Friday, 13 September 2019

రామాయణ ముఖ ద్వారము


రామాయణ ముఖ ద్వారము
First Time Published On 7th April 2014 now revised


యావత్ స్థాంస్యతి గిరియః సరితశ్చ మహీతలే l
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతిll
రామాయణ మహా కావ్యం శతకోటి ప్రవిస్తరంl
ఏకైకమక్షరం ప్రోక్తం పుంసాం పాతక నాశనంll
గిరులు తరులు ఝరులు ధరలో వరలినంత కాలం రామాయణ కథ ఈ లోకంలో ప్రచలితమై వుంటుంది.  శతకోటి ప్రవిస్తరమైన  ఈ మహాకవ్యములోని ఒక అక్షరం వల్లించినా జనుల పాతకములు పటాపంచలౌతాయి. రామస్య అయనమ్ రామాయణమ్. రమాయాః అయనమ్ రామాయణమ్. అయనమ్ నామ ఆధారమ్.
అయనము లేక ఆయనము అంటే ప్రయాణము.  అది రాముని యొక్క ప్రయాణమా   రాముని కొరకు ప్రయాణమా రాముని యొక్క ప్రయాణమైతే పరుడైన పరమాత్మ నరుడై ధర్మపరుడై పిత్రువాక్య తత్పరుడై అసురోత్పల (ఉత్పల=కలువలు) దివాకరుడై, వనచరుడై వనచరసహితుడై, జనహితుడై, జగన్మహితుడై మానవాళికి ఆదర్శప్రాయుడై నిలచిన నరుడు.
రాముని కొరకు ప్రయాణమైతే విష్ణుడై ప్రియహృచ్చరిష్ణుడై, సంపద్వరిష్ణుడై, వసుదైక జిష్ణుడై, యశోరోచిష్ణుడై, భక్తహర్షణుడై, వైరిధర్షణుడై, కృపావర్షణుడై, పరుడై, విశ్వంభరుడై, నిలచిన యా హరిని చేరుట.
అంటే రామాయణమన్న కత్తికి రెండువైపులా పదునే.  పరుడు నరుడై అవతరించి అవనికి ఆదర్శమై నిలచినాడు. తన విభూతులను అవతారసమాప్తివరకు ఎక్కడ చాటుకోడు.
ఆదికావ్యమై, అజరామరమై, ఆదర్శవంతమై, అత్యంత సునిశిత ధర్మ సంపన్నమై అనంత మానవాళి ఆర్తిని తీర్చి అచ్యుతుని పాదసన్నిధికి చేర్చే అద్భుత సాధనముగా రామాయణమును వాల్మీకి మహర్షి మలచినాడు.
ఎవరు ఈ వాల్మీకి? వాల్మీకి చరిత మనకు ఉత్తర కాండలో వస్తుంది.  స్కాంద పురాణాదులలో కూడా వాల్మీకి చరిత్ర వస్తుంది.  కానీ ఇచట తన కథ తనచే రచింపబడిన రామాయణము నుండే గ్రహిచుట జరిగినది.  వాల్మీకి పేరు రుక్షుడు.  నిజదారసుతోదర పోషణార్ధం వ్యాధుడై, మమకార వికారగ్రస్తుడై, మునుల దయతో భవబంధ పరాజ్ఞ్ముఖుడై  విలోమ “రామ” మంత్ర స్వీకృతుడై అకుంఠిత తపో దీక్షా దక్షుడై, శరీరమును విస్మరించి పరమేశ్వర ధ్యానమునందు మనసును సంధించిన వాడై, తన చుట్టూ వల్మీకము (పుట్ట) పెరిగినా, శరీర ధ్యాసను వదిలి ఆత్మను పరమాత్మకు అనుసంధించిన నాడౌత, ఆయన వాల్మీకి ఐనాడు. వరుణుని ప్రచేతసుడంటారు. ఆ వరుణుని అనుగ్రహముతో కల్గిన వర్షము వల్ల ఆయన ప్రాచేతసుడని కూడా పిలవబడియుండవచ్చును. దీని వాల్ల మనము గ్రహించినది ఏమిటంటే వాల్మీకి మమకారమునకతీతుడై, మనసునందు పరమాత్మ భావన నింపుకొన్న తరువాతనే ఆయన రామాయణ రచనకు యోగ్యుడైనాడు. అంటే రజస్తమోగుణ విముక్తుడై శుద్ధ సాత్వికుడైనాడు.
అటువంటి రామనామ మహిమ మాత్రమే తెలిసిన వాల్మీకిని తగిన వానిగా నెంచుకొని, రామ మహిమ గూర్చి జగతికి తెలియజెప్ప,ప్రేరేపించుటకు వచ్చినాడు నారదుడు.
నారదుడు ఎటువంటి వాడు అంటే
తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరంl
నారదం పరిప్ర ప్రచ్చ నాత్మకర్మునిపుంగవంll
అన్న ఈ శ్లోకం  వల్ల  తెలుసుకొనవచ్చు
నారదుడు బ్రహ్మజ్ఞుడెట్లైనాడు అంటే 'తపసా బ్రహ్మ జిజ్ఞాసస్య' అన్నారు పెద్దలు.  అందువల్ల ఆయనను  “తపస్వి” అని సంబోధించినాడు వాల్మీకి.  ఇక రెండో విశేషణము స్వాధ్యాయ నిరతుడు.  తండ్రియగు బ్రహ్మ నుంచి వేదములను గ్రహించి నిరతము మననము చేయుచునే వుండేవాడు.  వేదనాదము విష్ణువు.  విష్ణువును నిరంతరము జపించుట వల్ల ఆయన స్వాధ్యాయుడైనాడు.  ఇంకొక విశేషణం వాగ్విదాం వరుడు. వాక్కు అనగా త్రికరణ శుద్ధి కలిగిన మాట, 'విద్' అంటే వేదమును ఎరిగినవాడు, అంటే వేదముచే ప్రతిపాదింపబడిన ధర్మమును బ్రహ్మము కూడి భూమి పై నడయాడు నరజన్ముని గూర్చిన ఎరుక కలవాడు “వాగ్విదాంవరుడు”.  అందువల్లనే ఆయన సరియైన శిష్యుని వాల్మీకి రూపంలో ఎంచుకొన్నాడు.  అసలు నారము అంటే జ్ఞానము అంటే దైవజ్ఞత.  ద అంటే ఇచ్చువాడు. నరుడు అన్న పేరు భగవానునికి కుడా కలదని విన్నాను.  నారమే తానై యున్నవాడు నరుడే కదా. అంటే పరుడే కదా. నర శబ్దము మాత్రమె గైకోన్నచో జీవుడని అర్ధము. జీవుడు జ్ఞానియగువరకు అజ్ఞానియేకదా.  అంటే నరునియొక్క అజ్ఞానము నారమే కదా.  కావున నారమును పోద్రోలి నారమును గ్రహించి, నారమునకు ఆదియౌ నరుని యందు ఐక్యము గొనుటయే ఈ రామాయణ రచనా ఉపోద్ఘాతము.
రామాయణ ముఖద్వారము - 2
రామాయణమునకు మూడు పేర్లు గలవు.  1. రామాయణము 2. సీత చరిత్ర  3. పౌలస్య వధ. ఈ మూడు పేర్లు రామాయణమును మూడు ముక్కల్లో చెప్పినట్లు మనకు స్ఫురిస్తాయి.  రామాయణము అంటే దేవుడు, రాముడుగా భూమి పై వెలయుట, సీత చరిత్ర రామునికూడి సీత వనములలో చరించుట, పౌలస్య వధ అంటే రావణ సంహారము.  అంటే ఒక కావ్యానికి అందులోనూ ఆదికావ్యానికి ఇంత  భావస్ఫోరకమైన మూడు పేర్లను వుంచిన ఆ మహర్షిది ఎంతటి ప్రాజ్ఞత, ఎంతటి విజ్ఞత, ఎంతటి ఉపజ్ఞత, ఎంతటి సర్వజ్ఞత.  ఇక్కడ ఇంకొక అంతరార్ధము కలదు.  రాముడు పరమాత్మ, సీత మనసు, రావణుడు ‘వాసనా’ భరితుడు.  ఈ ప్రాపంచిక వాసనలు మనసును వశపరచుకో దలిస్తే మనసు చలించక తనయందు పరమాత్మనే నింపుకొని ఆయననే చేరుట అంతరార్ధము.  ఎందుకు రావణుడు వాసనా భరితుడు అంటే అసలు ‘రవము’ అంటే శబ్దము.  ఈ ప్రపంచం శబ్దమయము. దీనికి తోడు అతడు దశముఖుడు కుడా.'దశవారా విరాట్.'  విరాడన్నం అన్నది వేదం వచనం.  దశ దిశలా వ్యాపించిన ఈ విరాడ్రూపమైన జగత్తే కదా దశ ముఖుడంటే.  అది అసలు విషయం.

