Saturday, 23 November 2019

సీతామాత - అశోక వృక్షము


సీతామాత - అశోక వృక్షము

పూర్వము అంటే నావయసు అంతకన్నా ఎక్కువ ఉన్నవారి బాల్యములో, అంటే 
5 సంవత్సరాల లోపు ఉన్న వారి  పెద్దలు అంటే తల్లి కావచ్చు, అవ్వ తాతలు కావచ్చు, వీలున్నపుడు తండ్రికూడా కావచ్చు రామాయణ భారత భాగవత కథలు చెప్పేవారు.6 సంవత్సరాల వయసులో వీధి బడిలో చేరితే అక్కడ కూడా సులభాగ్రాహ్యమస్నా కథలు చెప్పేవారు. ఉన్నత పాఠశాలలో చేరిన తరువాత మాకు తెలిసిన కథలు తమ విశ్లేషణను జోడించి చెప్పేవారు. అవికాక కొత్త కొత్త కథలెన్నో చెప్పేవారు. పాఠ్య పుస్తకాలలో నీతిచంద్రిక తప్పనిసరిగా వుండేది.భారత భాగవత రామాయణ పద్య పాఠములు తప్పనిసరి. వారెంత చెప్పినా కొన్నిసందేహాలు స్థిరముగా గుండెలలో గూడు కట్టుకొని ఉండిపొయినాయి. వయసు పెరిగే కొద్దీ ఈ చిక్కుముళ్ళు ఒక్కటొక్కటే విప్పుకొంటూ వస్తూవున్నాము. అన్ని సందేహాలూ తీరటానికి ఈ మిగిలిన వయసు చాలదు. అయినా తెలుసుకోవలెనన్న తపన. అట్టి తపన ఒక చిక్కు ముడిని విప్పింది. ఆ చిక్కుముడి ఏమిటంటే అసలు రావణుని  ‘అశోక వనము’ లో సీత ఒక అశోక వృక్షము క్రిందనే ఎందుకు కూర్చున్నది, లేక రావణుడు సీతామాత అక్కడ కూర్చుండుటకు ఎందుకు ఏర్పాటు చేసినాడు. ఈ విషయమును గూర్చి నేను గ్రహించిన మేరకు జ్ఞాపకము వచ్చినంతవరకూ మీ ముందుంచుతాను.
    మేనకా హిమవంతులు ఆలూమగలు. సతి గా దక్షయజ్ఞములో తనువు చాలించిన జగదంబను దేవతలు స్థిరచిత్తులై మదిలో నిలిపి ఆమె తిరిగీ జన్మించి పరమేశ్వరుని అర్ధాంగియై తారకాసుర సంహార దక్షుడగు కుమారుడు వారికి కలగవలెనని కోరుకొంటారు. తల్లి తథాస్తు అంటుంది. మేనక నిరంతర నియమ నిష్టా గరిష్టయై భగవతిని భక్తి పారవశ్యత సంతరించుకొని నిర్విఘ్నముగా పూజ చేస్తుంది. జగదంబ ప్రసన్నురాలై ప్రత్యక్షమైతే ఆమెనే తన దుహితగా జన్మించవలెనని కోరుకొంటుంది. తల్లి తథాస్తు అంటుంది. అన్న విధముగానే పర్వత రాజాధిరాజునకు  పుత్రికయై పార్వతీదేవి యన్న పేరున ప్రకాశించుతుంది. తన యింట శివ పారమ్యతను తిలకించి తిలకించి తానూ కూడా అతి చిన్నవయసులోనే తనకు శంకరుడే భర్త కావాలని మహాఘోరమైన నియమనిబంధనలతో తపస్సు చేయదోదగింది. ఆమె కనీసం ఆకులు కూడా తినకుండా ఉపవాసం చేయబట్టే ఆమె అపర్ణ అయింది. భోగ వస్తువులు వదలి దుకూలములు ధరించి నిద్రా ఆహారాలు వదిలి తపస్సు చేస్తూ ఉన్న చిన్నారిని చూసి తల్లి మేనకాదేవి ఆమెను లాలించి బుజ్జగించి తపస్సు మాన్పించింది. ఆ సందర్భమున తన కుమార్తె తో ఉమ’ అన్నది. అంటే “తపస్సు వద్దు” అని అర్త్జము. అందుచే ఆమె ఉమాదేవి అయింది.

