంలోని గొప్పదనం తెలుస్తుంది.
వర్ణనలలో అయితేనేమి, పాత్ర
చిత్రణలోనైతేనేమి సోమన చూపిన సూక్ష్మత అనన్యమైనది. ఉదాహరణకి యీ వర్ణన చూడండి:
నరకాసుర ప్రాణ నాళోత్తరణ కేళి
రణకేళి వలకేలి రమణ జూపె
గంసదానవ శిరః కమల కృత్తన మేలు
తన మేలుచేయి పెద్దలకు నొసగె
జాణూర ముష్టిక క్షతజ కీలాలంబు
నాలంబులో నెల్ల నలవు వఱపె
ముర హయగ్రీవాంత్రమూల ఫేనావలి
నావలి దలగ జీకాకు పఱచె
వీరరససార కాసార విహరణంబు
విష్ణునకు నొప్పు నతనితో విగ్రహింప
దొరకొనిన వచ్చు మనకు మద్దులు మునింగి
పాఱ వెంపళ్ళు తమకెంత బంటి యనుట
ఇందులో పైకి ఎక్కువగా కనిపించేది శబ్దాలంకార ఆడంబరం. విస్తారమైన వర్ణన. కాని
వాటిని దాటుకొని అందులోని భావాన్ని తరచి చూస్తే ఏం కనిపిస్తుంది? నరకాసురుని ప్రాణాలనే తామర
తూళ్ళని పెరికి పారెయ్యడమూ, కంసుని శిరస్సనే పద్మాన్ని తుంచి పారెయ్యడమూ, చాణూర ముష్టికుల రక్త జలాన్ని
నలుదిక్కులా చిమ్మేయడమూ, ముర హయగ్రీవుల ప్రేగులనే నురగల సమూహాన్ని
చిందరవందర చెయ్యడమూను. ఇది చదివాక, సరస్సులో స్వైర విహారం చేస్తున్న ఒక మత్త గజం
మనకి కనిపించక మానదు! వర్ణన ద్వారా పాఠకుల మనసులలో ఒక చిత్రాన్ని రూపుకట్టించడం
కవి ప్రతిభ. ఇక్కడ సోమన ప్రత్యేకతంతా విష్ణువుని మదగజంతో నేరుగా పోల్చకపోవడంలో
ఉంది. అది పాఠకుల ఊహకి వదిలివెయ్యడమే ఇందులోని సూక్ష్మత. పైకి కనిపించే
శబ్దాలంకారాలకి లొంగి అక్కడే ఆగిపోక, ‘లోనారసి’ చూస్తే
ఇందులో దాగిన ఆ చక్కని చిత్రం దర్శనమిస్తుంది. అలాగే మరో వర్ణన చూడండి.
నరకుని వలన మునులుపడ్డ బాధలని విని కృష్ణుడు కోపించినప్పుడు అతని క్రోధాన్ని
వర్ణించే పద్యమిది :
అరుణాంభోరుహ పత్రనేత్రుడు సముద్యద్భ్రూకుటీ భంగ భా
సుర ఫాలస్థలుడుం జలాచల మనశ్శూలాయమానవ్యధా
పరివేషానన భానుమండలుడునై ప్రత్యక్ష రౌద్రంబనన్
నరకాలంభ విజృంభణంబు నెఱపెన్ నారాయణుండాకృతిన్
ఈ పద్యములో ‘ప్రత్యక్ష రౌద్రంబనన్’ అంటే
ఏమిటి?
