Wednesday, 11 March 2015

నచికేతుని కథ


నచికేతుని కథ

https://cherukurammohan.blogspot.com/2015/03/blog-post_11.html
 
వేదముల సారము ఉపనిషత్తులో వున్నది. ఎన్నోఉపనిషత్తులలో కొన్ని ముఖ్యమైనవి కాగా 

కఠోపనిషత్తు అతి ముఖ్య మైనది. ఇందులో నచికేతుడు అన్న బాలకుడు యమధర్మరాజునే 

తన ప్రజ్ఞా సంస్కారములచేత సంతృప్తి పరచి ఆయన నుండి బ్రహ్మవిద్య పొందినాడు. 

అటువంటి బాలుడు బాలురైన మీకు ఆదర్శము కావలె.

పూర్వం వాజస్రవసుడను సత్పురుషుడు ఒకసారి విశ్వజిత్ యజ్ఞము చేసినాడు. ఆ 

చేసినవారు యజ్ఞము ముగిసిన పిదప  తమ సర్వస్వమునూ దానము చేయవలెను. 

వాజస్రవసుడు కూడా తనకున్నది దానంచేయసాగినాడు.

భారతీయులకు  గోసంపద అతి ముఖ్యమైనది. ఉన్నదీ ఒక్కొక్కటిగా ఇస్తూ , ఇక కలిగిన  

గోవులను దానము చేయసాగినాడు. వాజస్రవసునకు, గుణము బుద్ధి పితృభక్తి కలిగిన

నచికేతుడను పుత్రుడు కలడు. అతడు చిన్నవాడైనా సకల శాస్త్రములను ఆకళింపు 

చేసుకొన్న వాడు. నచికేతుడు  తన తండ్రి దానమిచ్చే గోవులు చాలా వరకు గొడ్డుపోయినవి. 

వెంటనే నచికేతుడు తండ్రితో "శాస్త్రాలు ఎవడైతే నిస్సారమైన గోవులను దానంచేస్తాడో 

వాడికి సద్గతులుండవు అని ఘోషిస్తున్నాయి .కావున మీరు ఇవి దానము చేయుట పాడి 

కాదు పైపెచ్చు మీకు యాగ ఫలితము దక్కక పోగా ఎక్కడలేని పాపము చుట్టుకొంటుంది." 

అని అన్నాడు.అందుకు తండ్రి "నావద్ద వున్నవి ఇవే మరి ఇవి కాక నిన్నివ్వమంటావా" 

అన్నాడు. నచికేతుడు " మీకున్నదానిలో నేనూ భాగమే కావున సంతోషంగా ఇవ్వండి" 

అన్నాడు. అంటూ"నిరుపయోగినైన నన్ను ఎవరికీ ఇస్తారు " అని అడిగినాడు. తండ్రికి 

కోపమొచ్చి "యమునికిస్తా"నన్నాడు.

తన తప్పు తెలుసుకొని వాజస్రవాసుడు బాధపడినా నచికేతుడు యమునివద్దకు పోవుటకు 

సిద్ధమయినాడు.పైగా తండ్రితో "పైరు మొలచి పండి ఆపై ఎలా జీర్ణమవుతుందో 

అదేవిధముగా పాంచభౌతిక శరీరము పుట్టి పెరిగి మరల ఆ పంచభూతముల లోనే 

లీనమగును కదా! కావున ఈ శరీరము శాశ్వతము కాదు. సత్యమొక్కటే శాశ్వతము. 

సత్యమే భగవంతుడు. కనుక విచారించక యముని వద్దకు పోవుటకు ఆజ్ఞ 

నొసంగుము.అన్నాడు. ఎలాగైతేనేమి  వాజస్రవసుడు నచికేతుని యముని వద్దకు 

పంపినాడు.
 ఎంతో పుణ్యశీలులు కూడా సులభముగా దాటలేని వైతరణీనదిని నచికేతుడు తన 

సత్యసంధత, పితృభక్తి ప్రభావములచే సునాయాసముగా దాటి యమపురిని చేరినాడు. 

యమధర్మరాజు నగరములో లేడని తెలుసుకుని ద్వారమువద్ద  మూడురోజులు 

అన్నపానీయాదులు లేకుండా ఆ పసివాడు  నిరీక్షించినాడు. మూడవ రోజున 

యమధర్మరాజు వచ్చి, ద్వారము వద్ద మహాతేజస్సుతో అగ్నివలె వెలిగిపోతున్న నచికేతుని 

చూచి " అయ్యో నా వల్ల ఈ బ్రాహ్మణ బాలకుడు అన్నము నీరులేక మూడు నాళ్ళు 

వుండిపోయినాడే అని బాధపడి  నచికేతుని వద్దకువెళ్ళి ఓ బ్రాహ్మణ బాలకా 'అతిథి 

దేవోభవ'. అన్న శాస్త్ర వచనము ప్రకారము చిన్నవాడివైనా నీకు నమస్కరిస్తున్నాను. నా 

నమస్కారమును స్వీకరించు. ఇంటికి వచ్చిన అతిథి అగ్నిదేవునితో సమానుడని 

తెలిసికూడా నిన్ను మూడు దినములు నిరీక్షింపచేసినాను. నన్ను క్షమించు. నాకు శుభం 

కలిగేటట్టు ఆశీర్వదించు. మూడురోజులు నిన్ను కష్టపెట్టినందుకు ప్రాయశ్చిత్తముగా నీకు 

మూడు వరాలు ఇస్తాను. కోరుకో అని అన్నాడు.

