Saturday, 15 December 2018

ధనుర్మాసము - ప్రాధాన్యత


ధనుర్మాసము  ప్రాధాన్యత :
 https://cherukurammohan.blogspot.com/2018/12/blog-post_15.html
సనాతన ధర్మమే సంబరాల పుట్ట. భక్తీ ప్రపత్తులను పూల తట్ట. అర్థవంతమైన పండుగల గుట్ట. కృష్ణగీతను తేనే తెట్ట. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు పరమాత్మ. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించుటచే ఇది ధనుర్మాసమౌతూవుంది. దీని ప్రశస్తి క్లుప్తముగా తెలుసుకొందాము.

ధనుస్సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆభగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈభూమిపైనే. భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక.

ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే. ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు.తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు. ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి. దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు. ఈధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఈ కాలము అటువంటి ఊహ కూడా చేయలేము. అసలు, నేటి కాలములో, నాడు ఇటువంటి సాంప్రదాయములుండేవి అన్నది కూడా తెలియదు.  తెలుసుకొన్నా, వానిని పాటించే అవకాశము కూడా లేదు. ఇది కేవలము నాడు ఈ విధముగా వుండేది అని తెలుపుటకు వ్రాయుచున్నాను. బండలు కూడా పరువని ఇళ్ళు ఉండేవి. ఆవు పంచతము పేద కూడా అప్పటికప్పుడు లభించేవి. అందుచే అట్లు చేయగలిగినారు. ఇంటిబయట ముంగిళ్ళలో గో మయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. అసలు గొబ్బిళ్ళను గుమ్మడి పూలతో అలంకరించటం కద్దు. భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు. అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ ఆనాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిన కోరికలను తీర్చేది గోపూజ. ఈకాలంలో విష్ణుపూజ, దాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి ’మార్గళి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది. తిరుప్పావై పారాయణ ఈరోజు నుండి మొదలు. వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈమాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత కలదు.

వైష్ణవాలయాలకు భక్తులు శుచి శుభ్రతలు కలిగినవారై తెల్లవారు ఝామున వెళ్లి , ముందురోజు పూజారికి 'తళిహ' (అంటే స్వామికి మనము కోరిన నైవేద్యమొనరించుటకు గానూ వస్తు సంభారములు ముందురోజే ఇచ్చి లేక తగిన డబ్బు ఇచ్చి , ఉప్పుపొంగలో, చెక్కెర పొంగలో, పుళియోగిరమో(పులిహోర) చేయ తెలిపితే, మనము చేరు సమయానికి ఆయన సిద్ధముగా చేసియుంచి పరమాత్మకు నైవేద్యమిడి మనకు ప్రసాదమును అందజేస్తాడు. ఇంటిల్లపాది దానిని భుజించి ఎంతో సంతృప్తులౌతారు. అసలు చలి పొద్దున్న వేడి వేడి ఉప్పుపొంగలి తింటూవుంటే మనసు ఆనందమయమై నిజంగానే భగవంతుని దర్శించుకొంటుంది. ఇటువంటి అనుభూతులతో మాబాల్యము గడిచినది. కడపజిల్లా జమ్మలమడుగులో నారాపుర స్వామిగా వెలసిన వేంకటేశ్వరునికి  మాతండ్రిగారు తళిహ కుగానూ ముందురోజే పూజారికి తగిన వస్తుఇవులను సమకూర్చితే , పూజారి తరువాతి రోజు తెల్లవారుఝామున 4 ఘంటలకల్లా శుచి యై నైదేవాలయ ద్వారములను తెరచి నైవేద్యముతో మకోరకు వేచియుండేవాడు మేము ఇంటిల్లపాదిమీ 3 గంటలకే లేచి స్నానాదీకములను ముగించుకొని పిల్లవాల్లమైనా నిర్మల చిత్తముతో పెదాలను అనుసరించేవారము.3 కిలోమీటర్ల దూరము నడచి గుడి చేరి దేవుని ఆష్టోత్తరాది పూజలతో సేవించి, పూజారికి సముచితముగా దక్షిననోసంగి,ముఖ్యముగా వేడి వేడి ఉప్పుపొంగాలిని దేవాలయ ఆవరణలో కూర్చుని టిని చేతులు శుభ్రపరచుకొని స్వామికి నమస్కరించి ఇంటికి మరలేవారము. అసలు ఆనవాలే లేకుండా ఇసుకలో కూరుకు పోయిన ఈ దేవాలయమును , వేరు వేరు కాలములలో ఇసుకను  త్రవ్వి  దేవాలయమును పునరుద్దరించుట జరిగినదని స్థానికులు చెప్పేవారు. మారోజులలో ఇసుక దిబ్బలు విషముగా ఉండేవి. స్వామీ తిరుణాల ఎంతో వైభవముగా జరిగేది. ఇప్పుడు చూస్తె అక్కడ ఇసుక రేణువు కూడా అగుపించదు. ఆ నారాపురేశ్వరుని పాదపంకజమునకు ఈ వ్యాసమును సంపర్పించి సాష్టాంగ నమస్సులను సమర్పించుకొనుచున్నాను.

Saturday, 1 December 2018

వేదము-పంచమవేదము- నిర్వేదము

వేదము - పంచమవేదము నిర్వేదము (ఉపోద్ఘాతము)
ఎంతో నిర్వేదముతో ఈ మాట వ్రాస్తూవున్నాను.
మరీ ఈ మధ్యకాలములో కొందరు మేధావులు అనుకొనేవారు రామాయణ భారతాది ఇతిహాసములను కనీసము వచన రూపములోనైనా చదువక, వినక, అన్నీ తమకే తెలుసునన్న గుర్తింపు పొందుటకై తోచినది ఆస్య గ్రంధి లో వ్రాస్తూవున్నారు, ముఖ్యముగా శ్రీకృష్ణుడు మొదలగు దేవతా మూర్తులపై. వారి మాటలు, కాకతాళీయముగా చదువవలసి వచ్చి మనసారా బాధపడినాను. శ్రీ కృష్ణుడు పరమాత్మ. అందు సందేహమే అక్కర లేదు. ఆయనది జన్మ కాదు అవతరణము. ఇక ధర్మరాజు ను గూర్చి ఒక మాట. మనకు భారతములో భీముడు , అర్జనుడు అంటే మక్కువ ఎక్కువ. వారు ఎన్నెన్నో వీర విన్యాసములు చేసినారు కావున. కానీ ధర్మరాజు ఎంతటి ధర్మ మూర్తి అన్న విషయమును కొంత క్లుప్తముగా, రెండు మూడు సందర్భములను తీసుకొని, మీ ముందుంచ ప్రయత్నము చేసినాను.
ఇటువంటివి మీరు చదివితే మీ పిల్లలకు చెప్పి వారిని రుజుమార్గములో ఉంచగలరు. ఇతరమతములలో అధికాంశము లొసుగులున్నా వారు బయట పెట్టరు పెట్టలేరు. మనము మాత్రము ప్రతివిషయమునూ ఎందఱో, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, అరవిందో ఘోష్, కంచి పరమాచార్యులు, శృంగేరి పీఠాధిపతుల వంటి వారలను చూస్తూ కూడా, వారిని విస్మరించి, రమణానంద, నిత్యానంద, ప్రేమానంద, డేరా బాబా, అసారాం బాపు, మొదలగు దుర్మార్గులను నమ్మి మోసపోయేవారు  వారు కొందరయితే, వారే ఈ పవిత్ర ధర్మమునకు ప్రతినిధులని నడిచే దేవతలని, కొనియాడేవారు కొందరు.ఉన్న మాట చెప్పినందుకు సల్మాన్ రుష్ది ప్రాణములు కాపాడుకొనుటకు, ఎన్ని తిప్పలు పడినాడో,ఎవరికీ తెలియని విషయము కాదు. ఇక నయినా మన ధర్మముపై తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేయక ధర్మానువర్తులై మెలుగుతారన్న ఆశతో, ఈ వ్యాసమును చదువుతారని మీ ముందు ఉంచుచున్నాను.
లంకె:

https://cherukurammohan.blogspot.com/2018/12/blog-post.html

వేదము-పంచమవేదము- నిర్వేదము
మనకు ఒక లాలా ఒక లాలూ ఉన్నారు. ఇరువురూ యాదవులే. ఇరువురూ ప్రఖ్యాతులే !
ఒకరు ఆవు పూజనీయమన్నారు వేరొకరు ఆవు తిండి కూడా భోజనీయమన్నారు. ఒకరు చెరసాలలో పుట్టి బయటకు వచ్చి రాజ్యముల పాలింప జేసినారు. వేరొకరు రాజ్యముల పాలించి పాలింపజేసి చెరసాలపాలయినారు. ఒకరు ప్రపంచమును గృహముగా భావించినారు. మరియొకరు గృహమును ప్రపంచముగా భావించినారు. ఒకరికి, పరులకు మేలు చేసినా కీడు చేసినా, లోక కళ్యాణమే ధ్యేయము. వేరొకరికి, పరులకు మేలు చేసినా కీడు చేసినా 'చిన్ని నా బోజ్జకు గోమాత రక్ష'.