‘రౌద్ర రసమే సాక్షాత్కరించిందా అన్నట్టుగా’ అన్నది
సామాన్యంగా చెప్పే అర్థం. (రౌద్ర అన్న పదమును రుద్రా సంబంధమైనదిగా వాడుట
జరిగినది.) రుద్రుడే, అంటే శివుడే
ప్రత్యక్షమైనాడా అన్నది సూక్ష్మంగా కవి స్ఫురింప జేస్తున్న అర్థం. భాసురమైన
ఫాలస్థలి ప్రస్తావన దీనికి మరింత దోహదం చేస్తోంది. ఇది శ్లేష కాదు. ఒక చిత్రాన్ని
లీలగా ఛాయగా ప్రదర్శించడం, ఇక్కడ మరో విశేషం. ఇలాగే వర్ణన ద్వారా శివుని
రూపాన్ని లీలగా స్ఫురింపజెసిన సందర్భం, ఉత్తరహరివంశంలో మరొకటి ఉంది. పౌండ్రకుని
వద్దకు నారదుడు వచ్చినప్పుడు, ఆ నారదుడెలా ఉన్నాడో వర్ణించే పద్యమిది :
ప్రాలేయాంశు మరీచి నిర్మల తనూ భాగంబు కృష్ణాజిన
వ్యాలోలామల యజ్ఞసూత్రములు సంసాసక్త వీణాలతా
లాలిత్యంబు, లలాటికా రుచులు
గ్రాలన్నారదుండిచ్చలం
గైలాసంబుననుండి వచ్చె గలహోత్కస్వాంతుడచ్చోటికిన్
ఈ పద్యంలో ప్రస్తావించిన చంద్రకాంతిలా(తో) తెల్లగా వెలుగుతున్న శరీరము, లలాటము చిందే కాంతులు, కైలాసము నుండి విచ్చేయడము – ఇవన్నీ
కైలాసం నుండి స్వయంగా శివుడే వచ్చాడా అన్న భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఇంతకుముందు
పద్యంలో లాగానే ఇందులో కూడా శ్లేష లేదు. ఇక్కడ ఉన్నది ధ్వని! ఇలా వర్ణనలలో
సూక్ష్మంగా అంతరార్థాన్ని ధ్వనింప జేసే సందర్భాలు మరికొన్ని ఉన్నాయి. నేను
తెలుసుకోలేక పోయినవి ఇంకా చాలానే ఉండి ఉంటాయి! దురదృష్టవశాత్తూ యీ కావ్యానికి
విపుల వ్యాఖ్యానమేమీ వచ్చినట్టు లేదు. మల్లంపల్లి శరభయ్యగారు చేసినారని విన్నాను
కాని, అది
నాకు అలభ్యము.
పాత్ర నిర్వహణలో కూడా సోమన పాత్ర స్వభావాలని వాచ్యం చెయ్యకుండా సూక్ష్మంగా
ధ్వనింపజెయ్యడం గమనించవచ్చు.
పాత్ర నిర్వహణలో సోమన చూపించిన సూక్ష్మతకి మంచి ఉదాహరణ పౌండ్రకుని కథ. ఇందులో
పౌండ్రకుని పాత్ర ప్రవేశంలో ఉన్న యీ పద్యం చూడండి:
ఇక్కడ బౌండ్రభూపతి వివేకవిహీనత జేవ యెక్కగా
“నెక్కడి వాసుదేవు డిల నేనొకరుండన వాసుదేవుడన్
దక్కినవాడు నందక సుదర్శన శార్ఙ గదాది హేతులన్
స్రుక్కక పట్టినన్, దెసల జుట్టిన .......
అని అంటూ కృష్ణుని ఎగతాళి చేస్తున్నట్లనుకొంటూ తనను తానూ ఎగతాళి చేసుకొంటాడు.
9. పాలలో పండ్లు పిసికిరి అన్న ప్రయోగము అమోఘమని అందరూ అంటారు . దానిని గూర్చి
కాస్త తెలుపండి?
బాణాసురుడు అనిరుద్ధుని చెరసాలలో బంధించినాడనే విషయం తెలిసి, ద్వారకలోని అమ్మలక్కలు
అనుకునే మాటల్లో “పాలలో పండ్లు పిసికిరమ్మ” అనుకుంటారు.
“అఖిల లోకాధీశుడగు చక్రధరు నింట
నొక కీడు మాట నేడొదవె నమ్మ
బాల్యంబు నంద శంబరు జంపె
ప్రద్యుమ్ను డతని లావెల్లిద మయ్యెనమ్మ.
కీడు లేదన దేవకీ దేవి బలగమొ
ప్పిన పాలలో పండ్లు బిసికిరమ్మ”
అన్ని లోకాలనూ ఏలే కృష్ణుడింట్లోనే ఇన్నాళ్ళకు ఇటువంటి కీడు జరిగింది కదా.