పట్టు వీడని పార్వతీదేవి స్థిర చిత్తముతో తపస్సు చేస్తుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆమెకు పరమేశ్వరుడే భర్త అవుతాడని వరం ఇవ్వటం జరిగింది. సంతోషించిన ఆమె చిత్రకూట పర్వతంపై అశోకవృక్షం క్రింద కూర్చుని ఉంది.
బ్రహ్మ ఇచ్చిన వరాన్ని నిజం చేయాలి కనుక శంకరుడు ఆమెను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు.
వికృతరూపంతో, పొట్టి చేతులతో, చట్టి ముక్కుతో, రాగిజడలతో, భయంకర ముఖంతో మురగుజ్జు రూపంతో ఆమె వద్దకు వెళ్ళినాడు. జన్మ జన్మలుగా అర్ధాంగియై దనరారు అపర్ణ ఆయనను మదిలోనే గుర్తించి అర్ఘ్యపాద్యాలనిచ్చి పూజించింది. పార్వతి సపర్యలకు సంతసించక, మురగుజ్జు రూపముననున్న శంకరుడు ఆమెను పెళ్ళి చేసుకోవమని కోరీనాడు.
ఆమె నవ్వుతూ ఈ విధంగా జవాబిచ్చింది.
భగవన్న స్వతంత్రాహం పితామే త్వగ్రణీర్గృహే|
ప్రభుర్మమ దానే వై కన్యాహం ద్విజపుంగవ||
గత్వా యాచస్వ పితరం మమ శైలేంద్ర మవ్యయమ్|
స చేద్దదాతి మాం విప్ర తుభ్యం తదుచితం మమ||
‘‘దేవా! నేను అస్వతంత్రురాలను. మా తండ్రి హిమశైలాధిపతి. వారు ఇంటిలోనే ఉన్నారు. ఆయన కన్యాదానం చేయడానికి సమర్థుడు. మీరు వెళ్ళి ఆయన్ను అడగండి. ఆయన మీకు ఇస్తే అదే నాకు సమ్మతం‘‘ అని అమ్మవారు జవాబుచెప్పింది.
పుట్టిన నాటి నుండీ శంకరుని భర్తగా పొందడానికి తపస్సు చేయడమే కాదు, అసలు పుట్టిందే అందుకోసం. అయినా ఆమె శంకరుడు సాక్షాత్కరించి వచ్చినా ఆమె ధర్మమును వీడలేదు. తండ్రియే కన్యాదాత అన్న సాంప్రదాయానికి కట్టుబడి ప్రవర్తించినది.
సాక్షాత్తూ పరమేశ్వరుడే వచ్చినా తండ్రి అంగీకారం ముఖ్యం అనే నిబంధన ఆమె అతిక్రమించలేదు. ప్రతి తండ్రీ తన కుమార్తెను యోగ్యుడైన వరునికి దానం చేసి తన పితరులకు శాశ్వత పుణ్యలోకాలు కల్పించాలని కోరుకుంటాడు. యోగ్యుడైన వాడిని తేలేకపోతే ఆ తండ్రికి నరకప్రాప్తి తప్పదు. అంతేకాక, మెట్టినింటికి వెళ్ళిన వధువులు కాపురాలు కచికలు చేసుకుంటే అది వాళ్ళ పుట్టింటిని అవమానాలపాలు జేస్తుంది. నేడు ముదిరిన మనుషులకు ముదిరిన మనసులతో పెళ్ళిళ్ళు జరిగి, ‘మొగిలి చెందుతో తానట్లంటే మోద్దుపొరకతో నేనిట్లంటి’ అన్న చందాన వైవాహిక జీవితమును  నరకానికి నకళ్ళుగా తయారు చేసుకుని పెళ్ళిళ్ళు పెటాకులై, కుటుంబాలు, న్యాయస్థానాల్లో విడాకుల కోసం, భరణాల కోసం, గబ్బిళాల్లా వేళ్ళాడుతున్నాయి. ఇది మనము సాధించిన ప్రగతి అనిపించుకొంటుందా! లేక దుర్గతియా అన్నది పాఠకుల విచక్షణకు వదిలి విషయానికి వస్తాను.