ఇక రామాయణ కావ్య రచనా ఉపక్రణమెట్లు జరిగినదో ఒక సారి పరిశీలించెదము.

వాల్మీకి మహర్షి యొకనాడు గౌతమాది శిష్య సమేతుండై సరయూ నదీ తీరంబునకు తన ప్రాతః సంధ్యాది విధులను నిర్వర్తించుకొన బోవు సమయంబున ఒక నిషాదుడు చెట్టు పైగల క్రౌంచ పక్షుల జంటను కొట్టగా మహర్షి శోకముప్పొంగి
  భూమిపై వెలసిన మొదటి శ్లోకమైనది.  ఇక ఆ శ్లోకమును విశ్లేషించి చూద్దాము.  మహనీయుల వాక్కులు ఎప్పుడునూ అప్రతిహతములు. అటువంటి వాక్కులు అనుకోకుండా వెలువడినపుడు వానికి అర్ధమేకాక అర్ధాంతరములు కుడా ఉండునని పండిత వాక్కు.  ఇపుడు ఈ శ్లోకములో గల  1.బాహ్యర్ధ  2.అంతరార్ధ  ౩.గుడార్ధాలను గమనించుదాము.
1.బాహ్యర్ధము:
నిషాద :  ఓరీ కిరాతకుడా త్వం=నీవు; పుతిష్టాం=లోకంలో నివసించడమనేది; శాశ్వతీసమాః = ఎన్నో ఏండ్ల; మాగమః = పొందలేవు; యత్ = ఎందుకంటే; క్రౌంచమిధునాత్ = క్రౌంచ పక్షుల జంట నుండి; ఏకం = ఒకదానిని; కామమోహితం = కామసుఖమనుభవించుచుండగా; అవధీః = వధించితివి.
కామ మొహితమైయున్న ఈ క్రౌంచ మిదునమునకదానిని వధించిన కిరాతకుడా! నీవు ఎక్కువ కాలము భూమిపై నిలువలేవు.
2.అంతరార్ధము:
మానిషాదః = ఓ శ్రీపతీ; త్వం = నీవు; శాశ్వతీసమాః = కలకాలము; ప్రతిష్ఠాం ఆగమ = లోకములో ప్రష్టను పొందితివి; యత్ = ఎందుకంటే; క్రౌంచమిధునాత్ = రాక్షస జంటనుండి; కామమోహితం = పరదారా కాముకుడైన; ఏకం = ఒకడిని; అవధీ = వధించితినవి.
ఓ శ్రీహరీ! రాక్షస జంటనుండి పరదారాకాముడైన యొకనిని వధించి జగతిన శాశ్వతమైన ప్రతిష్టను పొందితివి.
గూడార్దము:
మానిషాద = మాయాశక్తికి అధీనమైన ఓ జీవుడా; త్వం = నీవు; మానిషాద = మాయాజీతుడైనయా పరమాత్మ భావాన్ని; ప్రతిష్ఠాం ఆగమః = పొందగలిగితిని;   యత్ =  ఎందుకంటే; క్రౌంచమిధునాత్ = ‘ద్వాసుపర్నాసయుఔస్సఖాయా’ అంటే పక్షుల జంటను బోలిన జీవాత్మ పరమాత్మలతో; ఏకం కామమోహితం = ప్రాపంచిక సుఖాలపై మనసు  పడిన జీవాత్మయనుదానిని; అవధీ = వధించితివి; (బ్రహ్మ విద్య యను బాణముతో మనో ఏకాగ్రత యను ధనువునకు సంధించి) ఓ మాయ శక్తి కి అధీనమైన జీవుడా! ప్రాపంచిక  సుఖాలపై మోజు పడిన; జీవాత్మ  పరమాత్మయను పక్షుల జంటలోని యొక దానిని వధించి మాయాతీతుడైనయా పరమాత్మ భావాన్ని పొందగాల్గితిని.
చూచితిరికదా! ఎంతటి భావము, ఎంతటి భాష, మాటలో ఎంతటి  సంస్కారము.  తత్వమరసిన  ఆది కవి వాల్మీకి మహర్షికే ఇది సాధ్యము. అందుకే కాళిదాసు తన రఘువంశములో వాల్మీకి తో తనని పోల్చుకొంటాడు. 'ప్రాంశులభ్యే ఫలేలోభా   దుద్బాహురివవామనః' ఎత్తైన వ్యక్తికి చేతికందే ఫలాన్ని, పొట్టివాడు అందుకొన సాధ్యమా! అని అన్న కాళీదాసునిది ఎంత వినయము, ఎంత విధేయత, వాల్మీకి కవిపై ఎంత గౌరవమో చుడండి.  వాల్మీకి రామాయణముండగా  మళ్ళీ నీచంపూ రామయణమెందుకయ్యా?  అని భోజరాజును ప్రశ్నిస్తే ఆయన ఈ విధముగా సమాధానమిస్తాడు.  'గంగాజలైః భువి భగీరథ యత్న లబ్ధైః కింతర్పణం నవిదధాతి జనః పితౄణాం.'

అంటే గంగా జలాన్ని భగీరధుడే తెచ్చినా పుణ్య కార్యములకు ఆ నీటిని అందరు వాడుటలేదా అని తిరిగి ప్రశ్నించినాడు.  కానీ వాల్మీకిని భగీరధుడు  అన్నాడు భవభూతియైతే వాల్మీకిని బహువచనముతోనే సంబోధించి గౌరవించుటయే కాక ఆయనయొక్క అమృతమయమైన వాక్కునకు కూడా నమస్కరిస్తాడు.  ఇంతా జేసి అయన ‘కవి’ మాత్రమే.  కానీ నేడో ‘భావకవి’ ‘మధురకవి’ ‘విప్లవకవి’ ‘దిగంబరకవి’ ‘యుగకవి’ ‘వచనకవి’ 'తుత్తికవి' 'సుత్తికవి' యని తప్పించి నిర్విశేషణముగా ఉత్తి ‘కవి’ అనిపించుకొనేవారు  బహు అరుదు. అంటే ఆవిధంగా కూడా కవి యన్న పేరు గల్గిన వాల్మీకి కి మేము బహుదూరము అని నిరూపించుకొన్నారేమో.
మిగిలినది రేపు........
రామాయణ ముఖ ద్వారము- 3
అసలు రామాయణ ముఖద్వారము వద్దకు ఎందుకు పోవుచున్నాము రాముని తలచుటకు అంటే రాముని కోలుచుటకేకదా! మరి ఇపుడు రాముని గూర్చి పెద్దలచే విన్నంత కన్నంత, తెలియవచ్చినంత లోని తేటను మాత్రమే గ్రహించిన నేను నా శక్తి కి వంచన చేయకుండా తెలిపే ప్రయత్నము  చేస్తాను.

