Thursday, 10 April 2014

ఆంధ్రులు-- వారి మూలములు

ఆంధ్రులు


ఆంధ్రులు వారి మూలములు అన్న విషయ ప్రస్తాపన ఎవరు చేసినా కార్యారంభములో గణపతి ప్రార్ధన చేసినట్లు మహనీయులు, వేదముర్తులు, పరివ్రాజకులై విరూపాక్ష జగద్గురు పీఠాధిపతులై శ్రీ శ్రీ శ్రీ అద్వయానంద శంకర భారతీ స్వామిగా కొనియాడబడి  కైవల్య పదమలంకరించిన మాన్యవరులు కోట వెంకటాచలం గారి పాద యుగళికి నమస్కరించకుండా పూనుకొన మనస్కరించదు.  కంప్యూటరు, అంతర్జాలము,గూగులు లేని కాలములో వ్యయ ప్రయాసల కోర్చి ఎన్నో గ్రంధములను పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి వాస్తవములను వెలికి తీసినవారి అకుంఠిత దీక్షా దక్షత అనితర సాధ్యము.  నేను వ్రాయబోయే వ్యాసమునకు వారి ఆంధ్రులను గూర్చిన పరిశోధనయే మూలము. 21-4-1885 లో పుట్టిన వీరు 12-11-1959 లో బ్రహ్మసాయుజ్యమును పొందినారు.
గతములో పాశ్చాత్యుల ప్రలోభమునకు గురియైనవారు కొందరైతే, ప్రభావమునకు లోనైనవారు ఎందరో ? మన దుస్థితి ఏమిటంటే మనకు విస్సన్న చెప్పింది వేదము, జేమ్సు చెప్పిందే చరిత్ర. అందువల్ల మనమేరోజూ మన చరిత్ర తెలుసుకొను నుత్సుకత చూపింది లేదు.  ఒక వేళ ఎవరైనా భారతీయులు ఉత్సుకత చూపినా వానిని చదివి, వ్రాసిన వారిని ప్రోత్సహించిందీలేదు.  పాశ్చాత్యులిచ్చిన గుడ్డి దీపముతోనే చీకటి వాత పడిన మన చరిత్రను వెదుకుకొనుచున్నాము. ఇకనైనా యువకులు అంతర్జాలమనే విద్యుద్దీప కాంతిలో మన చరిత్రను దొరక బుచ్సుకొనే ప్రయత్నము చేసిన మంచిది.
వేదమూర్తులగు విశ్వనాథ వారి ఈ పద్యము వినండి:
ఇమ్ముగ కాకుళమ్ము మొదలీవరకుంగల యాంధ్ర పూర్వరా
జ్యమ్ముల పెరుజేప్పిన, హృదంతరమేదొ చలించిపోవు, నా
ర్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయమేనని నెన్ని జ
న్మమ్ముల గాక నీ తనువునన్ బ్రవహించునో యాంధ్ర రక్తముల్
శ్రీకాకుళము మొదలు చివరికంటా గల పూర్వపు ఆంద్ర రాజ్యముల పేరు జెప్పిన నాహృదయాంతరాళములందు
ఎదో అలజడి, ఒక విధమైన అవినాభావ సంబంధ ప్రకంపనలు కలుగుతాయి. ఆర్ద్రతా భరితమైన ఈ నా చిత్తవృత్తికి కారణము, నా తనువులో,ఊహకందని, ఎంతోకాలమునుండి ప్రవహించే యాంధ్ర రక్తము యైయుండనోపునని ఉద్వేగభరితమైన మనస్సుతో వాక్రుచ్చుతారు వేదమూర్తులగు విశ్వనాథ వారు.
అదేవిధంగా “ఆంధ్ర భాష సుజనోత్సవ మొప్పగ నిర్వచించి…” అంటూ 
“నృసింహపురాణం”లో కూడా ఆంధ్ర శబ్దం వినియోగించబడింది.
యిక మహాభారతగాథ ఆధారాలు యిలా తెలియ జేస్తున్నాయి.
కవిత్రయంలో నన్నయ తర్వాత విరాట పర్వ ఆంధ్రీకరణ ప్రారంభ దశలో 
“ఆంధ్ర కవితా విశారదుండు విద్యాదాయితుండు నరించే మహితాత్ముడు 
నన్నయభట్టు దక్షతన్ “ అంటూ ఆదికవి నన్నయామాత్యుని కీర్తించాడు 
మహాకవి తిక్కన..
 ఆపస్థంభమహర్షి వర్ణనల ప్రకారం నాటి ఆంధ్ర బ్రాహ్మణులు అతి గొప్ప 
విద్వత్వేత్తలుగా కొనియాడ బడేవారని తెలుస్తోంది.