ఇదంతా ఎందుకు చెప్పుకు వచ్చినానంటే ఒకే ఒక యుగము ఇరువురి నడుమ గల అంతరము. కానీ మనస్తత్వములో ఎంత తేడా వచ్చినదో గమనించండి. శ్రీ కృష్ణునికి వేదశాస్త్ర పురాణేతిహాసములలో నిష్ణాతుడు, ఒక్క క్షణానికి ఆయనే పరమాత్మ అన్నవిషయమును ప్రక్కనుంచి, మానవ మాత్రునిగా యోచించితే అన్నీ తెలిసికూడా లౌకికమును ఎక్కువగా ప్రదర్శించినాడు కానీ లోక కళ్యాణమునకు మాత్రమే సుమా! అందుకే తానే చెప్పుకొన్నాడు ‘పరిత్రాణాయ సాధూనాం...’ అని. కానీ కలియుగములో వేదము మాట దేవుడెరుగు, పురాణేతిహాసములను చదివే పాపాన బోయేవారులేరు, చెబితే వినేవారులేరు, ఒకవేళ విన్నా, చదివినా ఆచరించ ఆలోచించేవారు అసలు లేరు. ఆలోచనే లేకుంటే ఆచరణ వుండనేరదు కదా! అటువంటి వారు అందుకే చేయరాని పనులు చేసి  చేరసాలకెళ్ళినా, వారు  బయటికి వస్తూనే పూలమాలలతో సత్కరించి జయజయ ధ్వానాలతో స్వాగతము పలుకుచున్నారు మూర్ఖజనులు.
వేగము పెరిగిన ఈ కాలములో, నెమ్మదిగా చేయవలసిన పని, త్వరగా చేయవలసిన పని అన్న తేడా లేకుండా అన్నీ త్వరత్వరగా చేసి ‘తొందరపడే గొడ్డు మురికి నీరు త్రాగుతుం’దన్న నానుడిని రుజువు చేస్తున్నారు. తమ పిల్లలకు లౌకికము నేర్పదలచిన తల్లిదండ్రులు, బాల్యమునుండి భారతమునకు పరిచయము చేస్తే చాలు. జీవిత కాలమంతా చదువుతూ వుండినాకూడా ప్రతిసారి ఒక క్రొత్త విషయమో, క్రొత్త అర్థమో తెలియవస్తూనే వుంటాయి. ఈ ఇతిహాస పురాణములను చదువుతూవస్తే చాలు. ఇవి చదువుటకు వర్ణాశ్రమ ధర్మములు అడ్డురావు. మహనీయులు గోన బుద్ధా రెడ్డి, కుమ్మరి మొల్ల, రామరాజ భూషణుడు ఆదిగాగల విద్వత్ కవివరేణ్యులు రామాయణాది కావ్యములను అత్యంత జనరంజకముగా అనుపమాన శ్రద్ధాభక్తులతో వ్రాయలేదా! పైపెచ్చు వీరెవరూ బ్రాహ్మణులు కాదు. ఇతిహాసము పురాణము మొదలగునవి చదువు వారలకు  వేదము చదువలేదే అన్న చింత పడనవసరము ఉండదు. కేవలము వేదమే చదివితే, ఆకళింపు చేసుకొనుటలో అనర్థము సంభవించితే ఆసాంతము అవస్థ పడవలసి ఉంటుంది. అందుచే అన్నింటికన్నా ముఖ్యముగా  పంచమ వేదమగు భారతమును ఆపోశనము పట్టితే చాలు, అంతా తెలుసుకొన్నట్లే. వేదమును గూర్చి చెప్పిన ఈ మాట గమనించండి.
ఇతిహాస పురాణానాం వేదం సముపబృహ్మయేత్l
విభేదాలప శ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి ll
అన్నది శాస్త్ర వచనము. వేదములు శాస్త్ర పురాణములలో నిక్షిప్తము చేయబడినవి. ఆ జ్ఞానమును చక్కగా ఉపయోగించుకొనమని పెద్దల ఆదేశము. అందుకే అల్పజ్ఞానిని చూస్తే, నా మీద ఎక్కడ ప్రహారము చేస్తాడో అంటే  ఎక్కడ దెబ్బ కొడతాడో అని వేదము భయపడుతుందట. అసలు వేదము అంటే ఏమిటో చూద్దాము.
‘ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారయోః యౌ అలౌకికం ఉపాయం వేదయతి సభేదః’ ఇష్ట ప్రాప్తి కలుగుటకు, అనిష్టము తొలగుటకు, లౌకికముగా తెలుసుకొనలేనపుడు తెలియజెప్పేదే వేదము. ఈ వేదమే (వేదముల సమూహము) భారతములో నిగూఢముగా నిక్షిప్తమైయున్నది.  అసలు భారతీయ సాహిత్యమంతా వేద ప్రతిపాదితమే! అసలు సాహిత్యము అంటేనే హితమును కూడినది, హితమును కూర్చునది అని అర్థము. స్థూలముగా మానవుని గుణములు పరిగణనన లోనికి తీసుకొంటే అతనికి రెండు విషయముల గూర్చి తెలుసుకొనుట అత్యవసరము. అవి 1. హితము 2. ప్రియము. హితము, ప్రియము ఒకటేనను పొరబాటు పడవద్దు.  నేనిపుడు పైన తెలిపిన రెండు గుణములను సాహిత్యపరముగా విశ్లేషిచుచున్నాను.
అసలు ఆంగ్లము అంటే షేక్స్పియర్ రచనలు అన్నంత ప్రతిష్ఠ అవి కలిగి  వున్నాయి. ఆయన ‘Shakespeare's sonnets’ అన్న పేరుతో ఒక పద్య కావ్యము వ్రాసినాడు. అది 154 ‘Sonnets’ కలిగియున్నది. అది కాక ఒక 6 Sonnets, Romeo and Juliet, Henry V and Love's Labour's Lost అన్న నాటకములలో కూడా వున్నాయి. కానీ ఈ కవిత్వము ఏమి తెలుపుతుంది అన్నది గూగుల్ నుండి సేకరించిన ఈ నాలుగు వాక్యములను చదివితే తెలుస్తుంది.
 Instead of expressing worshipful love for an almost goddess-like yet unobtainable female love-object, as Francesco Petrarca(Petrarch), Dante, and Philip Sidney had done, Shakespeare introduces a young man. He also introduces the Dark Lady, who is no goddess. Shakespeare explores themes such as lust, homoeroticism, misogyny, infidelity, and acrimony in ways that may challenge, but which also open new terrain for the sonnet form.
మరి ఈ సంకలనమును మన మహాకావ్యములతో పోల్చనౌతుందా! మన ప్రబంధములలో శృంగారము వున్నా నీతి మాత్రము అంతర్లీనముగా వుంటూనే వుంటుంది. అట్టి స్థితి ఈ ఆంగ్ల రచనలయందు మృగ్యము.
ఇప్పుడు పైన తెల్పిన 1.హితము, 2.ప్రియమును గూర్చి మాటలాడుకొందాము.
ఉదాహరణకు మిరపకాయ బజ్జి తీసుకొందాము.
'పచ్చిమిరప బజ్జి బల్ కమ్మగానుండు
మితము మీరి దినుట హితము కాదు'
అని ఒక సందర్భములో వ్రాసియుండినాను. బజ్జి ప్రియమైనది అని ఇష్టమొచ్చినట్లు తింటే, ప్రక్క, పాయిఖానా లోకి మార్చుకోవలసివస్తుంది. అదే మితముగా కనుక తింటే చక్కగా కాలప్రవృత్తి యగుటకు హితకారి యౌతుంది. కావున ఏపని కూడా తనకు, పదిమందికీ హితమైనదిగా ఉండవలెను, ముఖ్యముగా సాహిత్యము.  ‘జిహ్వ చాపల్యము’ చెడ్డది. కావున ఆహారమయినా అన్యథా అయినా ఔషధమువలె తగు మోతాదులో తీసుకొనుట ఎప్పటికీ, ఏ విషయములోనయినా శ్రేయస్కరము. మన పూర్వులు వ్రాసినది సాహిత్యము. అంటే ఆధునికులు వ్రాసినది ‘అశ్లీలమా’ అన్న ప్రశ్న వెంటనే ఉత్పన్నమౌతుంది. దీనిని సంస్కృతములో ‘పరిశేచ న్యాయము’ అంటారు. అంటే ‘రాజుగారి పెద్దభార్య పతివ్రత....’ అన్న నానుడికి అన్వయమన్నమాట. కావున మన పూర్వులు వ్రాసినారు అంటే వాళ్ళు అది మాత్రమే వ్రాసినారు, నేడు అట్లుగాక అంతా కలగాపులగమైపోయింది.  పాఠకుడు హంసవలె నీరును వేరుజేసి పాలను గ్రహించవలసి యుంటుంది.
మన పూర్వులు నీతిని కూడా శాసించినారు. అంటే నీతి ఏది అవినీతి ఏది అన్నది నిర్ద్వంద్వముగా మనముందుంచినారు. అందుకే మనకు ‘నీతి శాస్త్రము’ను అందించినారు. నియమముతో నీతి వుంటుంది, నీతితో నియమము వుంటుంది. ఈకాలమున మనవద్ద ఆరెంటిలో ఒకటి కూడా లేదు కాబట్టి రెండవది ఉండే అవకాశమే లేదు. అజ్ఞానమనే అంధకారములో అలమటిస్తూ వెలుగు పడమటినుండి రావాలనుకొంటున్నాము. సూర్యుని వెలుగు వచ్చేది, సూర్యుడు వెలుగు తెచ్చేది తూర్పునుండియే అన్న వాస్తవమునే విస్మరించినాము.
మిగిలినది వేరోకసారి చూద్దాము.......
వేదము-పంచమవేదము- నిర్వేదము
-2వ భాగము
వేదము ఏమి చెబుతూ ఉన్నదంటే :

