Saturday, 30 August 2014

చిత్రాన్నము-- హోళిగె -- అతిరసము

ప్రొద్దుట చిత్రాన్నము అన్న ఒక ప్రచురణ చూసినాను. అక్కడ నా వివరణ సరిపోదేమోనన్న సంశయముతో ఇక్కడ విశధముగా, నాకు తోచిన మేరకు వివరించుచున్నాను.

పెద్దలు దీవించేటపుడు 10 కాలాల పాటు పచ్చగా వర్దిల్లమంటారు.పచ్చదనము పంటకు సంబంధించినది. పైరు పచ్చగా వుంటే పంట గొప్పగా వుంటుంది.జీవితానికి కోడా అది అన్వయమే కదా! ఇక ఆ పచ్చదనము శుభ సూచకముగా భావించుతారు కాబట్టి తినే ఆహారముకూడా కొంతమేరకైన పచ్చదనము కలిగియుండవలయునను ఉద్దేశ్యముతో వివాహాది శుభాకార్యములలో చప్పిడి పప్పు, మజ్జిగపులుసు, చిత్రాన్నము, పసుపుతో కూడిన నిమ్మరసం చారు, బండ పచ్చడి(కొత్తిమిరి+పచ్చిమిరప+ఉప్పు+బెల్లము అతి కొద్దిగా), హోళిగ (బొబ్బట్టు) లడ్డు మొదలైనవి పూర్వము రాయలసీమ ప్రాంతాలలో శాఖాహార గృహములలో చేసే వారు. కాలం మారిపోయింది. ఇప్పుడు బిరియానీలు,పులావులు,కూర్మాలు ఆ స్తానాలను భర్తీ చేస్తున్నాయి.ఇక అసలు విషయానికి వస్తాము.

1. చిత్రాన్నము : అన్నము తెల్లగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయము. అందులో అనుపానము కలిపి తినడము వాడుక.

ఇందులో పసుపు,చాలా కొద్దిగా ఆవపిండి,కొద్దిగా పసుపు,పచ్చి మిరపపొడి,ఉప్పు తగినంత వేసి , ముందుగానే వేసి పెట్టుకొన్న పోపులోఅన్నముతో కూడా కలిపితే 'చిత్రాన్నము' తయారు. ఇది నిమ్మ పండు రంగు కలిగి కంటికి ఆకర్షణీయముగా వుంటుంది. ఇందులో పసుపు,ఉప్పుతప్ప 'పులిహొర' కు వాడే వస్తువులు, నాకు తెలిసి , వాడరు.
ఇక 'పులిహోర' లోని 'పులి' . తమిళ , మళయాళ భాషలలో మనమనే చింతపండును'  'పుళి' యని కన్నడములో 'హుళి' (వారు 'ప' ను'హ' గా పలుకుతారు.) అని అంటారు. మనము చింత పండు అంటాము. మరాఠీ లో 'చించ' అంటారు. ఇది మనమాటకు దగ్గర. ఈ వంటకము మనకు పైవారినుండి అంటే చింత పండు  దిగుమతి అయినట్లు తెలియవచ్చుచున్నది.
పుళి = చింతపండు; ఒగిరై = ఓగిరము (ఆహారము ప్రకృతి,ఓగిరము వికృతి.) ఈ పులియోగిరై  రాను రాను పులియోదరై గానూ ఇంకా మారి మారి 'పులిహోర' గానూ మారింది.

2.హోళిగె : దీనినే పోళీ అని అధిక ప్రాంతాలలో అంటారు. కర్నాటకములో  'ప' కు బదులుగా 'హ' వాడుతారు గనుక అది 'హోళిగె' అయినది. రాయలసీమ ప్రాంతములో ఈ తీపి వంటకాన్ని పై రెండు పేర్లతోనే పిలుస్తారు. బొబ్బట్టు అంటే అక్కడ చాలా మందికి తెలియదు. శుభకార్యాలలో ఇది చేయుట ఆనవాయితీ ఎందుకంటే ఇది కూడా పచ్చదనము కలిగియుంటుంది కాబట్టి.
విజయవాడ,గుంటూరు.తీరప్రాంతాలలో దీనిని బొబ్బట్టు అనే పిలుస్తారు. అక్కడ .హోళిగె, పోళీ తెలియక పోవచ్చు. కర్నాటక లోని కొన్ని ప్రాంతాలలో 'ఒబ్బట్టు' అనుట కూడా కద్దు. ఇందులోనూ శెనగపప్పు,బెల్లము సమపాళ్ళ లో కలిపి పూర్ణము తయారు చేసుకొని తగినన్ని నీళ్ళతోనో,పాలతోనో,పసుపు ఒక చిన్న స్పూను, చిటికెడు ఉప్పు మంచి గోధుమపిండి తోకలిపి ఒక గంటకు పైగా నానబెట్టి, తరువాత పూర్ణపు ముద్దలు  గోధుమ పిండి ఉల్లెలో జొనిపి  దానిని చపాతీ బండ పై బట్టపరిచి దానిపై పోడిపిండిని రాల్చి ఈ వుల్లెని వత్తి పెనము పై కాల్చుతారు.విధానము అంతటా దాదాపు ఒకటే అయినా పేర్లలో మాత్రమె వ్యత్యాసము.