రామాయణ ప్రబోధమొక్కటే! పరుడే నరుడు నరుడే పరుడు.
 ఈ భూమిపైకి మహా విష్ణువు  రావణుని మానవ రూపములోనే వచ్చి వధించ వలయునని మునులు తెల్పగా తధాస్తు అంటూ ఆయనే “దశవర్శసహస్రాణి దశవర్ష శతానిచ వత్స్యామి మానుషే లోకే  పాలయన్  పృథివీమిమాం” అని పదకొండు వేల సంవత్సరములు భూమిపై మానవునిగ  నిలిచి పాలించెదనని హామీ ఇస్తాడు.  ఇక పుట్టినది మొదలు సరయూ నదిలో ఆత్మ త్యాగము చేసుకొను వరకు దేవునిగా తన విభూతులను ఎక్కడ ఏ పరిస్థితి లోను ప్రదర్శించడు.

రామాయణం ,తపస్వాధ్యాయనిరతం... 'తో మొదలౌతుంది.
 మహత్తరమైన ఈ ఇతిహాసాన్ని  ‘త’ తో మొదలుపెట్టుటయే  శుభ సూచకము.  'త కారో విఘ్న నాశాయ త కారో సౌఖ్యదాయకం' అన్నది ఆర్య వాక్కు.  పై శ్లోకమును గూర్చి ముందే  ముచ్చటించు కొన్నాము కావున పై శ్లోకములోని విశేషణములు కల్గిన నారదుడు వాల్మీకి యడిగిన ప్రశ్నలకు  బదులుగా చెబుతాడు.  వాల్మీకి ప్రశ్న ఏమంటే పురుషులలో ఉత్తముడై ఈ క్రింది పదునారు గుణములు కల్గిన వ్యక్తిని గూర్చి?  అసలు   పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడే  కదా!  అంటే ఇంకో విధముగా పురుషోత్తముని లక్షణములు గల పురుషుని గూర్చియడుగుచున్నాడు.  ఆ లక్షణములేవియన
1.గుణవంతుడు, 2.వీర్యవంతుడు, ౩.ధర్మజ్ఞుడు, 4.కృతజ్ఞడు, 5.సత్యవాక్యుడు, 6.ధృడవ్రతుడు, 7. సుచరితుడు, 8.సర్వ భూత హితుడు, 9.విద్వాంసుడు, 10.సమర్ధుడు, 11.ఏక ప్రియ దర్శనుడు, 12.ఆత్మవంతుడు, 13.జితక్రోధుడు, 14.ద్యుతిమంతుడు, 15.అనసూయుడు,  16.సుదీరుడు.
అనగా యుద్ధమున కోపమే కల్గిన దేవతలనే భయపెట్టు వాడు.  ఈ పదునారు లక్షణములు గలవాడు శ్రీరాముడేయని  నారదుడు వాల్మీకితో అంటాడు.  ఈ పదునారు లక్షణములతో పదునారు కళలు గల చంద్రుని బోలి రామచంద్రుడైనాడు.  అని మనమనుకోవచ్చునేమో.
బ్రహ్మమొక్కటే... యన్న అన్నమయ్య మాటను మనము తీసుకొంటే బ్రహ్మ అను పదములో ‘ర’ ‘మ’ అను రెండక్షరాలను మనము అంతర్లీనముగా చూడవచ్చును.  ‘ర’ అంటే దావానలమై దహించేది.  అనగా మనలోని దుష్ట, దురహంకార, దురశాపూరిత సకల కామాళిని దహించి వేసి  ‘మ’ అనగా మనసును మహదానంద తుందిలితమై యోప్పారునట్లు చేయునది. అందుకే పరమ శివుడు ‘రామ’ తారక మంత్ర పరవశుడు.  రామ మంత్రము రామజననాత్పూర్వమే రాజిల్లు చుండినది.  రమింప జేసే తత్వము కలుగుట  వలననే రామాయణ నాయకుడు రాముడై, జగద్భిరాముడైనాడు. రామ శబ్ధములో ఇంకొక ప్రత్యేకత వుంది.  అక్షరమాలలో య ర ల వ లో  ‘ర’ రెండవ అక్షరము.  అదేవిధంగా ప ఫ బ భ మా  లో ‘మ’ ఐదవ అక్షరము 2 x 5 = 10.  కేనోపాయేనలఘునా’ అని పార్వతీ దేవి విష్ణు సహస్ర నామ ఉత్తర పీఠికలో అడిగితే ఈశ్వరుడు శ్రీ రామ రామ రామేతి... అని రామ రామ రామ మూడు సార్లంటాడు.అంటే   10x10x10=1000.  అందువల్లనే అదే శ్లోకములో... సహస్ర నామ తత్తుల్యం అన్నాడేమో!

రాముని దశావతారాలలో ఒక అవతారముగానే పరిగణింప బడినది.  ‘పరిత్రాణాయ... అని భగవద్గీతలో అన్నట్లు రామునిగా కూడా పదకొండు వేల సంవత్సరములు మానవుని వలె మాత్రమే జీవించి మానవులకు ఆదర్శ ప్రాయుడైన మానవుడు ఏ రీతిగా వుండవలె ననేది నిరూపించినాడు.  ఇక దీనికి వత్తాసు జయ విజయుల కథ. ఇది అందరికి తెలిసిందే.
మిగిలినది మళ్ళీ.............
రామాయణ ముఖ ద్వారము- 4
కానీ రాముడు కృష్ణుని లాగ  ఎటువంటి లీలలను చూపడు.  ఆయన మానవుని గానే వుంటానన్నాడు కాబట్టి ఆయన పదునారు లక్షణములతో సత్యవాక్పరిపాలన కూడా కలదు గదా.  ఆయన జితక్రోధుడు.  కోపము కావలిసినపుడు తెచ్చుకొంటాడు.  సముద్రుని విషయంలో అదే కదా చేస్తాడు.  సముద్రుని సేతుబంధనకు వసతి కల్పించమంటే మౌనము వహిస్తాడు సముద్రుడు. అది కూడా మూడురాత్రులు. తన కార్యము ఆలస్యమగుచున్నందువల్ల రాముడు కోపమును, సముద్రునిపై తెచ్చుకుంటాడు. అప్పుడు ఆయన లక్ష్మణుని తో ఈ విధముగా అంటాడు :
ప్రశమశ్చక్షమా చైవ  ఆర్జవం ప్రియవాదితా
అసామర్థ్యంఫలన్త్వేతే నిర్గుణేషు సతాం గుణాః
సత్పురుషులు మంచిగుణములు కలిగియుందురు. ఓరిమి,ఇంద్రియ నిగ్రహము,మనోవాక్కాయ కర్మలలో ఋజుత్వము,ప్రియ భాషనమును కలిగి యుందురు.అది వారి సహజ గుణము. కానీ గుణహీనులు వారి మంచితనమును చేతగానితనముగా భావిస్తారు. చూసినావా ఈ సముద్రుని గర్వము
ఆత్మా ప్రశంసినం దుష్టం ధృష్టం విపరిధావకం
సర్వత్రో త్సృశత దండం చలోక స్సత్కురుతే నరం
న సామ్నాశక్యతే కీర్తి రణ సామ్నాశక్యతే యశః
ప్రాప్తుం లక్ష్మణ లోకే స్మిన్జయోవా రణ మూర్ధని
క్రోధము లేకుండా ఎదుటివారి తప్పులను ఓర్చుకొనుచూ వారి మనసును అనుసరించి కపటము లేక ప్రియముగా మాట్లాడువానిని నీచులు అసమర్థుడని భావింతురు.ఎవడు తనను తానూ పోగాడుకోనుచూ , పరుల నిందించుచూ,
ఆవిధముగా వారిని తన కపటము మరియు వంచనకు గురిచేయుచూ నుండునో వానిని లోకము గౌరవిన్చును. గొర్రె నమ్మేది గోసాయిని కాదు కసాయినే కదా  ! సముద్రమును ఇంకింపజేసి దాటి ఈ సముద్రుని పోగరణచెదను . ఈ నీచునివడ్డ ఓరిమి చూపుత అవివేకమంటాడు శ్రీ రామ చంద్రుడు.
అప్పటికీ వారధి కట్టుకొని పొమ్మంటాడేకాని, బాలకృష్ణుని బుట్టలో మోసుకొని పోవునపుడు దారి వదిలిన యమునలాగా దారినివ్వడు సముద్రుడు.  ఇదంతా మానవుడు అనుకొంటే సాధించ లేనిది లేదు అని నిరూపించేటందుకే ఆ నరునికి తోడు దేవ ముని తాపసులను  తన వక్త్రము (నోరు) నుండి బయల్వెడలిన జాంబవంతుడు తోడు రాగా వీరంతా వాలి సుగ్రీవ హనుమన్నల నీల కుముద పనస గజగవయ గంధమాదనాదులుగ జన్మించి తమ తమ వర్గములతో  వానరులై భూమి నిండిపోయినారట. అంటే పరుడు నరుడైతే  పరివారము  వానరులైనారు.
విశ్వామిత్రుని అనుసరించే ఘట్టములో కుడా ఆ బ్రహ్మర్షి నుండి ఎన్నో విద్యలు  నేర్చుకొంటాడు.  తాను పరమాత్మయన్న స్పృహను దరిచేరనీయాడు. విశ్వామిత్రుడు “నృశంస మన్న శం సం వా  ప్రజారక్షణకారణాత్ పాతకంవాసీంరోషంవా కర్తవ్యం రక్షతా  సతా  రాజ్య భార నియుక్తానాం ఏష ధర్మస్సనాతనః”  యాగ రక్షణకు  నియమించబడిన  రాకుమారులు పాలిత రక్షణకు కౄరమేయైననూ, నిందింప దగినదైనను, పాపమేయైనను వెనుకాడక అట్టి కర్మలు చేసి తీరవలెనని  ‘తాటక సంహారమప్పుడు  తెల్పగా  రాముడు  ఆయనకు ఈ విధముగా  బదులిస్తాడు.
 పితుర్వచన నిద్దేశాత్
పితుర్వచన గౌరవాత్
వచనం కౌశికసస్యేతి
కర్తవ్యమనిశంకయా
గురువర్యా! మా తండ్రి గారైన దశరథుని ఆజ్ఞ వలన ఆయనపై గౌరవము వలన మీరు నిర్దేశించిన ఎడల స్త్రీ వధనైనను చేయగలనని అంటాడు.  ఆ విధంగానే చేస్తాడు.  రాముని ధర్మనిరతికి మెచ్చి తన వద్ద కలిగిన సకల శస్రాస్త్ర విద్యలన్నీ సమంత్రకముగా ఉపదేశించెను.  మానవునిగా గుర్వనుగ్రహమునకు పాత్రుడగుట తప్పించి పరాత్పరుడనైన  నాకే నేర్పించుచున్నాడే యనుకోలేదు.  యాగ సంరక్షణ సమయమున కూడా ఇంకా ఆ రాక్షసులు రాలేదే యని అడుగుతాడు.  ఇది చివరి రోజైన ఆరవ రోజు ఈ రాత్రికి వారు విజృంబింతురని తెల్పుటయూ, అటులనే వారు  విజృంబించుటయు రాముడు ఆగ్నేయాస్త్రమున సుబాహుని కుల్చుటయు, మానవాస్త్రమున శతయోజన దూరము గల్గిన సముద్రములోనికి మారీచుని విసరుటయు చేస్తాడు శ్రీరాముడు. తన దైవత్వమునే వుపయోగించియుంటే ఇంత రామాయణమవసరమేలేదు.  దేవతలే దిగివచ్చి నీవు సాక్షాత్తు నారాయణుడవంటే ఆయన ‘అత్మానంమానుషంమన్యే.'  అని తనను మానవునిగానే తెలియజేస్తాడు.

