అహింసాది అష్ట పుష్పములు
https://cherukurammohan.blogspot.com/2020/10/blog-post_25.html
अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रिय निग्रहः ।
सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशेषतः ॥
ज्ञानं पुष्पं तपः पुष्पं शान्तिः पुष्पं तथैव च ।
सत्यमष्टविधं पुष्पं विष्णोः प्रीतिकरं भवेत् ॥
అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహః
సర్వభూతదయా పుష్పం క్షమా
పుష్పం విశేషతః
జ్ఞానం పుష్పం తపఃపుష్పం
శాంతిః పుష్పం తథైవ చ |
సత్యమష్టవిధం పుష్పం విష్ణొః
ప్రీతికరం భవేత్ ||
పై శ్లోకమును రెండు మూడు
రోజుల క్రితము అజరామర సూక్తిగా ఉంచియుండినాను. కానీ విశ్లేషించ వీలుపడలేదు ఆరోజు. అందుకు గాను ఆ
శ్లోకమును తీసుకొని ప్రత్యేక శీర్షిక క్రింద విశ్లేషించుచున్నాను.
ఇది చాలామందికి తెలిసిన శ్లోకమే! మిగతావారు కూడా తెలుసుకొనేందుకు ఈ
ప్రయత్నము. భగవంతునికి ఈ ఎనిమిది పుష్పాలూ అత్యంత ప్రీతికరమైనవి.
1.అహింస 2.ఇంద్రియ నిగ్రహత 3.భూత దయ 4. క్షమా 5. జ్ఞానము 6. ధ్యానము
మరియు తపస్సు 7. శాంతి 8. సత్యము
ఇందులో మనకు తెలియనివి ఏవీ లేవు. కానీ వీనిని మనము సాధించినామా! సాధించ
దలచినామా! లేక వీని ముసుగులో మనము సంఘాన్ని మభ్యపెడుతున్నామా! అన్నది ఆత్మ
విమర్శకు అత్యంత యుక్తమైనది.
వీనిని సాధించిన జీవితము ధన్యము. వీనిని మనసునందే పాదుగొలిపి భగవత్ చింతన చేసినచో ఆయన ఆశ్రయము పొందుటలో
ఆలశ్యముండదు.
అహింసా సత్యమస్తేయం | శౌచ మింద్రియ నిగ్రహ: |
దమో దానం దయా శాంతి: | సర్వేషాం ధర్మసంగ్రహ: ||
అహింస, సత్యవాక్కు, అచోరత్వము, శుచిత్వము, బాహిరింద్రియ, అంతరింద్రియనిగ్రహము, దానపరత్వము, భూతదయ, శాంతము అనే ఈ తొమ్మిది గుణములు కలిగియుండుట మానవధర్మం. తమ సుఖము కొరకు, ఇతర జీవుల ప్రాణాలను తీయుట మంచిదికాదు, అట్లని స్వధర్మాలంబనలో యుద్ధము విహితమని నిర్ద్వంద్వముగా పరమాత్మ అర్జనునికి తెలిపినాడు. మరి భగవద్గీత తన ధర్మ పథగమనమునకు ఊతకర్ర అని చెప్పిన గాంధీగారు పాశ్చాత్యులతో యుద్దముచేసి వారిని పారద్రోలుట భగవద్గీత అనుసారము, తన ధర్మముగా భావించక అహింసను అవలంబించి, అవలంబింపజేసి అనేకమైన అతిసామాన్య ప్రజల అసువులు బాపజేసినాడు. గాంధీగారు చెరసాలలో ఉన్నారన్న పేరేకానీ వారు ఆసమయములో తనకు వలయు వసతులను బ్రిటీషు పాలకుల ద్వారా పొందేవారు. అసలు ఆహింసను ఎటువంటి విషయములలో పాటించవలెనంటే, ఒకదోమ కుట్టి మన రక్తమును కళ్ళ స్తుందని దానిని చంపేకంటే ప్రత్యామ్నాయములను వాడి దానిని తన దారిన పంపవచ్చును. ఇది అహింస.