పాశ్చాత్యుల ముఖ్యమైన తలంపు వారు పరమ నాగరికులని, మనము అనాగరికులమని మొహెంజోదారో,హరప్పా శిధిలాలు బయల్పడేవరకు తలచిన ఆ గొప్పవారి నోట్లో, అవి బయల్పడిన తరువాత, పచ్చి వెలగ పడిన  చందమైనది.  వారి దృష్టిలో ఆంధ్రులు ఆటవికులు.  నాగరికత లేని వారు.  వారి పుక్కిటి పురాణమునకీ కథ ఆలంబనము అని నాకు తోచుచున్నది.  ఐతరేయ బ్రాహ్మణములో గల ఈ కథ ఈ విధముగా ఉన్నది.
హరిశ్చంద్రుడనే రాజు (సత్య హరిశ్చంద్రుడు కాదు)  వరుణుని గూర్చి తపస్సు చేసి తనకు కొడుకు కలిగితే వానిని యజ్ఞ పశువును జేసి యజ్ఞము చేసెదనని విన్నవించుకొంటాడు.  కొడుకును కలిగిన తరువాత తన మాటను దాటవేసుకొంటూ వస్తాడు. వరుణుడు కోపించి, అతనిని జలోదర వ్యాధిగ్రస్తుడు కమ్మని శపించితే కనువిప్పు కలిగి అతను చేయునంతలో కన్నకొడుకందుకు భయపడి కాననాగతుడౌతాడు. అప్పుడు రాజు కుల గురువైన వశిష్టుని బోధన మేరకు వేదవిద్యావిదితుడు యోగ్యుడు ఐన బ్రాహ్మణ వటువును బలి పశువు చేయనెంచి భటుల దేశపు నలు మూలలకు పంపుతాడు.  చివరకు అటువంటి వటువు వారికి ఒక అగ్రహారములోని బ్రాహ్మణ కుటుంబములోని ముగ్గురు కుమారులలో మధ్యమునిగా తారస పడతాడు.  అతని పేరే శునశ్శేపుడు.  తండ్రికి జ్యేష్టుడు తల్లికి కనిష్టుడు ఇష్టమని తలంచి కష్టమైనా ప్రాణ నష్టమైనా స్పష్టముగా తాను అందులకు ఒప్పుకొంటాడు.  కారణం,రాజు అందుకు గానూ  ఇవ్వబోవు ధనము తో తన తల్లిదండ్రులు సుఖముగా బ్రతుకుతారనే తలంపే.  భటులు అతనిని తీసుకొని పోవు మార్గ మద్యములో విశ్వామిత్రుడు ఎదురై విషయములు గ్రహించి, ఆ బాలునితో తాను కూడా రాజు వద్దకు బయలుదేరుతాడు.  రాజువద్దకు జేరి ఆ బాలుని బలిచేయకనే యజ్ఞఫలము అతనికి ప్రాప్తించు నట్లు చేసి బాలుని తన వెంట తీసుకొని పోయి తన నూర్గురు కుమారులకు పరిచయము చేసి వారి కన్న పెద్దవాడైన కారణాన తమకు  జ్యేష్ఠునిగా అంగీకరించమంటాడు.  మొదటి ఏబది మంది, వీరి పేర్లు మనకు తెలియవు కానీ పెద్దవాని పేరు మాత్రము అష్టకుడు అని భాగవతమున చదివిన గుర్తు, వీలు పడదనీ వాదించగా వారిని చండాలాది నీఛ జాతులుగా పుట్టమని శపించి, మిగిలిన ఏబది మందిలో పెద్దవాడైన మధుచ్చందుని అడుగగా తాను తన సోదర గణమూ అందుకు సమ్మతమేయని అంటాడు.  ఛండాలురైన మొదటి ఏబది మంది అంధ్ర (ఆంద్ర కాదు),  శబర, పుళింద, మూతిబా ఆదిగా గల హీనవర్ణులై జెలగిరి.  ఇందులోని అంధ్ర శబ్దము చూసి చరిత్రకారులు అందులో మనవారలు కూడా వున్నారని భ్రమించి  శాపగ్రస్తులై, వైదిక ధర్మాచార భ్రష్టులై ఆటవిక జాతులతో కలిసి హింసా చౌర్యాదులచేజీవించుచూ వచ్చినవారు మన పుర్వీకులనుట ఎంత వరకు సహజమో, సమంజసమో  పాఠకులు ఊహించ గలరు. అసలు వీరిని విశ్వామిత్రులవారు మీరు నీతి బాహ్యులైనా కృష్ణా గోదావరీ తీరములకు పోయి నివశించమని చెప్పినట్లు ఏ పురాణేతిహాస బ్రాహ్మణకములందునూ లేదు. అరణ్యాలలో నివశించే వీరు , ఎందఱో ఆటవికులు నేటికీ అరణ్యములలో నివశించుచుండగా వీరు మాత్రము గోదావరీ కృష్ణా తీరములకు ఏవిధముగా రాగలిగినారో వ్రాసిన ఆ ఆంగ్లేయ చరిత్రకారులకే ఎరుక. మరి ఆంధ్రులెవరో పరిశీలింపనారంభింతము.
రామాయణములోని కిష్కిందా కాండలోని నలభైఒకతవ సర్గలో 11,12,13 శ్లోకాలు ఏమి చెబుతున్నాయో వినండి.
విడర్భాన్ ఋషి కాలశ్చైవ రమ్యాన్ మాహిషకానపి
తథా వంగాన్ కళింగాశ్చ కానికామ్శ్చ సమన్తతః
అన్వీక్ష్య దండకారణ్యం సపర్వత నదీ గుహాం
నదీ గోదావరీం చైవ సర్వేమేమనుపశ్యత
ఈ శ్లోకములను సుగ్రీవుడు , దక్షిణ దిశకు పంపబోతున్న తన ఉద్యోగులగు హనుమద్నలనీలాదులకు చెబుతాడు. ఇక్కడ ఆయన తెలిపినవన్నీ రాజ్యములు గానీ జాతులు కాదన్నది సుస్పష్టము కదా !