మాతృ దేవో భవ పితృ దేవో భవ ఆచార్య దేవో భవ
అతిథి దేవో భవ యాన్ యనవజ్ఞాని కర్మాణి
తానిద్వయా సేవితవ్యాని నో ఇతరాణి
ఈ దేవతలగా భావించే వారి చేత ఏదయినా, తెలియక గానీ, పోరాబాటునగానీ, జరిగితే వాటిని అనుసరించక దోషరహితమైన పనులను మాత్రమే చేయుము, ‘నో ఇతరాణి’ అంటే ఇతరములు ఏవీ చేయకుము అని ఘంటా పథముగా చెబుతూ వున్నది.
ఒక నదిని ఆనుకొనియుండే అగ్రహారములో ఒక ఆదర్శప్రాయుడగు బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆయన సూర్యోదయమునకు పూర్వమే నదికి వెళ్లి స్నానమాచరించి సంధ్య అక్కడే వార్చుకొనేవాడట. ఆయనకు కనుచూపు మేరలో, నదిలో,  ఆ అగ్రహారములోని ఇతర బ్రాహ్మణులు నిలిచి ఆయనను అనుకరించేవారట. ఒకసారి ఆ బ్రాహ్మణుని గోచి వూడినది. ‘ఓహో! మనము కూడా గోచి ఊడదీసుకొనవలె’నని తలచి మిగతా వారంతా గోచులు ఊదదీసుకొన్నారట. కాబట్టి పెద్దలను అనుకరించినా లేక అనుసరించినా, చేసే పని గొర్రెదాటు కాకూడదు అని ఘంటాపథముగా చెప్పుచున్నది వేదము.
ఒక పనిని చేయవలెనా వద్దా అన్న విచికిత్స వ్యక్తిలో ఒక్కొక్కసారి కలుగుతూ వుంటుంది అందు వేదమును గూర్చి మనకు  ఈ మాట తెలియవస్తూ వున్నది:
అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలః
అధ యధితే కర్మవిచికిత్సావా  వృత్తవిచికిత్సావాస్యాత్
య ఏతత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః యుక్తాః ఆయుక్తాః అరూక్షాః ధర్మకామాచ్యుః  యథాతే తేషు వర్త్యేనన్ తథాతే వర్తేతాః
ఇది శాససనము.
బ్రాహ్మణాః అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులు. బ్రహ్మము అన్న మాటకు పెద్దలు వేదము అన్న అర్థమును  కూడా చెబుతారు. అంటే నిరంతర వేద పఠన బ్రహ్మనిష్ఠ కలిగియున్న వారు చక్కనగు వివేకమునుపయోగించి ఆలోచించగలిగినవారెవరయితే ఉన్నారో, యోగ్యులెవరైతే వున్నారో, ధర్మమునందు మాత్రమే కామము కలిగినవారెవరయితే ఉన్నారో, అరూక్షాః అంటే, అనవసరముగా అసహనముతో కూడిన కోపమును  లేశమయినా లేకుండా, ధర్మమునందు మాత్రమే కామము కలిగి ఉంటారో అట్టివారి నుండి సముచితమగు సలహానుపొందుము అన్నది శాసనము. మరి అటువంటి వారిని ఎక్కడ వేదుకగలము అన్నది మనలో అంకురించే మొదటి ప్రశ్న. తెలుసుకోవలసినదేమిటంటే అట్టివారు బయట వెదుకుటచే దొరుకరు. ఈ అన్నిలక్షణములున్న వ్యక్తులు మనకు దొరుకవలెనంటే అది కేవలము పురాణేతిహాసములలోనే సాధ్యము. అందుచేత మనము సత్సాహిత్య పఠనానురక్తులమై ఉండవలెను. అప్పుడు మనకు వలసిన ద్రుష్టాన్తరములు ఎన్నియో దొరికే అవకాశముంటుంది.
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణగా మహాభారతములోని మహాధర్మానువర్తి యగు ధర్మరాజును, మరియు అసూయాగ్రస్తమస్తకుడైన దుర్యోధనుని తీసుకొందాము. దృశ్యము కృష్ణ రాయభారము.
దురోయోధన సభామంటపము చేరి ధర్మజ మనోగతమునెరింగించిన కృష్ణునితో, మాత్సర్య మకరీగ్రస్తుండగు దుర్యోధనుని ప్రేలాపనము చూడండి:
‘ఏమును వారు పంచుకొని ఏలుట కల్గదు పల్కకుండు మిం
కేమియు, వాడి సూది మొన ఇంచుక మోపిన యంత మాత్రయున్
భూమియోనర్చి పాండునృప పుత్రుల కిత్తునె ఎవ్వరైన సం
గ్రామమునన్ జయంబుగొని రాజ్యము చేయుట నిశ్చయించితిన్
అన్నాడు. ఇది అతని రూక్షాతత్వమును తెలియజేస్తూ వున్నది. ఎంతటి విజ్ఞతా రాహిత్యమో గమనించండి. మరి అతను బాగా చదువుకొన్నవాడే కానీ ప్రయోజనము లేకుండాపోయింది. అతనిలో సంస్కార రాహిత్యము పుష్కలముగా చోటు చేసుకొనింది. ఆ గుణము తండ్రి ధృతరాష్ట్రుని నుండి సంక్రమించింది. తన అవిటితనము, తన తమ్ముని శౌర్యసాహసములు ధృతరాష్ట్రుని ఈర్ష్యా లోలునిగా చేసినాయి. మరి దుర్యోధనుడు ఆయన కుమారుడే కదా!
అదే విధముగా ధర్మరాజు చేయు రాజసూయమున శిశుపాలుడు ధర్మరాజును ధిక్కారపూర్వకముగా ఇట్లు మాట్లాడుతాడు...
సీ. ఈతని వృద్ధని యెఱిఁగి పూజించితే
వసుదేవుఁ డుండంగ వసుమతీశ!
ఋత్విజుం డని విచారించి పూజించితే
ద్వైపాయనుం డుండ ధర్మయుక్తి
యాచార్యుఁడని వినయమునఁ బూజించితే
కృతమతుల్ ద్రోణుండుఁ గృపుఁడు నుండ
భూనాథుఁ డనియెడుబుద్ధి బూజించితే
యాదవుల్ రాజులే యవనిమీఁదఁ.
ఆ. బూజనీయు లైనపురుషులలోపల
నెవ్వడయ్యెఁ గృష్ణుఁ డిట్టు లేల
పూజ్యు లయినవారిఁ బూజింప నొల్లక
భీష్ము పనుపుఁజేసి బేల వయితి.
ఇట్టి అసందర్భ ప్రలాపిని ‘అనిమిత్తమహత్పరివాద శీలుడు’ అంటారు అని మనకు భీష్ముని ద్వారా తెలుస్తుంది మనకు భారతములో! అంటే కారణము లేకుండా పెద్దవారిని నిందించు శీలము కలిగినవాడు అని ఆ మాటకు అర్థము. ఇది కూడా ఒకవిధమగు రూక్షాస్వభావమే! ఇది శిశుపాలునికి ఎట్లు సంభవించింది అంటే సాంగత్య దోషము. అతని స్నేహిత బలగమంతా కంస, రుక్మి, జరాసంధాది మద మత్తులు. కావున దీనివల్ల దుష్ట సాంగత్యము తగదు అన్న మాట మనకు సహేతుకముగా తెలియవస్తూవుంది.
అందుకే సునిశిత పరిశీలనతో ఇటువంటి గ్రంథములు చదివితే చెడుగు దరి జేరకుండా కాపాడుకొనగల్గుట, మంచిని అలవరచుకొనుట నేర్చుకొనవచ్చును.
మరి ధర్మరాజు చిత్తవృత్తి ఎట్లు వుంటుంది అన్నది ఇంకొకసారి తెలుసుకొందాము……………
వేదము-పంచమవేదము- నిర్వేదము-3వ భాగము
అదే ధర్మరాజు ఒక సందర్భములో ఈ విధముగా అంటాడు
‘క్షత్రధర్మమింత కష్టమగునె
పెఱధర్మమాచారింప తగదటండ్రు
గాన శస్త్ర జీవికయ తగియున్నది
యైన వంశనాశమనభిమతము
అజాత శత్రువు యొక్క అంతర్మధనానికి ఈ ఆటవెలది అచ్చమైన అభినయవాచికము.
ఎంత మధనపడుతున్నాడో చూడండి ధర్మరాజు. ఆయన అంటూవున్నాడు "ఔరా! ఈ క్షత్రియధర్మము అన్నది ఎంత కష్టమును కూడియున్నది.
క్షాత్రధర్మమునకు బద్ధులగా మనల విధాత నిర్ణయించినాడు. ఇక పరధర్మము నవలంబించే ప్రసక్తి చోటు చేసుకోదు.
ధర్మమును అనుష్ఠించవలసినదే కాబట్టి ధనుర్ధారులమై ఉండక తప్పదు. అయినా రక్తపాతము, కులనిర్మూలనమూ నా అంతరాత్మ అంగీకరించని విషయములు.
ఇదే మాటను పరమాత్మ కురుక్షేత్రమున తన గీతోపదేశములో అర్జనునకు తిరిగీ ఒకసారి గుర్తు చేస్తాడు ఈ విధముగా:
శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||
"చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా, గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది ; స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే ; కానీ, పరధర్మం మాత్రం భయంకరమైనది."
ఇక్కడ ధర్మరాజు యొక్క ధర్మస్వరూపమును గమనించండి. తన కోరికకు విరుద్ధమయినా కూడా స్వధర్మమునకే కట్టుబడి యుంటానన్న ధర్మనిష్ఠాగరిష్టుడు. ఆయనకు ధర్మము ముఖ్యము. తన అభిప్రాయము కాదు.
ఈ మాటే కాకుండా తాను కృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నానన్న సంకోచము ఈషణ్మాత్రమయిననూ లేక తన హృదయమును పరమాత్మ ముందు ఈ విధముగా ఆవిష్కరించుతాడు.
 సుతువాడై వినయంబు సేకొనక ఏచొప్పున్ దగం జెప్ప కా
ధృతరాష్ట్రుండవినీతి జేసినను సంధింపంగ రాదంచు వే
గ తెగంబాఱకు తెంపుసేయునెడ లోకంబెల్ల మెచ్చం బ్రకా
శిత ధర్మస్థితి నొంది మా మనము నిశ్చింతంబుగా జేయుమీ!
కృష్ణా! ఆ ధృతరాష్ట్రుడు కుమారుని పక్షమును పూని , వినయము వీడి, విచక్షణ వీడి, ఏ అభిప్రాయమునూ వెల్లడించక అవినీతితో మెలగినప్పుడు, ఇక సంధి పోసగదని సాహసించవద్దు. ఆవిధమగు సాహసమే ప్రదర్శించవలసి వస్తే జనులు జయజయ ధ్వానాలు చేయురీతిన ధర్మనిబద్ధుడవై మా మనసు విచారరహితమై యుండులాగున మెలగ వలసినది. అంతటి ధీరుడు ధర్మరాజు. ధైర్యము అంటే మీదబడి కొట్టటము కాదు. ధర్మ ప్రతిపాదితమైన తన నిర్ణయాని అమలుపరచుటకు వెనుకాడని వ్యక్తి ఆయన. నిజానికి ధర్మజుడు చెప్పకపోయినా పరమాత్మ అదే చేస్తాడు. కానీ చెప్పనిదే తన మదిలోని తలంపు తానూ తెలిపినానన్న తృప్తిని  కలిగించుకొంటూ తన ఋజువర్తనమును తమ్ములకు ద్రౌపదికి కూడా తెలియజేయుచున్నాడు. ఆయనకు ఈ ధర్మ పరాయణత తన తల్లి, పితామహుడు భీష్ముడు, గురువులు ద్రోణ కృపుల వద్దనుడి మరియు పినతండ్రి విదురుని వద్దనుండి కూడా శ్రద్ధతో గ్రహించినాడు.
స్వార్థపరుడగు దుర్యోధనుడు ‘అస్థానపతితమైన దాతృత్వము’ కలిగినవాడు. అంటే దాతృ గుణము వున్నది కానీ స్వార్థము అతనిని విచక్షణారహితుని చేసినది. అందుకే కర్ణునికి అంగరాజ్య మివ్వగలిగినాడు కానీ ధర్మరాజుకు వాడిసూది మొన మోపిన స్థలము కూడా ఇవ్వనన్నాడు, అందుచే మాత్సర్య మదొన్మత్తుడగు దుర్యోధనుడు, అసందర్భ ప్రలాపి రూక్షా స్వభావుడునగు శిశుపాలుడు దారుణ మరణమునకు గురియైనారు. ధర్మరాజు తన ధర్మబుద్ధిచే సశరీరుడై స్వర్గారోహణము చేసి ఇంద్రునితోకూడి ఇంద్ర సింహాసనమును అధిష్ఠించినాడు. అది నీతి, నియమము, నిష్ఠ, నిబద్ధత, నిష్కాపట్యము, ధర్మాచరణ మున్నగు సల్లక్షణముల అనుసరణ యొక్క సత్ఫలితము.
‘త్యాగేనంకే అమృతత్వ మానసుఃఅని అంటూవున్నది వేదము. త్యాగము చేతనే అమృతత్వమును పొందవీలవుతుంది. మరి త్యాగము అంటే ఏమిటి?
స్వస్వత్వ నిరసన పూర్వక పరస్వత్వ కరణంఅంటే ఒక వస్తువు, పట్టము పదవి ఏదయితే నీయొక్క స్వామిత్వమును కలిగియున్నదో అంటే దేనికయితే నీవు స్వంతదారునివైవున్నావో, దానిని తొలగించి మనః పూర్వకముగా పరులకు ఒప్పగించటము. అంటే మనము ఇవ్వదలచినది  నిస్వార్థబుద్ధితో పరులకు ఇవ్వవలెను. దానిని త్యాగము లేక దానము అని అంటారు. ఆంధ్ర మహాభారతములో తిక్కన గారు చాలా గొప్పమాట చెబుతారు. ‘రెండక్షరములు బంధంబు, మూడక్షరములు మోక్షంబు’ అని. ‘మమ’ అనే  రెండక్షరాలు ‘బంధం’ నందు దాగియున్నాయి అంటే బంధింపబడి యున్నాయి. సహజముగా మనము శరీరానికి ఎక్కడలేని  ప్రాధాన్యతనిస్తాము. దానినే ‘మమ’ అని నమ్ముతాము. మన ఇల్లు వుంది .  
ఒక ఊరకుక్క లోపలి వస్తుంది. దానికీ మనకు మన ఇంటికీ ఎటువంటి  సంబంధము లేదు. మనము పిలువలేదు దానికదిగా వచ్చింది. మనము పొమ్మని అదిలిస్తే వెళ్ళిపోతుంది. అంటే మన ఇంటి లోనికి వచ్చిన మనకు  సంబంధము లేని వ్యక్తులను జీవులను వెంటనే బయటికి పంపుతాము. అదేవిధముగా ‘మమ’ అనుకొనే ఈ శరీరానికి ఒక రుగ్మత వచ్చింది  అనుకొందాము. మనము దానిని పట్టి పారవేయలేము. వైద్యుని వద్దకు పోవలసిందే, మందు తీసుకోన వలసిందే! మరి అటువంటప్పుడు శరీరముపై మన నియంత్రణ లేదనియే కదా! మన నియంత్రణ లేనిది మనదెట్లవుతుంది.