కనుకనే అమ్మవారు శంకరులే సాక్షాత్కరించినా తండ్రిని అడగమని సూచించింది. ఇందులో గమనించవలసినది ఏమిటంటే ఆయన కపట రూపంలో వచ్చుటచే ఆమె కూడా అదే విధానమును అనునయిచింది.
శంకరుడు అదే మురగుజ్జు రూపంలో హిమవంతుని వద్దకు వెడలినాడు. పరమ శివభక్తుడగు  హిమవంతుడు కూడా వచ్చిన వాడు శంకరుడే అని కనిపెట్టినాడు. ఆయన బయటపడకుండా కనుక ‘మా అమ్మాయికి స్వయంవరం పెడతాను. ఎవరిని ఇష్టపడితే వారిని పెళ్ళి చేసుకుంటుంది’ అన్నాడు.
శివుడు వెంటనే మళ్ళీ పార్వతి దగ్గరికి వెళ్ళి
దేవి పిత్రా త్వనుజ్ఞాతః స్వయంవర ఇతి శ్రుతిః|
తత్ర త్వం వరయిత్రీ యం స తే భర్తా భవేదితి||
త దాపృచ్ఛ్య గమిష్యామి దుర్లభాం త్వాం వరాననే
రూపవంతం సముత్సృజ్య వృణోష్య సదృశం కథమ్‘‘ అని వెళ్ళిపోబోయాడు.
 ‘‘మీ నాన్న స్వయంవరం ఏర్పాటు చేసి, నీకు ఇష్టమగు వ్యక్తిని వరించే అవకాశము అధికారము ఇచ్చినారు” అని అంటూ “స్వయంవరానికి మహాసౌందర్యవంతులైన పురుషులు వస్తారు. నీ అందానికి తగిన వాడిని నీవు ఎన్నుకొంటావుగానీ ఈ అనాకారిని ఎందుకు పెళ్ళాడతావు? నీ అందానికి తగిన వాడిని పెళ్ళాడి సుఖించు. నేను వెళ్ళి వస్తాను.అని చెప్పి బయలుదేరబోగా అమ్మవారు విషయ తీవ్రతను అర్థము చేసుకొన్నదై
‘‘దేవదేవేశ! సందేహం వద్దు. రేపు స్వయంవరం జరిగినా నేను మిమ్ములనే వరిస్తాను. ఇందులో సందేహము అణుమాత్రము కూడా ఉంచుకోననవసరము లేదు. అందుకు సాక్ష్యంగా నేను తక్షణమే సర్వేశ్వరుడవైన మిమ్ము భర్తగా వరిస్తూ ఈ  అశోకపుష్పములతో పూజిస్తున్నాను‘‘ అని అందుబాటులోనున్నఅశోకవృక్ష కుసుమములను ఆయన పై ఉంచింది.
శంకరుడు మహానందభరితుడై తమ పరిణయానికి సాక్షిగా నిలిచిన అశోకమునకు వరాలిచ్చాడు.
‘‘ అశోకవృక్ష పూగుచ్ఛ ముతో నన్ను వరించినావు గనుక ఈ అశోకవృక్షములకు వృద్ధాప్యం రాదు. వీనికి మృత్యుభయము లేదు. ఈ చెట్టు ఛాయ మంగళప్రదము. ఈ వృక్షము దేవతలకు కూడా ప్రీతికరమవుతుంది.”  అంటూ వరాల గురిపించినాడు.
