Tuesday, 19 November 2013

సంస్కృత సంస్కృతి

సంస్కృత సంస్కృతి(19.11.2013)
సంస్కృతం=సమ్యక్ +కృతం  అనగా సంపూర్ణముగా సంస్కరింప బడినది అని అర్థము. సృష్ట్యాదినుండి అది ధ్వనిరూపములో ఆకాశాన్ని అంటిపెట్టుకొనే వుంది. ధ్వని శబ్ద సంకలనమే. సూత్రాను సారిణి యైన శబ్ద సంకలనమే భాష. వ్యాకరణము ఛందస్సు భాషామతల్లి స్తన్యములు అంటారు. బుడ్డిపాల కలవాటుపడి తల్లి పాలు త్రాగే అవకాశము పోగొట్టుకొన్న వానికి తల్లి పాలరుచి తెలిసే అవకాశమేదీ! అపౌరుషేయమైన వేదము యేభాషలో ఉన్నదో ఆ భాష కూడా అపౌరుషేయమే కదా. ఆవేద భాషే ఆది భాషఆ ఆది భాషే సంస్కృతము. రామాయణము ఆది కావ్యము. 
వేదభాష గా బ్రహ్మ నుండి దేవతలు ఋషులు వారి నుండి భూలోక వాసులకు ఈ భాష సంక్రమించినది. వేదానికి షడంగములైన శిక్షవ్యాకరణ,ఛందస్,నిరుక్త,జ్యోతిష కల్పములలో వ్యాకరణము కలదు ఆ వ్యాకరణమును విడమరచి విశధీకరించిన మొదటి మహానుభావుడు పాణిని. 
పాణిని మహర్షి తన 'అష్టాధ్యాయి'అను వ్యాకరణ ప్రామాణిక సూత్రగ్రంథమందు ఈ క్రింది శ్లోకాన్ని తెలియబరచినారు :
    'నృత్తావసానే నటరాజరాజో నానంద ఢక్కాం నవపంచ చారం
     ఉద్ధర్తు కామః సనకాది సిధ్ధా నేతద్విమర్శే శివసూత్రజాలమ్'
కైలాసము లో తాండవ మూర్తి యైన పరమ శివుని నృత్తావసాన సమయమున ఆయన చర్మ వాద్యమైన తన డమరుకమును వాయించుచూ నృత్యాన్ని ముగించుతారు . దాన్ని 'చోపు'  అంటారు . ఆ తాండవ నృత్యానికి తన్మయులైనా ప్రేక్షకులలో సనక,సనందన,సనాతన సనత్కుమారులు మరియు పతంజలి వ్యాఘ్రపాద పాణినీ ప్రభ్రుతులు ఉండినారు. ఆ చోపు లోని నవ పంచ చారం అంటే 9+5=14 దరువులను ఏక సంతాగ్రాహియైన పాణిని గ్రహించి తన 'అష్టాధ్యాయిఅన్న సూత్ర గ్రంథము లో పొందు పరచిరి. వీనిని మాహేశ్వర సూత్రములందురు. 
శివుని   డమరుకము నుండి ప్రభవించిన ఆ దరువులీ విధంగా వున్నాయి. 
1. ఆఇఉణ్ 2. ఋల్క్ 3. ఎఒఙ 4. ఐఔచ్ 5. హయవరట్ 6. రణ్ 7. ఞమఙణనమ్ 8. ఝభణ్ 9. ఘడధష్ 10. జబగడదశ్ 11.  ఖఫఛద్ధయ చటతవ్ 12. కపయ 13. శషసర్ 14. హల్ ఇందు స్వరములు 16. 
