Saturday, 25 November 2017

శ్రీ గురుభ్యోన్నమః - కందుకూరి శివానంద మూర్తి గురువు గారు

శ్రీ గురుభ్యోన్నమః


గురువుగారిని గురించి తెలుసుకోవడం, ఎవరికి వారికి ఒక కాక తాలీయమైన సంఘటన ద్వారా జరిగినా, దాని వెనుక, ఒక జననాంతర సంబంధంఉంటుంది. నావిషయంలో నాకు గురువుగారితో పరిచయానికి కారణం నా వివాహం. గురువుగారి నాన్నగారు నాభార్య మేనమామగారు. ఆయన, గురువుగారి తల్లి నాకు కన్యాదానంచేశారు. పెళ్ళిలో ఆయనను చూచినా కలుసుకునే అదృష్టం మరో ఆరు సంవత్సరాలకు గాని జరగలేదు.. అది కూడా అనుకోని సంఘటనే. వరంగల్ RECలో ఒక సమావేశానికి బయలుదేరివెళ్తుంటే, మా బావ గారింటికి వెడదామని నాభార్యకూడా ప్రయాణమయినది. అదే వారింటికి మొదటిసారి వెళ్ళడం. తరువాత ఆయన తో పరిచయం నాజీవితంలో ప్రతిఘట్టాన్నీ ప్రభావితంచేసినది. ఆయన గురువు. జగద్గురువు. ఆనందవన శివుడు.
V.V.S. Sarma

ఈ లేఖనమునకు స్పూర్తి VVS శర్మ గారి ప్రచురణ. వారికి నా ధన్యవాదాలు .

కారణ జన్ములైన గురువుగారిని గూర్చి తెలియడము బ్ర.శ్రీ. సామవేదం షణ్ముఖ శర్మ గారి ద్వారానే. వారు ,నేను చెన్నపట్టణం లో విరుగంబాక్కం లో వుండేవాళ్ళం. వారి ఋషిపీఠము మొదటి నెల ప్రతి నేను చూసినవెంటనే శర్మ గారికి ఫోను ద్వారా నా అభినందనలు తెలియబరచి ,నాకు అందుబాటులోవున్న సరస్వతీదేవి విగ్రహమును తీసుకొని, వారు చెప్పిన చిరునామా ప్రకారము వారి ఇంటికి ,శాశ్వత చందా చెక్కు తీసుకొని బయలుదేరివెళ్లి ఆయనను కలిసిన మొదటిరోజు మరువలేను. 'దదాతి ప్రతిఘృణ్ణాతి ...' అని చెప్పినారు పెద్దలు . సహవాసము కోరువారు శక్తిమేరకు సంతోషపూర్వకముగా ఇచ్చిపుచ్చుకొనుట జరుపవలెను. అది సాంప్రదాయము. నేను ఇచ్చిన సరస్వతీ ప్రతిమకు ప్రతిగా వారు ఇచ్చిన 'నీలకంఠేశ్వర శతకము' 'అగ్ని'శివపదము' పుస్తకము మరియు కేసెట్టు (c.d. లు అప్పుడు లేవు) ఇప్పటికీ నేను భద్రపరచుకొన్న అపురూపమైన వస్తువులు. చెక్కు వారికి ఇచ్చి దాదాపు ఒక గంట మాటలాడి తిరిగి ఇల్లు చేరినాను. అప్పటినుండి అప్పుడప్పుడు మా మధ్యన రాకపోకలుండేవి . ఒకరోజు 7,8 గంటల సమయము దంపతీ సమేతముగా, మాతోగడిపి మా ఆతిథ్యమును స్వీకరించినరోజు మేము మరచుటకు వీలుకాదు. ఎన్నోమార్లు వారి ఇంటికి నేను పోయినపుడు వారి మిత్రులెందరి తోనో పరిచయము చేయుటయే గాక ఎన్నో ధార్మిక విషయముల గూర్చి మాతలాడుకొనే వాళ్ళం. వారి మొదటి ఉపన్యాసము మొదలు చేన్నపట్టణమున జరిగిన ప్రతి ఉపన్యాసమునకు వారు నాపై అభిమానముతో పిలువడము నేను వేడలడము జరిగినది.
కాలాంతరములో వారు హైదరాబాదు రావటము పిదప ఒక ఏడాది తరువాత నేను రావడము తటస్తించినది కానీ కలియ వీలు పడలేదు. తిరిగీ నా 'రామమోహనుక్తి రమ్యసూక్తి'కి పరిచయ వాక్యాలు వారు వ్రాస్తే నా మనసుకు తృప్తియని తలచి వారి వద్దకు వెళ్ళినాను. వారి గౌరవ సంపద ఎంతపెరిగినా వారి ప్రేమాభిమానములలో మంచిమనసులో మార్పు రాలేదు. తన కార్యభారము కొండంత వున్నా నా కోరిక తీర్చిన అభిమాన మూర్తి ఆయన.
ఇప్పుడు వారిని కలియుట అంట సులభము కాదు పైగా వారున్న చోటుకు నేనున్నా చోటుకు చాలా చాలా దూరము. అందుకే ఎప్పుడూ ఆ అనుభవాలే మదిలో మెదలుతూ వుంటాయి.

'దూరస్తోపి సమీపస్తో యోవై మనసి వర్తతే
యోవై చిత్తేపి దూరస్తో సమీపస్తోహి దూరతః' అన్నది పెద్దల మాట.
ఎవరైతే మనసులో నిలచిపోతారో వారు దూరమున్నా దగ్గర ఉన్నట్టే. ఎవరైతే మనసులోలేరో వారు దగ్గరున్నా దూరమైనట్టే.