కైకేయి చేసిన పనికి ఆగ్రహోదగ్రుడై ఆమెను కొడతానని లక్ష్మణుడంటే నన్నెంతో వాత్సల్యముగా చూచుకొనే తల్లి ఇంత దారుణంగా ప్రవర్తించిందంటే 'యది భావోన దైవోయం' అంతా దైవ ప్రేరణే అంటాడు.  ఆ దైవము తానే మరియు ఆమె తోడ్పాటు లేకుంటే అడవి దారి పట్టేవాడా రావణుని తన కోలతో కొట్టేవాడా!  కృతయుగములో తాను విష్ణువుగా ధనుజుల గెలిచిన ధనుర్బాణాది మహాస్త్రములు అగస్త్యునినుండి పొంది మహర్షికి కృతజ్ఞతలు వ్యక్తము చేసుకొంటాడే తప్పించి నావి నాకే గదా వచ్చినాయన్న అహంకారాన్ని చూపడు.  ఆయన  అగస్త్యుని ఆశ్రమానికి పోయి అతిథి సత్కారములు ముగిసిన పిమ్మట  శరభంగ సుతీక్ష్ణకులను గూర్చి మరీ మరీ అడిగి వారి వద్దకు పోతాడు.  లోనఏమున్నా పైకిమాత్రం అంతా మానవ గుణమే.  అగస్త్యునివద్దకు పోవుటలోని మరొక  అంతరార్ధం చిత్రకూట నివాసం.  అగస్త్యమహర్షి సీతా రామ లక్ష్మణులను పంచవటికీ వెళ్లి అక్కడ వుండమని సలహాయిస్తాడు.  రాక్షస మయమైన ఆ ప్రాంతమున వారిని తుదముట్టించుటతో రావణ సంహారానికి నాంది పలుకవచ్చు.  లోపల ఏమున్నా పైకి మానవుడే. భార్య బంగరు లేడి కావలెనన్నపుడు కూడా అది మాయ అంటూనే తెచ్చియిస్తానంటు యలుదేరుతాడు.  తన ప్రవర్తనతో ఇక్కడకూడా తాను దైవమన్న  అనుమానానికి తావివ్వడు.  
మిగిలినది మరొకసారి.......
రామాయణ ముఖ ద్వారము-5   