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఋూ ఌ ౡ ఎ  ఐ ఒ ఔ అం అః 
వ్యంజనములు :
క్ ఖ్ గ్ ఘ్ ఙ్  చ్ ఛ్ జ్ ఝ్ ఞ్  ట్ ఠ్ డ్ ఢ్ ణ్  త్ థ్ ద్ ధ్ న్  ప్ ఫ్ బ్ భ్ మ్ య్ ర్  ల్  వ్ శ ష్ స్ హ్    క్ష ్  త్ర్ జ్ఞ్
ఇందు వ్యంజనముల వర్గీకరణము ఒక గొప్ప విషయమైతే వీటి జన్య స్థానములను నిర్దేసించి కంఠ్యములుగా,తాలవ్యములుగామూర్ధన్యములుగా, అనునాసికములుగా, వర్గీకరించడం మరొక గొప్ప విషయము. ఈ వివరణ పురాతన భాషలని గొప్పలు చెప్పుకొనుచున్న గ్రీకు లాటిన్ ఫార్సీ అరబ్బు  వంటి ఎ భాషకును లేదు. పాణిని వారిది మొదటి వ్యాకరణ శాస్త్రమని భాషజ్ఞులు (philologists) నిర్ద్వందంగా అంగీకరించిన విషయము. కానీ పాణిని గారే తనకు పూర్వము ఎన్నో వ్యాకరణ గ్రంథాలుండేవని  తన అష్టాధ్యాయిలో పేర్కొన్నారు. అసలు వీనికి 'అక్షరములుఅన్న పేరు పెట్టడంలోనే అసలు రహస్యం దాగివుంది. న+క్షరము=అక్షరము . క్షరము కానిది అంటే నశించనిది యని అర్థము. 
పరమేశ్వరుడు అక్షరుడు. వేదములు అక్షరములు. ఈ సంస్కృత భాష అక్షరము. ఇటువంటి పదజాలముల ఉత్పత్తియే ఈ భాష ఘనతను చాటుతూ వుంది. 
ప్రపంచ పురాతన భాషలలో మాయమైన  భాషలు కొన్నిమార్పుకు నోచుకోలేని భాషలు కొన్నిమారుతూ మారుతూ ఉన్కినే కోల్పోయిన భాషలు కొన్ని. కానీ ఈ భాష భగవత్ స్వరూపము ఇది అవినాశము. హిమాలయోత్తుంగము. గంగా పవిత్రము. ఈ భాషను  పొందిన మన జన్మలు పునీతములు. 
భాష భూమి అయితే విత్తనం ధాతువు . ధాతువు అన్నది సామాన్యముగా ఒక అక్షరము. పదజాలము ఆ విత్తనమునుండి ఏర్పడిన వృక్ష జనిత ఫల సంపద. ఒక ధాతువును వచనములు (ఏక,ద్వి,బహు) 3 పురుషలు మరియు 10 అంతర్భాగములుగా విభజింపబడిన కాలములు (భూత, భవిష్యత్, వర్తమాన) తో కలిపి పదములు 90 విధములగును. ఈ శబ్ద వాచక సంబద్ధమైన ఈ భాష భారతీయతకు సనాతన ధర్మమునకు పట్టుగొమ్మ. నేటికి కూడా సంస్కృతము  భారతదేశపు 23 అధికారిక భాషలలో ఒకటి.  నేపాలు లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే కలదు. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135 (2011 గణాంకములు నాకు దొరకలేదుఅని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. 