3. అతిరసము: ఇది చేయడము సులభమే గానీ జాగ్రత్త చాలా అవసరము.దాదాపు  3/4 kg బెల్లమి 1 kg బియ్యపుపిండి కాల్చుటకు నూనె ,కావలసినది అంతే. అంతా బెల్లపు పాకము తయారుచేయుటలోను పిండి పాకములో వేసి కలిపి (సాయంకాలముగా కలిపి రాత్రికి అలాగే ఉంచుతారు) తెల్లవారి అతిరసాలు చేస్తారు.
తమిళులు, రాయలక సీమ వారు దీనిని అతిరసం అంటారు. విజయవాడ,గుంటూరు.తీరప్రాంతాలలో దీనిని అరిసె అంటారు.
తమిళులలో అనేకులకు అతిరసం అన్నది సంస్కృత పదమనితెలియదు. నమిలే కొద్దిరసము వూరుటచే బహుశ అతిరసమంటారేమో. మరి ఆంద్ర లో 'అరిసె' అని ఎందుకంటారో వారికి కూడా తెలిసియుండక పోవచ్చు. 'అరిసి'
అన్నది తమిళ పదం అంటే బియ్యము అని అర్థము. అరిసి తో ఈ వంటకము చేస్తారు కావున దీనిని అరిసెలంటారు.

ప్రాంతాలు వేరయినా నాడెంతో సోదరభావము వుండేది. మరి నేడో?











Wednesday, 27 August 2014

మతాతీత పరిపాలన


'సెక్యులరిజము'నకు పరమత సహనము(మతాతీత పాలన) అన్న అర్థము చెప్పుకోవచ్చునేమో . అట్లు చెప్పుకొంటే అది అన్ని మతాలలోవుందా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అయితే, వుంది అని చెబితే అది అబద్ధమౌతుంది. లేదు అని చెబితే ఆత్మ వంచనౌతుంది. ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులలో సమాధానము మౌనమే.

మరి మన రాజ్యాంగ అవతారికలో వాక్స్వాతంత్ర్యము  వున్నది,  'ఇహము పరము లేని మొగుడు ఇంటినిండా రుచి పచి లేని కూర చట్టినిండా ' అన్నట్టు. ఏమి మాట్లాడితే తప్పో ఏమి మాట్లాడితే ముప్పో అన్న భయముతో సామాన్య మానవుడు సతమతమౌతూవున్నాడు, ఎందుకంటే ఏమి మాట్లాడితే ఒప్పో తేల్చుకోలేక పోవడమే కారణము.

ఈ 'వాక్ స్వాతంత్ర్యము' అన్న మాటకు నేను నా మనసుకు ఈ విధముగా చెప్పుకొన్నాను.'స్వ' అంటే తన యొక్క 'వాక్' అంటే మాట, 'తంత్రము' కుత్సితము కుట్రతో కూడుకొని యుండునది అన్న అర్థము చెప్పుకోవలసి వస్తుందేమో.

అంటే' మన మాట ఎప్పుడూ 'ఆత్మలోన విషము అంగిట బెల్లమ్ము' అన్నట్లుండవలెనేమో! ఇది ప్రప్రధముడైన మన దేశ ప్రధాని ,ప్రధానముగా సనాతన (శాశ్వతమైనది అంతే కానీ పాతది అన్న అర్థము లేదు.) ధర్మావలంబులకు వేసిన బురఖా.

ఎన్ని కలలో కన్నసామాన్యునికి ఎన్నికల భూతము ఆవహించగా దానిని వదిలించుకొనేటప్పటికి తనలో మిగిలినది నిరాశ,నిస్పృహ,నిస్సహాయత,నిర్వేదము.' పళ్ళూడగొట్టుకోనుటకు ఏ రాయైతే ఏమన్న' వేదాంతాన్ని ఆకళింపు చేసుకొన్నాడు. నాయకులు మాత్రము ' మీరూ మీరూ తన్నుకు చావండి మిగిలినవారిని మేమేలుతాం' అంటున్నారు. నాయకులకు కావలసినది కేవలము 'స్వార్థము',. దీనికి నేను నాది అన్నది ఒక అర్థమైతే ఇంకొక అర్థము 'నా డబ్బు' అని. అంటే నా 100 రూపాయల ఖర్చుకు 100000 రూపాయలన్నా వస్తుందా అన్న దురాశ.

ఎంత సంపద వున్నా 3 లేక 4 పూటలు తింటాడు ఎవడైనా ఒకవేళ ఆరోగ్యము బాగుంటే, అంతకు మించి తినలేడు కదా! అందుకే పెద్దలు ' లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారమ్ము మ్రింగబోడు' అన్నారు. ఇక నిద్రా!, తన చేతిలోలేదు . నిద్ర మాత్రల నాశ్రయించ వలసిందే. మరి సంపాదించి ఏమి చేసుకోబోతున్నాడు. పాపం తనకే తెలియదు. ఇక ఆరోగ్యము 'లైఫ్ బాయ్ ఎక్కడ వుంటే ఆరోగ్యమక్కడ' వున్నట్లు వీరికి తోడుగా రక్త పీడన (blood pressure) మధుమేహము(diabetes) ఉండవలసిందే కదా! అనారోగ్య జీవితానికి అర్థమూ లేదు పరమార్థమూ లేదు.