మరి మనది కానిదానిని ‘మమ’ అనుకొనుట తప్పుకాదా! కాబట్ట్ట్టి ఈ  శరీరము ‘మమ’కు ఒక అద్దెఇల్లు మాత్రమే!
ఒక 2౦ సంవత్సరాల క్రితం నాకొక మిత్రుడు ఉండేవాడు. 
మిగిలినది ఇంకొకరోజు.......
 వేదము-పంచమవేదము- నిర్వేదము
4వ భాగము 
ఒక 2౦ సంవత్సరాల క్రితం నాకొక మిత్రుడు ఉండేవాడు. అతనిది నాదీ ఒకటే  వయసే. ఆయన తలకు రంగువేసి జుట్టును తుమ్మెద రెక్కలవలె ఉంచేవాడు.  నేను జుట్టును పట్టపగలుగా  మాత్రమే ఉంచేవాడిని, రంగువేసేవాడిని కాదు. ఒక రోజు  మరొక మిత్రుడు మేమిరువురమూ అతని సమక్షమున వున్నపుడు ‘ తలకు ఆయన రంగు వేస్తాడు నీవు వెయ్యవెందుకు’ అని అడిగినాడు. నేను ఆతనికి జవాబుగా హాస్యము రంగరించి  ‘నేనిట్లు ఉండుటచే బస్సులో రైలు లో కూర్చున్న ఆడవాళ్ళు కూడా అయ్యోపాపమని నన్ను కూర్చోనిస్తారు జనసమ్మర్దము ఎక్కువగా వున్నపుడు. ఆయనకు ఆ అదృష్టము ఉండదు. కూర్చోదలచితే Foot Board ను ఆశ్రయించవలసి వస్తుంది అదికూడా స్థలము ఉంటేనే!’ అని అన్నాను.  వెరసి ఈ మాటలో 'మనది కాని దానికి అవసరము మించి అలంకారము చేయనావశ్యకత లేదు', అన్నది మనము  గ్రహించవలసిన విషయము. కావున ఏది మనది కాదో  దానికి మనము అవసరములేని హంగులు చేయుట నిరుపయోగము. దీనిని ఆంగ్లములో Capital Waste అంటారు. ఈ భావము మనకు పట్టుబడుతుంది పురాణేతిహాసములలోని పాత్రలద్వారా. మనము ఆగ్రంధములను చదివేటపుడుకూడా అదే విచక్షణతో చదువవలసి వుంటుంది. అప్పుడు ‘మమ’ ఏమిటో మనకు అర్థమౌతుంది.
 ఇక మూడక్షరముల పదమును గూర్చి ముచ్చటించుకొందాము. ఆ పదము  ఏమిటంటే ‘నమమ’. నమమ’ లో మోక్షము దాగివుంది. ‘నమమ’ అంటే నాది కాదు అన్న భావన. ఇది సులభముగా రాదు కానీ మన ప్రయత్నముచే పెంపొందించుకొనవలసి వుంటుంది. ఒక అతితెలివి కలిగిన కుర్రవాడు ఒక సాధువును ‘స్వామీ! మోక్ష సాధనకు ‘నమమ’ను ఆశ్రయించవలసి వుంటుందే మరి నా భార్యను కూడా ‘నమమ’ అనుకోవలెనా’ అని. అ సాధువు ‘మూర్ఖుడా భార్యా అర్ధ శరీరాణి’ అన్నది మన శాస్త్రవచనము. చతుర్విధ పురుషార్థములకు ఆమె నీ తోడు’ అని జవాబిచ్చినాడు. ఇక్కడ నేను చెప్పవచ్చినది ఏమంటే భారతము వంటి మహాగ్రంధములను చదువునప్పుడు చెత్త శుద్ధి కాకుండా చిత్త శుద్ధి పాటించుట అత్యంత ముఖ్యము. అందుకే కదా ద్రౌపది అవమానముతో మొదలై ‘పరిత్రాణాయ సాధూనాం’ మరియు ‘వినాశాయచ దుష్కృతాం’ జరిగింది. కావున ఈ ‘నమమ’ అన్న మాటను ఎక్కడ ఎక్కడ మనము తలువవలసి వస్తుంది అన్నది తెలుస్తుంది.
ధర్మరాజును గూర్చి భారతము ద్వారా ఇంకా ఏమి మనకు అర్థమౌతుందో చూద్దాము. దుర్యోధనుని శకము ముగిసింది. ధర్మరాజు సింహాసనాధిష్ఠుడయినాడు. కానీ ఆ ధర్మమూర్తి దుర్యోధనునిచే ప్రతిపాదింపబడిన ప్రతి దుష్కార్యమునూ ఆమోదించిన ధృతరాష్ట్రుని ఆయన అర్దాగి గాంధారినీ సింహాసనముపై కూర్చుండబెట్టి తాను సవినయముగా కోశము యొక్క జమాఖర్చులు ప్రతిరోజు చెప్పేవాడట. ఇంకొక విషయము చూడండి. మహావీరులు మరణించిన పిదప శల్యునికి సైన్యాధ్యక్షునిగా పట్టము కట్టినారు. ప్రతి  రోజు లాగానే ఆరోజు కూడా సంజయుడు ధృతరాష్ట్రుని వద్ద యుద్ధమున వీరగతినందినవారి పేర్లు ఏకరువు పెడుతూవున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సహింపలేని ఆవేదనతో సంజయునితో ఈవిధముగా అంటాడు:
"చావరు నొవ్వరు పాండవు
లేవురునని నీవు చెప్ప నిప్పలుకులు దుః
ఖావేశకరములై చే
తోవృత్తి దహింపజొచ్చె దుర్భరభంగిన్"
- పాండవులు అయిదుగురు మరణించలేదు. ఏ విధమైన బాధను పొందలేదు. అని నీవు చెప్పిన మాటలు భరించరాని దుఃఖంతో నా గుండెను మండింపజేస్తున్నాయి. ఇంతటి కుత్సితముగల్గిన ధృతరాష్ట్రుని ఎంతగా గౌరవించినాడో ధర్మరాజు మరి గమనించండి.
తండ్రి పోయిన తరువాత తమను కొంతకాలము చేరదీసినాడు ధృతరాష్ట్రుడు. అందుచేత ఆయన పిత అయినాడు. ఆ ధర్మాత్మునిలో ఆ ఒక్క కృతజ్ఞత ధృతరాష్ట్రునికి తమపై ఉన్న అసూయ ద్వేషమును చెరిపివేసింది. అంతటి సదాచార సంపన్నుడు ఆయన.
ఈ నీతి శ్లోకము ధర్మరాజు సౌశీల్యమునకు ఎంత చక్కగా ఇముడుతుందో గమనించండి.
ప్రథమ వయసి పీతం తోయమల్పమ్ స్మరంతం
శిరసి విహితభారా నారికేళ నరాణామ్
సలిల మమృత కల్పం దద్యురాజీవితాంతం
నహికృత ముపకారం సాధవో విస్మరన్తి
 మొక్కగా నున్న కొబ్బరి చెట్టు, మానవుడు పోసే నీరుత్రావుతుంది తాను పెరిగే వరకు. ఆపైనో అమృతజలనిధులను (కొబ్బరి కాయలను) నెత్తిన పెట్టుకొని తన జీవితాంతము ఆఅమృత  జలమును ఇస్తూనే వుంటుంది. సద్గుణ సంపన్నులు తమకితరులు చేసిన మేలు జీవితాంతమూ గుర్తుంచుకొంటారు గానీ చేసిన కీడును మాత్రము బహిర్గతము కానివ్వరు. ఇందుకు ఉదాహరణము కాలకూట విషమును గొంతులో, అమృతకిరణములు విరజిమ్మే ఈశ్వరుడు పై మాటకు నిలువుటద్దము.
గుణ దోష బుధో గృహ్ణన్ ,ఇందు క్ష్వేళా వివేశ్వరః l
శిరసా శ్లాఘ్యతే పూర్వం ,పరం కంఠేన యచ్ఛతి ll
ఇప్పుడు పిత కు జనకునికి గల భేదమేమిటి అని చూద్దాము. స్థూలముగా రెండింటికీ అర్థము తండ్రి అన్నదే అయినా నిరుక్తము రీత్యా ఎంతో అర్థభేదము వున్నది . జనకుడు అంటే పుట్టుకకు కారణమైనవాడు. పిత అంటే పాలించినవాడు. ఈ విధముగా సంస్కృతము ధాతుజన్య భాష అయినందున ప్రతి పదమునకూ ఒక వ్యుత్పత్తి అర్థము వుంటుంది. ఋషులకు బవిరి గడ్డం ఉంటుంది సాయబులకు  బవిరి గడ్డము వుంటుంది కావున సాయబులు ఋషులూ ఒకటే అనుట ఎట్లు చెల్లదో సంస్కృతములోని పదార్థములు  కూడా అంతే!
 సంస్కృతము పేరు వచ్చింది కాబట్టి, ఇక్కడ, సంస్కృతమును గూర్చిన ఒక  చిన్న కథ చెప్పుకొందాము. 
మిగతాది రేపు ........
వేదము-పంచమవేదము- నిర్వేదము
చివరి భాగము 
అవి సంస్కృతము చలామణి అయ్యే రోజులు. ఒక అబ్బాయి పెళ్ళిచూపులకు ఒకరింటికి వచ్చినాడు. తన తెలివితేటలను ఉపయోగించుతూ అమ్మాయిని కొన్ని ప్రశ్నలు సంస్కృతములో అడిగినాడు. అతని పాండిత్యము ఆమెకు అర్థమైపోయింది. ఆమె అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతానంది వరునితో. అలాగేనన్నాడు అబ్బాయి మాయాబజార్ సినిమాలో రేలంగి లాగా!
అహం ఏ విభక్తి అని అడిగింది అమ్మాయి. అతను సంస్కృతములో ‘రామ’ శబ్దము నేర్చుకొనుటకే చెప్పలేనంత కాలము పట్టినది. అందుకని ఇంకొక శబ్దము నేర్చుకొనకుండా నిశ్శబ్దముగా ఉండిపొయినాడు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పవలెను కదా! వెంటనే తన పాండిత్యమునంతా పునశ్చరణ చేసుకొన్నాడు. ‘రామం’ ద్వితీయావిభక్తి కాబట్టి ‘అహం’ కూడా ద్వితీయావిభక్తి అన్నాడు. ఆమె ‘కథం’ ఏ విభక్తి అన్నది. అతను వెంటనే అది కూడా ద్వితీయా విభక్తే అన్నాడు ‘రామం’ మాదిరే వున్నది కాబట్టి. ‘విహస్య’ ఏవిభక్తి అని అడిగింది. అతడు ఆ శబ్దము ‘రామస్య’ లాగా వున్నది కాబట్టి షష్టీ విభక్తి అన్నాడు. ఆమె ‘విహాయ’ అని అడిగింది. ‘రామాయ’ లాగా వున్నది కాబట్టి చతుర్థీ విభక్తి అన్నాడు. అసలు అవి అవ్యయములు. అవి కేవలము ‘రామస్య’ రామాయ’ లాగా వినిపిస్తూ వున్నాయి. అవి భాషలో ఎక్కడా మార్పు చెందకుండా వుంటాయి. అతని పాండిత్యము ఆమెకు అర్థమైపోయింది. అప్పుడు ఆ వరునికి ఆమె ఒక శ్లోకమును వినిపించింది, అది ఈ క్రింది విధముగా వుంది.
యస్య విహస్యచ విహాయచ షష్టీ చతుర్థీచ l
అహం కథం ద్వితీయాస్యాత్ తస్యమహం కథం ద్వితీయాస్యాత్ ll
ఏ మొద్దుబుర్రకయితే ‘విహస్య’ ‘విహాయ’ షష్టీ చతుర్థీ విభక్తులో ‘అహం’ ‘కథం’ ద్వితీయావిభక్తులో అటువంటి వాడిని ‘అహం’ అంటే నేను ‘కథం’ ఏవిధముగా ‘ద్వితీయాస్యాత్’ అర్ధాంగినౌతాను అన్నది. తరువాతి కథ మీ ఊహకే!
ధర్మరాజు గొప్పదనము ఇంకా వినండి. ఆశ్రమవాసమునకు సిద్ధమౌతారు ధృతరాష్ట్రాదులు. అప్పుడు ఎంతగానో విలపించుతూ ధర్మరాజంటాడు ‘మీరు లేని రాజ్యము నాకేల. మీతోడిదే లోకము’ అని ఎంతగానో చెబుతాడు. అప్పటికే మారిన మనస్సు కలిగివాడయిన ధృతరాష్ట్రుడు ధర్మజునికి నచ్చజెబుతాడు.  ఎటువంటి ధర్మనిష్ఠాగరిష్ఠుడో ధర్మరాజు చూడండి. మరణించిన మహామహులకందరికీ పితృకార్యములు తాను జరుపవలేనంటే, భీముడు ఎదురు తిరుగుతాడు. ఈ ఒక్క సందర్భములోనే ధర్మరాజు కోపగించినట్లు వ్యాస భారతము ద్వారా మనకు తెలియవస్తుంది. ఆ సమయమున తన కోపమునంతా దిగమ్రింగి’జోశామాస్వ’ అంటే  ‘నోరు మూసుకో’ అన్నాడట ధర్మమూర్తి. కోపగించిన భీముని అర్జనుడు శాంతింపజేస్తూ ఎంత గొప్ప నీతి చెబుతాడో చూడండి.
 నస్మరన్త్య పరాద్ధాణి స్మరన్తి సుకృతాన్యపిl
అసంభిన్నార్య మర్యాదాః సా భవః పురుషోత్తమాll  
శ్రేష్ఠులగు మన పెద్దలు చెప్పిన పాడుచేయబడనటువంటి మాటలనెప్పుడూ మరువ కూడదు. అట్టి ఆర్య మర్యాదను పాటించినవాడే పురుషోత్తముడౌతాడు అని అర్జనుడు భీమునికి చెబుతాడు.
అప్పుడు భీముడు ఉపశమించితే, ఎంతయినా ఖర్చుపెట్టి చేయమంటాడు ధర్మరాజు. ఎంత గొప్ప నీతి దాగియున్నదో మన పురాణేతిహాసములలో చూడండి.
భారతములో మనకు దొరకని నీతి లేదు. లోకములో మనకు కలిగే ప్రతి అనుభావమునూ కథాపరమైన పాత్రల రూపములో మనము భారతములో చూడగలము. ప్రపంచములోని ఏ విషయమయినాగానీ ఇందులో వుండేది ఎక్కడయినా ఉండవచ్చును గానీ ఇందులో లేనిది ఎక్కడా ఉండదు అన్న సవాలు విసిరి భారతమును మనకందించిన ప్రాతః స్మరణీయుడు వేదవ్యాసులవారు. ఆయన మాటలలోనే చదవండి.
ధర్మే చార్దే చ కామేచ మొక్షేచ భరతర్షభ l
యది అస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్ ll
ఇంతటి ప్రజ్ఞ గల కవి, రచయిత, పండితుడు ప్రపంచములోని ఏమూలనా దొరకడు.
భారతము నీతినిధి. ఈ నీతివాక్యము సరమ అన్న కుక్కచేత చెప్పబడుతుంది. ఎంతటి వాస్తవవిషయమో గమనించండి.
తగునిది తగదని యెదలో
వగవక , సాధులకు బేదవారల కెగ్గుల్
మొగి జేయు దుర్వినీతుల
కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్ .