కర్ణాటక లోని 'మత్తూరుఅనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష. అచట అన్నివర్ణములవారూ ఇదే భాష మాట్లాడుతారు. ఈ విషయమును గూర్చి ఆంగ్లములో ఒక వ్యాసము కొన్ని సంవత్సరముల క్రితము వ్రాసియుండినాను. సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటిలోపాలు లేకుండా ఏర్పడినఅని అర్థమని ముందే చెప్పుకొన్నాము. ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతము ఉపజీవ్యము. సంస్కృతమునకు అమరవాణిదేవభాషసురభాషగీర్వాణము మొదలగు పేర్లు కలవు. శౌరసేనిపైశాచిమాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనముబహువచనము అను మూడు వచనములు కలవు. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియుశబ్దములనియునుక్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులని వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపి గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి  లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి తమిళ లిపి బెంగాలీ లిపి,మొదలగునవి లింగవచనవిభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.ఏదృష్టితో చూచినను సంస్కృతభాష ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సమ్మానితమైవివిధ భాషామాతయైయలరారు చున్నదిమరియు భారతజాతీయతకు జీవగర్రయై, భారతీయ భాషలకు ఉచ్ఛ్వాసప్రాయమై, సరస సాహిత్య జ్ఞానవిజ్ఞాన రత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన నాగరికతలో కూడ ప్రధానభూమికను నిర్వహింపగల్గుట పరమ విశేషము. ఇది మహామహోపాధ్యాయ శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు  (Lecturer in Sanskrit, S.R.R. & C.V.R College, Vijayawada) చెప్పిన మాట. సంస్కృతము యొక్క గోప్పతనమేమిటన్నది చాటుటకు వారు వ్రాసిన ఈ ఒక్క శ్లోకము చాలు: "సుధా స్రవంతీ సుర భాషి తాయా -సుచ్చాన సూక్తి సురత్న వార్ధిః -సుకావ్య సందోహ నిధిశ్చ వాణీ -సా సంస్కృతాఖ్యా, సుకృతిః కలాభ్యా" "నా మాతృభాషా భువి సంస్కృతాఖ్యా" సంస్కృతమే సర్వ భాషలకు, సర్వ కళలకు మూలము సమస్త సంస్కృతికి మూలము అని స్థూలముగా ఈ శ్లోకములకర్థము.
మిగత వివరములు రేపు.....
2.
సుమారు 150 సంవత్సరములక్రిందట భాషాసాదృశ్య శాస్త్రము (Comparative Philology)  విజ్ఞాన ప్రపంచములో నుద్భవించెను. గ్రీకులాటినుఇంగ్లీషుజర్మనుఫ్రెంచి మున్నగు యూరోపియన్ భాషలనడుమ, అత్యంత సన్నిహితసంబంధము కలదనియుఈభాషలన్నియు ఆదిలో నేకమాతృసంజనితలనియు,మాతృ స్థానము సంస్కృతముదనియు గ్రహించిరి. ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు సత్యమును బాహాటముగా చాటిరి. అట్టి విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటలనిట ఉల్లేఖించుచున్నాను. “గ్రీకు, లాటినుగొతిక్ మొదలైన భాషలన్నియు భిన్నభిన్న కాలముల యందు సంస్కృతభాషనుండియేముఖ్యముగా వైదిక సంస్కృతము నుండియేఉద్భవించినవి.” (Journal of Royal Asiatic Society of Britain and Ireland అను ప్రసిద్ధ పత్రికలో 16 వ సంపుటము ప్రధమ భాగములో 177 వ పుట.)
నిష్పక్షపాతబుద్ధితో ఈరీతిగా సంస్కృతభాషకు యూరపీయ భాషా మాతృత్వము నంగీకరించినవారు కొందరు కలరు. 1834 వ సంవత్సరములో R.A.S. పత్రికలోనే ద్వితీయసంపుటములో Sanskrit Literature అను శీర్షిక క్రింద W.C. టెయిలర్ వ్రాసిన యీక్రింది మాటలు కూడ గమనింపదగియున్నవి. “ప్రాచీన యూరోపీయ భాషల కన్నింటికిని తల్లి హిందూదేశపుభాషయే. దేశములో ఎన్నిమార్పులు వచ్చినను ఆ భాషను హిందూదేశము నిలబెట్టుకొనగల్గినదని మనము ఆశ్చర్యముతో కనుగొంటిమి.” జ్యేష్ఠభగినీవాదియైన మాక్సుముల్లరుకూడ సంస్కృతమంత ప్రాచీనభాష మరియొకటి లేదనియుఇకమీదటకూడ అట్టిది కన్పట్టుట కవకాశము గోచరింపదనియు చెప్పియున్నాడు. ఆధునిక శాస్త్రములు  అన్నింటికిని గణితశాస్త్ర మెట్టిదో, ప్రపంచభాషలకు న్నింటికిని సంస్కృతమట్టిదని యాయన నుడివినాడు. “What Mathematics is to the Sciences, the same is Sanskrit to the languages of the world”.సంస్కృతమునేర్చిన పాశ్చాత్య పండితులేకాకఇతర పాశ్చాత్య విద్వాంసులుకూడ నీ యభిప్రాయమునంగీకరించినారు. జాన్ రస్కిన్ కూడ ఇంగ్లీషుభాషలో పాండిత్యము గలుగవలెనన్నచో మాక్సుముల్లరు రచించిన Biography of words అను గ్రంథమును చదువవలెనని చెప్పినాడు. ఆ గ్రంథములో ప్రధానముగా యూరపీయ భాషాపదముల సంస్కృత భాషా వ్యుత్పత్తి ప్రదర్శింపబడినది. దానిని చదువుటవలన ఇంగ్లీషు పదముల శక్తివినియోగ విధానము బాగుగా బోధపడునని రస్కిన్ అభీప్రాయము.(చూ: Sesame and Lilies.)