వంశదీపకుడైన నచికేతుడిలా కోరినాడు ఓ యమధర్మరాజా! మా తండ్రిగారు 

ఆందోళనారహితుడు శాంతచిత్తుడు అగునట్టు ఆశీర్వదించు. నేను  మిమ్ము చేరినాను 

కావున నా తండ్రికి సంతు కలిగించు." అన్నాడు . యముడు మొదటి కోరికను తీర్చినాను. 

రెండవకోరికను, నిన్నే మీతండ్రి వద్దకు పంపి, తీర్చుతాను ఇక మూడవది 

కోరుకొమ్మన్నాడు.. 

అప్పుడు నచికేతుడు స్వామి! ఆత్మ శాశ్వతమని కొందఱు కాదని మరికొందఱు 

అంటున్నారు. ఈ సందేహము తీరునట్లుగా నాకు అతిరహస్యమైన బ్రహ్మవిద్యను 

ఉపదేశించుము.

యమధర్మరాజు నచికేతుడు జ్ఞానోపదేశానికి అర్హుడోకాదో అని అన్నివిధాలా పరీక్ష చేసి 

అతడు యోగ్యుడు అని నిర్ధారించుకొన్న పిమ్మట ఆ బాలకుని  పట్టుదలకు సంతోషించి 

అత్యంత నిగూఢమైన బ్రహ్మవిద్యను నేర్పి పంపినాడు.

ఈ సందర్భములో ఎన్నో అత్యంత ముఖ్యమయిన శ్లోకాలు ఈ కఠోపనిషత్తులో వున్నా ఈ 

ఒక్క శ్లోకమును ఒక సాధారణ జీవితమును సక్రమమయిన రీతిగా నడిపే వ్యక్తి, తన 

పిల్లలకు చిన్న వయసులోనే నేర్పించవలసిన శ్లోకమును ఈ దిగువన అర్థ సహితముగా 

పొందుపరుస్తున్నాను.

ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవ తు 
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ 

ఇంద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్ 
ఆత్మేంద్రియమనోయుక్తమ్ భోక్తేత్యాహుర్మనీషిణః (1.3.3,4)

ఆత్మ రథికుడు అంటే రథములో కూర్చున్నవాడు, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు 

పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు,  గుర్రాలు విషయాల వైపుకు పరుగులు తీస్తాయి. ఇటువంటి శరీరేంద్రియ మనస్సులతో కూడిన జీవుడు భోక్త అని పెద్దలు అంటారు. శరీరి 

అయిన ఆత్మ, బుద్ధి, మనసు, ఇంద్రియాలు మొదలగు ఉపకరనములను 

కలిగియుంటుంది. వీనికి తోడు అవ్యక్తమయిన కర్మఫలము తలపెట్టిన ప్రతిపనిలో 

ప్రతిఫలిస్తుంటుంది. గుర్రాల వంటి ఇంద్రియాలకు ఎంత గంతలు కట్టినా అప్పుడప్పుడు 

పెడదారి పట్టుట కద్దు. మరి ఆ గుర్రాల పగ్గాలను చేత కలిగినది మనసు. మనసు 

చంచలతకు మారుపేరు. మనసే చంచలమైతే మరి గుర్రాలు మాటవినేదేముంటుంది. 

అందుకే మనసు మన నియంత్రణలో ఉంచుకొనుట మనకెంతో అవసరము.

అప్పుడే మనము ప్రేయస్సును అంటే మమకారాలను వదిలి శ్రేయస్సును గూర్చి అంటే 

పారమార్తికాన్నిగూర్చి తలపోస్తాము.

ఇందులోపిల్లలు గమనించవలసినవి :

1.     కలిగిన వానిలో మంచివి గ్రహీతకు ఉపకరించేవి మాత్రమె ఇవ్వవలెను.
2.   తల్లిదండ్రులమాట జవదాట రాదు.
3.    తనకోపమే తన శత్రువు
4.   అతిధి అభ్యాగతులు పరమాత్మునితో సమానము.వారిని గౌరవించుట మన కర్తవ్యము
5.    నాకంతా తెలుసునన్న మిడిసిపాటు పనికిరాదు.
6.    విద్య యోగ్యునికి మాత్రమే చెందవలెను.
7.     బోధించు సమయములో విద్యార్థి అత్యంత శ్రద్ధాభక్తులు కనబరచవలెను. అందుకే 
బ్రహ్మవిద్య అంత కష్టమైనదైనాకూడా నచికేతుడు నేర్చుకోగలిగినాడు.
8.    ఇవి అన్నీ మీరూ నేర్చుకొంటారు కదూ!
స్వస్తి 

No comments:

Post a Comment