మహాభారతారంభంలో నన్నయ రాసిన పద్యమిది . ఇది తగిన పని , ఇది తగని పని అని అలోచించకుండా పేదవారికి , శాంతి మార్గంలో చరించే సాధువులకూ అపకారం కలిగించే వారికి నిమిత్తం అంటే కారణం లేకుండానే ఆపదలు వస్తాయి అని ఈ పద్యానికి అర్థం .
జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల శునకం అయిన సరమ కుమారుడు సారమేయుడు వచ్చి ఆడుకొంటూ వుండగా జనమేజయుని కుమారులు ఆ కుక్క పిల్లను కొట్టి తరుముతారు. సారమేయుడు ఏడుస్తూ తల్లి వద్దకు పోయి ఈ విషయం చెప్పగా సరమ జనమేజయుని వద్దకు వచ్చి ” జనమేజయా ! నీకుమారులు విచక్షణా రహితముగా నా కుమారుడిని కొట్టినారు. యుక్తా యుక్త విచక్షణ లేకుండా మంచి వారికి గాని సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు తప్పక ఎదుర్కొనవలసి వుంటుంది.” అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఇక విదురనీతిలో చెప్పలేనన్ని సూక్తులను వినవచ్చు.
అసలు ధర్మరాజునుండి వినయము, విధేయత, నిరహంకారము, ఉచితజ్ఞత, ధర్మాధర్మ విచక్షణ, కృతజ్ఞత మొదలగు ఎన్నియో లక్షణములను అలవరచుకోనవచ్చు.