ఒక సందర్భములో లక్ష్మణునితో కామతురుడయ్యు తనపై ఆవ్యయమైన అభిమానము కల్గిన తండ్రికి తనను అడవులకు పంపుటకు హేతువై ప్రాణ త్యాగమే చేయవలసి రావడం తన పాపానికి ప్రాయశ్చిత్తమని ఒక సాధారణ మానవుని లాగా మాట్లాడుతాడు. లంక ఎంత గొప్పగా వుంది అని లక్ష్మణుడంటే ఏ దేశము ఎంత గొప్పదైన 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి' అంటాడు.  అందుకే శత్రువైన మారీచుని చేతనే 'రామో విగ్రహవాన్ ధర్మః'అని కొనియాడబడుతాడు.
శరణాగతుడై వచ్చిన విభీషణునికి రక్షణ ఇవ్వవలదని ఒక్క హనుమంతుడు తప్ప అందరూ చెప్పినవారే ! కానీ రాముడు వారందరితో ఇతడు" 'రాఘవం శరణం గతః'శరణ్య శరణం గతః' అనినాడు.నాకు ఇతడు ఇకపై మిత్రుడే, శరణాగతుడు కూడా కాదు." అని నొక్కి వక్కాణించుతాడు. అసలు ఈ మాట చూడండి ఎంత సంస్కారవంతమైనదో!
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే
అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమ
ఒక్కసారి నేనే త్రాతనని నమ్మి, నేను నీవాడను అని శరణు కోరినవాని, సర్వ భూతములనుండి కూడా రక్షణ కల్పించుట నా వ్రతము. మానవ, దేవ, దానవ, పశుపక్ష్యాది సమూహముల నుండి ఎవరైనాసరే ఏవయినా సరే నా అభయమునకు అర్హులు. అసలు ' సకృత్ +ఏవ 'అనడములోనే అసలుమర్మము దాగివుంది.ఒక్కసారి 'రక్షమాం' అని దృఢమైన నమ్మకముతో అంటే చాలుఆయన రక్షకునిగా నిలుస్తాడు. అసలది ఆయన వ్రతము. కానీ మనది 'ఏరు దాటించితే ఎంగన్న' వ్రతము. భక్తీ, యోగము, తపస్సు ఎన్నివున్నా పరమాత్మ పై అచంచల విశ్వాసము అత్యంత ప్రాముఖ్యము. ఈ శ్లోకము సర్వులకూ సర్వదా పఠనీయము. శ్రీ రాముడు ఎంతటి మహానీయుడో చూడండి.పాశ్చాత్య పుస్తకాలలో ఇటువంటి కమనీయ గుణాభిరాముడు భూతద్దము పెట్టి వెదకినా దొరకడు.
 ఇంకొక ముఖ్యమైన విషయం :
ధర్మాత్మా సత్యసంధస్యరామో దాశరధిర్యధిః
పౌరుషేచాప్రతిద్వన్ద్వః శరైనంజహిరావణిం
ఈ మాటలనే మంత్రముగా జేసి రావణ కుమారుడైన ఇంద్రజిత్తు పైకి వదిలి అతనిని  కూల్చినాడు. అసలు ఈ మాటల సారాంశమేమి? అవి మంత్రమని మనమేవిధముగా చెప్పగలము. చంపేది లక్ష్మణుడు చచ్చేది మేఘనాథుడనబడు ఇంద్రజిత్తు. కానీ బాణము పై  ఆవాహన చేసిన మంత్రము రామునికి సంబంధించినది. అది విశేషము. అసలు ఈ విశేషములో గల విశేషము ఎంతో ముఖ్యమైనది ఒకటి ఉంది. ఈ శ్లోకములో మూడు  విశేషణములు రామునికి వాడబడినాయి. 1. ధర్మాత్మ 2. సత్యసంధస్య 3.పౌరుషేచ అప్రతిద్వందః, ఈ మూడిటినీ మన మూడవ కన్నుతో ఒకసారి చూస్తాము.
1. చెట్టు చాటునుండి వాలిని చంపినా వ్యక్తి ధర్మాత్ముడా?
2. తండ్రికి, ప్రజలకు యౌవరాజ పట్టాభిషేకమునకు ఇచ్చగించినట్లు తెలిపి తెల్లవారిన వెంటనే అడవులకు పోవుట సత్యసంధత అనిపించుకొంటుందా?
3. ఖరునితో యుద్ధము చేయునపుడు మూడడుగులు వెనుకకు తగ్గిన రాముడు పౌరుషమందు ఎదురులేనివాడా?

 పై మూడు ప్రశ్నలకు వీలయినంత క్లుప్తముగా వాల్మీకి రామయణము నుండి నేను అర్థము  చేసుకొన్న మేరకు జవాబు చెబుతాను.
ఇంకా ఉన్నది..............
రామాయణ ముఖ ద్వారము-6

1.   పై సందేహమును వాలియే రామునితో వెలిబుచ్చినాడు. దానికి రాముడిచ్చిన జవాబు  ఒక పర్యాయము చూద్దాము. శ్రీరాముడు వాలిని సంబోధించడమే ఆయన యొక్క పరిణతిని తెలుపుతుంది. ఆయన వాలిని వాలీ! నీవు వయసు వచ్చిన బాలుడవు. నేను  కాననలకు బయలుదేరు సమయమున భరతుడు రాజ్యము తనకు వలదని పట్టుబట్టినా, నేను తనకు నచ్చజెప్పి త్వం రాజా భారత భవ స్వయం వారాణాంఅహమపి  రాజరాట్ మృగాణాంll అని తెలిపినాను అందుచేత నేను ఆతని ఆదేశమును పాలించుచూ వన్యమృగ శాసకుడనైనాను. నీవే చెప్పుకొన్నట్లు నీవు మృగానివి, పైగా  రాజువైయుండి బ్రతికియున్న తమ్ముని భార్యను బలవంతముగా అనుభవించుచున్న వానివి. అందుచే దోషివి. అదికాక అగ్నిసాక్షిగా నేను సుగ్రీవ మిత్రుడను. రావణునితో  మైత్రి ఘటించిన నిన్ను నేను మిత్రునిగా చేసుకొని ధర్మమునకు కళంకము  నాపాదించలేను.  సుగ్రీవుడు నిన్ను శరణుకోరినా, రక్షించవలసిన రాజువైయుండి  కూడా  ఆతనిని ఉపేక్షించి వెడలగొట్టితివి. నీవు ఏదిఏమయినా తిర్యగ్జాతికి చెందిన  వాడవే. దూరమున ఉండుటచే నీ దృష్టి నాపై పడలేదుగానీ, నాబాణము నీ గుండెనే చీల్చినది, వీపును కాదు. కావున నాకేదోషము అంటదు అని  శ్రీరాముడు వాలికి తెలియజేసినాడు. అప్పుడు వాలికూడా పురుషోత్తమా నీవు ఏది పలికితివో అది వాస్తవము. నీచేత మరణించుట సంతోషదాయకము అని అసువుల బాసినాడు. ఈ మాత్రము చాలు శ్రీరాముడు వాలి విషయములో ధర్మ పథమును వీడలేదు అనుటకు.

2.    ఇపుడు రాముని సత్య సంధత గురించి పరిశీలిద్దాము. ముందురోజు   పట్టాభిషేకానికి తండ్రివద్ద ప్రజల సమక్షములో కూడా తన సమ్మతిని తెలిపినాడు, కానీ తరువాత రోజు కైకేయి స్వార్థము దశరథుని మేధోదిగ్బంధము చేయుటచే కుమారుని   అడవులకు పంప సమ్మతిస్తాడు. అసలు నాటి ధర్మము ప్రకారము 14 సంవత్సరములు  వనవాసము చేసిన రాకుమారుడు రాజ్యాధిపతియగు అధికారమును కోల్పోతాడు.  అందుకేనా అన్నట్లు కైకేయి 

నవ పంచచ వర్షాణి దండకారణ్యమాశ్రితఃl

చీరాజిన జటాధారి రామో భవతు తాపసఃll (2-11-27)

అని అంటుంది. ఆమె అన్నట్లే దండకారణ్య నివాసము తరువాత సమయము సీతాన్వేషణకే సరిపోతుంది. తండ్రి మొదట చెప్పిన మాట యగు పట్టాభిషేకమునకు రాముడు ఒప్పుకొన్నా కైకేయి మరియు తండ్రి ద్వారా అడవులకు పోవలెనను మాట విన్న తరువాత, ఆ మాటకే కట్టుబడుతూ, ఈ విధంగా అంటాడు.

   ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితంl

   ధర్మ సంశ్రితమే తచ్ఛ పితుర్వచనముత్తమంll

   అంటే ధర్మముతో కూడిన సత్యము అత్యంత ఆచరణయోగ్యము. దశరథుడు రెండవ        పర్యాయము చెప్పిన మాటలో అట్టి ధర్మయుత సత్యము దాగి ఉన్నది కాబట్టి అదే తనకు యోగ్యమని చెబుతాడు. ఇక్కడ ఇంకొక విషయము ఉన్నది. సుమంతుడు రామలక్ష్మణ సీతలను రథమునందు కూర్చుండబెట్టుకొని పోతూవుండగా రథమును ఆపమని దశరథుడు సుమంతుని ఆదేశించుతాడు. రాముడు ఆపవలదని చెబుతూ, తిరిగీ పైన తెలిపిన శ్లోక భావార్తములో రథ చక్రముల సవ్వడి మూలమున వినిపించలేదని చెప్పమంటాడు అట్లు చెప్పకుండియుంటే తన తండ్రి అసలు మాట తప్పినవాదవుతాడు. పైగా తానూ ధర్మమార్గామును వీడి రాజ్యమునకై అర్రులుచాచినట్లవుతుంది. అందుకే రాముడు ధర్మముతో కూడిన సత్యమార్గమును అనుసరించినాడు.