వే. షణ్ముఖ శర్మ గారిని మొదట కలిసినప్పుడు మాటల మధ్యలో గురువు గారి ఆశీస్సులతోనే ఈ ఋషి పీఠం పత్రిక్జ ప్రారంభము చేసినట్లు చెప్పినారు. అటుపిమ్మట గురువుగారి వాక్కులు పత్రికలో చదువుట మొదలుపెట్టి మానసికముగా నా నడయాడే గురువుగా వారిని భావించినాను. నా అర్ధాంగికి అకస్మాత్తుగా ఒక పెద్ద ఆపరేషన్ చేయవలసి వచ్చింది. హైదరాబాదులోని ఒక పేరుమోసిన హాస్పిటలుకు పొతే 15,000 రూపాయలవరకు టెస్టులకే జమకట్టించుకొన్నారు. నా మనసుకు వారి వ్యాపార దృక్పథము నచ్చక నాకు పుత్రికా సమానమైన Dr. లలిత(M.D.) కి ఫోన్ చేస్తే ఆమె తత్కాల్ లో టికెట్టు బుక్ చేసుకొని బయలుదేరి వెంటనే రమ్మని చెప్పింది. నేను అదేవిధంగా చేసినాను. ఒక ఆదర్శ ప్రాయమైన వ్యక్తిని గూర్చిన తలంపు వచ్చినపుడు ఎందుకు ఆదర్సప్రాయురాలో చెబితే బాగుంటుంది. మేము హైదరాబాదులో బయలుదేరిన రాత్రే ఆమె భర్తకు పెద్ద అచ్సిదెంటు జరిగి విశాఖ సెవెన్ హిల్స్ హాస్పిటల్ లోని ఇంటెన్సివ్ కేర్ లో చేర్చినారు. దానికితోడుగా ఆమె మరిది(భర్త స్వంత తమ్ముడు)అదే రోజు చనిపోయినాడు. అయినా ఆమె తన మాట వెనుకకు తీసుకోకుండా, స్నేహితులు వారించినా వినకుండా మమ్ముల రప్పించి అటు ఇటు అన్నివిషయములనూ సమర్తవంతముగా నిర్వహించిన ధీరోదాత్త ఆమె. ఇన్నివుండీ మాకు మంచి జరుగవలెనని తన వాహనములో గురువు గారి వద్దకు తన వాహనములో పిలుచుకొని పోయినది.
భీమిలి ఐతే చేరినాము కానీ సమయము ముగిసినది గురువుగారు దర్సనానికి అందుబాటులో లేరని చెప్పినారు. నిరాశకు గురియైనమాకు ఒక వటువు కనిపించి నేను తీసుకు వెడతాను రండి అని పిలుచుకుపోయినాడు. స్వామిని తనివితీరా చూసినాము. భాగ్య వశమున గురువుగారితో మాట్లాడే అదృష్టం దొరికింది. నా శ్రీమతిని విశాఖకు పిలుచుకు వచ్చిన కారణం చెబుతూనే చింత పడవలసినది లేదు. ఆపరేషన్ సక్సెస్ అయి చక్కగా కోలుకొంటుంది అన్నారు. వారి ఆశీర్వాదము భగవదనుగ్రహము Dr. లలిత అభిమానము ఆవిడను ఈ ఎకాకికి దక్కించినాయి . నేను గురువుగారితో నాకేదైనా మంత్రోపదేశము చేయమని అర్థించినాను. వెంటనే వారు పంచాక్షరి చేస్తున్నారుకదా అదే కొనసాగించండి అన్నారు. తల ఊపుత తప్పించి నా నోట మాట రాలేదు. కృతజ్ఞతతో నాగుండె నిండిపోయింది. ఇక Dr. లలితా భర్తను గూర్చి కూడా నేనే అడిగినాను. ఆయన i.c.u. లో వున్నట్లు ముందే చెప్పినాను కదా, ఇక ఒక డాక్టర్ గా ఆమెకు తనభర్తది ఎంత విషమ స్థితియో ఆమెకు తెలుసు. ఆమెకు ఎక్కువగా నమ్మకము కూడాలేదు. గురువుగారు ప్రశాంత చిత్తముతో భయపడవలసిన అవసరము లేదు ఇబ్బందులను దాటుకొని నయమౌతాడని చెప్పినారు. ఆయన నిజంగానే మృత్యుద్వారమునుండి వెనుదిరిగినాడు . ఇది వారి దయాచిత్తదర్శనము .
వారిని గూర్చిన నా మనోనివేదన :

కందుకూరి గురువు కరుణ పూరితమైన
చూపు కొరకు ఎదురు చూచుచుంటి
వారి దయను పొందు వారధి యా చూపే
దానిపొందితేని ధన్యుడగుదు

వారి మనసు గాంచ వారిది యద్దాని
సీమనంటియున్న సికతమేను
అలకు ప్రేమ చేర్చి యలవొక వారంప
మునిగి తెలుచుంటి ముదము మీర

మనసు నచ్చినట్టి మారాజు మా స్వామి
వారి వత్సలతన వరలునట్టి
భాగ్యమొకటి దొరికె భావింపగా మాదు
పూర్వ జన్మ యొక్క పుణ్య ఫలము

కందుకూరి గురుపరం కామితార్థ సుఫలదం
చరణ కమల స్పర్శనం సకల పాప భంజనం

శివానంద గురు శ్రేష్ఠం శిష్య మందార సన్నిభం
సత్వాది గుణసంపన్నం సర్వపాప విమోచనం

వారిని గూర్చి ఎంత చెప్పినా తక్కువే .

తత్సత్

Friday, 24 November 2017

శృంగేరి పూర్వ పీఠాధిపతి ద్రశేఖర భారతి వారి మహనీయత

శృంగేరి పూర్వ పీఠాదిపతి చంద్రశేఖర భారతి వారి మహనీయత

https://cherukurammohan.blogspot.com/2017/11/blog-post_24.html

నడచే దైవముగా కొనియాడబడే చంద్రశేఖర సరస్వతీ యతీంద్రులను గూర్చి అందరికీ 

తెలిసినదే కానీ వారు వయసులో వున్నకాలములో సమాంతరముగా చంద్రశేఖర భారతీ 

స్వామీ వారిని గూర్చి తక్కువగా తెలిసి వుంటుంది. నేను ఇపుడు వారి మహానీయతను 

గూర్చిన ఒక సంఘటన మీకు తెలియజేయ సంకల్పించినాను.

ఒకసారి ఒక వ్యక్తి స్వామి వారి దర్శనము చేసుకొనుటకు వచ్చు సమయానికి, అది 

సాయంకాలము అగుట మూలమున స్వామి తన శిష్య గణముతో శృంగేరియందలి 

నరసింహ వనము నందుగల కాలభైరవ ఆలయమునకు కొందరు శిష్యులతోనూ వారి 

ఉపాధ్యాయునితోనూ బయలుదేరి వెళుతూ వుండినారు. ఆగంతకుడు స్వామికి 

నమస్కరించగా వారు ఆయనను అనుసరించమని చెప్పినారు. అట్టి సమయమునందు 

స్వాములవారు ఊరుకొనక ఎదో ఒక విషయమును ప్రస్తావనకు తెచ్చి దానిని 

విశ్లేషించమనేవారు తన వెంట వచ్చు వారితో!

ఆరోజు స్వామీ వారికి ఒక శ్లోకమును చెప్పి దాని అర్థమును విశదీకరించమన్నారు. ఆ 

శ్లోకములో 'మే మే మే' అన్న మేక అరుపులు ఎక్కువగా వస్తాయి. సంస్కృతములో 'మే

అంటే 'నాది' అన్న ఒక అర్థము వుంది. దానిని మేక అరుపునకు సంధించిన ఆ 

శ్లోకమును చదవండి. అందులోని గూఢార్థమును గ్రహించండి.

స్వామివారు ఇంతకూ ఆ శ్లోకమునే ఎందుకు ఎంచుకొన్నారు అంటే, ఆ వచ్చిన వ్యక్తి 

అత్యంత అనారోగ్యముతో బాధపడుచున్న తన భార్యను గురించి, మాటవినని తన 

కుమారుని గురించి తెలిపి స్వామి ఆశీర్వాదముచే ఒక పరిష్కారము పొందుటకు 

వచ్చినాడు.

స్వాములవారికి కర్మఫల పీడితులై ఫలితముననుభవించు వారికి లోక విముక్తే 

పరిష్కారమని తెలియుటచే ఆ శ్లోకమును చెప్పి విశ్లేషించమన్నారు. సందర్భోచితమగు 

వారి మనసును గ్రహించినట్టి యా వచ్చిన వ్యక్తి ఆయన కాళ్ళపై బడి తానెందుకు 

వచ్చినదీ చెప్పి, తానడగాకుండానే స్వాములవారు తనను అనుగ్రహించినారని తెలిపి 

కాలభైరవ దర్శనము స్వామివారితో కూడా చేసుకొని, వారివద్ద శెలవు తీసుకొని తన 

నెలవుకు బయలుదేరినాడు. కొంతకాలమునకు సంసారి బంధ విముక్తుడై సన్యసించి 

జీవిత శేషమును ఉత్తరభారత పుణ్యతీర్థములందు వెళ్ళబుచ్చి పరమపదించినారు. 