ఇక ఆచార్య డా. శలాక రఘునాథ శర్మ గారు పిన్నవయసుననే ఎంతో నమ్రతతో  చెప్పిన ఒక శ్లోకమును ఇక్కడ ఉటంకించుతూ ఈ వ్యాసమును ఇక్కడ ముగించుతాను.
రామాయణంవా యది భారతంవా పఠేత్ మనుష్యః నరతాముపైతిl
న కేవలం దైహిక మానుషత్వం దదాతి కశ్యాపిచ సౌమనస్యంll
రామాయణ భారతములను పఠించిన నాడే మానవుడు నరుడు అంటే శ్రేష్ఠుడౌతాడు. కేవలము రక్తమాంస రూప ధారణచే ప్రాణముతో భూమిపై సంచరించవచ్చుగానీ అతనికి సౌమనస్యం సంప్రాప్తించదు.
మనసు చెదరనీకు మనుగడ పోనీకు
నీతి నియమములను నిలిపి యుంచు
చేయి జార్చుకొన్న చెడిపోయెదవురన్న
రామమోహనుక్తి రమ్యసూక్తి
స్వస్తి.



Saturday, 10 November 2018

ఖగోళము - ఆశ్లేష నక్షత్రము (https://cherukuramamohanrao.blogspot.com/2018/11/blog-post.html)