భారతములోని సభా పర్వములోని శిశుపాలవధ ఘట్టములో నన్నయ వ్రాసిన ఈ పద్యమును తిలకించండి

రయ విచలత్తురంగ మత రంగములై మదనాగ నక్రసం
చయముల సంచలచ్చటల సైనిక మత్స్యములన్ భయంకరం
బయియ దువృశ్ని భోజకు కురాంధకవాహిని యుంజె లంగని
ర్దయతర రోషమారుతనింకాంత సావీ హితమై క్షణంబునన్

ఇందులో కూడా కుకుర అంధక.... అన్న శబ్దము వస్తుంది.  మరి దానిని కూడా ఆంధ్ర శబ్దమునకు అన్వయించుకొనవచ్చును.  మధువు కుమారుడు క్రోష్టు యొక్క వంశములోని వారు ఈ భోజ, వృష్టి,
అంధకాదులు .ఇంత వరకు మనము చెప్పు కొన్నవేవి తర్కమునకు నిలువవు.
ఇంకొక విషయము భారతము లోనే సహదేవుని విజయ యాత్రలోఓఢ్ర, ద్రావిడ, పాండ్య,మళయాళ దేశాములనేగాక,కళింగ ఆంద్ర దేశములనుగూడా జయించినట్లు చెప్పబడియుంది. అసలు రాజసూయ యాగములో ఆంద్ర, ద్రావిడ, పాండ్య, ఓఢ్ర రాజులు కూడా ఉన్నట్లు తెలుపబడినది.మరి ఇంతటి నాగారీకతకలిగి దేశమును పాలించిన ఆంధ్రులను ఆటవికులతో ముడిపెట్టుట సమంజసమా!