మహనీయుల మాటలు అంత నర్మగర్భంగా వుంటాయి. ఇంతకూ ఆ శ్లోకమునకు 

అర్థము చెప్పిన వారు తదనంతర పీఠాధిపతియైన అభినవ విద్యాతీర్థ స్వాములవారు

సన్యసించక ముందు గురువు గారివద్ద శిష్యునిగా వున్న కాలములో! శ్లోకము శ్లోక 

భావము క్రింద/పైన చదవండి.

దారా ఇమేమే తనయా ఇమేమే గృహా ఇమేమే పశవశ్చమే మే l

ఇత్థం నరో మేష సమాన ధర్మ ‘మే మే’ కరః కాల వ్రుకేన నైతాః ll

నా భార్య, నా పిల్లలు, నాయిల్లు, నా పశుసంపద, అంటూ మేకవలె ‘మే మే’ అని అరుస్తూ 

ఉన్నాడు కానీ కాలమనే తోడేలు కబలించబోతూ  ఉందని తెలియలేకున్నాడు.

Essence of Life

dārā ime me, tanayā ime me, ghā ime me, paśavaśca me me.

Ittha naro measamāna-dharmā me-me-kara kāla-vkea nīta

(This wife is mine (the Sanskrit word ‘me’, meaning ‘mine’, sounds, when pronounced, a little like the bleating of a sheep).These children are mine (‘me’). These houses are mine (‘me’) and these cattle are mine (‘me’). The man who, in this manner, keeps saying ‘me-me’ is on par with a sheep (which bleats ‘me-me’). He is killed by the wolf named as 'time').”

