Sunday, 15 March 2015

ఉగాది

వేపపూవుల చీరతో  విలసితముగ 
మావిచిగురుల రవికెతో  మరువకముతొ
మొల్లలన్నియు మాలగా ముడిని జేర్చి 
మందగమనాన 'జయ' వచ్చె మదను గూడి 
వేపపూవుల చీరతో , మావిచిగురుల రవికెతో, మరువము కలిపి కట్టిన మల్లెచెండు కలిగిన జడతో,మెల్లమెల్లగా అడుగులు వేసుకొంటూ 'జయ' మన్మదుని గూడి వచ్చుచున్నది. 

చేదును తీపియున్ వగరు చేర్చుచు పుల్పున కుప్పుకారమున్ 
మీదగు రీతినన్ గలిపి మిక్కిలి వేడుక వేప పచ్చడిన్
ఆదరమంద ఇంటినెడ యందరికిచ్చి యభీప్సితమ్ములన్
పొందుడు, శ్రీపతిన్ మిగుల పోరిమి భక్తికి చేర్చి మ్రొక్కుచున్

చేదు,తీపి,వగరు,పులుపు,ఉప్పు,కారము  అను ఆరు రుచులతో కూడిన వేప పచ్చడి ఎంతో ఆదరముతో ఇంటిల్లపాదికీ పంచి ఆ శ్రీమహావిష్ణువును  ఎంతో ఓర్పుతో  కూడిన భక్తితో ధ్యానించి మీ మీ కోరికలను నేరవేర్చుకోనుడు . 

బాలేందు మౌళియౌ బహుసర్ప భూషుండు
నీలకంఠుడు నిటల నేత్రధరుడు
నిండు చందురునేలు నెమ్మోము జిగివాడు 
శ్రీదేవి నెదపైన జేర్చువాడు
కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి
తల్లుల తనయందు దాల్చు తల్లి
అష్టలక్ష్ముల రూపు ఐశ్వర్యముల చూపు 
కరుణ గల్గినదేవి కలిమి తల్లి 

దేవతలు వాణి వాణీశు దీవెనలను 
కురియజేయగ శుభమంచు  కోయిలమ్మ 
కూసె సన్నాయి నొక్కుల కోర్కె మీర
'జయ'జయ' ధ్వని జయఘంట జగతి నింప 

చంద్రమౌళి,పాములను ఆభరణములుగా కలిగిన వాడు,నీలకంఠుడు , ఫాల నేత్రుడు అగు శివుడు, నిండు చందమామ కన్నా అందమైన ముఖము గలవాడు, మహాలక్ష్మిని ఎదలో గలిగినవాడు అగు విష్ణువు, కామాక్షి, మీనాక్షి, కాశీ విసాలాక్షిని తనలోకలిగిన తల్లి గౌరీదేవి,అష్టలక్ష్ముల రూపును తనలో ఇముడ్చుకోన్నాట్టి,ఐశ్వర్య మార్గములను చూపే తల్లియగు లక్ష్మీదేవి, సకల దేవతలు ,భారతీ బ్రహ్మ దేవుడు అందరూ శుభము శుభమని పలుకుచుండగా కోయిల సన్నాయి నొక్కులు  వారి ఆశీర్వాదములలో కలిసిపోవగా 'జయ' జయ' అని జగతికి వినిపించు రీతిగా జేగంట మ్రోగింది.

అల్లనల్లన మంచు మెల్ల మెల్లగ జారి
*కరువ పై  సెలయేటి *కరణి కాగ 
*కరువలి తోడౌచు కదిలిన ఝరి నీరు 
*జలతరంగిణులతో జాలువార 
*ఉదయ రాగాముతోడ *ఉల్లముల్లసిలంగ
*తను విస్మృతులచేత తరువులాడ 
వాద్య గోష్ఠికి నెల్ల వన విహంగములైన 
*శుక పిక హిందోళ సుధల గురవ

శోభలను జల్ల సతత యశోక వనిని 
మంద్రమున సాగు సంగీత మహిమవలని
జంతుకులమన్నదేమరచి *జంతుతతులు 
'జయ'ము'జయ' మనె 'జయ' నామ జననమందు