సత్యపాలన కష్టమే! ముఖ్యముగా నేటి సాంఘీక పరిస్థితులలో. కానీ ఆత్మవంచన లేని
సత్యపాలన నేటికి కూడా అత్యంత ఆచరణ యోగ్యము. నూరు అశ్వమేథ యాగాలు
చేసిన వచ్చు పుణ్యం కంటే ఒక సత్యవాక్కు వలన లభించే పుణ్యం ఎక్కువ. కనుక
సత్యమును పాటించవలెనన్నది పెద్దల మాట. అబద్ధము అను నూలుతో నేయబడే
వస్త్రమునకు అదుపూ ఉండదు అంతూ ఉండదు. నాడు సత్యము నిత్యము. నేడు
సత్యము పత్యము.
పేదరికము దొంగతనాన్ని ప్రోత్సహిస్తుంది. కనుక మనోనిగ్రహముతో ఉండుట
మంచిది. దొంగతనము నరకప్రాప్తిని కలిగిస్తుంది. ఎంతపేదరికము అనుభవిస్తున్నా
దొంగతనము చేయక ఉన్నదానిలో తృప్తి పడటం గౌరవము .
సర్వదా శుచిపాటించాలి. శుచిపాటించకపోవటం వలన కలిపురుషుడు ప్రవేశిస్తాడు. అందువలన కష్టాలు అనుభవించవలసి వస్తుంది. నలుడు అశుచి పాటించటం వలన కష్టాలు అనుభవించినాడు. శుచి ఉన్నచోటకు లక్ష్మి స్వయంగా వస్తుంది. శుచి ఆరోగ్య కారకము. నాదు ముఖ్యముగా ఈ శుచిని మడుగు అన్న పేరుతో నిష్ఠగా పాటించేవారు. స్త్రీల శరీరతత్వము కోమలమైనది. ఈ మడి ఆచార నియమాలే వారిని భయంకరమైన స్త్రీ వ్యాధులనుండి రక్షించి వారిని కాపాడేవి. బ్రాహ్మణులు కానివారి కాయకష్టమే వారి శుచియై వారిని కాపాడేది,
అంతిరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహాలు పాటించాలి. రథాశ్వాలకు పగ్గాలు లేకపోతే ఎలా ఉంటుందో వీటిని పాటించకపోతే అలా ఉంటుంది. ఇంద్రియాలు మనసుకు ఆధీనం. కనుక మనస్సును దారితప్పనీయక అదుపులో ఉంచుకోనవలసి యుంటుంది. ఆర్జనుడు తన ఇంద్రియ నిగ్రహముతో ఊర్వశి శాపమునకు గురియైనా అది అతనికి వరముగా మారి సహకరించింది. ధర్మపథము సకల సంకట దమన హేతువు అన్నది ఎంతో సహేతుకముగా నిరూపింపబడినది. ఈ విషయమై భగవద్గీత ఏమని ఆదేశించుచున్నదో కాస్త గమనించండి:
యదా సంహరతే చాయం కూర్మోఽఙ్గానీవ సర్వశః ।
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 2 - 58।।
తాబేలు దాని అంగములను తన శరీర కావచమగు పైచిప్ప లోనికి ఉపసంహరించుకున్నట్టుగా, ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును.అది ఇంద్రియ నిగ్రహము యొక్క గొప్పదనము.
ఇక దానగుణమును గూర్చి తెలుసుకొందాము.
దానగుణము వలన శాంతము, సుఖము లభిస్తాయి. ఇహలోకంలో కీర్తిప్రతిష్ఠలు కలుగుతాయి. పరలోకంలో పుణ్యం లభిస్తుంది. అంటే తనకూ తనవల్ల సమాజానికి మేలు చేకూరుతుంది. దానగుణము త్యాగానికి మొదటిమెట్టు. రంతిదేవుడు దయాగుణం కలవాడు. తనకు లభించిన అన్నాదులను వచ్చిన వారందరికీ పూర్తిగా ఇచ్చివేసిన దయాస్వభావుడు.
కామక్రోథాది అరిషడ్వర్గములను అంత:శత్రువులను జయించినపుడే, శాంతము కలుగుతుంది. పైన చెప్పిన శ్లోకములోని ఈ తొమ్మిది గుణములు,
ఆచరించిన మానవుడు మహనీయుడవుతాడు.