Tuesday, 21 November 2017

శరతల్పగతుడగు భీష్ముని పాండవులు సేవించిన తీరు

శరతల్పగతుడగు భీష్ముని పాండవులు సేవించిన తీరు
ఈ వ్యాసము నేను వ్రాసినది కాదు. నాకంత శక్తి కూడా లేదు. ఆంధ్ర వ్యాసులుగా విశేష కీర్తినార్జించిన శ్రీయుతులు ఏలూరిపాటి అనంతరామయ్య గారిదని తలుస్తాను. ఆ మహనీయునికి మనసా వచసా శిరసా వందనములర్పించుకొంటూ వారు వ్రాసిన ఈ వ్యాసమును మీ ముందు ఉంచుతున్నాను.
ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది. ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశసేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు. దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు. కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశసేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది.
భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగాడు. అయితే ఆయన వెంటనే చనిపోలేదు. 58 రోజులు బాణశయ్య మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరులో ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుపుతోంది.
భీష్మ నిర్యాణంపై ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మనం చాలా తప్పు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ళ ముద్రవేసి వారిని పట్టించుకోవడంలేదు. కానీ విదేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నారు. జీవితంలో వారు గడించిన అనుభవాలను విదేశీయులు సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. మనం పనికి మాలిన వాళ్ళలాగా మారిపోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాము. ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము.
ప్రతీ వృద్ధుని దగ్గరా తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవజ్ఞానం ఉంటుంది. దాన్ని సేకరించే విభాగం ఒకటి రావాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా తమను సమాజం నిర్లక్ష్యం చేస్తోంది అనే భావన పోతుంది. మనకు దాని వల్ల వివిధరంగాలకు కావలసిన అనుభవజ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయల పరిశోధనలు చేసినా దొరకదు. కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఉంటుంది. దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో ఉంది.
18 రోజుల యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయ్యాక, దుర్యోధనుడు కూడా చనిపోయాక, ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు. ఈ సమయంలో వ్యాసుడు, కృష్ణుడు అద్భుతమైన సలహా ధర్మరాజుకు ఇస్తాడు. అప్పటికి భీష్ముడు ఇంకా జీవించే ఉన్నాడని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అపారమైన జ్ఞాన సంపద ఆ కురువృద్ధుడి దగ్గర ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి తెలుసుకోమని వ్యాసుడు, కృష్ణుడు సలహా ఇస్తారు.
వారి సలహా వల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం శాంతి పర్వం పుట్టింది. అందులో భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు. విష్ణుసహస్ర నామం కూడా అందులోదే. కనుక వృద్ధులను సేవించడం వలన సమాజానికి ఎం ప్రయోజనం ఉంటుందో భారతం తెలుపుతోంది‘‘ అని అన్నారు. ఆంధ్రవ్యాసుల వారి మార్గదర్శకత్వంలో మరింత లోతుగా పరిశోధన చేస్తే అద్భుతమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
1) భీష్ముడు క్రింద పడగానే వేలాది కన్యలు (నర్సుల) వచ్చి ఆప్రదేశాన్ని శుభ్రంచేసి గంధపు పొడి, పేలాలుచల్లి, పూవులతో అలంకరించారు.
2) భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తూర్యాణి శతసంఖ్యాని తథైవ నటనర్తకాః।
శిల్పినశ్చ తథాఽఽజగ్ముః కురువృద్ధం పితామహం ॥
భీష్ముడి దగ్గరకు సంగీత వాయిద్యాలు వందల సంఖ్యలో తీసుకొని గాయకులు, నటులు, నర్తకులు, శిల్పులు (ఇంజనీరింగు విభాగంవారు) వచ్చారని వ్యాసుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం.
రోగి వేరు అంత్యకాలంలోని వ్యక్తి వేరు. చికిత్స ఉన్నంత కాలమే ఒక వ్యక్తి రోగి అవుతాడు. చికిత్స లేనప్పుడు అతడు పేషంటు కాడు. అతడికి చేయాల్సిన వైద్యం అంత్యకాల సేవ. అది వేరే ఉంటుంది. అదే ఆరోజున భీష్ముడికి చేశారు. అంత్యకాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడం కోసం నటులు, నర్తకులు, గాయకులు, సంగీతకారులు వచ్చారు. నేడు కూడా ఆసుపత్రులలో సైతం టివిలు, మ్యూజిక్ సిస్టంలు ఉంచుతున్నారు. ఇక పాలియేటివ్ కేర్ సెంటర్లలో అయితే అంత్యకాలంలో వారు ఆడుకోవడానికి ఆటవస్తువులు కూడా ఉంచుతున్నారు.
ఇక్కడ అతిముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతేకానీ వారు ఎవరు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ, నటులు, నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్పలేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడను అయ్యాను అనినందువల్ల.
అయితే వేల సంవత్సరాల క్రితం భారతంలో పాలియేటివ్ కేర్ పురుడుపోసుకుందని చెప్పడానికి ఇది రెండో అతి ముఖ్యమైన శ్లోకం భీష్మపర్వంలో ఉంది.
3) దీని తరువాత అతి ముఖ్యమైంది శాంతిపర్వంలో ఉంది. ‘‘భీష్ముడి మరణశయ్య దగ్గరకు భూమి మీదే కాక ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమహంసలు, దేవతలు వచ్చారు. వారిలో నారదాది సంగీతవిద్వాంసులు ఉన్నారు. శ్రీకృష్ణుడు చూడడానికి వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే వ్యాస మహర్షితో కూడిన సమస్త రుషి గణాలూ రుగ్, యజుస్, సామగానాలు చేశారు. అన్ని రుతువులకు చెందిన పుష్పాలు ఏక కాలంలో కురిశాయి. దేవతలు, అప్సరసలు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. పవిత్రమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాయి. భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడు సూర్యాస్తమయం చూసి రేపు వస్తానని వెళ్ళాడు.‘‘
ఇక్కడ ఇచ్చిన ప్రతి వర్ణన అంత్యదశసేవల్లో చాలా ముఖ్యమైంది.
దీనిలో, రెలిజియస్ హీలింగ్, యోగా, మ్యూజిక్ థెరపీ, పుష్పవైద్యం వంటివి ఉన్నాయి.
తతస్తే వ్యాససహితాః సర్వ ఏవ మహర్షయః।
ఋగ్యజుఃసామసహితైర్వచోభిః కృష్ణమార్చయన్॥
తతః సర్వార్తవం దివ్యం పుష్పవర్షం న భస్తలాత్।
పపాత యత్ర వార్ష్ణేయః సగాంగేయః సపాండవః॥
వాదిత్రాణి చ సర్వాణి జగుశ్చాప్సరసాం గణాః।
న చాహితమనిష్టం చ కించిత్తత్ర వ్యదృశ్యత॥
అన్నిటికీ మించి పేషంటుకు ఉన్న విజిటర్స్ సమయాన్ని మహర్షులు కూడా గౌరవించి అస్తమయం అవుతుండడంతో మరలా రేపు వస్తానని కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు వద్ద శలవు తీసుకొని వెళ్ళిపోయారు. ధర్మరాజు, కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు.
4) ఇక్కడ అతి ముఖ్యమైన వర్ణన వ్యాసుడు చేస్తాడు. పాండవుల రథాలు వెళ్ళిన తీరు మహానదిని తలపించిందని చెప్పాడు.
తతో రథైః కాంచనచిత్రకూబరై
ర్మహీధరాభైః సమదైశ్చ దంతిభిః।
హయైః సుపర్ణైరివ చాశుగామిభిః
పదాతిభిశ్చాత్తశరాసనాదిభిః॥
యయౌ రథానాం పురతో హి సా చమూ
స్తథైవ పశ్చాదతిమాత్రసారిణీ।
పురశ్చ పశ్చాచ్చ యథా మహానదీ
తమృక్షవంతం గిరిమేత్య నర్మదా॥
ఈ వర్ణన చదవకపోతే తరువాత ధర్మరాజుకు ఉన్న మహత్తరమైన విజ్ఞానం మనకు అర్థం కాదు.
5) మర్నాడు ధర్మరాజు ఉదయాన్నే భీష్ముని దర్శనానికి వెళుతూ అర్జునుడిని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు. ‘‘ అర్జునా ఈ రోజు ఏవిధమైన మందీ మార్బలం, సైన్యం లేకుండా నేను సోదరులతో మాత్రమే వెళ్లదలచాను. మన అశ్వగజరథ సైన్య పరివారం వెళ్ళివస్తూ ఉండడం వలన అంపశయ్యమీది భీష్ముడికి ఇబ్బంది కలుగకూడదు. కనుక సైన్యాన్ని, భటులను వద్దని చెప్పు. ఈ రోజు నుంచీ నేను భీష్ముడి దగ్గర ముఖ్యమైన రహస్యాలు తెలుసుకోబోతున్నాను. కనుక అనవసరమైనవారు అక్కడ జమకూడడం నాకు ఇష్టంలేదు‘‘ అన్నాడు.
న సైనికైశ్చ యాతవ్యం యాస్యామో వయమేవ హి।
న చ పీడయితవ్యో మే భీష్మో ధర్మభృతాం వరః
ఇది నేటికీ ఆచరించదగిన ముఖ్య విషయం. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోవడమో, జబ్బుపడడమో జరిగితే ముందుగా ట్రాఫిక్కు పోలీసుల గుండెలు ఆరిపోతాయి. వచ్చేవారు పలకరించడానికి వస్తున్నారా? లేక తమ హోదాలు వెలగబెట్టుకోవడానికి వస్తున్నారో తెలియని సందర్భాలు కోకొల్లలు. భారీగా వాహనాలు రోడ్ల మీద పార్కుచేసి ట్రాఫిక్కు స్తంభింపచేయడంతో మొదలుపెడితే గన్ మెన్లు హోషు చూపించుకోవడం, బుగ్గకార్ల హడావుడి--- ఇదంతా చూస్తే ఎంత నీచంగా ఉంటుందో ఒక సారి ఎవరికి వారు గమనించుకుంటే మంచిది.
శ్రీకృష్ణుడు కూడా శైబ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్ప అనే తన రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమని ప్రార్థించాడట. ఆ పశువులైన ఆ గుర్రాలు మహావేగంతో పయనించినా భూమి మీద అతి సుకుమారంగా వెళ్ళాయని వ్యాసుడు చెప్పాడు. నేడు ఆసుత్రుల దగ్గరకు వాహానాలలో వెళ్ళేవాళ్ళు ఆ గుర్రాలను చూసి బుద్ధి తెచ్చుకుంటే మంచిది. ఆసుపత్రి ఏరియా దయచేసి హారన్ మ్రోగించవద్దు అనే బోర్డు ఎవరూ పట్టించుకోరు. లోపల మరణావస్థలో ఉన్నపేషంట్ల వినికిడి అవయవాలు మహాబాధపెడతాయని ఎప్పటికి బుద్ధి వస్తుందో నేటి వాహన చోదకులకు?
ఆగచ్ఛత్స్వథ కృష్ణోఽపి పాండవేషు మహాత్మసు।
శైనేయసహితో ధీమాన్రథమేవాన్వపద్యత॥
రథస్థాః సంవిదం కృత్వా సుఖాం పృష్ట్వా చ శర్వరీం।
మేఘఘోషై రథవరైః ప్రయయుస్తే నరర్షభాః॥
బలాహకం మేఘపుష్పం శైబ్యం సుగ్రీవమేవచ।
దారుకశ్చోదయామాస వాసుదేవస్య వాజినః॥
తే హయా వాసుదేవస్య దారుకేణ ప్రచోదితాః।
గాం ఖురాగ్రైస్తథా రాజఁల్లిఖంతః ప్రయయుస్తదా॥
తే గ్రసంత ఇవాకాశం వేగవంతో మహాబలాః।
క్షేత్రం ధర్మస్య కృత్స్నస్య కురుక్షేత్రమవాతరన్॥
మహాభారతం నేడు కూడా ఎందుకు అనే ప్రశ్నకు ఈ శ్లోకాలు చాలు. ఎంత నిర్లజ్జగా మనం నేడు బ్రతుకుతున్నామో తెలియడానికి. వేల సంవత్సరాల క్రితం మరణశయ్యమీద వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్పిన మరో గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. లక్షాపదివేల శ్లోకాల్లో ఏం ఉందో చదువుకుంటే మనిషిగా మనం ఎంత పశుప్రాయంతో జీవిస్తున్నామో తెలుస్తుంది. నేడు దౌర్భాగ్య ప్రభుత్వాల కారణంగా సంస్కృతం అడుగంటి భారతంలో ఏం ఉందో చదివి తెలుసుకోలేక బ్రతుకుతున్నాము. ఏ అమెరికా, ఇంగ్లండు వారో హాస్పీస్ సేవలు మా దగ్గరే పుట్టాయి అంటే నిజమే కాబోలు అనుకునే జాతి తయారైంది.

Tuesday, 14 November 2017

నన్నెచోడుడు - మానవల్లి రామకృష్ణ కవి


నన్నెచోడుడు - మానవల్లి రామకృష్ణ కవి

https://cherukurammohan.blogspot.com/2017/11/blog-post.html

ముందు మానవల్లి రామ కృష్ణ కవి గారిని గూర్చి తెలుసుకొందాము.