  శ్రీమత్ భాగవతములోని నవమస్కందములోని 5, 6 శ్లోకములు

!!శ్లో!! అంగ వంగ కళింగాద్యాః  సుంహ పుండ్రాంధ్ర సంజ్ఞితాః
       జజ్ఞిరే దీర్ఘత మర్షిసో బలేః క్షేత్ర మహే క్షతః

!!శ్లో!! చక్రుస్వ నామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్చకాంశ్చతే

పూర్వ శ్లోకముల అన్వయముతో పై శ్లోక భావమే మన బలి యను మహారాజునకు దీర్ఘతముడను ఋషి యనుగ్రహము వల్ల 1.అంగ, 2.వంగ, ౩.కళింగ, 4.సుంహ, 5.పుండ్ర, 6.అంధ్ర అను ఆరుగురు కుమారులు కలిగిరి.  వారు తూరుపు దేశమునకు రాజులై ఆరు భాగములుగా విభజించుకొని ఆ రాజ్యములను సార్ధకమొనరించిరి.  ఆ విధమున అంధ్రుని దేశము ఆంధ్ర దేశమైనది.  శ్రీ బమ్మెర పోతన శ్రీమదాంధ్ర భాగవతములోని నవమ స్కందమున గల ఈ వచనము చూచిననూ అర్ధము కాగలదు.
వచనం: తితిక్షునకు ఋశద్రథుండు, అతనికి వేముండు, అతనికి సుతపుండు, అతనికి బలియు పుట్టిరి. ఆ బలివలన అంగ, వంగ, కళింగ, సుంహ, పుండ్ర, ఆంధ్రులను పేర్లు గల ఆర్వురు కుమారులు జన్మించి తమ తమ నమధేయముల దేసమ్ముల నేలిరి.  కావున ఆంధ్రులు విశ్వామిత్ర సంతానము కాదనియు, క్షత్రియ కుల సంజాతుడైన ఆంధ్రుని రాజ్య వాసులనియు మనము గ్రహింప గలుగుచున్నాము.
విశ్వామిత్రుని కనిష్ట అర్ధ శత సంతానము శునశ్శేపుని అగ్రజత్వమునకు అంగీకరించినవారై తమ తండ్రి దీవెనలు పొందిరి.  శునశ్శేపుడు దేవరాతుడని పిలువబడి విశ్వామిత్ర గోత్ర ప్రవరుడయ్యెను.  బ్రాహ్మలలోని విశ్వామిత్ర గోత్రజులకు ఈ విషయము తెలియగలదు. ఈ ప్రవరాన్వితులు నేటికినీ పుష్కలముగా యున్నారు.  మరి ఆంధ్రులు కిరాతకులైనవారియందు వీరేట్లు ఇమడ గలరు.
పాశ్చాత్యులు సముద్రపు దొంగలై (pirates)  ప్రయాణీకులను హింసించుచూ రాను రాను మాన దేశ ప్రాభవమును గూర్చి తెలుసుకొని, అన్వేషకులు (explorers) అన్న ముసుగులో మన దేశమున ప్రవేశించి, మన దేశమును కొల్లగొట్టినారు.  ఒక వైపు ముస్లీములతో మరొక వైపు ఆంగ్లేయులతో కొల్లగొట్టబడి కూడా తన ఉనికిని కాపాడుకోగలిగినది.  తమ తమ మత ప్రచారమునకు వారు చేసిన రాక్షస పైశాచిక కృత్యములు తలచుకొంటే నేటికీ వళ్ళు గగుర్పొడుస్తుంది.  అందులోని భాగంగానే పాశ్చాత్యులు మన వేదములను, పురాణములను వక్రీకరించి తాము నాగరికులుగానూ, మనమనాగరికులుగానూ చిత్రించుటయే కాక క్రొత్తగా ఆర్య ద్రావిడ విభేదములనేర్పరచి, ఔత్తరాహులని దక్షిణాత్యులని, మనల వేర్పరుప జూచినారు.  ఆర్యాః అనగా ఈశ్వర పుత్రాః అని యాస్కాచార్యులవారు 5000 సంవత్సరముల క్రితమే తెలిపినారు.  అదే మాటను 500 సంవత్సరములకు పూర్వం వేద భాష్యమును వ్రాసిన విద్యారణ్యులవారు కూడా ఇదే విషయమును చెప్పినారు.  ఇక ద్రవిడ శబ్ధము చుట్టూ ద్రవము కలిగి యుండుట వలన ఈ దక్షిణ దేశ ప్రాంతము ద్రావిడమైనదని కొందరంటే ద్రమిళుడు అను రాజు చేత పాలింపబడిన ప్రాంతము కాబట్టి ద్రమిళము అదే రానురానూ ద్రవిడము ఐనదని కూడా పండితులు తెలియబరచినారు.  అంతే కానీ వేరేమియుకాదు.  ఆర్యులు ఎర్రగాను ద్రావిళ్ళు నల్లని వారని తేల్చినారు పాశ్చాత్యులు.  మరి రాముడు, కృష్ణుడు, వ్యాసుడు ద్రౌపది మొదలైనవారంతా ద్రావిళ్ళేనా! వీరు వేద పురుషులు గారా ! వేదము, పాశ్చాత్యుల ప్రకారము సుమేరు నుండి వచ్చిన ఆర్యజాతి వ్రాసిన లొల్లాయి పదాలని వేదాలను వక్రీకరించినారుకదా, మరి  సీతాన్వేషియై లంకా నగరము నకు వెళ్ళిన హనుమంతుడు అక్కడి రాక్షసులు వేదపారాయణులని  తెలిపినాడు. మరి వారు ఆర్యులా ద్రావిడులా !
విష్ణు సహస్ర నామములో