లోకకల్యాణి యగు గిరిజా దేవి ఆశ్రయించిన వృక్షం కనుక అప్పటి నుండీ అశోకవృక్షము స్త్రీలకు అతిముఖ్యమైన ఆశ్రయమయ్యింది. ఆయుర్వేదపరంగా స్త్రీలకు వచ్చే అనేక జబ్బులకు అశోకం నుండి సేకరించిన ఆకులు, కొమ్మలు, బెరళ్ళు, వేళ్ళు ఔషధములుగా ఉపయోగపడుతూ ఉన్నాయి.
ఉమామహేశులకు ప్రీతికరమగు వృక్షమగుటచే  పరమ శివభక్తుడగు రావణుడు ఏకంగా అశోకవనమే  తన అంతఃపుర సీమలో ఏర్పాటుగావించినాడు. అంతేకాక తాను చెరపట్టి తెచ్చిన సీతా సాధ్విని, తన పూర్వజన్మ యజమానిగా గుర్తించి ఆమెకు మంగళకరమగు రీతిగానూ, తన శాపవిమోచనమగు విధముగానూ, అశోక వృక్షము క్రింద వుండు వసతిని ఏర్పాటుచేసినాడు. ముఖ్యంగా స్త్రీలకు మంగళ గౌరీమాత ఆరాధ్య దేవత కావున సీతాదేవి కూడా, గౌరీదేవికి ప్రియమైన ఈ వృక్షమును ఆశ్రయించింది.
అయితే నేడు అశోకవృక్షాలుగా చెలామణి అవుతున్న గడకర్రల చెట్లు అసలు అశోక వృక్షాలు కావు. దిగువ ఛాయా చిత్రమునందు చూపించినదే నిజమైన అశోకము. శోకమును ఎదబాగాజేసేది అశోకము. దీన్ని ఆంగ్లంలో అశోకా సరకా అంటారు. దీన్నే సరకా ఇండికా అని కూడా అంటారు.
అశోకవృక్షము ( పాశ్చాత్య భాషలాలో asoca Wilde, or Saraca indica అన్న పేర్లు కలవు). బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్ప వృక్షము. ఇది భారతదేశం మరియు శ్రీలంక దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది. 'అశోకము' అంటేనే శోక రాహిత్యమును కలిగించేది అని అర్థము. అసలు ఈ చెట్టును చూస్తూ వుంటేనే ఇంకా ఇంకా చూడవలెనని అనిపిస్తూ వుంటుంది. ఇది ఎల్లప్పుడు ముదురు పచ్చని ఆకులతో నిండివుందుటయేగాక, వీని శాఖలు సుగంధ సుమభరితములు. ఇవి కాషాయము నుండి ఎరుపు రంగులలో పూలను గుత్తులు గుత్తులుగా కలిగియుంటాయి. ఇవి ఎక్కువగా తూర్పు మరియు మధ్య హిమాలయా పర్వతాలు, దక్షిణ భారతదేశ మైదానాలలోను, పడమర తీరం వెంట అధికంగా కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పుష్పిస్తాయి. మన్మధుని పంచాబాణాలలో అశోకమొకటి. 'అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలము' అన్నవి కాముని పంచ శరములు. అన్నీ వసంతములో పుష్పించేవే!
గౌతమ బుద్ధుడు లుంబినీ వనములో అశోకవృక్షము క్రిందనే జన్మించినాడు.
మహావీరుడు వైశాలి నగరములో అశోకవృక్షము క్రిందనే సన్యాసాన్ని స్వీకరించినాడు.
ఇంత ప్రాధాన్యత కలిగిన అశోకము అన్య దేశములలో పండదు. అందుకే అశోక అని పలుకలేక పాశ్చాత్యులు  asoca చేసుకొన్నారు.
ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ గౌరీ దేవి ఉంటుంది. శంకరునికి అత్యంత ఇష్టమైనది. వారి ప్రేమకు ప్రతినిధి. అనేక స్త్రీ వ్యాధులకు అమృత తుల్యమౌ ఔషధములనందిస్తుంది.
ఇదీ అశోక వనమునకు సీతామాతకు గల సంబంధము.
స్వస్తి.

No comments:

Post a Comment