ఆంగ్లేయుల ప్రాపుతో, తిమ్మిని బమ్మిని చేసి కూడా, అవ్యయమైన పేరు ప్రతిష్ఠలు 

సంపాదించిన మహనీయులు ఎందఱో ఉన్నారు, ‘సర్’ ‘రావు బహద్దర్’ ఆదిగా గల 

బిరుదులను, నాటి ‘Madras University’ Senate Membership పొందిన 

మహనీయులు ఎందఱో తెలుగును ఆంద్ర భాషా చరిత్రను తమ మనసుకు నచ్చిన రీతిలో, సమగ్రమైన కృషి లేకుండానే, మనకు కట్టబెట్టిన ఆ మహానీయులకందరకు ప్రణామములు.

కొందరు అట్లుగాక నిజమైన చరిత్రను ఎన్నో ఆర్ధిక శారీరిక కష్టాలకు ఓర్చి నిజమైన 

చరిత్ర మన ముందు ఉంచినా అవి మన అందుబాటులోనికి రానీకుండా చేసి, ఆ 

కృషిచేసిన మహానుభావుల రూపురేఖలు కూడా లేకుండా చేసినారు. అయినా కూడా 

ఎంతో కష్టించి, మానవల్లి రామకృష్ణ కవి గారిని వెలుగులోనికి తెచ్చుటకు ప్రయత్నించిన 

డా.బోయినిపల్లి ప్రభాకర్, తెలుగు సహాయ ఆచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలఆర్మూర్‌

నిజామాబాద్‌ జిల్లా, గారికి ఎంతో రుణపడి ఉన్నాము. మానవల్లి రామకృష్ణ కవి గారి 

పేరును, తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్నవాళ్లందరూ స్మరించుకొనవలసిన పేరు.

తన కాలంనాటికి చరిత్రకు ఎక్కకుండా, తాళపత్రాల్లోనే మరుగున పడిపోతున్న సాహితీ 

సంపదను వెలికితీసిన కీర్తి రామకృష్ణ కవి గారిది. నన్నయకు పూర్వమే తెలుగు 

సాహిత్యం కాంతులీనిందన్న వాదనకు ఆధారమైన నన్నెచోడుడు అనేవాడు 

ఒకడున్నాడని లోకానికి చాటింది మానవల్లి వారే! ఒక్క కుమారసంభవమే కాదు, 

కాలమాళిగలోంచి ఎన్నో కావ్యాలు, కవులను వెలుగులోకి తెచ్చిన మహా 

పరిశోధకులాయన.

సాహిత్యచరిత్ర వికాసానికి మూలం ‘మౌలిక పరిశోధనే’ అని నిరూపించిన వ్యక్తి మానవల్లి 

రామకృష్ణకవి. ‘‘ఆనాడా వాఙ్మయతపస్వి విస్మృతకవులు అనుపేర, సాహిత్యపు 

ప్రపంచమంతకుముందు కనివిని యెఱుగని కావ్యములను, ప్రకటింపబట్టియే నేటి మన 

సారస్వత చరిత్ర యిట్టి పరిణత స్థితికి వచ్చినది. ఆయన జన్మించి యుండకపోయిన 

యెడల ఆంధ్ర సాహిత్యచరిత్ర అంధకారబంధురమై యుండెడిదనుటలో అతిశయోక్తి 

లేదు’’ అన్నారు నిడుదవోలు వెంకటరావు. నిజంగానే మానవల్లి జీవితమంతా చరిత్ర 

విస్మరించిన కవులు, కావ్యాల పరిశోధనకే అంకితమైంది.

      మానవల్లి రామకృష్ణ కవి 1866లో మద్రాసులోని నుంగంబాకంలో జన్మించినారు. 

ఆయనది పండిత కుటుంబం. తండ్రి నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానం వ్రాసినారు. ఇక 

రామకృష్ణ కవివర్యులు బాల్యంలోనే కవితాశక్తిని ఒడిసిపట్టుకున్నారు. తెలుగు

సంస్కృతం, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లోనూ ప్రావీణ్యం సాధించినారు. ఆ పాండిత్యం

తాళపత్ర గ్రంథాలపట్ల ఆసక్తి ఆయన్ను గొప్ప మౌలిక పరిశోధకునిగా నిలబెట్టాయి.

      రామకృష్ణకవి సంస్కృతం, తెలుగు ప్రధానంగా MA చదివినారు. మౌలిక 

పరిశోధనపట్ల ఆసక్తితో తంజావూరు సరస్వతీమహల్‌ను ఆశ్రయించినారు. అందులో 

లభ్యమైన కావ్యాలను ఎలా ప్రచురించవలెనని అనుకుంటున్న తరుణంలో, ఆయనకు 

1904లో వనపర్తి సంస్థానంలో ఉద్యోగం లభించింది. అక్కడి ‘బ్రహ్మవిద్యా విలాస 

ముద్రాక్షరశాల’ ద్వారా ‘విస్మృతకవులు’ ధారావాహికలో భాగంగా, అపూర్వమైన 

కావ్యాలను వెలుగులోకి తెచ్చినారు. ఈ సమయంలో సంస్థాన ఉద్యోగులు కొంతమంది 

ఆయన మీద అపవాదులను ప్రచారం చేసినారు. మంచికి మననుగడ అంత సులభము 

కాదు కదా!  హంస గొప్పదనము కొంగలకు తెలిసే అవకాశము లేదు కదా! దాంతో 

1912లో వనపర్తిని వదిలిపెట్టి మళ్లీ మద్రాసు చేరుకున్నారు.

      ఆ తర్వాత రామకృష్ణకవి తన దృష్టిని సంస్కృత సాహిత్యం మీదికి మరల్చారు. 

1915లో మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉద్యోగంలో చేరారు. 

భాండాగారం తరఫున కేరళలో పర్యటించి అమూల్యమైన సంస్కృత సాహితీ సంపదను 

పోగుచేశారు. ఆ ప్రయత్నంలో నంబూద్రి బ్రాహ్మణుల దగ్గర భాసవిరచితమగు, ఆయన 

 రచనల జాబితాలో చేరని, ‘డమరుకం’ అనే నాటకాన్ని, సంపాదించి 

మనకందించినవారాయన. 1926 వరకు అక్కడే పనిచేసినారు. అయితే భాండాగారం 

నిబంధనలకు విరుద్ధంగా కుందమాల, కౌముది మహోత్సవం నాటకాలను స్వయంగా 

ప్రకటించి ఉద్యోగం కోల్పోయినారు. మరి పనిచేసే ఉత్సుకత కలిగినవాడు 

తప్పులుచేస్తాడు.  

తర్వాత 1932 వరకు రాజమండ్రిలో ఉపాధ్యాయుడిగా పనిచేసినారు. అది తాత్కాలిక 

ఉద్యోగం కావటంతో పింఛనుకు నోచుకోలేదు. దాంతో తన 66వ ఏట మళ్లీ ఉద్యోగ 

ప్రయత్నం చేసినారు. అలా మద్రాసు విశ్వవిద్యాలయంలో ఏడాదిపాటు ఉండి 50 

మెకంజీ సంపుటాలను తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించినారు. 1933లో 

తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాశాఖ అధికారిగా, 1940- 54 మధ్య శ్రీవేంకటేశ్వర 

ప్రాచ్య పరిశోధన సంస్థలో సంస్కృత శాఖాధ్యక్షులుగా ఉద్యోగాలు నిర్వహించినారు. 