సులభః సువ్రతస్సిద్దః శత్రుజిచ్చత్రుతాపనః
న్యగ్రోధోదుంబరోశ్వత్తః చాణూరాంధ్ర నిశూధనః

అంటే దాదాపు ఐదు వేల సంవత్సరములకు పూర్వమే ఆంధ్రుల ఉనికి తెలియ వచ్చుచున్నది.
“అంధ్ర” ‘‘ఆంద్ర’’ అను పదములు స్వల్ప మార్పులతో గూడియున్నందున అన్నియు ఎకోచ్చారణ కలవియై కాలక్రమమున పాశ్చాత్య ధోరణుల నభ్యసించి అభిలషించిన మన చేత ఏకార్ధమున ఉపయోగింప బడినవి. అంత మాత్రమున మూలమునాశ్రయింపక రెంటిని ఒకటే గాట కట్టుట సమంజసము కాదు.

అంధ్ర లేక ఆంద్ర అను జాతి యొకటి  విలోమ సంకర జాతులలో నున్నట్లు మను స్మృతి చెప్పుచున్నది.

!!శ్లో!! మత్స్య షూతో నిషాదానాంత్వష్టిస్వా యోగావస్యచ
       మేదాంద్ర చుంచు మద్గూనామారణ్య పశు హింసనామ్  (మను 10-48)