జాతీయ మహానాయకులు,నిజమైన మహనీయులు అయిన సుభాష్ బోస్ , సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, లాల్ బహాదుర్, గుల్జారీలాల్ నందా, మొరార్జీ దేశాయ్ ప్రకాశం పంతులు, ఇంకా ఎందరెందరో ఆదర్శ మూర్తులుగా ఉండవలసినవారు కాల గర్భములో కలిసి పోయినారు. ఇప్పటి నాయకులు 'హాథీ కె దాంత్ ఖానేకే ఔర్ దిఖానేకే ఔర్' బాపతుకు చెందిన వాళ్ళే.

భావి నాయకులను తయారుచేసే బాధ్యత తల్లిదండ్రులు,అంటే ఇప్పటి యువతరము తీసుకోగలిగితే , తమపిల్లలకు నీతి నిజాయితి, ఋజువర్తన  నేర్పించ గలిగితే, వారి వృద్ధాప్యములోనో, లేక వారి సంతానము యొక్క వృద్ధాప్యములోనో ఒక ఆదర్శవంతమైన సమాజము చూసే అవకాశము ఉందేమో. ఈ దేశము యొక్క ఈ ధర్మము యొక్క , మనకీ వారసత్వమునందజేసిన  పేరునాశించని మహాపురుషుల గొప్పదనము తెలుసుకొనే ప్రయత్నము చేయండి.
అసలు ఈ వాలంటైన్ అనునతడు ఎక్కడి వాడు అసలు వుండినాడా లేదా, ఒకవేళ వుండివున్నా అతనిని అనుసరించవలసిన కర్మ మనకెందుకు పట్టినది అని యోచించండి.ఈ రోజు మీరు హీరో కావచ్చు రేపు పెళ్ళయి మీ బిడ్డలు వయసుకు వచ్చి బరితేగించితే మీ మనోవ్యధ ఏవిధంగా ఉంటుందో ఊహించండి.
ఈ వాలంటైన్ దివసము (దినము) నకు తిలోదకాలివ్వండి. యువత నిర్వీర్యులైపోతే  రంగులోమునిగిన రవివర్మ చిత్రమైపోతుంది ఈ దేశము. అప్పుడు మనకు 'గొరగంగా మిగిలిందే జుట్టు.'
స్వస్తి.

చెరుకు రామ మోహన్ రావు




















ఓం 

శ్రీ  ఉచ్చిష్ట గణపతియే నమః 

నక్షత్ర దర్శనం


ఒక నక్షత్రపాదానికి   3 డిగ్రీస్ 20 ' min , ఒక నక్షత్రానికి 4 పాదములు , ఒక రాశికి 9 నక్షత్ర పాదములు , 12 రాశులకు 108 నక్షత్ర పాదములు 
  27 నక్షత్రములు 
 1వ సముదాయం 
1. అశ్విని  2. భరణి  3. కృత్తిక  4. రోహిణి . 5. మృగశిర 
6. ఆర్ద్ర 7. పునర్వసు 8. పుష్యమి 9. ఆశ్లేష      
                   2 వ సముదాయం
10. మఖ  11. పూర్వ ఫల్గుణి  12. ఉత్తర ఫల్గుణి 13. హస్త 
14. చిట్టా 15. స్వాతి 16.విశాఖ 17. అనురాధ 18. జ్యేష్ట
                    3 వ సముదాయం
 19. మూల 20 . పూర్వాషాడ 21ఉత్తరాషాడ 22. శ్రావణం 23. ధనిష్టం  
 24. శతబిష్టం 25.పూర్వాబాద్ర 26 ఉత్తరా బాద్ర 27.రేవతి 
ఈ మూడు సముదాయములకు కేతువుతో మొదలై బుధునితో నక్షత్రాదిపతుల మహర్ధశ అంతమవుతుంది . ఈ క్రమమును ఒక పట్టిక రూపములో పొందు పరచవచ్చు . 
కేతు ---------7,శుక్ర -------6, సూర్య -------1, చంద్ర ----------2, కుజ---------9, 
రాహు---------4 , గురు-----------3, శని----------8 , బుధ--------5
ఈ stellar న్యూమరాలజీలో , ఏ మాసములో ఐతే మనం పుట్టామో లేదా రాశి  (sun sign ) సౌర రాశి ప్రకారము ఆ రాశికి అధిపతితో  సంఖ్య మహర్ధస మొదలవుతుంది . క్రమంగా మిగిలిన 8 గ్రహాల మహార్ధశ వరుసగా జరుగుతుంది . ఇది మహర్ధశ నిర్ణయం . 
                 గ్రహముల మిత్రశత్రు సమత్వ పట్టిక
                  ---------------------------------------------  
గ్రహములు----------   మిత్రులు ----------------  శత్రువులు ------సమ 
సూర్యుడు ------   చంద్ర , కుజ , గురు -------   శని ,శుక్ర -------బుధ 
చంద్రుడు ----------   సూర్య, బుధ -------------  లేరు --------కుజ,గురు,శని ,శుక్ర 
కుజ ------------     గురు , శుక్రులు --------------బుధ ------- శుక్ర , శని 
గురు ------------    రవి , చంద్ర , కుజ ----------శుక్ర ,బుధ --- ---- శని 
శుక్ర --------------   శని , బుధ ---------------- చంద్ర ,సూర్య------కుజ , గురు 
శని ---------------   బుధ, శుక్ర ---------------సూర్య,చంద్ర , కుజ ---గురు. 
పైన వివరించిన పట్టికను మనం సంఖ్యల రూపంలో చూద్దాం .   
                    సంఖ్యలలో గ్రహముల మిత్రశత్రు సమత్వ పట్టిక
                    ---------------------------------------------------------
గ్రహములు----------   మిత్రులు ----------------  శత్రువులు ------సమ
       1           ------   2,9,3 -----------------   8,  6  -------    5 
       2     ----------   1   ,5  -------------    ----------  --------  9, 3, 6, 8 
       9  ---------------  3, 2 ,1----------------     5    --------   6,8
       5  -----------------  1, 6 --------------------  2 ---------------- 9, 3, 8
       3   ------------------ 1,2,9 ------------------- 6,5 --------------- 8
       6    ---------------   8,5  -------------------   2,1 --------------- 9,3
       8 -------------------- 5,6  -------------------  1, 2, 9 ------------ 3
     