సంస్కతభాష సమస్త భాషలకు మాతయైనట్లేసంస్కృతభాషాఘటితమైన విజ్ఞానముకూడ సమస్తదేశ ప్రాచీన విజ్ఞానమునకు మూలమైయున్నది. విజ్ఞాన ప్రవాహము భారతదేశమునుండి బయలుదేరి యేరీతిగా పర్షియా, అరేబియాగ్రీసు మున్నగు దేశములకు వ్యాపించినదో విపులముగా వివరించుచు పోకాక్ అను ఆంగ్లేయుడు India in Greece అను గ్రంథములో నిరూపణచేసియున్నాడు. బాబిలోనియాఈజిప్టు మున్నగు దేశములలో అతిప్రాచీన నాగరికత యని భావింపబడుచున్నది భారతదేశసంస్కృతియొక్క విస్తారమే యని ఆ గ్రంథములో 
వివరముగా తెలుపబడినది. ప్రపంచములోని యేభాషలోను వాజ్ఞయము పుట్టక పూర్వమేసంస్కృతములో వాజ్ఞయము బయలుదేరినదని ఎల్లరు నంగీకరించుచున్నారు. మానవ పుస్తకభాండాగారములో ఋగ్వేదమే 
మొదటి గ్రంథమని మాక్సుముల్లరు నుడివియున్నాడు.“Rig Veda is the first book in the Library of man.” ప్రపంచములో మొదటికావ్యమగు రామాయణము సంస్కృతభాషలో నుద్భవించినదిప్రపంచములోని మొదటి జ్యౌతిషగ్రంథముమొదటి నాట్యశాస్త్ర గ్రంథముమొదటి వ్యాకరణ గ్రంథము సంస్కృతభాషలోనే యుద్భవించినవి. కావున ప్రపంచ విజ్ఞాన చరిత్రలో సంస్కృతభాషకు విశిష్టమైనస్థానము కలదు. 
మిగిలినది మరొకమారు......
3
 విశ్వవిఖ్యాతిగల షోపెన్ హోవర్ అను జర్మనువిద్వాంసుడు "ఉపనిషత్పఠన మంత లాభదాయకమైనదిఔన్నత్యాపాదకమైనది మరొకటిలేదు. అది జీవితకాలమంతయు నాకు ఆశ్వాసజనకముగా నున్నది. మరణ సమయమునకూడ అదియే నాకు ఆశ్వాసహేతువు కాగలదు” అని నుడివినాడు.ఫ్రెడెరిక్ ష్లెగెల్ "భారతీయుల భాషవిజ్ఞానము” అను గ్రంథములో నిట్లు వ్రాసెను. “ప్రాగ్దేశస్థుల ఆదర్శ ప్రాయమైన విజ్ఞానజ్యోతి ముందర గ్రీకువేదాంతుల తత్వశాస్త్రము అప్రతిబద్ధమై మినుకుమినుకుమను నిప్పునెరసువలె నుండును.” సంస్కృతభాషయొక్క కట్టుబాటును గురించి మోనియర్ విలియమ్స్ యిట్లు పల్కినాడు. “ఇంతవరకు ప్రపంచములో బయలుదేరిన అద్భుతగ్రంథములలో పాణిని వ్యాకరణ మొకటి. స్వతంత్ర ప్రతిభ లోనుసూక్ష్మ పరిశీలనలోను పాణినీయ వ్యాకరణముతో పోల్చదగిన గ్రంథమును మరియే దేశమును సృజించుకొనలేదు”.