పరిశోధన కోసం తన సంపదనంతా వెచ్చించిన రామకృష్ణకవి చివరిదశలో దుర్భర 

పేదరికాన్ని అనుభవించినారు. ఈ స్థితిలో ప్రభుత్వం ఆయనకు నెలకు రూ.150 

గౌరవభృతిని మంజూరుచేసింది. 1957 సెప్టెంబర్‌ 20న ఈ ‘మౌలిక పరిశోధనా 

దురంధరుడు’ కీర్తిశేషులయినారు.

ఆయన పడిన శ్రమ, ప్రాచీన కవులపై ఆయన కున్న గౌరవ ప్రపత్తులు 

కొలమానమునకందనివి. అసలు సాహిత్యచరిత్ర పరిణత స్థితికి ప్రధానపాత్ర పోషించేది 

మౌలిక పరిశోధనే. అంటే చరిత్రకెక్కని ప్రాచీన కావ్యాలను, కవులను గురించి 

ప్రకటించడంలో భాగంగా- తాళపత్రాలను సేకరించడం, వాటిని సరిపోల్చడం

పాఠ్యభేదాలలో సరైన దాన్ని గ్రహించి పరిష్కరించడం, కవి దేశ కాలాలను నిర్ణయించి

విపులమైన పీఠికతో ఆ కావ్యాన్ని ప్రకటించడం లాంటివి. ఇదెంతో కష్టమైన పని. 

అలాంటి మౌలిక పరిశోధనను ఓ యజ్ఞంలా భావించి, తన జీవితాన్ని అర్పించినారు 

రామకృష్ణకవి. ఆ కృషిలోంచి మొగ్గతొడిగిందే ‘విస్మృత కవులు’ గ్రంథమాల. 1908లో 

‘కుమార సంభవం’ మొదటిభాగంతో మొదలుపెట్టి ‘క్రీడాభిరామం, నీతిసార ముక్తావళి

ప్రబంధమణిభూషణం, పరతత్త్వ రసాయనం, అనర్ఘరాఘవం, త్రిపురాంతకోదా హరణం

శ్రీరంగమాహాత్మ్యం, కుమార సంభవం రెండోభాగం, సకలనీతి సమ్మతం’ తదితర 

గ్రంథాలను విపులమైన పీఠికలతో తొలిసారిగా ప్రకటించినారు. ఆయన రాసిన పీఠికలు 

ప్రత్యేక సాహిత్య ఖండాలుగా స్థిరపడినాయి. ఈ పీఠికలు పుస్తకానికి ఉన్నంత ప్రసిద్ధి 

సాధించినాయి. కుమారసంభవం, క్రీడాభిరామం పీఠికలు ఈ కోవలోవే.

      అంతవరకు సాహితీ ప్రపంచంలో తెలియని ప్రాచీనకవుల విశిష్టతను వివరిస్తూ 

వైజయంతి, భారతి, ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, శ్రీవేంకటేశ్వర ప్రాచ్యపరిశోధన పత్రికల్లో 

రామకృష్ణ కవి వ్యాసాలు వ్రాసినారు. ‘ఆంధ్ర రాజకవులు’ (1910) వ్యాసంలో నన్నెచోడుడు 

నుంచి పాలవేకరి కదిరీపతి వరకుగల రాజకవులను గురించి స్థూలంగా 

తెలపడంతోపాటు, ముకుందమాల కర్త సాయప వేంకటపతి; ద్విపద రామాయణ 

రచయిత కట్టా వరదరాజ కవులను సాహితీలోకానికి పరిచయం చేశారు. ఇంకా ఈ 

వ్యాసంలో ఆముక్తమాల్యదను రాయలు రచించలేదనీ, ఎవరో వైష్ణవుడు రచించాడని 

ప్రతిపాదించారు. ఇది నాటి పండితుల్లో చర్చకు దారితీసింది. ఎన్నో కొత్త విషయాలు 

వెలుగులోకి రావడానికి తోడ్పడింది. 1915లో ‘తెనాలి కవులు’ వ్యాసంలో 

రామకృష్ణుడితోపాటు ఆ వంశపు ఇతర కవులను, వారి గ్రంథాలను గురించి వ్రాసినారు. 

‘పాండురంగ మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్రం, ఘటికాచల మహాత్మ్యాలే కాకుండా 

హరిలీలా విలాసం, కందర్పకేతు విలాసం’ అనే ప్రబంధాలనూ తెనాలి రామకృష్ణుడు 

రచించినాడని చెప్పినారు.

కందుకూరి వీరేశలింగం ‘కవులచరిత్ర’లో లేని కవులను వెలుగులోకి తేవడానికి ఎక్కువ 

కృషిచేసినారు రామకృష్ణకవి. 1916లో వసుచరిత్రను గురించి రాస్తూ- దీనికి 

సంస్కృతంలోనేకాక తమిళ అనువాదం కూడా ఉందన్నారు. సంస్కృతంలోని కొన్ని 

విస్మృత నాటకాలు, తెలుగు- సంస్కృత నరసభూపాలీయాలు, కొన్ని కాకతీయ 

శాసనాలురామకృష్ణార్జున రూప నారాయణీయం, తుక్కాపంచకం, ఎలకూచి 

వేంకటకృష్ణరాయకవి, శ్రీకృష్ణ లీలాశుకకవి, కాళకలభకవి, ఉదయనోదయం

లీలావతికథ, కవికంఠపాశం లాంటి కావ్యాలు, కవుల గురించి తొలిసారి వ్యాసాలు 

రాసింది మానవల్లి వారే! రఘునాథ రామాయణం, కవి గజాంకుశాలను ఆంధ్ర సాహిత్య 

పరిషత్పత్రికలో, శుకసప్తతి కావ్యావతారికను, వాల్మీకిచరిత్రను ‘సరస్వతీ’ పత్రికలో 

తొలిసారిగా ప్రకటించారాయన. తరిగొండ వెంగమాంబ, గణపవరపు వేంకటకవి

పట్టమెట్ట సోమనాథ సోమ యాజి, కస్తూరి భట్టురాజు, చింతలపల్లి కవులనూ 

వెలుగులోకి తెచ్చినారు.

      తాళపత్ర పరిశోధనలోనే కాదు, కవిత్వంలోనూ రామకృష్ణకవిది అందెవేసిన చేయి. 

‘మృగావతి, వసంతవిలాసం’ కావ్యాల్లో ఆయన ప్రౌఢ మధుర కవిత్వం బయటపడుతుంది.

ఈ సామర్థ్యమే ‘కుమారసంభవ’ కర్తృత్వం విషయంలో ఆయన మీద ఆరోపణలకు 

కారణమైంది. ఇంకా ‘కళింగసేన’ నాటకం, ‘వత్సరాజ చరిత్ర’ నవలలను 

రచించడంతోపాటు భాస నాటకాలైన కర్ణభారం, అవిమారకాలను అనువదించారు. 

మౌలిక పరిశోధనలో భాగంగా ఆంగ్లంలోనూ వ్యాసాలు రాశారు. నిడుదవోలు 

వెంకటరావు, డా।। పోణంగి శ్రీరామ అప్పారావుల సంపాదకత్వంలో ‘మానవల్లి కవి- 

రచనలు’ పేరిట 1972లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ఓ బృహత్‌ గ్రంథాన్ని 

ప్రచురించింది.

'దక్షిణ భారతి గ్రంథమాల పేరుతో మానవల్లి అపూర్వమైన విస్మృత సంస్కృత నాటకాలను, 

కావ్యాలను ప్రకటించినారు. వాటిలో భాగముగా 'కుందమాల' నాటకాన్నిప్రచురించినారు. 

