Saturday, 15 December 2018

ధనుర్మాసము - ప్రాధాన్యత


ధనుర్మాసము  ప్రాధాన్యత :
 https://cherukurammohan.blogspot.com/2018/12/blog-post_15.html
సనాతన ధర్మమే సంబరాల పుట్ట. భక్తీ ప్రపత్తులను పూల తట్ట. అర్థవంతమైన పండుగల గుట్ట. కృష్ణగీతను తేనే తెట్ట. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు పరమాత్మ. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించుటచే ఇది ధనుర్మాసమౌతూవుంది. దీని ప్రశస్తి క్లుప్తముగా తెలుసుకొందాము.

ధనుస్సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆభగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈభూమిపైనే. భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక.

ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే. ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు.తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు. ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి. దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు. ఈధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఈ కాలము అటువంటి ఊహ కూడా చేయలేము. అసలు, నేటి కాలములో, నాడు ఇటువంటి సాంప్రదాయములుండేవి అన్నది కూడా తెలియదు.  తెలుసుకొన్నా, వానిని పాటించే అవకాశము కూడా లేదు. ఇది కేవలము నాడు ఈ విధముగా వుండేది అని తెలుపుటకు వ్రాయుచున్నాను. బండలు కూడా పరువని ఇళ్ళు ఉండేవి. ఆవు పంచతము పేద కూడా అప్పటికప్పుడు లభించేవి. అందుచే అట్లు చేయగలిగినారు. ఇంటిబయట ముంగిళ్ళలో గో మయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. అసలు గొబ్బిళ్ళను గుమ్మడి పూలతో అలంకరించటం కద్దు. భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు. అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ ఆనాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిన కోరికలను తీర్చేది గోపూజ. ఈకాలంలో విష్ణుపూజ, దాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి ’మార్గళి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది. తిరుప్పావై పారాయణ ఈరోజు నుండి మొదలు. వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈమాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత కలదు.

వైష్ణవాలయాలకు భక్తులు శుచి శుభ్రతలు కలిగినవారై తెల్లవారు ఝామున వెళ్లి , ముందురోజు పూజారికి 'తళిహ' (అంటే స్వామికి మనము కోరిన నైవేద్యమొనరించుటకు గానూ వస్తు సంభారములు ముందురోజే ఇచ్చి లేక తగిన డబ్బు ఇచ్చి , ఉప్పుపొంగలో, చెక్కెర పొంగలో, పుళియోగిరమో(పులిహోర) చేయ తెలిపితే, మనము చేరు సమయానికి ఆయన సిద్ధముగా చేసియుంచి పరమాత్మకు నైవేద్యమిడి మనకు ప్రసాదమును అందజేస్తాడు. ఇంటిల్లపాది దానిని భుజించి ఎంతో సంతృప్తులౌతారు. అసలు చలి పొద్దున్న వేడి వేడి ఉప్పుపొంగలి తింటూవుంటే మనసు ఆనందమయమై నిజంగానే భగవంతుని దర్శించుకొంటుంది. ఇటువంటి అనుభూతులతో మాబాల్యము గడిచినది. కడపజిల్లా జమ్మలమడుగులో నారాపుర స్వామిగా వెలసిన వేంకటేశ్వరునికి  మాతండ్రిగారు తళిహ కుగానూ ముందురోజే పూజారికి తగిన వస్తుఇవులను సమకూర్చితే , పూజారి తరువాతి రోజు తెల్లవారుఝామున 4 ఘంటలకల్లా శుచి యై నైదేవాలయ ద్వారములను తెరచి నైవేద్యముతో మకోరకు వేచియుండేవాడు మేము ఇంటిల్లపాదిమీ 3 గంటలకే లేచి స్నానాదీకములను ముగించుకొని పిల్లవాల్లమైనా నిర్మల చిత్తముతో పెదాలను అనుసరించేవారము.3 కిలోమీటర్ల దూరము నడచి గుడి చేరి దేవుని ఆష్టోత్తరాది పూజలతో సేవించి, పూజారికి సముచితముగా దక్షిననోసంగి,ముఖ్యముగా వేడి వేడి ఉప్పుపొంగాలిని దేవాలయ ఆవరణలో కూర్చుని టిని చేతులు శుభ్రపరచుకొని స్వామికి నమస్కరించి ఇంటికి మరలేవారము. అసలు ఆనవాలే లేకుండా ఇసుకలో కూరుకు పోయిన ఈ దేవాలయమును , వేరు వేరు కాలములలో ఇసుకను  త్రవ్వి  దేవాలయమును పునరుద్దరించుట జరిగినదని స్థానికులు చెప్పేవారు. మారోజులలో ఇసుక దిబ్బలు విషముగా ఉండేవి. స్వామీ తిరుణాల ఎంతో వైభవముగా జరిగేది. ఇప్పుడు చూస్తె అక్కడ ఇసుక రేణువు కూడా అగుపించదు. ఆ నారాపురేశ్వరుని పాదపంకజమునకు ఈ వ్యాసమును సంపర్పించి సాష్టాంగ నమస్సులను సమర్పించుకొనుచున్నాను.

No comments:

Post a Comment