కరువ = కొండ ; కరణి = వలె ; కరువలి = గాలి ; జలతరంగిణులు = నీటి పై చిన్న అలలు ; వాద్య విశేషము ; 
ఉదయ రాగము = ఉదయభానుని జలతారు వెలుతురు ; ఉదయించిన రాగము ; ఉల్లసిలు = సంతసించు
*తను విస్మృతుల = మైమరచి ; శుకపిక = చిలుక కోకిల  హిందోళ = తుమ్మెదల సమూహము ; 
హిందోళము =సంగీతము లోని ఒక రాగము (రెండవ అర్థము); జంతు తతి = జంతు సమూహము 

భావము : చలితో కూడిన శిశిరము గడిచి మెల్లమెల్లగా  కొండపై మంచు కరుగ నారంభించి సెలయేరై  మందగతిలో  పాడుతూ పారుతూ వుంది . దాని నడక గాలి తో కలిసి చిన్నచిన్న అలలను రేపుతూవుంది. ఆ వయ్యారము జలతరంగిణులను వాయించు చున్నట్లు వుంది. చెట్లు  ఆ రాగానికి అనుగుణంగా మైమరచి నర్తించున్నాయి. దీనికి  
చిలుకలు కోకిలలు తుమ్మెదలు సంగీతాన్ని సమకూరుస్తున్నాయి. తదేకముగా వినే ఆ శోకమేలేని అశోకవనములో గల జంతువులు తాము జంతువులమన్న మాటనే మరచి 'జయ' 'జయ' 'జయ' మంటున్నాయి .

దక్ష వాటి పవిత్ర ధరపైన భీమేశు
డానంద మూర్తియై నలరుదాక 
ఇంద్రకీలాద్రి పై ఇమ్ముగ దుర్గమ్మ 
అవనిని పాలించు నంతదాక 
రాజరాజేశుండు రంజింపనీ భూమి 
వేములవాడలో వెలయుదాక 
శ్రీశైల మల్లన్న శ్రీమాత భ్రమరతో
చింతల బాపుచూ చెలగుదాక

సిరుల వరదలు పారించు శ్రీనివాసు
కరుణ కాణాచిగా ధర కాయుదాక 
కలిసియుందము పున్నమి కలువ తతిగ
తపనమునగూడ తనిసెడు తామరలుగ

దక్షారామములో భీమేశ్వరుడు ఈ పవిత్రభూమి పై ఆనందముగా ఉన్నంతవరకు (అంటే  దక్షుని యజ్ఞము ధ్వంసము  చేసినపుడు కలిగిన కోపము కలగకుండా , శాంత మూర్తియై ఉన్నంతవరకు), ఇంద్రకీలాద్రి పర్వతము పైన కనక దుర్గమ్మ ఆదరముతో మనల కాపాడు వరకు,వేములవాడలో రాజరాజేశ్వరుడు ఈ భూమిని ఆనందమయముగా కాపాడునంత కాలము,శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునులు మనకు ఎటువంటి చింతలు లేకుండా  కాపాడువరకు , సంపదల వరదాయకుడైన శ్రీనివాసుడు మనకు సంపద వరదలు పారించ్చున్నంత వరకు అందరమూ పున్నమి నాటికలువలలాగా , కష్టము అన్న సూర్యుని వేడిమిని భరించి ఆనందమును వదలని తామరల లాగా అందరమూ కలిసిమెలసి ఆనందముగా వుందాము. 