"ఆయన జీవిత సార్తక్యానికి  ఈ ఒక్క నాటకమే చాలు" అని రాహుల్ సాంకృత్యాయన్ 

మానవల్లిని కీర్తించినారు. సామ్బోపాఖ్యానము, ఐరావత చరిత్రము, హరిభాట్టు గారి 

'ఉత్తర నారసింహ మస్త్యపురాణాలు'  దండి 'అవంతీ సుందరి కథ' , శూద్రకుడి 'వత్సరాజు కథ, విజ్జికాదేవి కౌముదీ మహోత్సవము' లతో బాటు భరతుడి నాట్య శాస్త్రానికి అభినవ గుప్తుడి వ్యాఖ్యలనుమానవల్లి తొలిసారిగా ప్రకటించినారు. ఇంకా సంగీత నాత్యశాస్త్రాలలోని పారిభాషిక పదాలతో 'భారేఅత కోశం' పేరిట సంస్కృత బృహత్ నిఘంటువును సంకలనము చేసినారు.

రామకృష్ణకవికి తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టిన కావ్యం 

‘కుమార సంభవం’. తొలిసారి దాన్ని సంపాదించి పరిష్కరించి, ప్రకటించిన ఘనత 

ఆయనదే. దీనిపై చెలరేగినంత వివాదం మరే కావ్యంపైనా రాలేదు. కవి కాల నిర్ణయంలో 

మానవల్లి అనేక శాసన, మత ప్రమాణాలు, వ్యాకరణ ఛందో విశేష అపూర్వపద 

ప్రయోగాల ఆధారంగా నన్నెచోడుడు నన్నయకంటె ముందువాడని ప్రతిపాదించినారు. 

దీనిమీద జరిగిన వాదవివాదాల్లో ఆనాటి ప్రసిద్ధ పండితులంతా పాల్గొన్నారు. దాంతో 

నన్నెచోడుని మీద ప్రత్యేక వాఙ్మయమే వెలువడింది. కొంతమంది విమర్శకులు

కుమారసంభవాన్ని రామకృష్ణకవే రాసి, నన్నెచోడుడి పేర వెలయించారని అన్నవాళ్లూ 

ఉన్నారు. మొత్తానికి, మానవల్లి వాదాన్ని సమర్థించని వాళ్లు ఎక్కువగా ఉండటంతో 

నన్నెచోడుడు నన్నయ, తిక్కనల నడిమివాడన్న అంగీకారం సాహితీలోకంలో 

స్థిరపడింది. బహుశ ప్రాంతీయ తత్వము ఇందుకు ఎక్కువగా ఉపకరించి ఉంటుంది. కాకుంటే ‘కుమార సంభవ’ కావ్యము మానవల్లి వారే వ్రాసి ‘నన్నే చోడు’ని పెరునతికించినారన్న అపవాదును ఆయన పై వేయుటకంటే మించిన హేయభావన వేరేమయినా ఉంటుందా!

      ఎంతోమంది ప్రసిద్ధ వ్యక్తులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే గుర్తింపు, గౌరవం 

లభించడం చరిత్ర అసమగ్రతకు తార్కాణం. రామకృష్ణకవి విషయంలోనూ ఇది 

వర్తిస్తుంది. ఆయనకు తెలుగు సాహితీ ప్రపంచంలో రావాల్సినంత గుర్తింపు రాలేదు. 

పరిశోధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాళపత్రాలను వెలికితీయడాన్ని

ప్రచురించడాన్ని మానవల్లి మానుకోలేదు. ఒకవేళ ఆయనే గనుక ఈ పనికి 

పూనుకోకపోతే ఎన్నో ప్రాచీన గ్రంథాలు మనకు దక్కేవి కావు. 

రామకృష్ణ కవి, ఆ తరువాత వచ్చిన వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల రామచంద్ర 

మొదలైన సాహితీ పరిశోధకులకు మార్గదర్శకుడైనాడు. మానవల్లి వారు పూర్వకాలపు 

సంకలన గ్రంథమైన 'ప్రబంధ మణిభూషణా'న్ని బైటపెట్టగా, ప్రభాకరశాస్త్రి దానివిలువను 

తెలిసినవాడై, చాటుపద్య మణిమంజరి రెండు భాగాలను, ప్రబంధ రత్నావళిని వలవేసి 

బైటికి లాగినారు. రామకృష్ణ కవి క్రీడాభిరామాన్ని తెలుగువారికి అందజేయగా, 

శాస్త్రిగారు  ఆ పుస్తకాన్ని ముచ్చట లొలికే పండిత కూర్పును, చక్కని పీఠికతో విందు 

జేసినారు. మానవల్లి వారి దోవ ప్రభాకర శాస్త్రికి ఘంటాపథమయింది.

‘‘పగడపు పురుగులు మహాసముద్రంలో చుట్టూ గోడలను కట్టుకొంటాయి. అవి మానవులకు దీవులవుతాయి. అట్లే మానవులలో మేధావులు తమ లాభం కోసం, పొగడ్తల కోసం గాక నైసర్గికంగా పనిచేసుకొని పోతారు. దానివల్ల జాతికి మాత్రమే శాశ్వత ప్రయోజనం’’ అన్న టేకుమళ్ల కామేశ్వరరావు మాటలు మానవల్లి రామకృష్ణకవికి అక్షరాలా సరిపోతాయి.

స్వస్తి.

నన్నె చోడుని గూర్చి మరొక మారు ముచ్చటించుతాను.

నన్నెచోడుడు

నన్నెచోడుడు కడప జిల్లాలో తూరుపు ప్రాంతాలతో చేర్చి  నేటి నెల్లూరు ప్రకాశం 

జిల్లాలలోని కొన్ని ప్రాంతములకు అధిపతియై పాలించినాడు. ప్రసిద్దుడగు కరికాల 

చోళుడు తమ పూర్వీకుడని చెప్పుకొన్నాడు ఈయన. ఈయన తండ్రి చోడబలి యని, తల్లి 

శ్రీసతి యని తెలియవస్తూ వున్నది. ఈయన కడప జిల్లా నందలురులోని ప్రసిద్ధిగన్న 

సౌమ్యనాథస్వామి ఆరాధకులు. ఈయనకు శివ కేశవ భేదము లేదు. ఇక అసలు 

విషయమునకు వత్తము.

మానవల్లి రామకృష్ణ కవి (1866-1957) సాహిత్య పరిశోధకుడు, కవి మరియు 

సంస్కృతాంధ్ర పండితుడు. బహుభాషా కోవిదుడు. సంస్కృతము, ఆంధ్రము, అరవము

కన్నడము, మలయాళము మరియు ఇంగ్లీషు భాషలలో పాండిత్యము కలవాడు. 

అన్నమయ్యను వెలుగులోనికి తెచ్చిన మొట్టమొదటి మహనీయుడు ఈయన. 

రాయలసీమ ప్రాంతానికి ఉద్యోగ రీత్యా వచ్చి స్థిరపడిన రామకృష్ణ కవి 1933లో టీటీడీ 

విద్యాశాఖాధికారిగా పనిచేసినాడు.