     పంచద మైత్రి ( compound relation )
      మిత్ర + మిత్ర     =    అధి మిత్ర 
      సమ + మిత్ర    =     మిత్ర 
      సమ  + శతృ     =   శతృ 
     శతృ    + శతృ     = అధి శతృ
     శతృ +   మిత్ర     =   సమ 
మరియు  నక్షత్రానికి అక్షర రూపం ఇచ్చే పద్ధతి అందరికి సుపరిచితమే  . 27 నక్షత్రాలకు 108 పాదములకు, 108 అక్షరాలను ఇవ్వటం జరిగింది . 
                  నామ నక్షత్ర రాశి పట్టిక
                     ---------------------------
అశ్విని 4 మేషం -- చూ , చే , చో , లా 
భరణి 4 మేషం ---  లీ , లూ , లే , లో 
కృత్తిక 1 మేషం 3,వృషభం --- ఆ , ఈ , ఊ , ఏ 
రోహిణి 4 వృషభం ----    ఓ , వా , వీ , వు 
మృగ 2 వృషభం 2 మిధున ---  వే , కా , కీ 
ఆరుద్ర 4 మిధునం -- కూ , ఖం , జ , చ్చ డో 
ఫల్గుణి 3 మిధున 1 కర్కాటకం ----- కే , కో , హ, హీ 
పుష్య 4 కర్కాటకం --- హూ , హే, హో ,డా 
ఆశ్రే 4 కర్కాటకం --- డీ , డూ , డే , డో 
మఖ 4 సింహం -- మా , మీ , మూ  , మే 
పుబ్బ 4 సింహం --- మో , టా , టీ , టూ 
ఉత్తర 1 సింహం 3 కన్య -- టే , టో , పా , పీ 
హస్త 4 కన్య ---- పూ , షం , ణా , డా 
చిత్త 2 కన్య 2 తుల --- పే , పో , రా , రి 
స్వాతి 4 తుల -- రూ , రే , రో , త 
విశాఖ 3 తుల , వృశ్చిక --- తీ , తూ , తే, తో 
అనూ 4 వృశ్చిక----నా , నీ , నూ , నే 
జ్యేష్ట 4 వృశ్చిక---- నో , యా యీ , య 
మూల 4 ధనస్సు --  యే , యో , బా బి 
పూర్వాషాడ 4 ధనస్సు -- భూ , ధా , భా , డా
ఉత్తరాషాడ 1 ధనస్సు 3 మకరం --- బే , బో , జా , జి 
అభిజిత్ మకరం --- ఖ , ఖా , ఖె , ఖో
వైశేషిక దర్శనము - విశేషాలు 