3.  ఇక మూడవ మాట పౌరుషేచ అప్రతిద్వందః. ఖరునితో యుద్ధము చేయునపుడు 3 అడుగులు శ్రీరామచంద్రుడు వెనుకకు తగ్గినాడు అన్న అపవాదు. ఇద్దరు యోధుల నడుమ యుద్ధము జరుగబోవు క్షణమున యోధుడు ప్రత్యాలీఢ పాదమును ముందుంచి బాణము సంధించుటకు వెనకడుగు వేస్తాడు. అంటే ఒకే చోటున ఉన్న రెండు పాదాలలో కుడిపాదముతో వెనుకడుగు వేసి ఆపై ఎడమ పాదమును కుడి పాదము వద్దకు చేర్చి తిరిగీ కుడిపాదమును వెనుకకు వేయుటతో యుద్ధమునకు సన్నద్ధమైనట్లు ప్రస్ఫుటమౌతూవుంది. కావున ఆయన పౌరుషేచ అప్రతిద్వందుడైనాడు కానీ అన్యథా కాదు.

ఇంకొక మాట. పై మూల మంత్రములో శ్రీరామునికి దాశరథిఅన్న శబ్దము ఉపయోగించబడింది. కొందరు వెకిలిగా రాముడు 'పాయస పాత్రుడు' కానీ 'దశరథ జాతుడు' కాదు కదా అని అన్నారు. దశరథుని శక్తి ఆ పాయసములో నిక్షిప్తము చేయబడినదని నా బాల్యమున ధర్మానుసారులైన పండితులు చెప్పగా విన్నాను. ఆ యాగమే పుత్రకామేష్టి. దానిని గూర్చి, సమగ్రముగా జరిపించిన వశిష్ఠ మహర్షికే తెలియగలదు. రామాయణములో విడివిడిగా జరిగిన  ఈ ఉదంతముల నుటంకించిన వారికిఈ శ్లోకమే/మంత్రమే కనువిప్పు .

ఒకసారి పరికించండి. యుద్ధము జరిగేది లక్ష్మణ మేఘనాథుల మధ్యన. లక్ష్మణుడు బాణమును అభిమంత్రించినది రాముని పేరుపై. అప్పటికి ఉన్న యుద్ధ మంత్రములగానీ , లేక తన సుగుణ సంపదను,భాతృభక్తిని, మంత్రముగా చేసిగానీ వాడలేదు. అదిచాలు రాముడెంత గొప్పవాడు అని మనము తెలుసుకోడానికి, కువిమర్శకుల నోరు మూయించడానికి. పై శ్లోకము మంత్రము. కులాతీతమైన మంత్రము. తప్పక కంఠస్థము చేసి అనునిత్యము , ముఖ్యముగా మీ నూతన కార్యారంభములలో విధిగా, పైన చెప్పిన శ్లోకముతోబాటూ

 సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతేl

అభయం సర్వభూతేభ్యో దదామేతద్వ్రతమ్మమll

 అన్న శ్లోకము తో కూడా అనునిత్యము భక్తిశ్రద్ధలతో మననము చేసుకొనేది.

 

    ఈ ఒక్క మంత్రమే అన్నింటికీ జవాబుచెప్పింది. దీనిని మూల మంత్రమంటారు. ఎందువల్లనంటే ఈ మంత్రమునభిమంత్రించి లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై వదలిన వెంటనే శిరస్త్రాణ, కుండలసహితమైన బంగారు కాంతులీను ఇంద్రజిత్తుని తల మొండెము నుండి తొడిమెను విడిచిన పండులా వేరుపడినది. ఈవిధంగా షోడశ గుణాకరుడైన రాముని గూర్చి, ఎంతైనా చెప్పుకొంటూనే పోవచ్చు.  రామాయణములో విడివిడిగా జరిగిన ఈ

ఉదంతముల నుటంకించిన వారికి ఈ శ్లోకమే/మంత్రమే కనువిప్పు .

మిగిలినది మరొకసారి........


రామాయణ ముఖ ద్వారము-7
బాలకాండ నుండి ఉత్తరాకాండ దాకా  మనము గమనించితే శ్రీ రామ చంద్రుడు ఏడు కాండలలోను ఏడు ధర్మాలు పాటించినాడు. బాలకాండలో శిష్య ధర్మం, అయోధ్యకాండలో పుత్ర ధర్మం, అరణ్యకాండలో క్షాత్ర ధర్మం, కిష్కింధకాండలో మిత్రధర్మం, సుందరకాండలో స్వామి ధర్మం, యుద్ధకాండలో వీరధర్మం మరి ఉత్తరకాండలో రాజధర్మం.  అడుగడుగునా అణువణువునా తాను మానవునిగానే నడుచుకొంటూ పదకొండు వేల సంవత్సరాలు ధర్మ ప్రతిష్ఠాతయై, ఆదర్శ మానవుడై, అరివీర భయంకరుడై, ఆశ్రిత రక్షకుడై, జితక్రోధియైన ఆ మహనీయుని ఎంత తలచుకొన్నా తక్కువే.
ఎందరో మహనీయులు రామాయణ గంగా ప్రవాహములో మునకలు వేసినారు.  నాలో వ్రాయవలయునన్న చపలతే కానీ చతురత లేదని తెలుసు.  ఈ గంగలో నేనూ ఒక మునక వేసినానని చెప్పుకొంటాను.
దాసరి తప్పలు దండముతో సరి.
వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే
పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం
తత్సత్
ఈ దిగువ మనః పూర్వకముగా చదివి తమ అభిప్రాయమును తెలియజేసిన పెద్దలకు నమస్కరించుతూ వారి ఆశీర్వాదమును ఈ క్రింద పొందుపరచుచున్నాను.


Ghorakavi Sreenivasa Venkata Subbarao Very good pl continue enlightening people though this is the threshold Narada laid the foundation with his teachings to Valmiki I think so. thank you
Varanasi Gangadhara Rao mee sradha,tapana maboti vandlaku tetatellamu mariyu mee akhuntitha deekshaku na namassulu;mee vopikaku thagina daiva krupa kalagalani sada bhagavanuni pradhhanaga vedukuntanu. nijam cheppalante mee postings chuseka books chadavadam thagginchenu,sir thanks for your dedicated service through facebook.please devise a method to uplift the havenots through this media,if possible,so that you can educate them for their betterment in their social life
తరువాత ఇంకా కొంత ........