ప్రపంచములో ఏభాషయు సాధింపజాలని యొక విశేషమును సంస్కృతము సాధించినదని శ్రీ స్వామీ వివేకానంద నుడివియున్నారు. ఏభాషలోనైనను కావ్యము రసవంతమై రమ్యముగానున్నచో అందు ధర్మబోధ తక్కువగా నుండును. ధర్మబోధ ఎక్కువగానున్నచో రమ్యత తక్కువగానుండును. రమ్యతయుధర్మ్యతయు కలియుట మేలనియుకాని అట్టి కలయిక కన్పట్టుటలేదనియు అరిస్టాటిల్ మున్నగు ప్రాచీనవిమర్శకులు పరితపించినారు.
షేక్స్ పియరు  లోకమునకు సందేశమునిచ్చు దృష్టితో నాటకములను వ్రాయనేలేదనియు విమర్శకులు చెప్పుచున్నారు. రమ్యతనుధర్మ్యతను అత్యున్నత పథములో సమముగా సాధించిన గ్రంథము వాల్మీకి రామాయణము మాత్రమే. ఈ యంశమును స్వామి వివేకానందుడు అమెరికనులకు తెలుపుచు ఇట్లు పలికెను.“Nowhere else are the aesthetic and the didactic so harmoniously blended as in the Ramayana”.కాళిదాసాది ఇతర సంస్కృత దిగ్గజ కవుల గ్రంథములను పఠించు సమయములో అన్ని రసములూ మనము జూచిననూ అన్నిటికన్నా మిన్నగా ధర్మ ప్రతిపాదన మనకు అనుభవగోచరము.అట్టి 
గ్రంథములే యింతకాలము భారతీయులను సత్వగుణ ప్రధానులనుగ చేసివారికి ప్రపంచములో నొక విశిష్టతను చేకూర్చినవి. ఆధునిక కాలములో (సైన్సు) విజ్ఞానము పర్వతరాశివలె పెరిగిపోయినది.  మన సంస్కృతిని  మరచి  ఆధునిక విజ్ఞానమును మాత్రమే మనముపయోగించుకొందుమేని అది  ప్రపంచమునకు శాంతి ప్రదానము చేయలేక, కల్లోలస్ధితికే కారణమగుచుండును. సంస్కృతికి  సైన్సుకు  సేతువును నిర్మింపవలసిన యావశ్యకతను రాష్ట్రపతి శ్రీ రాజేంద్రప్రసాదుగారు 1952 వ సంవత్సరములో కాశీలోజరిగిన సంస్కృత విశ్వపరిషదధివేశమునకు అధ్యక్షతను వహించుచుస్పష్టపరిచి యున్నారు.  భారతదేశములో ఫిన్లెండు రాజదూతగానుండిన హ్యూగోవల్వనే చెప్పిన యీ క్రిందిమాటలు సంస్కృతముయొక్క ప్రభావమును ఘంటాపథముగ చాటుచున్నవి. “సంస్కృతభాషా నిబద్ధములైన భారతీయభావములు యూరపు హృదయమునకు మృదుత్వము నొసగినవి. అచట నాగరికతను నెలకొల్పినవి. ప్రత్యక్షముగా 