మనము మామూలుగా నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలు, ఆరో-పదహారో దర్శనాల పేర్లు తెలుసుకుని వాటితో మన జ్ఞానం పరిపూర్ణమయినదని అనుకోకూడదు. వాటిలో ఏమిటి ఉంటుంది? ఇది తెలుసుకుంటే ప్రాచీనులు ఇవన్నీ ఎందుకు ముఖ్యమనుకున్నారో తెలుస్తుంది. ఊదాహరణకు వైశేషిక దర్శనం చూదాం. ఇందులో ముఖ్యపదం విశేషం. "ఏవండీ బావగారు! ఈ రోజు పత్రికలలో విశేషాలు ఏమిటి? అని ఇద్దరు వృద్ధుల సంభాషణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి మాచిన్నప్పుడు వచ్చేది. విశేషాలు అందరికీ కావాలి. అది మానవ లక్షణం. అసలు జ్ఞానం అని మనం అనుకునేది పదాలు వాక్యాలలోనే ఉంటుంది, భాష ఏదైనా. 
క్రైస్తవులకు పదమంటే దేవుడు. యెహోవాకు మరొక పేరు. కావాలంటే యోహాను సువార్త చూడండి (The Gospel of John Chapter 1 (King James Version) - 1 In the beginning was the Word, and the Word was with God, and the Word was God.) ఆ పదము ఏమిటో వారికి తెలుసా? సువార్తీకులను అడగాలి. ఆ పదం నాకు తెలియదనికాదు. నాకు అది మరెక్కడో కనుపించింది. దేవుడు (ఉంటే) ఆయన సృష్టించిన ప్రపంచాన్ని (ఆయన సృష్టిస్తే) వర్ణించడానికి ఎన్ని రకముల (categories) పదములు అవసరమౌతాయి. ఇది చెప్పే శాస్త్రము వైశేషికము. పదాలు తెలిస్తే పదార్థాలు తెలుస్తాయి. కణాదుడు వైశేషిక సూత్రాల కర్త. ఆయనా అన్నాడు ఆరు రకముల పదాలు చాలు అన్నారు. తరువాత ఏడవదానినికూడా చేర్చారు.అందుకే వైశేషికాన్ని సప్త పదార్థి అంటారు అవి ద్రవ్యము,(matter), గుణము (quality) కర్మ (action) సామాన్యము (universal) విశేషము (special) సమవాయము (inherence) అభావము (absence) 
దేవుడు - ద్రవ్యము, మనుష్యుడు - ద్రవ్యము, బ్రహ్మము - ద్రవ్యము, గుణములు వేరు. దేవుడు - సామాన్యము శివుడు - విశేషము, కణాదుని ప్రకారము ప్రతిపదార్థము అణువులతో నిర్మించబడినది. దేవునిలో దైవాణువు ఉంటుంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రములో నొబెల్ బహుమతి హిగ్స్ బొసాన్ (గాడ్ పార్టికల్) ను గుర్తించినవారికి వచ్చింది. కణాదునిది అత్యాధునిక విజ్ఞానమని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. దేవునికి ఇంగ్లీషు పదం గాడ్ ఒకటే అయితే మనకు గుణంతో కలపడం వలన వేలాది నామాలు వచ్చాయి.

తర్కములోని ఇతర పదాలు 
పూర్వ పక్షము - ఉత్తర పక్షము (సిద్ధాంతము), హేత్వాభాస, ఛలము, జాతి, నిగ్రహస్థానము. 
పూర్వ పక్షము - ఒక వాదనలో మొదటి వ్యక్తి తన సిద్ధాంతాన్ని చెబుతూ చేసిన మొదటి ప్రసంగం. the prima facie view or argument in any question 
సిద్దాంతం (ప్రతిజ్ఞ) - దేవుడు విశ్వమునకు సృష్టి కర్త.
హేతువు - ప్రతి కార్యము వెనుక ఒక కర్త ఉండును.
ఉదాహరణ - ఒక రథము ఉన్న అదినిర్మించిన రథకారుడు, ఒక ఘటము ఉన్న అది సృష్టించిన కులాలుడు (కుమ్మరి) ఉన్నారు
ఉపనయము - విశ్వముయొక్క సృష్టికూడ అటువంటి కార్యమే. కర్త ఉండితీరవలెను. అతడే దేవుడు.
నిగమనము - దేవుడు విశ్వమునకు సృష్టికర్త.
ఈ ఐదువాక్యములను పంచావయవ న్యాయ వాక్యములంటారు (Five limbed Indian syllogism)
ప్రతివాది దీనిని ఖండించి తన సిద్ధాంతమును ప్రకటించవలెను.
ప్రతివాది - తమ న్యాయ వాక్యము దోషభూయిష్టము. హేత్వాభాస స్పష్టముగ ఉన్నది. పక్షాభాసయు ఉన్నది. నిగమునమూ సరిలేదు. రథ నిర్మాణమునకు విశ్వసృష్టికి పోలికయే లేదు. దేవుని కార్యము సంకల్పమా నిర్మాణమా?. విశ్వమునకవసరమైన మూల పదార్థములెక్కడివి? మీరుచెప్పిన ఆదేవుడు ఉపాదాన కారణమా (material cause) నిమిత్త కారణమా(instrument cause)? ఉదాహరణము - ఒక విమానము తయారు చేయుటకు బోయింగ్ కంపనీ పది దేశములలో పదివేల మందిని ఉపయోగించును. దేవుడొక్కడే విశ్వనిర్మాణము చేయగలడా? బ్రహ్మాండములు, బ్రహ్మలు, ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు - వీరిపాత్ర ఏమి? కులాలుడు కేవలము నిమిత్త కారణము. అతని సారెయు నంతే. మట్టి అతని సృష్టి కాదు.