పై శ్లోకమునకు అనుబంధముగా, భర్తృహరి తన నీతి శతకము లోని సుజన పద్ధతిలో
ఏమి చెప్పినాడో చూడండి.
ప్రాణఘాతాన్నివృత్తిః పరధనహరణే సంయమః సత్యవాక్యం
కాలే శక్త్యా ప్రదానం యువతిజనకథా మూకభావః
పరేషామ్ ।
తృష్ణా స్రోతో విభంగో గురుషు చ వినయః సర్వ
భూతానుకంపా
సామాన్యః సర్వ శాస్త్రేష్వనుపహత విధిః
శ్రేయసామేష పంథాః ॥ 54
దిగువన, ఈపద్యమునకు, ఏనుగు లక్ష్మణ కవిగారి తెనుగు సేత ఇవ్వబడినది.
అవధారించగలరు.
పరహింసా పరకీయ విత్తహరణా భావంబు సత్యవ్రతా
దరముం దానపరత్వ మన్యవనితో దంతోక్తి
మూతకత్వమున్
బరతృష్ణాఝర భంజనంబు గురు నమ్రత్వంబునుం
బ్రాణభృ
త్కరుణాశాస్త్ర సమత్వసద్విధులు
భద్రప్రాప్తికిన్ మార్గముల్
ఇంద్రియ వ్యామోహము క్షణికము. దాని ఫలితము కొన్నిసమయములలో వెంటనే
చూపకపోయినా, చేష్టలుడిగిన చరమదశలో అనుభవించక తప్పదు. వ్యామోహము
అన్న తీయని విషము తాగునపుడు రుచికరమనిపించినా పిదప అది ప్రాణఘాతుకమే
కదా! అందుకే ‘పరహింస’ అంటే ఇతరులను బాధపెట్టుట, ‘పరకీయవిత్త హరణ’
ఇతరుల సొమ్ము ఆశించుట అన్న అభావము కలిగి యుండవలెను. (పరహింస
పరకీయ విత్తహరణ +అభావము)
మాట తప్పనితనము, అంటే మాటపై నిలువటము,కలిగినదానిలో శక్తి కొలది దానము
చేయట. ఇతర స్త్రీల ప్రసక్తి వచ్చినప్పుడు మౌనము పాటించుట, . ఇతరుల వస్తువుల పట్ల
‘తృష్ణ +ఝర’ వాంఛా గుణ భంజనము
అనగా నివృత్తి,
గురువుల పట్ల విధేయత, సకల భూత దయ అన్న ఈ లక్షణములన్నీ
మోక్షదాయకములు. సద్గుణ సంపత్తిలేని భక్తుడు రావణాసురుని వంటివాడు.
ఎంతరుచికరమైన పాయసము పాత్రలో ఉన్నా, బాహిరముగా పాత్ర శుభ్రముగా
లేకపోతే తాగుటకు మనసు రాదు కదా!
దారి తప్పకు దారి తప్పకు ధర్మ మార్గపు
దారి తప్పకు
తప్పికూడా తప్పలేదని నీవబ్ద్ధము నెపుడు
చెప్పకు
భేషజములకు పోవ బోవక నీతి తప్పక నిజము
పలుకు
మనసులోపల ప్రేమ నిలుపని మభ్యపెట్టే
మాటలాడకు
దయను కూడుచు దానముండును దాని వదలకు వదలి కదలకు
జీవహింసను చేయబోవకు శత్రువుల నిర్జించ మానకు
పిండికిని మరి పిడుగునకును మంత్రమొకటని తలువబోకు
నీదు గృహిణిని తప్ప ఇతరుల మోహ వాంఛల చూడ నేరకు
ధర్మమును రక్షించుమన్నా కాచు నిన్నది నిజము కన్నా
దీని మరువక ఆచరించుము ఉన్న మాటను తెలుపుతున్నా
అహింసను గూర్చిన ఒక అపప్రథను అంతము చేయు ప్రయత్నములో ఈ దిగువన
తత్సంబంధమగు విషయమును సవిస్తారముగా మీ ముందుంచుచున్నాను.