చిన్నప్పుడే శంబరాసురుని చంపిన ప్రద్యుమ్నుని పరాక్రమం నగుబాటు చెందినట్లయింది గదా – అతని
కుమారుడైన అనిరుద్ధుని ఒక రాక్షసుడు బంధించడం. దేవకీ దేవి బలగానికి ఎప్పుడూ ఏ కీడు
ఉండదు. అటువంటిది పాలలో పండ్లు పిసికినట్టయింది కదా అని అర్ధం. ఈ పాలలో పండ్లు
పిసకడం అనేది ఒక విచిత్రమైన ఊహ. పాలు రుచి కోల్పోయినప్పుడు రుచి కోసం పాలలో పండ్లు
పిసుకుతారు. అలాగే, పాలు
పలచ నైనప్పుడు చిక్కదనం కోసం పండ్లు పిసికి కలుపుతారు. ఇన్నాళ్ళకి దేవకీ దేవి ఇంట
పాలు రుచినీ చిక్కదనాన్నీ కోల్పోయినాయి. ఎటువంటి దశ వచ్చింది, కృష్ణుని ఇంటికి, అని వాపోవడం ఇది.
ఉత్తరహరివంశం లోని కావ్యధ్వని గురించి విశ్వనాథ సత్యనారాయణ ‘ఒకడు నాచన సోమన్న’ అన్న పుస్తకాన్ని రాసినారు.
సోమన స్థాపించాలనుకున్న విషయం విష్ణువు యొక్క పరమస్థితి అని విశ్వనాథ ఆలోచన. పరమస్థితి
అంటే అతని పరమాత్మ తత్వమన్నమాట. ఉత్తరహరివంశం లోని కథల సంవిధానము, వాటి కథనము విష్ణు
పారమ్యాన్ని ఎలా ధ్వనింపజేస్తున్నాయో ఆ పుస్తకంలో వివరించినారు. ముఖ్యంగా
నరకాసురుని కథ గురించి, జ్యోతిష పరంగా ఇచ్చిన వివరణ చాలా ఆసక్తికరంగా
ఉంటుంది. నరకుడు నిజానికి భూమినుంచి విడిపోయిన ఒక గోళమని, అది భూమికి దగ్గరగా వచ్చి
దాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు, కాల స్వరూపుడైన విష్ణువు
దాన్ని ఛిన్నాభిన్నం చేయడమే నరకాసుర వధ అని కొన్ని ఆధారాలతో వివరించినారు.
చివరి భాగము రేపు........
నాచన సోమన (నాచన సోమనాథుడు)-చివరి భాగము
10. నరకాసురునితో యుద్ధ సమయమున వ్రాసిన సోమన పద్యములు భాగవతమున పోతనకు ఆలంబనములైనాయని విన్నాను. ఉదహరించ గలరా?
నరకాసుర యుద్ధ ఘట్టములో కొన్ని పద్యాలను చూద్దాము. ఎంతటి గంభీరమైన పద ప్రయోగమో
ఎటువంటి భావజాలమో గమనించుదాము. ఈ పద్యములను నరకాసుర ఘట్టములో పోతనే ఈయనను
అనుకరించినాడు అంటే ఈయన గొప్పదనము మనము అర్థము చేసుకోన గలము .
ఈ పద్యము చూడండి
''తంత్రీ వినోదంబు తడవు సైపని వ్రేళ్ళ
గొనయంబు తెగలపై గోరికనుట
యద్దంబు పిడి ముట్టనలయు పాణి తలంబు,
లస్తకంబిఱియించు లావు కలిమి
చెలికత్తెనొత్తిలి చీఱలేని యెలుంగు,
సింహనాదంబుచే జెదరకునికి
ప్రమద నర్తన కేళి బంతవింపని పదం,
బైదు రాణంబుల నలత బడమి
సోయగపు జిత్రరూపంబు జూచుచోట,
వేసరు విలోచనంబులు వికృత
దైత్య
లక్ష్యమీక్షించుటయు
మొక్కలంపు గెలుపు
గైకొనియె సత్యభామ సంగ్రామ
సీమ''
తంత్రులను మీటుటకే కనలి పోయే వ్రేళ్ళు వింటి అల్లెత్రాటిని ఏవిధముగా వింటికి
అనుసంధించ గలుగుతుంది. అద్దము యొక్క పిడిని
పట్టుకుంటేనే కందిపోయే చేయి ధనువు మధ్య గల ధృడమైన పిడిని ఏవిధముగా
పట్టుకోగలుగుతుంది. చేలికత్తెలనే గట్టిగా పిలువలేని స్వరము సింహనాదముల నేవిధముగా
చేస్తుంది, స్త్రీ సహజమైన
సౌకుమార్యముగల నాట్యమే చేయనోపని సుకుమార పదములు ఐదు విధములగు నైపుణ్యతలను అంటే
1.విల్లు ధరించుట 2. బాణమును సంధించుట ౩. ఆకర్ణాంతము లాగుట, 4. ప్రత్యాలీఢ పాదమ్ముతో
నిలచుట 5. శరమును వదలుట అన్న ఈ ఐదు పనులను ఒకే సమయమున అలయకుండానే
ఏవిధముగా చూపగలదు. సోయగముతో కూడిన రూప లావణ్యముల గాంచ వలసిన ఆమెలో వికృతమగు
రక్కసుని
లక్ష్యముగాగొని ఆతని కదలికలు సునిశితముగా చూసి వేసారిన కన్నులు గలిగి అలసి కూడా అసాధ్యమైన గెలుపు గైకొనె నా సంగ్రామ సీమ లో సత్యభామ.