Saturday, 9 August 2014

తాండవ శివస్తోత్రము (మహాభక్త రావణ ప్రణీతము)

తాండవ శివస్తోత్రము (మహాభక్త రావణ ప్రణీతము)

పంచచామర ఛందస్సులో అమర్చిన ఈ స్తోత్రము రావణబ్రహ్మ కృతముగా ప్రసిద్ధి పొందినది.ఒక 3 నెలల క్రితం అడిగిన ఒక ఆనన గ్రంథ మిత్రుని కోరిక మేరకు నా అల్ప మేధస్సుకు తోచిన విధముగా వివరణ ఇచ్చే ధైర్యము చేయుచున్నాను.విజ్ఞులు దయతో నా సాహసమును మన్నింప ప్రార్థన.


రోజూకు ఒక శ్లోకము తదర్థమునుంచ ప్రయత్నిచుతాను.


1.

ఝటాటవీ గళ జ్జలప్రవాహపావిత స్థలే
గళేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం
ఢమ డ్ఢమ డ్ఢమ డ్ఢమ న్నినాద వడ్ఢమర్వయం
చకార చండ తాండవం తనోతు నః శివ శ్శివం

ఉత్తుంగ గంగా జలపాతమును భరించు ఘనారణ్య సాద్రుశమైన జటలు గలుగు కంధరము (మెడ) చుట్టూ భుజంగ మాలికలు (ఫణిభూషణములు) కలుగుచూ తన ఢమరుకము నినదించు ఢమఢమ ఢమఢమ శబ్దమునకనుగుణముగా తాండవము చేయు పరమేశ్వరుడు మనకు సకల శుభములను సమకూర్చుగాక.


2


జటా కటాహ సంభ్రమభ్రమన్నిల్లింప నిర్ఝరీ,


విలోల వీచివల్లరీ విరాజ మాన మూర్ధనీ,

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్ట పావకే,

కిశోరచంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ.


కటాహము అన్న మాటకు నిఘంటువు అర్థము కడవ, పాత్ర అని తీసుకొనవచ్చు.ప్రస్తుతము ఈ 


శ్లోకములో బావి , లోతు మన ఊహకందనిది,అని అన్వయించుకొనవచ్చును.మహాజటా కూప 


స్థితోత్తుంగ తరంగిణీ విలసిత గంగా ప్రవాహము కలిగి ఫాలమున అగ్నిని కలుగుచూ(మూడవ 


కన్ను)కొండవంటి తన కొండె(జుట్టు ముడి) సానువున బాలచంద్రుని కలిగిన పరమేశుడు 


ప్రతిక్షణమూ నా మనసులో రమించుచున్నాడు.



3.

ధరా ధరేంద్ర నందినీ విలాస బంధు బంధుర,

స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మాన మానసే,

కృపా కటాక్ష ధొరణీ నిరుద్ధ దుర్ధరాపది,

క్వచిత్ దిగంబరే (క్వచిచ్చిదంబరే) మనో వినొదమేతు వస్తుని.


సకల చరాచర జీవ రాశికి కారణభూతమైన ప్రకృతి యైనట్టి అద్రిరాజసుతయైన తన అర్ధాంగి ఈ జగన్నాటకరంగము పై చేయు నృత్య హేలకు సర్వవిధముల సహకారియై నర్తించుచూ దుర్భర దుస్సహమైన ప్రతిబంధకముల తొలగించు తన కృపా కటాక్ష
వీక్షణముల మనపై ప్రసరింప జేయుచుండునట్టి చిదంబరుడు దిగంబరుడునగు పరమేశ్వరునిపై ధ్యాసచే ధ్యానముచే నా మనసు నిలిపి బ్రహ్మానందమును పొందుదును. 


4.

జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫణా మణి ప్రభా
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూ ముఖే
మదాంధ సింధుర స్ఫురత్ త్వగుత్తరీయ మేదురే
మనో వినోద మద్భుతం బిభర్తు భూత భర్తరి

జటలచేతను ఉరగాభరణములచేతను వానిపడగలపై గల పింగళ ద్యుతి(గోరోజనపురంగుగలిగినకాంతి)ప్రభాసిముగు మణులు 
వివిధ వర్ణములలో దిగ్వధువులపై (అష్ట దిక్కులను సుందరాంగులతో పోల్చబడినది) కాంతి విరజిమ్ముచుండగా ధగద్ధగాయమానమౌ మదగజచర్మాంబర ధారిని, పరమ శివుని మనోమందిరములో ప్రతిష్టించుకొని ఆత్మానందమును పొందుచున్నాను.


5.

సహస్ర లోచన ప్రభృత్యశేష లేఖ శేఖర
ప్రసూన ధూళి ధోరణీ విధూ సరాంఘ్రి పీఠభూః
భుజంగరాజ మాలయా నిబద్ధ జాట జూటకా
శ్రియై చిరాయ జాయతం చకోరబంధు శేఖరః

సహస్రలోచనుడగు ఇంద్రుడు తదితర దేవతలందరూ నాట్యరంగవలయితులై మైమరచి తిలకించుచుండగా పరమేశ్వర పదఘట్టనము చేత ఎగసిన పాదరజము ఆశీర్వాద పూర్వకముగావారి శిరసులనలంకరించగా, ఘన జతాజూతశిఖను జారకుండా సర్పరాజములు బంధించియుండగా, వెలుగు జిలుగుల చందమామ మధురుచిని (రుచి= కిరణము, వెలుగు) చకోరము తనివి తీరక గ్రోలుచునే యుండగా శ్రేయస్సును కలుగజేసే తాండవమొనరించుచు ప్రేక్షకులను నిశ్చేష్టుల జేసిన నటరాజుకు నా సాష్టాంగ  నమస్కారము.