రామాయణ ముఖ ద్వారము-8

ఇంత రామాయణము జరిగినది కదా! అసలిది ఎప్పుడు వాల్మీకిచే వ్రాయబడినట్లు?
వాల్మీకి అసలు పేరు రుక్షుడు. ఆటవికునిగా ఉన్న కాలములో నారద మహర్షి ఆయనకు కనువిప్పు కలిగించి విలోమ “రామ” మంత్ర దీక్షనొసగి 'వాల్మీకి మహర్షి’ని చేసినాడు. ఉత్తర రామాయణములో సీత వాల్మీకి ఆశ్రమము చేరుతుంది. ఆమె జనక జాత, అగ్ని పునీత, దివ్య చరిత, శ్రీరామంకిత సకల లోకారాధ్య దేవత సీత గా గుర్తించి ఆమెను తన పుత్రికగా  నెంచి తన ఆశ్రమములో ఉంచుకొంటాడు. ఆమె ఒకానొక రోజు తన భర్త చరిత్ర ఆచంద్ర తారార్కముగా నిలచిపోవునట్లు 'రామాయణమును వ్రాయమని చెబుతుంది. తనకంతటి  సామర్థ్యము కలదా అని తలపోయు సమయమున నారదులవారు వాల్మీకి ముందు నిలిచి, తగిన వాడవు నీవే నని తెలిపి, గురువుగా ఆజ్ఞ నొసగి రామాయణ రచనకు  పురిగొల్పుతాడు. అప్పుడు ఆయన చెప్పిన సంక్షిప్త రామాయనమునే ‘శత శ్లోకి రామాయణ’మని ప్రపంచములో నేటికీ నిలిచిపోయినది. మిగతా విషయములను ముందే  తెలిపినాను.
భవిష్యోత్తర పురాణము లోని  ఉమామహేశ్వర సంవాదములో ఈ శ్లోకాన్ని చూస్తాము.
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం మహా పాతక నాశనం
రాముడు 11,000 వేల సంవత్సరములు పరిపాలించినాడు. మరి వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణము కలిగినది 24,000 వేల శ్లోకములే! పై శ్లోకము ప్రకారము ఆ శ్రీరామచంద్రుని జీవిత కథనము సంపూర్ణముగా వ్రాస్తే నూరుకోట్ల శ్లోకములౌతాయని పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పినట్లు తెలియవస్తూవుంది. అందుకే వాల్మీకి మహర్షి అత్యంత ముఖ్యమైన చారిత్రిక ఘట్టములను మాత్రమె తీసుకొన్నాడని తలువ వచ్చు. అందునా రామ పట్టాభిషేకముతో వాల్మీకి రామాయణము ముగిసినది అన్న ఒక వాదన లోకములో ఉన్నది. అది నిజమయితే మిగిలిన 10,960 సంవత్సరాల చరిత్ర మనకు తెలిసే అవకాశమెట్లు? ఈ ప్రశ్నకు జవాబే వాల్మీకి కాలములోని అనేక మహితాత్ములు తమకు తెలిసిన విషయములను తమ పేరునకు రామాయణము అన్న పదమును జోడించి గ్రంథస్థము చేసినారు. వాల్మీకి తోబాటుగా 108 మంది మహర్షులు రామాయణమును వ్రాసినారని
డా. మల్లంపల్లి మల్లికార్జున రావు గారి పరిశోధన ద్వారా తెలియవస్తూ వుంది. రావణ సంహరణానంతరము రాముడు అయోధ్య చేరి పట్టాభిషిక్తుడగు సమయానికి ఆయన వయసు 40 సంవత్సరములని పండిత పరిశోధకుల ద్వారా తెలియుచున్నది.
ఒక 4, 5, శతాబ్దముల క్రితము వ్రాసిన భాస్కర రామాయణము, రంగనాథ రామాయణము, మొల్ల రామాయణము, తులసీ రామాయణము, కంబరామాయణము మరియు ఇవికాక తాయ్ ల్యాండ్, కంబోడియా మలేషియా  మొదలగు దేశముల రామాయణాలు ఇంకా ఎన్నేన్నో రామాయణాలు ప్రక్కన ఉంచితే, ఒక వాల్మీకి మహర్షి కాలములో వ్రాసిన రామాయణాలే పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి అని మనము పైన చెప్పుకొన్నాము.. అవి అన్నియు గూడా రాములవారిని గూర్చిన చారిత్రిక సత్యాలు తెలిపేవే! ఈ రామాయణముల ఆవిర్భావమునకు ఆ 100 కోట్ల శ్లోకముల రామాయణము ఆధారమేమో! నేడు మనకు అది కనిపించదు. ఈ విషయమై కొంత విశదముగా తెలుసుకొందాము. హనుమంతుడే స్వయముగా వ్రాసిన హనుమద్రామాయణము ఒకటి ఉన్నది. నేడు అందలి పూర్తి పాఠము అలభ్యము. 2, 3 వందల సంవత్సరాల క్రితము కూడా ఈ హనుమద్రామాయణము లభ్యమౌతూ ఉండేదట. ఇప్పుడు కొన్ని కొన్ని పుటలు మాత్రమే లభ్యమౌతూ వున్నాయని తెలుసుకొన్నాను. ఈ రామాయణములో ముఖ్యముగా వానరుల పుట్టుపూర్వోత్తరములు, వారి ఆహారఆచారవ్యవహారాలూ, పరిపాలనా విధానము, వారి విద్యలు, శక్తులు మొదలగు వాల్మీకములో లేని విషయములు చర్చించబడినాయి. అసలు ఈ వాల్మీకి రామాయణము కూడా బ్రిటీషు వారు పరిపాలించే కాలమున కోల్కతా, చెన్నై, ముంబాయి పట్టణ గ్రంధాలయము లందు లభించగా నాటి పండితులు వానిని పరిశోధించి పరిష్కరించి కోల్కతా ప్రతిని ఆలంబనగా తీసుకొని అచ్చు యంత్రము సహాయమున ముద్రించటము జరిగినది.
నాటి రామాయణములు లెక్కకు మిక్కుటములుగా ఉన్నా, ఆధ్యాత్మ రామాయణము లోని, ఒక విషయమును గూర్చి అతి క్లుప్తముగా తెలుసుకొందాము. ఇది వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో 61వ అధ్యాయము నుండి రామకథను పార్వతీ, పరమేశ్వరుల సంవాదంగా రచించినాడు. ఇదే ఆధ్యాత్మ రామాయణముగా ఖ్యాతి చెందింది. వాల్మీకి రామాయణములో కథ, కథనాలు ప్రధానము కాగా, ఆధ్యాత్మ రామయణంలో తత్వ వివేచన ప్రధానము.
అందుగల, నాకు ముఖ్యమని తోచిన ఈ విషయమును గమనించండి. విశ్వామిత్రుడు,ఇతర మహర్షి గణముతో కలిసి తన యజ్ఞదీక్ష నిర్విఘ్నముగా కొనసాగించుటకై రామ రక్షణ బడయుటకు దశరథుని వద్దకు వస్తాడు. అప్పుడు ఆయన రాముడు ఏదో నిర్వేదములో ఉన్నట్లు పసికడతాడు. ఆ మాటే శ్రీరాముని అడుగుతాడు విశ్వామిత్రుడు. దానికి దశరథుడు, రాముడు గురుకుల దీక్ష ముగించి దేశాటనము చేసి వచ్చినప్పటినుండి దేనియందునూ శ్రద్ధలేక ఎంతో నిర్లిప్తతతో ఉన్నట్లు చెబుతాడు. దానికి విశ్వామిత్రుడు “దశరథా! నేను శ్రీరామచంద్రుని కదా అడిగితిని. తన నుండియే జవాబు వినగోరెదను” అన్నాడు. అప్పుడు శ్రీరాముడు చెప్పిన మాటను సూక్ష్మముగా తెలిపెదను. తన వంశములో వివస్వంతుడు, వైవస్వత మనువు, ఇక్ష్వాకుడు, నాభాగుడు, అంబరీషుడు, భగీరథుడు, దిలీపుడు, రఘువు, అజుడు మున్నగు అవకర పరాక్రములై అఖండ రాజ్య పాలనా విభాసితులై, ప్రజాక్షేమమే తమ ధర్మముగానేంచి పాలించిన వారు. ఇక తన తండ్రి దశరథుడు 13000 సంవత్సరములు పరిపాలించినాడు. మరి ఇందరు మహనీయులు పాలించి సమస్త సామ్రాజ్యమును సుభిక్షముగా ఉంచిన తరువాత తాను రాజ్యాధికారియై పాలించావలసినది ఏమున్నది. అట్లుకాక ప్రజలు నిరంతరమూ మానసిక పరివర్తన చెందుతూ తాము ధర్మ మార్గము వీడకుండా ఒక అదుపును ప్రజలు నిరంతరమూ కోరుటచే రాజు రాజ్య పాలన యొక్క ఆవశ్యకత తిరిగీ ఏర్పడుచున్నదా! తాను క్రమబద్ధముగా ప్రజాజీవనమును ఏర్పరచిన తరువాత తన పుత్రపౌత్రులూ తిరిగీ చేయవలసిన సంస్కరణలు అనేకములుంటాయికదా! ఈ విధులకు అంతము లేదా!  