‘అహింసా పరమో
ధర్మః’ అన్న ఈ శ్లోకపాదమును గాంధీ గారు విరివిగా ఉపయోగించేవారు దాని పూర్తి
పాఠమిది అని కొందరు అహింసాపరమోధర్మః ధర్మోహింసా తథైవచ’ అంటూ ఇటీవల ఆస్య గ్రంధిలో
వ్రాసినారు, ‘ఎద్దు ఈనింది అంటే గాట కట్టివెయమ’న్నట్లు. ఇది తెలుగులోనే కాక హిందీ మరియు
ఆంగ్లములో కూడా కొనసాగినది. ఇప్పుడు ఆ ఉధృతి కొంత తగ్గినది. సామాన్యముగా
వ్రాసేవారిలోని ఒక వర్గము, ఒకరు వ్రాసినది సంగ్రహించి తమ
పేరుతో పునః ప్రచురణ చేస్తే, వారు చేసినది మరియొకరు అఖండ
శృంఖలము రీతిలో కొనసాగిస్తూ వుంటారు. ‘పదుగురాడు మాట పాటియై ధరయిల్లు-ఒక్కడాడు మాట
ఎక్కదెందు’ అన్నట్లు అదే నిజమై కూర్చుంటుంది రానురానూ. నిజానికి పైన తెలిపినది
పూర్తి శ్లోకము కాదు అది శ్లోక పాదమే! దానిని జూచి అది పూర్తి శ్లోకము కాదు శ్లోక
పాదమే నని తెలిసినా అసలు ఆవిధమగు పంక్తి కల్గిన శ్లోకము ఒకటుందా అని గూగుల్ లో
వెదకినాను. ఎందఱో పండితులను అడిగినాను. ఎక్కడా కనిపించలేదు ఎవరి ద్వారానూ
తెలియలేదు. చిట్ట చివరకు వేదమూర్తులు మాడుగుల నాగపణి శర్మగారిని అడిగినాను. వారు
అనుశాసనిక పర్వములోని ఒక శ్లోకమును చెప్పి అదికాక వేరేదీ నాకు అగుపించలేదు అని
అన్నారు. ఆ శ్లోకము ఇది.
అహింసా పరమోధర్మ
స్తథా2హింసా పరం తపఃl
అహింసా పరమం
సత్యం తతో ధర్మః ప్రవర్తతిll
అహింసా పరమో
ధర్మ స్తథా2హింసా పరో దమఃl
ఆహింసా పరమం దాన
మహింసా పరమం తపఃll (మహాభారతము అనుశాసనిక పర్వము)
ఇది హింస
భక్షణాన్ని గర్హిస్తూ భీష్ముడు యుధిష్ఠిరునితో చెప్పిన మాట.
మన మెదడులో
వెంటనే తళుక్కుమను ప్రశ్న మరి మనము అహింస తప్ప హింసపాటించ కూడదా! అంటే కూడదు
అన్నదే జవాబు. మరి యుద్ధములు చేయ కూడదా! అన్నది తదుపరి ఉదయించే ప్రశ్న. ఎందుకు చేయ
కూడదు, తప్పక చేయవలసినదే! అదే కదా భగవదీత చెప్పినది. యుద్ధము క్షత్రియుని
కర్తవ్యము. అది జరుగకుండా తగిన చర్యలన్నిటినీ తీసుకొని, అవి ఫలించక పొతే తప్పక యుద్ధము చేయవలసిందే!
అది హింస కానేరదు. మోస పూరితముగా చేత చిక్కించుకొని, శంబాజీని,
రంజీత్ సింహుని నరకయాతనలు అనుభవింపజేసిన ఔరంగజేబు చేసినది హింస. అదే
యధాదృష్టి గా యుద్ధము చేసి చంపినా చచ్చినా అది కర్తవ్యమే కానీ హింస కాదు.
గాంధీ గారిని
వెనకేసుకు వచ్చుట లేక వారి బోధను ఖండించుట నా రచన ఉద్దేశ్యము కాదు. తెలిసీ తెలియకుండా మన ఇతిహాసముల
వక్రీకరణ నా మనసుకు నొప్పి కలిగించుటచే ఇది వ్రాయుచున్నాను. ఎంతో మంది మహా
పండితులు దేశమున నిండియున్నారు కానీ వారు ఈ విషయముల జోలికి రారు. ఇప్పుడు
చిన్నమంటగా కనిపించేదే కొంతసేపయిన తరువాత ప్రళయభీకర జ్వాలయై సర్వస్వమునూ
దహించివేస్తుంది.