ఈ పద్యము సత్యభామా సౌకుమార్యమును తెలుపుతూ ఆమె యుద్ధము ఎట్లు చేయగలదు అన్న సందేహమును వ్యక్తము చేస్తున్నాడు సోమన.
ఇదే సందర్భమును, ఇదే భావమును, ఇదే పాత్రను , యథాతథముగా గ్రహించి పోతన భాగవత దశమ స్కందములోన ఏవిధముగా వర్ణించినారో తిలకించండి.
వీణ చక్కగ బట్ట వెరవెరుంగని కొమ్మ
బాణాసనంబెట్లు పట్ట నేర్చె
మ్రాకునదీగె గూర్పంగ నేరనిలేమ
గుణము నేక్రియధనుష్కోటి గూర్చె
సరవి ముత్యము గ్రువ్వజాలని యబల
ఏనిపుణత సంధించె నిశిత శరము
చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి
యస్త్రమంత్రము లెన్న డభ్యసించె
బలుకు మనిన బెక్కు పలుకని ముగుద
యే గతి నొనర్చె సింహ గర్జనములు
ననగ మెరసె ద్రిజగదభిరామ గుణధామ
చారు సత్యభామ సత్యభామ !
వీణ చక్కగా పట్టుకొనుట తెలియని ఈమె విల్లు పట్టుకొనుట ఎటుల నేర్చుకున్నది ? చెట్టుకు లతలను ఎక్కించ
లేని ఈమె ధనస్సుకు, వింటినారిని ఎటుల
ఎక్కించినదో ? ముత్యాలలో దారము గూర్చుట తెలియని మగువ బాణములు గురి తప్పక ఎటుల సంధించుచున్నదో? చిలుకలకు మాటలు నేర్పలేని సుందరి ఈ అస్త్రమంత్రముల నెప్పుడు నేర్చుకోన్నదో ? బిగ్గరగా మాట్లాడలేని ఈమె ఈ
యుద్ధము సింహగర్జనలు చేయుచున్నది . ముల్లోకాలలో చారు సత్య సౌందర్య యుతయైన భామయగు, సత్యభామకు ఇవన్నీ ఎటుల సాధ్యమయెను ? సమాధానము కుడా ఆపరమాత్మకు
తెలియును. సత్యభామ సాధారణ కన్య కాదు చక్రవర్తి కుమార్తె. క్షత్రియులలొ స్త్రీ పురుషులకు ఈ విద్యలెల్ల నేర్పు ఆచారముండెడిది ఆ కాలంలో..
అవసరమైనపుడు మాత్రమె వానిని ప్రదర్శించెడి వారు.
మ. అరి జూచున్ హరి జూచు
జూచుకములం దందంద మందార కే
సరమాలామకరందబిందుసలిలస్యందంబు
లందంబులై
తొరుగం బయ్యెద కొం గొకింత
దొలగం దొడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం గురియుచుం
దన్వంగి కేళీగతిన్
ఇది నాచన సోమనాథుడు ఉత్తరహరివంశమున నరకాసురవధ ఘట్టమున రచించినది.