సంస్కృతభాష ద్వారముననే కాక భాషాంతరీకరణముల ద్వారమునకూడ నీపనిజరిగినది. తరువాత కొన్నిశతాబ్దములపాటు సంస్కృతము యూరోపీయులకు అందలేదు.” (11-2-53 తేదీని కాశీలో ప్రభుత్వ సంస్కృత కళాశాలా స్నాతక సభోపన్యాసము).  కాంట్స్పైనోజా ఎమర్ సన్ఎడ్విన్ ఆర్నాల్డ్సోమర్సెట్  మామ్ మొదలైన రచయితలపైనను ఈ ప్రభావము ప్రస్ఫుటముగా గోచరించును. యూరపులో 15 వ శతాబ్దిలో జరిగిన రినైజాన్స్ అని చెప్పబడు 
విజ్ఞానపునర్విజృంభణమునకు తరువాత జరిగిన వైజ్ఞానిక సంచలనములన్నిటిలోను గొప్పది సంస్కృత సంపర్కమువలన జరిగిన వైజ్ఞానికసంచలనమే యని ఎ. ఎ. మాక్డోనెల్ తన Sanskrit Literature అను గ్రంథములో వ్రాసియున్నాడు.(వ పుట)
సంస్కృతభాషను నేర్చిభారతీయుల జీవితపద్ధతులను చూచిన పాశ్చాత్యపండితు లెల్లరు సంస్కృత భాషానిబద్ధసంస్కృతికినిభారతీయుల జీవితమునకును గల సన్నిహిత సంబంధమునుసమన్వయమును చూచి యాశ్చర్యపడిరి. భారతీయ జీవితమునర్ధముచేసికొనుటకు సంస్కృతభాషా వాఙ్మయ పరిచయము 
అవసరమని గుర్తించిరి. కావుననే బ్రిటిష్ ప్రభుత్వకాలములో ఈ దేశమునకు పరిపాలకులుగా రాదలచిన ఐ. సి.
 యస్. పరీక్షాభ్యర్ధులకు మాక్సుముల్లరు రచించిన India; What can it teach us? అను గ్రంథము పఠనీయముగానుండెను. 
ఆసేతు హిమాచలము గల ప్రజలు ఏకజాతిగ నిబద్ధమగుటలో విశేషముగ తోడ్పడినది సంస్కృతభాష. రాజకీయ
 శాస్త్రములో జాతీయతకు(Nationhood) కావలసినవిగ చెప్పబడిన యంశములలో భాషైక్యమొకటి. ప్రాచీనభరతఖండములో ప్రాంతీయభాషలుండినను వివిధప్రాంతముల నడుమ సామాన్యభాషగా నుండినది 
సంస్కృతమే. పండితులలో సంస్కృతము సామాన్య భాషగా వాడబడుట నేటికిని గలదు. స్వచ్ఛ సంస్కృతము రాని భిన్నప్రాంతముల వారు సమావేశమైనప్పుడుకూడ వారు పరస్పరము అవగాహనము చేసికొనవలయునన్నచో వారివారి భాషలలో సామాన్యముగనుండు సంస్కృత పదజాలమే సహాయము చేయును. ఒక యాంధ్రుడును బీహారు ప్రాంతవాసియు నొకచోట కలిసినప్పుడు ఆంద్రుడు బీహారీని "మీ నివాస మెక్కడ?” అని తెలుగులో అడిగినను అతని కర్థమగును. నివాస శబ్దము రెండు భాషలలోను సమానమే. 'భోజనము', 'శ్రమ', 'దానముమున్నగు సామాన్యముగా వాడబడు పదములు రెండు భాషలలోను ఉండును. 