పై శ్లోక
భావమును తిక్కన గారు చక్కనైన కందపద్యములో ఈ విధముగా తెలిపినారు.
భూతముల కలుగు
నతనికి
భూతములఖిలములునలుగు
భూత హితార్థీ
భూతములకభయమిచ్చిన
పూతాత్మునకభయమిచ్చు భూతావలియున్ (ఆంధ్ర మహా భారతము)
ఇక్కడ ‘అలుగు’
అన్న మాట రెండు మార్లు ఒకే అర్థములో ఉపయోగింపబడింది. ఇక్కడ అది కోపము అన్న
అర్థములో ప్రయోగింపబడినది. భూతములు అంటే ప్రాణికోటి అని ఇక్కడ అర్థము. ఎవరయినా
భూతములపై అంటే ప్రాణులపై కోపించి వానిని హింసించి, ప్రాణము తీస్తే అవికూడా కోపించి అట్టివాని
ప్రాణమును తీయగాలవు. అందువల్ల అతడు భూతములకు మేలుచేయువానిగా నడచుకొంటే ఆ ప్రాణులు
కూడా అతని ఎన్నో విధముల సహాయమొనరించుతాయి.
ఇదే విషయము
అరణ్య పర్వములో ధర్మ వ్యాధుని వృత్తాంతములో (ధర్మవ్యాదోపాఖ్యానములో) వస్తుంది.
చండాలుడైన ధర్మ వ్యాధుని వద్దకు బ్రాహ్మణుడు మరియు తపస్వి అయిన కౌశికుడు ధర్మ
సూక్ష్మముల నెరుగుటకు వచ్చిన సందర్భము
హింస అహింస
మహాభారతములోని
అరణ్య పర్వములో ధర్మవ్యాధుడను చండాలుడు కౌశికుడు అన్న బ్రాహ్మణునికి హింస ఆహింసల
గూర్చి ఈ విధముగా ఉపదేశించుతాడు. ఇందు ముఖ్యముగా గమనించవలసినది జ్ఞాన సముపార్జనకు
అధిక అధమ అన్న తారతమ్యములు లేవు. ఆదిశంకరులు కూడా చండాలోస్తు సతు ద్విజోస్తూ
గురురిత్యేషా మనీషా మామ' అని ఆమాటేకదా చెప్పినారు.
ధర్మవ్యాధుడు
కౌశికునితో ఈ విధముగా అంటాడు “అయ్యా! బ్రాహ్మణులకు స్వాధ్యయనం, తపస్సు, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము పరమ ధర్మము. క్షత్రియులకు ప్రజా రక్షణ, దండనీతి ధర్మము. శూద్రులకు సేవించుట అంటే సంఘమును సేవించుట అంటే సంఘమునకు వలయు
వసతులు సమకూర్చుట, ధర్మము. మృగ మాంసము విక్రయించుట నా ధర్మము. మిధిలా నగరాధీశుడైన జనకుడు
ఎవరి ధర్మాన్ని వారు మాత్రమే ఆచరించాలని కోరతాడు. జనకుడు అన్నది ఒక వ్యక్తిపేరు
కాదు, మిథిలను ఆయాసమయములలో పరిపాలించే రాజులకు తమ స్వంత
పేర్లున్నా ‘జనక’ అన్న పేరుతో పట్టాభిషిక్తులౌతారు.
స్వధర్మమును
ఆచరించని వాడు కొడుకైనా అతడు శిక్షార్హుడే. కనుక నేను నా ధర్మం ఆచరిస్తున్నాను.
కాని నేను జీవహింస చేయను. ఇతరులు చంపి తెచ్చిన వాటిని మాత్రమే విక్రయిస్తాను. నేను
గురువులను, దేవతలను, అతిధులను పూజిస్తాను. సత్యమును, శౌచమును ఆచరిస్తూ అణుకువతో ఉంటాను. బంధువులను ఆదరిస్తాను. ఏకపత్నీ వ్రతుడను.