అర్ధమేమిటంటే నిషాదులకు చేపలు పట్టుటయు అయోగవులకు వడ్రంగమును,మేదులు,అంద్రులు (మేద+అంధ్ర) చుంచులు మద్గులు మొదలగువారు అడవి మృగముల హింసించు వృత్తుల గొనియున్నారు. ఇంత విశధముగా ఈ ఆంధ్రులు ఆటవికులని మను ధర్మ శాస్త్రములో ఉన్న విషయాన్ని వక్రీకరించుట కంటే దానిని యధా తధముగా గ్రహించి తార్కికముగా ఆలోచించిన అంతంత మంది వేదశాస్త్ర పురాణాలనభ్యసించ యుద్ధ విద్యనభ్యశించి వ్యాపార వ్యవసాయములు  నేర్చుకొని వివిధ కళల యందు నిష్ణాతులై వారిలో వారే మీరీ వర్ణము మీరీ వర్ణమని నిర్ణయించుకొని రాజ్యములేలిరనుట అందలి పౌరులై వర్ణాశ్రమ ధర్మములను పాటించిరనుట నమ్మశక్యమా! అదియును గాక అటువంటి విధముగా జరిగినట్లు ఎటువంటి చారిత్రిక ఆధారమును లేదే! ఇది పాశ్చాత్య పండితుల, వారి అనుచరుల స్వకపోల కల్పనము.  ఆటవికులయిపోయిన విశ్వామిత్ర సంతానము ఆర్యులుగా మారి రాజ్యములు స్థాపించి వర్ణాశ్రమ ధర్మములను పాటించినట్లు ఏదైనా లెక్క దాఖలాను చూపగలరా!
ఒక వేళ అదియే నిజమైన వేదభాష్యము వ్రాసిన విద్యారణ్యుల వారు ఆంద్ర దేశపు ప్రశస్తిని జగతికి చాటిన వీర, విక్రమ, విద్యావిభవ సంపన్నులైన మాన అంధ్ర దేశపు రాజులు వ్యాపార వ్యవసాయముల నపారముగా జేసి అంధ్ర దేశమును సుసంపన్నము జేసిన వైశ్యులు, రాజులు నశించి దేశ మరాచక స్థితి యందున్నసమయమున
రాచరికపు పగ్గములును చేత బూని సమర్థవంతముగా అంధ్ర రాజ్యములనేలిన అనితర దీక్షా దక్షులగు వెలమ,కమ్మ, రెడ్డి, కాపు తెగలను అరణ్య జాతులనుట న్యాయమా  ఒకవేళ అది నిజమగుచో అటువంటి చోద్యము ఆంధ్రులకు మాత్రమే సంభవించినదా!   అసలు వేదాధ్యయమునకు మన రాజమహేంద్రి పట్టుకొమ్మ కాదా! దేశములోని ఆంధ్రము రెండవ భాషగా ప్రభవించ గలదా! వారు చెప్పినదే నిజమైతే మిగత అనాగరిక భాషలు కూడా దేశవ్యాప్తి అయిఉండవలెను కదా!
దీనివల్ల మనకు అవగతమగుచున్న దేమిటన ‘అనువు’ వంశములో యయాతినుండి ప్రముఖ వంశములను లెక్కించ, 15వ వంశమున జన్మించిన ‘బలి’ యను రాజు కుమారులైన 1.అంగ, 2.వంగ, ౩.కళింగ, 4.సుంహ, 5.పుండ్ర, 6.ఆంధ్రులను వారలకు (భాగవతము 9-685) రాజ్యమును పంచి ఇవ్వగా ఆ దేశ వాసులు ఆ యా రాజుల పేర్లతో బరగినట్లు నిర్దారితమగుచున్నది.

తన గోత్రమే ఉపయోగించుకొన నర్హత లేని ఆటవికులైపోయిన విశ్వామిత్రుని మొదటి యాభైమంది పుత్రులు వారి గోత్రమునుపయోగించుకొను బ్రాహ్మణులెప్పుడైరి.  చాతు వర్ణముల నెప్పుడు ఏర్పరచుకొనిరి
దేశము, కాలము, వంశపరంపరాచారము, సాంప్రదాయము, సంఘ వ్యవస్థ మొదలగు వానినన్నిటినీ విచారించి కదా జాతి నిర్ణయము చేయవలసి యుండును.  ఇట్టి స్థితిలో మన సాంప్రదాయము లవగతము లేని ధర్మ బాహ్యులై దేశాంతర గతులైన పాశ్చాత్యులు మనలను గూడ ధర్మ బహ్యులుగా ప్రకటించి మనకు ఎగ్గుజేయదలచిన  వ్యర్ధ ప్రయత్నమును  మనము సాలోచనముగా నవలోకించిన గాని అవగతము కాదు. మన హైందవ హూణవిద్యాధికులు కూడా వారికి వంత పాడుచూ వారి భావములను, పలుకులను మన దేశ భాషలలోకి తర్జుమా చేసి ఆంధ్రుల నధములుగా జీసినారు.