అన్న సందేహమును వెలిబుచ్చుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు “శ్రీరామా ఇదే సందేహమును నేనూ మరియు వశిష్ట మహర్షి బ్రహ్మదేవుని అడుగగా ఆయన ఎంతో ఓరిమితో మాకు సందేహ నివృత్తి గావించినాడు. ఈ విషయమును సవిస్తరముగా వశిష్ట మహర్షి నుండి వినగాలవాడవు” అని చెబుతాడు. దానికి సహేతుక సమాధానము చెబుతాడు వశిష్టుడు. ఏమి చెప్పినాడు అన్న వివరణ నేను ఇక్కడ ఇవ్వబోవుట లేదు. ఇక్కడ మన దృష్టి సాధారణముగా పడని ఒక విషయమును గూర్చి చెబుతున్నాను. విశ్వామిత్రుడు రాముని ప్రశ్నించినాడు. బాలుడు కదా అని దశరథుడు జవాబిచ్చినాడు. అప్పుడు విశ్వామిత్రుడు తాను జవాబును రాముని ద్వారానే వినగోరుచున్నట్లు తెలిపినాడు.
మిగిలినది మరొకసారి..........
రామాయణ ముఖ ద్వారము- 9
8 లక్షల ఏళ్లకు పూర్వమే ఉన్న ఆ సంస్కారమును గమనించండి. అది రాజయినా తన హద్దు మీరితే గురుస్థానములో ఉన్న మహర్షులు వారికి తమ హద్దును నిర్దేశించినారు. మరియొక విషయము. విశ్వామిత్రుడు విషయము తనకు తెలిసికూడా తానూ చెప్పక వశిష్ఠ మహర్షిని అడిగి తెలుసుకోమన్నాడు. వశిష్టుడు ఈ విషయముల గూర్చి 3 దినములు శ్రీరామచంద్రునికి బోధ చేస్తాడు. ఈ ఇందుకు కారణాలు రెండు. 1. వశిష్టుడు తనకన్నా పెద్దవాడు. వయసులో, బ్రహ్మఋషిత్వములో. 2. ఆయన ఇక్ష్వాకు వంశ గురువు. కావున ఆబాధ్యత ఆయనదే! ఇది యే అనుక్రమణికను పాటించుట (Maintaining Protocolనాడు దీనిని సభామర్యాద అని పిలచేవారు) అంటారు. నాడు దీనిని సభామర్యాద అని పిలచేవారు. ఇటువంటి అనేక విషయములను మనము పరిశీలనాత్మకముగా మరియు పరిశోధనాత్మకముగా వివిధ రామాయణములను అనుసరించినట్లయితే తెలుసుకొన వచ్చును. కావ్య పరముగా ఇది 34 వేళా శ్లోకములు కలిగియుండగా ప్రతి శ్లోకమూ ఉపమాలంకారము కలిగియుంటుంది. మొదటి కావ్యమనుకొనే వాల్మీకి రామాయణ కాలమునాటి రామాయణములలో ఇంతటి కవితా వైభవము ఉంటే, ఈ సంస్కృత భాష, ఈ భారతీయ సంస్కృతి ఎకాలమునాటిదని లెక్కకట్ట సాధ్యమౌతుందా?
ఇదికాకుండా నారదుడు ‘శత శ్లోకి రామాయణము’ కాకుండా నారద రామాయణము వ్రాసినాడు. ఇంకా లఘు రామాయణము, బృహత్ రామాయణము, అగస్త్య రామాయణము, సార రామాయణము, దేహ రామాయణము, వృత్త రామాయణము, క్రౌంచి రామాయణము, భారద్వాజ రామాయణము, భారత రామాయణము, జైమినీ రామాయణము, శ్వేత కేతు రామాయణము, జటాయు రామాయణము, దేవీ రామాయణము, రవి రామాయణము, పౌలస్త్య రామాయణము అంటే రావణాసురుడు వ్రాసిన రామాయణము ( ఇందులో అధికముగా రాక్షస జన్మ వృత్తాంతములు, వారికి సంబంధించిన చరిత్ర ఉన్నాయి.) అసలు ఇన్ని రామాయనముల్;ఉన్నాయన్న విషయము ఆనంద రామాయణమున పొందుపరుప బదినదని డా. మల్లంపల్లి మల్లికార్జున రావు గారు 30 సంవత్సరములు చేసిన విశేష కృషి వాళ్ళ మనకు తెలియవస్తూ వున్నది. ఇవికాక ఇంకా ఆనాటి ఎన్నేన్నో రామాయణములు ఉన్నవి. ఆనంద రామాయణము వాల్మీకియే వ్రాసినాడని చెప్పబడుతూవున్నా తగిన ఆధారాలు లేవు. పైగా ఇందులోని ఎన్నో ఉదంతములు అవాల్మీకములు. ఇంకా ముఖ్యముగా సుగ్రీవామయనము విభీషణ రామాయణములు కూడా వున్నాయి. 16వ శతాబ్దము వాడు కావచ్చునని పండితులు చెబుతున్న సంత్ ఏకనాథ్ మరాఠాకు చెందినా మహాభక్తుడు. ఆయన వ్రాసిన ‘భావార్థ రామాయణము’లో పైన తెలిపినట్టి వివిధములగు 31 రామాయనములను తానూ చదివినట్లు వ్రాసినాడు.
మరి ఈ రామాయణములన్నీ ఉన్నాయా అంటే సందేహమే అన్నది మాత్రమే సరియైన సమాధానము. లేవు అని చెప్పుటకు వీలు లేదు. ఎందుకంటే మనదేశములోని అనేక అత్యంత సుప్రసిద్ధ గ్రంధాలయాలలో కట్టలు కట్టి దొంతరలుగా ఇప్పటికీ పెర్చియుంచిన గ్రంథములు అనేక లక్షలు. నేడు అంత శ్రమకోర్చగాలిగిన జిజ్ఞాసువులు లేరు, గురువులు లేరు, వీరిరువురూ ఉనారనుకొన్నా గ్రంథాలయములలో తగిన సిబ్బంది లేరు. 1787 లో
చక్రి వంశమునకు చెందిన మొదటి రాజు రామా-1 రాజ్యమును స్థాపించినాడు. ఆయన థాయి రామాయణ గ్రంధ కర్త. ఈ గ్రంధములో రామాయణ కాలము నాటి అనేక క్రొత్తవిషయాలు ఉన్నాయని తెలియవస్తూ వున్నది. ఇప్పుడు రామా-10 పారిపాలించుచున్నాడు. అమెరికా లోని పేరూ లో రామాయణము లభ్యము. ఆఫ్రికా లో రామాయణ గ్రంధము ఉన్నది. ఇట్లు చెప్పుకొంటూ పోతే ఎన్ని రామాయణాలో! ఈ ఒక్క విషయమే ఆయన లోకప్రియత, సార్వభౌమత్వమును చాటుచున్నాయి.
      విదేశీ పాలనక్రింద దాదాపు ఒక సహస్రాబ్దము ఉండిపోయినా కూడా వేద శాస్త్రములు కృశించినాయి గానీ, పురాణ, ఉపనిషత్తులలో ప్రక్షిప్తములు సంభవించినవి కానీ, రామాయణ భారత ఇతిహాసములు మాత్రము హరికథల రూపములోనో, ప్రవచన రూపములోనో, ఇండ్లలో తల్లులు తమ పిల్లలకు కథలరూపములో చెప్పుట వలననో తమ ఉనికిని ఏ పరిస్థితులలో కూడా పోగొట్టుకోలేదు. ఆయా మహర్షులు అంటే వాల్మీకి వ్యాసులు ఆచంద్ర తారార్కము భువిపై నిలుచునని చెప్పిన మాట ఎంతటి సత్యవాక్యముగా నిలిచినదో చూడండి. రామాయణమును గూర్చి స్కాందపురాణము ఎంతగా ప్రశంసించుతూ వుందో చూడండి. 
తదుపరి మరియొక మారు......  

1 comment:

  1. రామాన్యమంటే సామాన్యము కాదు గుల్లెద్దుమోసినంత వుంటాది
    అని అంటే ఏమిటో అనుకున్నా
    నిజంగా ఎన్ని విషయాలు చెప్పినారు ఎంత శోధించారు మీకు శతాధిక నమస్సులు
    యిలా మీరు ఎన్నెన్నో విషయాలు వ్రాయాలని మేము తెలుసైకోవాలని కోరుకుంటున్నాను
    ఆ భగవంతుడు మీకు యెంతో శక్తిని ఇవ్వాలని వేడుకుంటున్నాను

    ReplyDelete