స్వతహాగా సత్య వీరనారి. నరకుని లాంటి వీరునితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. ఆ
ఉత్సాహం కొంత. తన పరాక్రమం భర్త ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు భర్త ముందు ప్రదర్శించే
అవకాశం వచ్చింది. ఆ ఆనందం కొంత. ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది. ఆమె అటు అరిని (శత్రువుని) చూస్తున్నది. అతని
మీద బాణ పరంపర కురిపిస్తున్నది. ఇటు హరిని చూస్తున్నది. అతనిపై చిరునవ్వులను
చిందిస్తున్నది. ఈ రెండు పనులూ ఒక హేలావిలాసంగా నిర్వహిస్తున్నది. ఆ సందర్భంలో ఆమె
పయ్యెద కొంగు కొంచెం తొలిగింది. మెడలోని మందారమాల లోని పువ్వుల నుంచి తేనె సొనలు
కురిసి ఆమె వక్షస్థలాన్ని చిత్తడి గావిస్తున్నాయి. ఇదీ దృశ్యం. ఆమె సౌందర్యమూ, శృంగారమూ, వీరమూ, చిరునవ్వుల జల్లూ, మెడలోని మందారదామం లోని
మకరందాల ధార, కొంచెంగా తొలగిన పైటకొంగు — ఒక ఆహ్లాదకరమైన దృశ్యాన్ని
ఈ పద్యంలో రూపు కట్టించాడు సోమన కవి.
దీనిని అదే ఘట్టములో పోతన ఏవిధముగా అనుకరించినాడో చూడండి
పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరుగన్ కన్నులు కెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహముల్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్
ఆమె వీరావేశముతో శతృవును విప్పారిన కనుబొమలతో కూడిన మందహాసము
తో అటు నరకుని ఇటు హరిని చూచుచున్నదట, కళ్ళు ఎర్రబడినాయి. వాడియైన బాణములతో నరకుని బాధించుతూ వేడి చూపులతో కృష్ణుని వేధిస్తూ వున్నది. ఆ కళ్ళలో ఇటు వీరము అటు శృంగారము తో
కళ్ళు ఎరుపెక్కినాయట. ఒక ప్రక్క పరుని అంటే శత్రువును ప్రచండాస్త్రములు సంధిస్తూ ఇంకొక ప్రక్క వరుని సరసరస సంయుక్తావలోకనములతో స్పందిస్తూ
ఆమె తన హేల అంటే సుస్పష్టమైన కవళికలతో కన్పించుచున్నదట
ఇంకా ఒకటి రెండు పద్యాల మొదటి పాదాలు వినిపిస్తాను.
గనయంబున్ గొనయంబుతో నెన్నడుముతో కర్ణావతంసంబుతో
1-157 ఉ.హ.వం
అలినీలాలక చూడ నెప్పెసగె ప్రత్యాలీఢ పాదంబుతో భాగ.దశ.179
సత్రాజిత్తనయా కరాంతర ధనుర్జ్యారావ మైరావతీ ఉ.హ.వం.160
జ్యావల్లీ ధ్వని గర్జనంబుగా సురల్ సారంగ యూధమ్ముగా భాగ.దశ.182
అనుకరణ కన్నా అసలు పద్యము ఎంత హృద్యముగా ఉన్నదో అర్థమును తడివితే మనకు
అర్థమౌతుంది. అంతటి మహనీయుడు కావుననే పోతన, ఒంటిమిట్టకు ౪౦ కి.మీ. దూరములో వున్న
బుక్కపట్ణము పోయి సోముని కలిసియుండ వచ్చును. హృద్యమైన ఆయన పద్యములచే ప్రభావితుడై సోమన పద్యములను పోతన అనుకరించి యుండ
వచ్చును.
ఇటువంటి ఒక మహనీయుని గుర్తు చేసుకొనే అవవకాశాము ఈ రాబోవు దీపావళి సందర్భమున పాఠకులగు మీకు, ఓర్పుతో చదువుతారని విశ్వసించుతూ, మానస సరోవరాంతర్గత మరాళయానయౌ వాణికి వీణా పాణికి క్షోణీకరురాణి కి నమస్సుమాలను అర్పించుకొంటూ శెలవు తీసుకుంటూ వున్నాను .
స్వస్తి.
No comments:
Post a Comment