ఖగోళము - ఆశ్లేష నక్షత్రము
(https://cherukuramamohanrao.blogspot.com/2018/11/blog-post.html)
నేను ఆశ్లేష నక్షత్రమును గూర్చిన వివరములను ఖగోళ పరముగా తప్ప జ్యోతిష పరముగా విశ్లేషించుట లేదు.
ఆశ్లేష నక్షత్రమునకు  అధిదేవత పాము. అది ఎట్లు అన్నది ఒకసారి గమనించుదాము. ఆచార్య వరరుచి భూమినుండి ఆకాశములోని ఆశ్లేషా నక్షత్రమును జూసి 'సర్ప ఋతుఅన్నాడు. భారతీయు గణిత శాస్త్రములో భూత సంఖ్యలుకటపయాది సంఖ్యలను గూర్చి సవిస్తారముగా నేను మన పూర్వులు π” విలువను "గోపిభాగ్యం...." అన్న శ్లోకములో ఏవిధముగా బంధించినారు అన్నవిషయమును తెలుపుటకు ముందు, తెలిపినాను. భూత సంఖ్యలలో మనకు ఎరుకలోని ఒక విషయము ఏ సంఖ్య లేక అంకెను తెలుపుతుందోఆపేరును వాడినపుడు ఆ అంకెను లేక సంఖ్యకు ప్రతీక వుండే సంజ్ఞను తీసుకొంటాము. ఉదాహరణకు ఋతు అంటే 6, ఋషి అంటే సప్తర్షులు 7, ఆవిధముగా.
ఆశ్లేష విషయములో వరరుచి గారు సర్ప ఋతు అని వాడినారు. సర్ప అంటే పాముఅది వంకర టింకరగా వుంటుంది. ఋతు అంటే ఋతువులు. అవి ఆరు. అంటే మొత్తము అర్థమును క్రోడీకరించితే ఆశ్లేషా నక్షత్ర సముదాయము 6 నక్షత్రములను కలిగి పాముచుట్ట ను బోలి లేక పామువలె వంకరటింకరగా వుంటుంది అని గ్రహించవచ్చు. ఈ విషయమునే దీపికాకారుడు 'చక్రాకృతిః షణ్ణక్షత్రాత్మకంఅన్నాడు. ఇదే విషయమును వేదము 'ఆశ్రేషా నక్షత్రం- సర్పో దేవతాఅంటూవుంది. ఇంకా 'తేన సర్పాసో హవమాగమిష్టాః – ఏ రోచనే సూర్యస్యాపి సర్పాఃఅని చెబుతుంది. దీనినిట్లుంచి సూర్యుని విషయమును గూర్చి పాశ్చాత్యుల పరిశోధనలను ఒకసారి చూద్దాము.
మనము భౌతిక శాస్త్రము(Physics)లోని కాంతి శక్తి (Light Energy) లో కాంతికిరణము ఒక గాజు పట్టకము(Glass Prism) గుండా పయనించినపుడు వర్ణవికిరణము(Divergence of Light) జరిగి VIBGYOR అన్న 7 రంగులుగా మారుతుందని చదివియుంటాము.
(Intermediate కు వస్తే 10th Syllabus గుర్తుంచుకోనక్కరలేదు అన్న మహనీయుల నీతివాక్యము విన్న వాడిని కాబట్టి, ఆ కోవకు చెందిన వారికి బహుశ ఇది గుర్తుండక పోవచ్చునని సంశయించుచున్నాను.)
1670 ప్రాంతములో అంటే 17వ శతాబ్దములో కాంతికిరణమును గూర్చి విస్తారమయిన ప్రయోగములు చేసి జగతికి చాటినవాడు న్యూటన్. దీనిని Corpuscular Theory అంటారు. Corpuscle అంటే ఒక అతిచిన్న పొట్లము (Packet) గా అనుకొనవచ్చు.  అంటే ఒక కాంతి కిరణము సూర్యునినుండి కొన్ని కోట్ల కోట్ల  పాకెట్స్ గా అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన, ఒక packet కు ఇంకొక packet కు గల, మధ్య దూరముతో సరళ రేఖలో  ప్రయాణము చేయుచున్నట్లు ఆయన ప్రతిపాదించినాడు. ఆయన తన ప్రతిపాదనను, పరావర్తనము, వక్రీకరణ సిద్ధాంతములతో సమర్థించుకొన్నాడు. అదే 1678 ప్రాంతములో Hygiene అనే Dutch Scientist వెలుతురు కిరణములు తరంగముల రూపములో పయనించుచున్నట్లు తెలిపినాడు. దీనిని Interfearence మరియు Difraction అన్న సిద్ధాంతాల సహకారముతో ఆయన తన వాదనను సమర్థించుకొన్నాడు.
ఒకే కాలము వారయినాకూడా తమ తమ సిద్దాంతముల మధ్య సమన్వయ సాధనకు వారు కృషి చేయలేదు.ఎవరి సిద్ధాంతమునకు వారు కట్టుబడి మొండిగా కూర్చొని ఉండిపోయినారు. పరిష్కారమునకన్నా పట్టుదల ముఖ్యమనుకొన్న మహనీయులు వారు. ఇందులో కూడా మనకు Newton పేరు మాత్రమే తెలుసు Hygiene మనలో చాలామందికి అగంతకుడే! దీనిని బట్టి Newton వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తకు స్వార్థము, అర్థము(ధనము)  తప్ప లోకహితార్థము లోపించినదని అర్థమగుట లేదా!
మిగిలినది మరొకసారి......
             ఖగోళము - ఆశ్లేష నక్షత్రము
                                 (2వ భాగము) 
ఈ పరస్పర వైరుధ్యములచే సమస్య సందిగ్ధముగానే ఉండిపోయినది 19వ శతాబ్దము వరకు. 
 Einstein 19వ శతాబ్దములో పై రెంటినీ సమన్వయము చేస్తూ Quantum theory ని ప్రతిపాదించినాడు. ఒక నావంటి పామరునికి అర్థమయ్యే రీతిలో చెప్పవలసి వస్తే ఈ corpuscles అన్నీ ఒకదానినొకటి ఆనుకొని తరంగ రూపములో పోతున్నాయి అన్నది ఈ ప్రతిపాదన. అంటే ఒక 12౦ సంవత్సరాలుగా ఇది Scientists అంగీకరిస్తున్న విషయము. అంటే అంతకు ముందుకాలము వరకు అయోమయావస్థలోనే ఆలోచనలను కలిగియుండినారు. ఇపుడు గ్రహ, గ్రహణ సంబంధితమైన వివరములు, వివరణలు ఈ సిద్ధాంతముననుసరించియే లోకమునకు చాటబడుచున్నవి. మన మహర్షులు ఈ విషయమును ఎన్నో లక్షల సంవత్సరముల క్రితము, అపౌరుషేయములైన మన వేదములలో చెప్పిన ఈ మాటను, మనకు అందించినారు. ఇంతటి విషయమును పాశ్చాత్యులు 12౦ సంవత్సరముల క్రితము మాత్రమే పుష్టి చేసుకొనగలిగినారు.
ఇపుడు మన వేదశాస్త్రములలో ఏమని తెలిపినారో ఒకసారి పరిశీలించుదాము.
అంతకన్నా ముందు శాస్త్ర చోదితమైన ఈ విషయమును గమనించండి.
రథస్యేకం చక్రం భుజగయమిత సప్తతురంగః
నిరలంబో మార్గః చరణరహితహ్ సరథిరపి.
 రవిర్యార్తేవంత్యం  ప్రతిదినమపారస్య నభసః 
క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే.    

రథానికి చక్రమా ఒకటే!, కళ్ళెములా పాములు,గుర్రములా ఒకటి కాదు ఏడూ, మార్గమా సరళరేఖ కాదు, సారధి చూస్తామా అసలు కాళ్ళే లేవు, అయినా సూర్యుడు లోకానికి వెలుగు పంచుటకు తాను ప్రతిరోజు ఆ కష్టాన్ని అనుభవించుతూనే వున్నాడు/ఉంటాడు. మహనీయులు కేవలము ఆశయము-ఫలితముపై ధ్యాసనుంచుతారు కానీ తమకు కలిగే కంటకాలను గూర్చి కాదుఅన్న విషయాన్ని అక్షరాలా పాటించి ఉన్నతి సాధించిన శ్రేష్ఠులను  ఆదర్శముగా తీసుకుని వీరు అడుగు ముందుకు వేయటం జరిగింది.
శ్లోకార్థము అంతా మనకు ఈ సందర్భములో అవసరము లేదు. కావలసినది మాత్రమె తీసుకొందాము. పైశ్లోకములో ఎంత నిర్ద్వంద్వముగా, నిశితముగా  నిస్సంకోచముగా, చెప్పినారో గమనించినారు కదా! చక్రము ఒకటే అంటే రథము ఒక చక్రముతో నడువలేదు. ఒక వేళ రథమునకు మధ్యలో ఉంచితే నడువవచ్చునుు
అనుకొంటే నిశ్చలత లోపిస్తుంది, అంటే సూర్యుడు రథములో ఉంటాడు కానీ  కదలడు. చక్రమా కాలచక్రము. అది తిరుగుతూనే ఉంటంది, stand వేసి pedal త్రోక్కుతూవుంటే తిరిగే cycle చక్రము లాగా! ఇక సారధికి నడుము వరకే శరీరము. అతనూ కదలడు. 7 గుర్రములు, వర్ణ వికిరణము చెందే 7 రంగులు. పగ్గాలు పాములుఅంటే వంకరటింకరగా వుంటాయి. ఇంతకంటే గొప్పగా ఏ scientist కూడా చెప్పలేదు సూర్యుని గూర్చి.
అంతటి గొప్ప విషయములు చెప్పినవారు ఎల్లపుడూకిం అర్థం దుఃఖబాజనం అనుకొన్నారు. అందుకే patent అన్న ఊహ కూడా వారికి రాలేదు.
మనము ఈ పాము నడకను బోలిన వెలుగు కిరణ ప్రయాణమును వేదములో ఏ విధముగా వర్ణింపబడినదో ఇపుడు చూద్దాము.
ఖగోళము - ఆశ్లేష నక్షత్రము (చివరి భాగము)
భుజగ నమితాః సప్త తురగాః
ఏదో రోచనే దివో, ఏవా సూర్యస్య రశ్మిషు
ఏషామప్సుషదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః   (Time 15.25)
ఇక్కడ పైన చెప్పిన భుజగ నమితాః సప్త తురగాః అన్నది తీసుకొంటే ఏడు గుర్రములు పాములవలే, వంకరటింకరగా, వంగి వున్నాయి. ఇక రెండవ వచనములో సూర్యస్య రశ్మిషు అన్న మాట వస్తుంది. రశ్మి అంటే కళ్ళెము మరొక అర్థము కిరణము. కిరణము అన్న అర్థము మనకు తెలిసినదే!
ఏడు గుర్రములకు కళ్ళెములు పాములు కదా! అవి  నిటారుగా వుండవు కదా! నిటారుగా వుంటే గుర్రములు నిలచిపోతాయి.
మరొక ఆశ్చర్యకరమగు వాస్తవమును పరిశీలించుదాము. జాతకాలు వ్రాయునపుడు రాశి, అంశ చక్రములను వేస్తాము. అందు మనము రాశి చక్రమును గమనించితే ఆశ్లేష నాలుగు పాదములు కర్కాటక రాశికి చెందుతాయి. ఆ చక్రములో దానికి పూర్తి వ్యతిరేక దశలో మకర రాశి వుంటుంది. మకరములో శ్రవణా నక్షత్రము తన నాలుగు పాదములనూ కలిగియుంటుంది. శ్రవణము విష్ణుమూర్తి నక్షత్రము. విష్ణువు వుంటే గరుత్మంతుడు అక్కడ వున్నట్లే! ఇందుకు సంబంధించి మనకు విష్ణు సహస్రనామములో 21వ శ్లోకము ఈ విధముగా వుంది.
మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు విభూతి యోగములో తనను గూర్చి ఈ విధముగా చెప్పుకొన్నాడు.
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్|
మృగాణాం చ మృగేన్ద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్  || 10-30 ||
నేను దైత్యులలో ప్రహ్లాదుడీనిలెక్కలు కట్టేవాళ్ళల్లొ కాలాన్నిమృగాలలో మృగేంద్రుడినిపక్షులలో గరుత్మంతుడిని.
గరుత్మంతునకు  సుపర్ణ అన్నది ఒక పేరు. ఈయన పక్షులకు రాజు. వైనతేయుడు అన్నది కూడా గరుత్మంతునియొక్క మరొక పేరు.అఖిల చరాచర జీవరాశులలో ఏదయితే శ్రేష్ఠమో అది శ్రీ మహావిష్ణువే! ఆవిధముగా ఒకే స్వరూపమును వేర్వేరు పాత్రలు అనగా శ్రీకృష్ణుడు, భీష్ముడు తెలియజెప్పినా అందు అభిప్రాయ భేదములు లేవు. అదే విధముగా నాగులలో శ్రేష్ఠుడగు అనంతుడు కూడా విష్ణ్వంశ సంభూతుడే!
మరి గరుడునికీ నాగులకూ వైరము కదా! ఇక్కడ ఈ విషయమును ఖగోళ పరముగానూ, కొంత లౌకికముగానూ చర్చించుదాము. గరుడుడు విష్ణు వాహనమే! ఆయన ప్రయాణమునకు ఉపయోగపడుతాడు.పరమాత్మ యోగములో ఉన్నపుడు ఆయన సమయమంతా అనంతునితోనే.
ఆశ్లేషా నక్షత్రము సర్పాకారము అని నిర్దారించుకొన్నాము. ఆశ్లేషా నక్షత్రము కర్కాటక రాశికి చెందినది. అదేవిధముగా విష్ణువు నక్షత్రము శ్రవణము. ఇది మకరరాశికి చెందినది. ఈ రెండు రాశులూ ఎల్లపుడూ 18౦డిగ్రీల కోణములో వుంటాయి. మరి సర్పము విష్ణు నక్షత్రమునకు సరళరేఖలో (180 డిగ్రీలు) ఉంటె విష్ణువు గరుత్మంతునితో ఉన్నట్లే కదా! కావున సుపర్ణుడగు విష్ణువు భుజగోత్తముడగు విష్ణువునకు 180 డిగ్రీల కోణములో వున్నాడు. సాపేక్షముగా ఈ రాశులు క్షితిజము నుండి ఉద్భవించి 180 డిగ్రీల కోణమును పాటీంచుతూ పయనించుచుంటాయి. అంటే మకరము పుట్టే సమయమునకు కర్కాటకము అస్తమించబోతూ వుంటుంది. అంటే గరుడుని చూస్తే పాము కనుమరుగౌతుంది అన్న లౌకిక, ప్రాకృతిక వాస్తవము ఇక్కడ ప్రతిఫలించుతూ వున్నది.
ఒక కర్కాటక రాశియేగాక సింహ,కన్య, తులా రాశులు కూడా సర్పాకృతి కలిగియుండుటతో అంతాకలుపుకొంటే అది మహా సర్పమౌతుంది. ఆవిధముగా ఆ ఆకృతిని ఆదిశేషునిగా ఊహించవచ్చు. ఆవిధముగా మనకు పై విషయములు అన్నింటికీ సమన్వయము కుదురుతుంది.
మరొక విషయమును గమనించుదాము.