శాపహతులైన విశ్వామిత్రుని సంతానమే ఆంధ్ర దేశములోని యాంధ్రులని చెప్పనెడల, విశ్వామిత్ర గోత్రీ కులే గాక మూడువందల ఆర్షేయ గోత్రములుగల బ్రాహ్మణులును, క్షత్రియులును సుమారు రెండువందల గోత్రములు గల్గిన వైశ్యులును అనేక గోత్రములు గల్గిన శూద్రులును నివశించుచున్నారు. మరి వీరందరూ ఆటవికులని అనగలమా ! వీరు విశ్వామిత్ర సంతానము కాదనుటకు ఇంతకు మించిన సాక్ష్యాధారము అవసరమా!
పాశ్చాత్య పండితులు హైందవులందరు తమవలెనే సంకరులని నిరూపింప దలచి మన దేశ చరిత్ర వ్రాయుటకు ఈ చతుస్సూత్రముల నెన్నుకొన్నారు.
1. హిందూ నాగరికత 3000 సంవత్సరములు మించినది కాదు.
2.హిందువుల నాగరికత, విద్య  అంతయును గ్రీసు మోసపుటేమియా నుండి దిగుమతి కాబడినది.
‘ పోకాక్’ అను పాశ్చాత్య పండితుడు దీనిని సమూలముగ ఖండించుతూ మన దేశమునుండి గ్రీసుకు మన వారు వలస పోవుట వల్ల వారికి మన సంస్కృతము, సంస్కృతి అబ్బినవని తన పుస్తకము ‘India in Greece’ లో సాధికారముగా నిరూపించినారు.
౩.వేద శాస్త్ర వాగ్మయము క్రీ!పూ! 1200 సంవత్సరముల నుండి ఇటీవలి కాలమున ఏర్పడినది.
హిందువులందరూ తమలాగే సంకరులే యని నిరూపించుట.
మాక్సుముల్లరు తన గ్రంధము 'Six systems of Indian Philosophy' లోని 8, 9 పుటలలో ఇట్లు వివరించాడు. (క్లుప్తముగా కేవలము సారాంశము పొందుపరచుచున్నాను)

This term CASTE has found most mischievous and misleading and the less we avail ourselves of it the better we shall be able to understand the true state of society in the ancient times of India.  Caste is of course a Portuguese word.  It should be most carefully defined afresh otherwise every social distinction will be called caste every stick a totem and every idol a fetish.

ఇండియా లో cast అనగా వర్గము  అని అర్థము. అదే పోర్చుగల్లులో'fetish' అంటే ఏమిటని యడిగినట్లుండును.మనము నిజముగా తెలుసుకోనగోరునదేమన మన దేశములో కులము అనగా కుటుంబము 'గోత్రము' అనగా జాతి లేక పుట్టుక 'ప్రవర' అనగా వంశ పరంపర అని తెలుసుకోనవలయును. అందుకే మాక్సుముల్లరు మన దేశము లోని సాంఘీక వ్యవస్థ ను 'cast' అని పిలువకూడదనియు  అది 'వర్ణ' అను పదమునకు సరియైన అర్థము నివ్వజాలదనియు నుడివెను.

వేదాధ్యయన తత్పరులై ఘనాపాఠీలై విలసిల్లి దేశములోనే బ్రాహ్మణ్యమునకు ప్రతిష్థ తెచ్చిన మన తెలుగువారు, శాతవాహన,ఇక్ష్వాక, ఆది వంశజులు వెలమ కమ్మ రేనాటి రాజులచే (రేనాటి రాజులే రెడ్లు) పరిపాలింపబడి వాసికెక్కిన మన తెలుగు వారు  ఈ ఆంధ్ర దేశ అభ్యుదయమునకు పాటుబడిన వాసవి కన్యకాంబ,మన పొట్టి శ్రీరాములవారి వంశజులైన ఆర్య వైశ్యులు, తమతమ రంగములలో అనన్యఖ్యాతి గడించిన శూద్రులు (services)
(శూద్రులు అన్న పదానికి ఎటువంటి నీచార్థము లేదు) అందరూ ఆనాటి నీతి బాహ్యులైన పుళిందులు, వ్యాధులు,నిషాదులు అను మాటలో ఇసుమంతయేని వాస్తవమున్నదా!

ఆంగ్లేయ మరియు వారి అనుచరవర్గ చారిత్రికులు చెప్పినట్లు 'ఆంధ్రులు ఆటవికులు' కాదు కాద్ఫ్హు కానే కాదు. సంస్కృతి నాగరికత ఘనకీర్తి యగు  గతము కలిగినవారు.

తత్సత్










No comments:

Post a Comment