అసూయలేదు, కోరికలు లేవు, ఇతరులలో దోషం ఎంచను. ఉపవాస నియమాలతో ఆహారం తీసుకుంటాను. పొగడ్తలకు లొంగను, తెగడ్తలకు కుంగను. అందువలన హీనకులములో పుట్టినా నిర్మలంగా జీవిస్తున్నాను.
మహాత్మా! నేను
చేస్తున్నది హింస కాదా అని ప్రశ్నించినారు. నా సమాధానమును విన్నారు. ఏది హింస ఏది
అహింస అని చెప్పుట సులభము కాదు. ప్రాణి పుట్టుకకు మరణానికి అతడు చేసిన కర్మలే
కారణము. చంపే వాడు కేవలం నిమిత్త మాత్రుడు. పండ్లు, వేర్లు, ఔషధాలు, శాకములు, జంతువులు ప్రాణులకు ఆహారంగా భగవంతుడు ఏర్పరచినట్లు వేదములు
చెబూతూ ఉన్నాయి. పూర్వం శిబి చక్రవర్తి తనమాంసమును డేగ రూపంలో ఉన్న ఇంద్రునికి
ఇచ్చి పుణ్యం సంపాదించ లేదా! వేదములు చదివిన వారు యజ్ఞయాగములు చేస్తూ పశువధ చేస్తారు కదా! పితృ కార్యాలలో, దైవ కార్యాలలో మాంసాహారాన్ని ఉంచి మిగిలిన దానిని భుజించడం ధర్మమని ఋషి
వాక్కులు చెప్పుట లేదా? రైతులు నాగలితో దున్నుతున్నప్పుడు ఎన్నో జీవులు నశిస్తాయి
కనుక అది హింస కాదా? మానవులు నడిచేటప్పుడు కాళ్ళ కింద పడి అనేక జీవులు నశించడం
హింస కాదా? నీరు భూమి ఆకాశం జీవులతో నిండి ఉన్నది. మనిషి చేసే ప్రతి
కర్మలో హింస అనివార్యం. ముని వృత్తిని స్వీకరించి అరణ్యాలలో జీవిస్తున్న మునులు
తాము అహింసను ఆచరిస్తున్నామని భ్రమ పడుతుంటారు. వారు భుజించే ఆకులూ, పండ్లూ, కందమూలాలలో కూడా జీవం ఉంది కదా? కనుక ఈ లోకంలో హింస చేయని వాడు లేడు. కనుక తెలిసీ జీవులను హింసించక పోవడమే
అహింస. ధర్మం పలు విధాలు దాని సూక్ష్మం గ్రహించడం కష్టం. కనుక వేదవిహతమైనదీ, పెద్దలు చెప్పినదీ, మునులు ఆచరించేదీ గమనించి ధర్మ నిర్ణయం చేయడం ఉత్తమం.
నిజానికి అది ఆ
యుగాధర్మము. కలియుగములో
అగ్నిహోత్రం గవాలంబం సన్యాసం పల పైతృకం |
దేవేరాచ్చ
సుతొత్పత్తిః కలౌ పంచ వివర్జయేత్ ||
అగ్నిహోత్రము
గోమాంసభక్షణ నిషిద్ధములని శాస్త్ర వచనము. ఇది ఈ యుగ ధర్మము. ఏయుగములో నయినా
ధర్మమునకు గ్లాని జరుగ కూడదు.
కాబట్టి వ్యాసాది మహా పురుషులు చెప్పిన సూక్తులు అమలులో ఉంచుట మన కర్తవ్యము. మహాపురుషుల మార్గము ఎప్పటికీ ధర్మమార్గము. దానిని అనుసరించవలెను కానీ అత్తెసరు తెలివితేటలతో శాస్త్రములను దూషించరాదు. అప్పుడే సనాతన ధర్మము సత్యదీధితితో ప్రకాశించగలదు. కృషి, దీక్ష, పట్టుదలలే మానవ ప్రగతికి మార్గదర్శకములు. మానవునికి సంతోషకర జీవనానికి సనాతన దర్మము ఉత్తమము.
స్వస్తి.