 'కుమార సంభవ' కావ్యాన్ని కనుగొని, పరిష్కరించి అజ్ఞాత వాసము నుండి బయటకు 

తెచ్చి, ప్రచురించిన పట్టుదల ఈ మహనీయునిది. అసలు అప్పటివరకు వరకూ తెలుగు 

సాహిత్యంలో నన్నెచోడుడనే కవి ఒకడున్నాడనే సంగతే ఎవరికీ తెలియదు. ఇతర 

కవులెవ్వరూ నన్నెచోడుని గురించి గానీ, అతని కుమార సంభవ కావ్యమును గురించి 

గానీ, పూర్వ కవి ప్రశంసల్లో గానీ మరెక్కడా గానీ ఒక్క ముక్క కూడా వ్రాసిన పాపాన 

పోయినది లేదు. తంజావూరు లోని సరస్వతీ మహల్ గ్రంథాలయములో ఒక మూలపడి 

ఉన్న తాళపత్ర గ్రంథమును కనుగొని, దానిని పరిష్కరించి 1909లో  ప్రకటిస్తూ నన్నె 

చోడుడు నన్నయ కంటే ముందువాడని రామకృష్ణ కవి చేసిన ప్రతిపాదన పండిత 

లోకాన్ని ఎంతటి ఆశ్చర్యానికి గురి చేసిందంటే చెప్పుట మాటలకు శక్యము కాదు. ఈ 

ప్రతిపాదన మీద చర్చలూ, ఉపచర్చలూ, వాదోపవాదాలూ బాగానే జరిగి

అరిగించుకోలేకఅసలు ఈ కావ్యమును  నన్నెచోడుడు వ్రాయలేదు-రామకృష్ణ కవి రాసి నన్నెచోడుని పేరు పెట్టినాడని కొర్లపాటి శ్రీరామమూర్తి పుస్తకం వ్రాసినారు. ఒక్కొక్కసారి మితిమీరిన ప్రాంతీయాభిమానములుకూడా వాస్తవాలను గతములో తప్పుదారి పట్టించిన దాఖలాలు మనకు ఎన్నో కానవస్తాయి.

    కడప జిల్లాకు సంబంధించిన తూరుపు ప్రాంతాలను పొత్తపి రాజధానిగా చేసుకొని పాలించిన మహారాజు నన్నె చోడుడు.  కడప జిల్లా తో బాటూ నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొంత భాగము వీరి ఎలుబడి  క్రింద ఉండేది. క్రీ.శ.రెండవ శతాబ్దంలో అరణ్యప్రాంతంగా ఉన్న "పొత్తపి" ప్రాంతాన్ని, సోమరాజు, మలిదేవరాజులు, సంయుక్తముగా బాగుచేసి, బాహుదానదికి దక్షిణంలో విశాలమైన కోట నిర్మించినారు. గతంలో దీనిని పలువురు రాజులు, రాజధానిగా చేసుకొని పరిపాలించినారు. దీనికోసం ముస్లిములు అప్పట్లో దండయాత్రలకు యుద్ధాలకు పాల్పడి, ముఖ్యమైన నిర్మాణాలను నాశనం చేసినారు. ప్రస్తుతం దీనికి చెందిన శివాలయాలు, అవశేషాలు, శాసనాలు ఉన్నవి. 30 మంది రాజులు దీనిని పాలించినారు. చివరగా బ్రిటిషువారు పరిపాలించినారు. గతంలో పొత్తపి, సిద్ధవటం తాలూకాలో ఉండేది. మండలాల పునర్వ్యవస్తీకరణలో భాగంగా, పొత్తపి, నందలూరు మండల పరిధి లోనికి వచ్చినది. దీనికి ఘన చరిత్ర ఉన్నది. ప్రముఖ పుస్తక పరిశోధన రచయిత, కవనికౌముది బిరుదాంకితులైన శ్రీ పోతురాజు వెంకట సుబ్బన్న, దీని ప్రాచీన చరిత్రను, ప్రాశస్త్యముపై, సమగ్ర పరిశోధన చేసి, పుస్తక రూపం లోకి తెచ్చినారు. మొట్టమొదట ఛందోబద్ధ పద్య పాదములు రేనాటి రాజుల కాలము లోనే కడప ప్రాంతములో దర్శనమిచ్చిన దాఖలాలున్నాయి. తిరిగీ నన్నెచోడుని విషయమునకు వస్తే, ఈయన కాళీదాస మహాకవి గారి కుమార సంభవమును తెనిగించినారు. కానీ రచనకు తనదైన శైలి ఉరవడిని జోడించినారు. కావ్య ప్రారంభములో సకల దేవతా ప్రార్థన , గురు ప్రార్థన , పూర్వకవి స్తుతి,, కుకవి నింద, కవి స్వ విషయం కృతి పతి వర్ణన, షష్ఠ్యంతాలు, రచియించి  భావి తెలుగు కావ్యములకు బాట వేసినాడు.

 పరిశోధక తపస్వి యనబడు బి.యన్. శాస్త్రిగారి శాసనాధారమగు పరిశోధనలో

నిర్ద్వంద్వముగా నన్నె చోడుడు ఆదికవి యని తేటతెల్లము గావించినారు.

''ఆదికవి నన్నెచోడుడు'' అనే పేరుతో ఆయన ప్రతిపాదిత అంశాలు 1972 భారతి,

ఫిబ్రవరిలో ప్రచురింపబడినాయి.

''కుమార సంభవము తెలుగులో రచింపబడిన మొట్టమొదటి గ్రంథము'' అనే వాక్యాలతో 

ఆరంభమైన ఈ వ్యాసంలో ''నన్నెచోడుడు నన్నయ - తిక్కనల తరువాత కవి అనే 

అభిప్రాయానికి ఆధారాలు లేవు'' అని కుండ బద్దలు కొట్టినట్లు వ్రాసినారు ఆచార్య 

బి.ఎన్‌. శాస్త్రిగారు. కుమార సంభవము ''కావ్యశైలిలో రచించిబడిన ప్రబంధము'' అని 

సూత్రీకరించినారు. నన్నెచోడుడు ఎందుకు ఆదికవి అవుతాడో శాసనాల ఆధారంగా ఈ 

వ్యాసంలో సమగ్రముగా విశ్లేషింశించినారు. నన్నెచోడుడు రెండవ యుద్ధమల్లుని 

సామంతుడు (930-934) అని పేర్కొన్నారు. ఈ వ్యాసాన్ని ఒకటికి రెండుసార్లు శ్రద్ధగా 

చదివిన వారికి నన్నెచోడుడే తెలుగు ఆదికవి అనే అభిప్రాయం బలపడుతుంది. అంత 

తర్కబద్దంగా ఉన్న వ్యాసమిది. వ్యాసంలోని ముగింపు వ్యాఖ్యను ఒకసారి నిశితంగా 

పరిశీలించండి.

''ఇట్లు ఆంధ్రభాషలో తొలి కావ్యమును రచించిన ఆదికవి నన్నెచోడుడు 

శివకవియైనందున మరుగుపడి, పదియవ శతాబ్ధిలో ఆంధ్రమునందాది కావ్యము 

రచింప, ఇరువదియవ శతాబ్ధిలో ఆ గ్రంథము వెలుగులోనికి రాగా, ఆంధ్ర పండిత 

ప్రకాండులు చారిత్రకులు, నన్నెచోడుని పన్నెండవ శతాబ్దివాడుగా నిర్ణయించుట 

చూడగా కొన్నికొన్ని దురభిమానములెంత శక్తిమంతమైనవో ఊహింపవచ్చును."

విషయమును ‘స్తాళీ పులాక న్యాయము’లో తెలియజేసినాను. విస్తారముగా 

జిజ్ఞాసువులు పరిశోధించవచ్చును.

స్వస్తి.