6.


లలాట చత్వర జ్వలద్ధనంజయ స్ఫులింగభా

నిపీత పంచ సాయకం నమన్నిలింప నాయకం
సుధా మయూఖ లెఖయా విరాజమాన శేఖరం
మహా కపాలి సంపదే, శిరో జటాలమస్తునః

ధరించిన అగ్ని గల ఫాలనేత్రమును తెరచి పంచబాణుని (అరవిందము, అశోకము,మావి,మల్లె, నల్ల కలువ) మదమణచిన బాలేందుశేఖరుడగు కపాలి ఐశ్వర్యమునకాలవాలమైన తన ఘన జటల నుండి తగిన సంపద కలుగజేయుగాక.ఆ నటరాజునకు త్రికరణ శుద్ధిగా సాష్టాంగ నమస్ కృతి చేయుచున్నాను.


7.

కరాళ ఫాల పట్టికా ధగధగ జ్వల-

ద్ధనంజయా హుతీ కృత ప్రచండ పంచ సాయకే,
ధరద్ధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక-
ప్రకల్పనైక శిల్పిని, త్రిలొచనే రతిర్ మమ.

ప్రచండ ధ్వనిని కల్గి ధగద్ధగలతో జ్వాలాయమానమై ప్రజ్వరిల్లుచున్న విశాల ఫాల నేత్రము చేత దగ్ధము కాబడిన పంచ శరుని (మన్మధుని) కలిగినవాడైన నటరాజు చేయు తాండవముచే కలుగు పద ఘట్టనల వలన  వసుధా ఉరముపై ( అంటే భూఫలకము మీద అని అన్వయము. వాసుదా ఉరము అంటే భూమి ఎద అని అర్థము. కవిత్వము ఎప్పుడూ అన్వయ ప్రాధాన్యత కలిగి ఉంటుంది.అందులోనూ రావణుడు పరమ శివ భక్తుడు ఆ విధముగా మహనీయుడు.) చిత్ర విచిత్ర చిత్ర లేఖనములు చేయుచున్నాడు. (ఇక్కడ భూమిపై సృష్టిని ఆవిష్కరించుచున్నాడా మహానుభావుడు.) భూమి ప్రకృతిలో భాగమే . ప్రకృతి అంటే వేరేవరోకాదు పరమేశ్వరియే కదా!పురుషుడు పరమేశ్వరుడే!శివతత్వమెంత ఇమిడియుందో గమనించండి.అంటే ఆ సతీపతుల నాట్య సంరంభము సృష్ఠికి ఆది పునాది అన్నది అన్వయము.అట్టి పరమేశుని ఫాలనేత్రముపై నా చిత్తము మొత్తమునుంచి నేను సాష్టాంగ ప్రణతులనాచరించుచున్నాను.


8

నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్
కుహూ నిశీధి నీతమః ప్రబంధ బంధ కంధరః
నిలింప నిర్ఝరీ ధర త్సనోతు కృత్తి సింధురః
కళా నిధాన బంధురః ష్రియం జగత్ దురంధరః

అమావాస్య చంద్రునివలె నున్నకంధరమును నియంత్రణ లేని నవీన మేఘసముదాయము నిరోధించినట్లు భాసించుచున్నఫణాళి కలిగినవాడై, ఉత్తుంగ తరంగయౌ గంగను తన ఘన జటలయందు బంధించినవాడై, గజచర్మ ధారియై,బాలశశిమౌళియై, విశ్వధారియైనయా తాండవ మూర్తి యగు పరమ శివుని ప్రియమారా మది దలచి ప్రణమిల్లుచున్నాను.

9.
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభా
వలంబి కంఠ కందళీ రుచి ప్రబద్ధ కంధరం
స్మరచ్ఛిదం పురచ్ఛిదం బవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజె

సముద్ర మంథన సమయంలో త్రావిన హాలాహలము, బహుశ హాలాహల సాదృశమైన  మన పాపములేమో, కడుపు లోనికి పోనీక కంఠ మందే ఒక పట్టికగా(neck lace)నిలిపి, అది నీలోత్పల మాలయో అన్న భ్రమను కలిగించుతూ, పంచశరుని,త్రిపురాసురులను, భవబంధములను, దక్షయజ్ఞమును, గజాసురుని, అంధకాసురుని, వధించి, యముని మదమణచిన ఆ తాండవ మూర్తిని మది నిండా నిలిపి మనసా,శిరసా,ఉరసా, అష్టాంగముల భూమికానించి నమస్కరించుచున్నాను.


10.


ఆఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ     

రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం
గజాంతకంధకాంతకం తమంతకాంతకం భజె

నిత్య నిరంతర శుభంకరుడు,ఆఖర్వ(న+ఖర్వ = కురుచ కాని) మంగళాకారుడు,కదంబ పుష్ప గుచ్చ ప్రసరిత మధుప్రవాహ మాధుర్యమునందించు మధుపమగు భావజాంతకుడు, త్రిపురాసురసంహారి,భవాంతకుడు,

దక్షయజ్ఞధ్వంసి,గజాసురాంతకుడు తమోపహారియు నగు పరమేశ్వరుని పాదములు మదిలో నిలిపి భజించుచున్నాను.

11.
జయత్వతభ్ర విభ్రమ భ్రమ ద్భుజంగ మశ్వసద్
వినిర్గమత్క్రమస్ఫురత్ కరాళ బాల హవ్య వాట్
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వనన్మృదంగ తుంగ మంగళ
ధ్వని క్రమ ప్రవర్తితః ప్రచండ తాండవ శ్శివః

నయన చాలనముచే ఈ జగత్తును నియంత్రించుచుందగా,చమత్కార శరీర విన్యాసమునకునిలకడలేక కదలుచున్న పాపలు (సర్పములు) కొట్టుచున్న బుసలవల్ల కలిగెడు వడగాడ్పు ఫాలాక్షమునుండి వెలువడు అగ్నిని ప్రజ్వరిల్ల జేయగా, మృదంగ రావమునకనుకంపితమైన పాద ఘట్టన చేత  ధిమిద్ధిమిద్ధిమిద్ధిమి రవములు లయ బద్ధముగా బయల్వెడలగా నర్తించు శివుని మనసారా ధ్యానించెదను.



12.

స్పృషద్ విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తికా స్రజోర్
గరిష్ఠ రత్న లొష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః
తృణార వింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం

విచిత్ర వర్ణ రంజిత తూలికా (ఈకలు) తల్పమైనను కటిక నేలయైనను,  ఫణులచే(పాములచే) విడువబడిన మణుల  మాలికలైనా మట్టిపూసల  హారములైనా,శత్రువైనా మిత్రువైనా, అమలిన కమలమైన అల్పమైన గడ్డిపోచయైనా,సార్వభౌముడైనా సాధారణ పౌరుడైనా, సమదృష్టిని సమకూర్చమని వేడుకొంటూ నిన్ను భజించుచున్నాను.


13.


కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్

విముక్త దుర్మతిః సదా శిరః తమంజలిం వహన్
విలోల లోల లొచనో లలామ ఫాల లగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం

సురగంగా ప్రవాహ సమీపమున ఘోరాటవీమధ్యమున, మూర్ధన్యమౌ ముకుళిత హస్తములు కలిగి, నీపైనే మది నిలిపిన నాదృష్టికి , నటనానుకూలముగా చలించు నేత్ర సముదాయము కలిగిన నీ పవిత్ర  ఫాల భాగాము కనిపింపగా చేసి శివ పంచాక్షరినుచ్చరించుటచే కలుగు సౌఖ్యమును అనుభవింపజేయుము  పరమేశ్వరా!


14.


ఇదం హి నిత్యమేవ ముక్త ముత్తమోత్తమం స్తవం,

పఠన్ స్మరన్ బ్రువన్ నరొ విశుద్ధిమేతి సంతతం,
హరే గురౌ సుభక్తిమాశుయాతి నాన్యథా గతిం,
విమొహనం హి దెహినాం సుశంకరస్య చింతనం

ఉత్తమోత్తమైన రీతిలో చెప్పబడిన ఈ స్తవమును పఠించినా,స్మరించినా,వదించినా( వినబడునట్లు నుడివినా) నరులు సదా సర్వదా పునీతులగుదురు.ఆ హరుని, గురుని, పరుని స్వచ్ఛమైన మనసుతో నిరంతరాయమైన రీతిలో తానే శివునిగా తలచే భక్తునికి విమోచనము కలిగించి యా పరమ శివుడు తన పదమునందనవరతమూ ఆశ్రయమిచ్చును.


15.

పూజావసానసమయే దశవక్త్రగీతం
యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే
తస్య స్థిరాం రథగజేంద్రతురంగ యుక్తం
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః

దశగ్రీవుడు (పది తలలు గలిగిన రావణాసురుడు)రచించిన ఈ కృతిని ప్రదోష కాలములో (సాయంకాలమున, శివ పూజకు శ్రేష్టమైన సమయము) శంభుని పూజావసాన సమయమున (శివపూజ ముగించబోవునపుడు)  

పఠించు వారలకు రథ,గజ, తురగంబులతో(గుర్రములతో)కూడిన సకలైశ్వర్యములనూ సమకూర్చుతూ నిరంతర లక్ష్మీ కటాక్ష సిద్ధిని ఆ పరమేశ్వరుడైన శంభుడు కలిగించును.

సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు సమాశ్రయాః

సర్వే భాద్నాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్

ఓం శాంతి శాంతి శాంతిః


తత్సత్