ఒక దినము యొక్క సూర్యోదయాత్ ఏ నక్షత్రము ఉదయించుతుందో ఆ నక్షత్రము యొక్క అధిదేవత యొక్క వ్రతమును, పూజను, పండుగను పాటించుతారు. ఉదాహరణకు భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక వ్రతమును ఆచరించుతాము. మనకు తెలిసిన 27 నక్షత్రములు గాక ఆకాశములో అనంత నక్షత్ర సముదాయాలున్నాయి. వానిలో వినాయక నక్షత్ర సముదాయమొకటి.
తరువాతి రోజయిన పంచమిని మనము ఋషిపంచమిగా గుర్తించి ఆచరించుతాముఖగోళ విషయములో ఋషి అంటూనే మనకు జ్ఞాపకమునకు వచ్చేది సప్తర్షి మండలము. ఇది 27 నక్షత్రమండలములలో లేకున్నా దీనికి కూడా ఉదయాస్తమానాలు వుంటాయి. ఆశ్లేష తరువాత వచ్చే మఖ నక్షత్రముతో బాటూ ఇవి కూడా చవితి తరువాతి రోజు అనగా పంచమి రోజున ఉదయించుతాయి కాబట్టి ఆరోజు ఋషి పంచమి అయినట్లే చవితి రోజు వినాయక నక్షత్రములు కూడా అత్యంత స్వల్ప భేదముతో ఆశ్లేషకు ముందు ఉదయించుటచే వినాయకుని జన్నిదమయినది సర్పాకృతి కల్గిన ఆశ్లేష. అదే మాటను మనము శ్రీ గణనాధాష్టకము లోని ఈ శ్లోకములో చూచుటయే గాక
ఈ శ్లోకము వేదవాక్కును సమర్థించుట కూడా చూస్తాము.
శ్లోll ముంజీ కృష్ణమృగాజినధరం నాగయజ్ఞోపవీతం
     బాలేందు సకళా ద్మౌళే వందేహం గణనాయకం 2
పై శ్లోకమును నాగ యజ్ఞోపవీతనం అన్న వేదవాక్యము ఈ విధముగా పుష్టి చేయుచున్నది.
ఎంతటి విజ్ఞానమో గమనించినారు కదా! పరమతములలో వలె, వాళ్లకు ఉన్నాయి కాబట్టి మనకు వువుండవలెనను రీతిలో ఏర్పడినవి కావు. మన పండుగలు శాస్త్రార్థము సమన్వయము సహేతుకము అగు పర్వదినములు. 
అంతో ఇంతో ఎంతో కొంత తెలిసిన వారు, లేక, నాలాంటి తెలుసుకొన్నవారు చెబుతున్నపుడు మనసు పెట్టి చదవండి. ఉబుసుపోకకు ఊకదంపుడు కబుర్లు చెప్పుట లేదు. మన పూర్వుల ప్రతిభ గుర్తించండి.
చర్మ చక్షువులను జ్ఞాన చక్షువులుగా చేసి Telescopes(దుర్భిణులు) యొక్క సహాయము లేకుండా చూడగల్గిన మన సనాతన ఋషిగణమునకు మనఃపూర్వకముగా సాష్టాంగ దండప్రణామము తప్ప వేరేమి చేయగలము.
స్వస్తి

Monday, 22 October 2018

ఇది ఒక భీకర రణము పెనుగాలిది చిరు దివ్వెది

https://youtu.be/kKl3oDahI1s


ఇది ఒక భీకర రణము పెనుగాలిది చిరు దివ్వెది

https://cherukurammohan.blogspot.com/2018/10/blog-post.html
రఘురాముని శౌర్యము కాదిదీ
కురు పాండవ  యుద్ధము కానిదీ
ఇది ఒక భీకర రణము
పెనుగాలిది చిరు దివ్వెది

నింగిని మింగెను గాలి దుమారము
ఉప్పెన ఉరికెను ముంచగ తీరము
తరువుల తనువులు భువిపై వాలెను
చూడగ ఎంతో హృదయ విదారము
తీరగ నేరదు ఈ విచారము
మంచిని ముంచుటయే మరి లోకాచారము ఔనుగా
జీవులు నెలవులయందే నిలిచెను
మెదలక వదలక దేవుని తలచెను 
చీకటి గట్టి గోడల కట్టి యుంచిన సీమలో
ఇది ఒక భీకర రణము
పెనుగాలిది చిరు దివ్వెది

ఆకటి మంట మింటికి ఎగసె
కాలే కడుపుకు తానూ తోడుగ
జీవజాలమంతా మలమలలాడుచునుండగా
ఆశల వెలుతురు తా కలిగించెను
దేవుని దూతది ఎవరో గానీ
దివ్వెకు ప్రాణము పోసె ప్రాణుల ఆశలు తీరగా
చీకటి నొక తృటిలోనే చిదిమెను
ఆ చిరుదీపము కరవాలముతో
ఆదేవునిదే ఈ లీలా విధివిధానమూ
ఇది ఒక భీకర రణము
పెనుగాలిది చిరు దివ్వెది

చేయి విడిచినది ఈ లోకము
ఆరిపోయినదీ అనురాగము
తైలము ఆవిరియౌతూ ఉండిపోగా సర్వమూ
శక్తిని కూడదీసుకొంది
చావుకు భయపడనని తానంది
గాలికి రెపరెపలాడీ  రొమ్ము విరిచి యున్నది
దేవుని పైనే నమ్మకముంచి  
ప్రాణము తప్పకనిలుపున నెంచి
ఆ విశ్వాసము వెలుతురు లోపల నింపెనూ
ఇది ఒక భీకర రణము
పెనుగాలిది చిరు దివ్వెది

ఒక అవ్వ ముదుసలి గువ్వ
గాలీ వానల సరుకే చేయక
దివ్వెకు ప్రాణము పోసేను వేయుచు దానికి తైలము
దీపము క్రొత్త ఉత్సాహముతో
చిమ్మెను కాంతి దిక్కుల నిండా
చీకటి ప్రాణము, వెలుతురు చేతిన మశియై పోయెను
గాలికి చేతలుఉడిగీ పోయెను
చేతులు ముడుచుకు వెనుకకు తగ్గెను
చిరుదీపమే మరి చివరకు నెగ్గెను
ఇది ఒక భీకర రణము
పెనుగాలిది చిరు దివ్వెది

దేవుని తోడు వుంటే చాలును
చేయును అదియే అంతామేలను
వాస్తవమ్మును జగతికి చాటెను
దారుణ రణమీ విధముగ ముగిసెను
శాంతి సుఖమే చివరకు మిగిలెను
చెడుపై మంచే గెలిచెను చివరకు చూడగా
ఉంచిన నమ్మకమాదేవునిపై
ఇంచుక ఉంచక భారము మనపై
అంతా తానెయౌచూ మనలను బ్రోచునూ
ఆయన వీక్షణమే మన
రక్షణయౌచూ కాచును     llరఘురామునిll