నిజమైన భక్తుడు




నిజమైన భక్తుడు
భూలోకంలో ఓ పేదరైతు తన వ్యవసాయం తాను చేసుకుంటూ, తన కుటుంబాన్ని, తను పోషించుకుంటూ, ప్రతి పనికీ ముందూ శ్రీహరి నామాన్ని జపిస్తూ అంతా స్వామిదయ, నాదేమీ లేదు అని తలపోస్తూ జీవితాన్ని గడుపుతూ కనబడతాడు.  
ఒకనాడు నారదుడు నారాయణ జపము చేస్తూ విష్ణు దర్శనమునకై వైకుంఠము చేరుతాడు. ఆ సమయములో విష్ణువు ఆ భక్తుని భక్తికి ఎంతో మురిసిపోతూ తదేకముగా ఆ భూలోక వాసిని చూస్తూ ఉంటాడు. అదిచూసి నారదుడు శ్రీమన్నారాయణా! ఆ రైతు తన పనులు తాను చేసుకుంటూ, అప్పుడప్పుడు మాత్రమే నీ నామాన్ని జపిస్తున్నాడు. నిరంతరమూ ని నామమె జపించేనాకంటే నీకు ఆ సాధారణ వ్యక్తి  ఎలా ఆప్తుడౌతాడు? అని ప్రశ్నించినాడు. అంత నారాయణుడు నవ్వి సరే నారదా! నీకు ఓ పరీక్ష పెడతాను అందులో నీవు నెగ్గితే నీవే గొప్ప భక్తుడవని అంగీకరిస్తాను.  లేదంటే ఆ సామాన్యుడే అసామాన్య భక్తుడని నీవు నమ్మవలసి ఉంటుంది అన్నాడు. నారదుడు అందుకు ఆనందంగా అంగీకరించి మరి పరీక్ష ఏమిటో చెప్పు స్వామీ' అన్నాడు.. విష్ణువు వెంటనే ఒక  నూనెతో నిండిన  పాత్రను తెప్పించి అది నారదుని తలపై పెట్టుకొని  ఒక్క చుక్క కూడా నూనె క్రింద పడకుండా  రోజంతా  భూలోకం చుట్టిరమ్మన్నాడు. నారదుడు సరేనని నెత్తిపై నూనెగిన్నె పెట్టుకొని సంచారానికి సన్నద్ధమైనాడు.
పందెంలో గెలవాలని, నూనె చుక్క క్రిందపడకూడదనే తలంపుతో సంచరిస్తూ, నారాయణ నామాన్ని స్మరించడం మరచిపోయినాడు. అలా తిరిగి సాయంత్రానికి విష్ణులోకం చేరుకుని, ప్రభూ నీవు చెప్పినట్లే నూనె చుక్క క్రింద పడకుండా లోకాలు సంచరించి వచ్చితినన్నాడు. అంతటితో ఆగక మరి నేను పందెం గెలిచినట్లే కదా! అని అడిగినాడు. అందుకు విష్ణువు  'నూనె క్రిందపడలేదు కాని నా నామాన్ని ఎన్ని మార్ల జపించేవు?' అని ఎదురు ప్రశ్న వేసినాడు. అందుకు నారదుడు సిగ్గుతో  'అయ్యో! స్వామీ  పాత్రమీద ధ్యాసతో నీ నామం పలకడమే మరచిపోయినాను.' అన్నాడు. అపుడు శ్రీహరి తెలిసిందా  నారదా! నీకు వేరేపని లేదు కనుక నిరంతరాయంగా నా నామాన్ని స్మరిస్తున్నావు. కానీ పని చేతికొస్తూనే  నా నామం పలకడం మరిచిపోయినావు. కాని ఆ రైతు తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ మనసులో నన్నే స్మరిస్తూ జీవిస్తున్నాడు. మరి మీ ఇరువురిలో ఎవరు గొప్ప అంటావో నీవే చెప్పు.' 'నన్ను ఎవరైతే మనసా, వాచా, కర్మణా  ధ్యానిస్తూ ఉంటారో వారికి తామరాకు నీటిబొట్టు సామేతలోని వాస్తవములా ఏ  పాపములూ  అంటనీక నా ఆప్తునిగా చేసుకొంటాను. అవసాన దశలో నా  సన్నిధి చేర్చుకుంటాను.'. అని పల్కి 'నీవు కూడా నాకు ఆప్తుడవే 'అని తన సహజమైన శైలిలో నారదునితో అన్నాడు. అప్పుడు నారదుడు శ్రీహరితో స్వామి నన్ను క్షమించండి. నిజమైన భక్తులపై నీవు తారతమ్యాలు చూపవని నిరూపించి , నా గర్వాన్ని పోగొట్టినావు. మీ మనసునేరుగుట నా తరము కాదని స్వామికి నమస్కరించి సంచారానికి బయలుదేరినాడు. .