కావున భాషా భేదమున్ననుభారతీయు లెల్లరు సంస్కృతపద సూత్రబద్ధులై భాషైక్యముగూడ పొందియున్నారు. సంస్కృతభాషవలెనే తద్భాషా నిబద్ధమైయున్న విజ్ఞానముకూడ భారతదేశమున కు ఏకత్వము 
 సాధించినది. రామాయణముమహాభారతముభర్తృహరి సుభాషితములు మున్నగునవి భారతదేశములోని 
ఏప్రాంతమువారికైను సమాన పరిచితములేవానినిచూచి యుప్పొంగని భారతీయుడు లేడు. సంస్కృతభాషను కాళిదాసాది విరచిత శ్లోకములద్వారా నేర్పు సంప్రదాయమొకటి మన దేశములో నున్నది. దీనివలన సంస్కృతముసంస్కృతి కూడ ఒకేసారి బాలబాలికల హృదయములో ప్రవేశించుటయే కాక వారి మేధస్సు లో ఆజన్మాంతమూ అవి స్థిరముగా నిల్చును. నిత్య నైమిత్తిక దైనందిన చర్యలలో వాని అవసరము కలుగుచునేయుండును.
మరొక మారు మరి కాస్త..........
4
సంస్కృతము ఏప్రాంతములోను నిత్యవ్యవహారభాష కానంత మాత్రముచేత కొందరు దీనిని మృతభాషయనుట అసమంజసము. మృతభాషలైన గ్రీకు, లాటినులను సంస్కృతముతో పోల్చి చూతుమేని ఆ నిజాము అర్థము 
కాగలదు.సంస్కృతము నేర్వనివారికి కూడ లోకోక్తి రూపముగాను, సుభాషితరూపముగాను పదులకొలదిగనైనను సంస్కృతశ్లోకములు వచ్చియుండును. పైని చెప్పిన లక్షణములలో ఏదియు మృతభాష కుండదు. సంస్కృతము మృతభాష కాకుండుటయేకాక మాధుర్యభరితమై యున్నందున అమృతభాషయని చెప్పదగియున్నది.హిందూమతముతో బాటు సంస్కృతమును జీవింపక తప్పదు. సంస్కృతవిరహితమైన హిందూమతము ఊహకుకూడ అందనిది. హిందువుల మతగ్రంథములన్నియు - వేదములు, పురాణేతిహాసములు, భాష్యములు మున్నగునవన్నియు - సంస్కృతములోనే యుండుటచేతను, 
నిత్యకర్మలును. పూర్వాపర కర్మలును యజ్ఞహోమములును, పారాయణ గ్రంథములును, అన్నియు సంస్కృతములోనే యున్నందున హిందువులకిది శాశ్వతముగ సమాశ్రయణీయము. మహాత్మా గాంధి యిప్పట్ల నుడివిన యీ మాటలు గమనింపదగినవి.
ఒకప్పడు క్రైస్తవమతమునకు పవిత్రభాషగా నుండి క్రైస్తవమతముతోబాటు శాశ్వతముగా జీవించీతీరునను అభిప్రాయమును గల్గించుచుండిన లాటిను భాష ఈనాడు క్రైస్తవమతమును వీడినట్లు  సంస్కృతము హిందూమతమును వీడుటకు వీలు లేదు. అసలిపుడు లాటిను భాషయే అంతర్ధానమైనది. కారణ మేమంటే 
(1)   ఆదిలో లాటిను ద్వారా క్రైస్తవమతము యూరపులో వ్యాపించినను, తన్మత మూలగ్రంథము లాటిను పుట్టియుండలేదు. (2) హిందూమత మూలగ్రంథములలో అర్ధశక్తియేగాక అక్షరశక్తికూడ కలదు ఆ అక్షరములు 
అదేరీతిగా, అదేస్వరముతో ఉచ్చరింపబడుచో దాని ఫలితము మిక్కుటమని అనభవ పూర్వకముగా నెరిగిన వారెందరో యున్నారు.   కావున మన సంస్కృతిలో మూల గ్రంథమునకు ప్రముఖస్ధానము ఎప్పుడును పోదు. (3) సంస్కృత పదములు ధాతు జన్యములు. మనము ఎన్ని కొత్త పదాలనైనా ఇందులో సృష్టించుకొన 
వచ్చును.త్రిమతా చార్యుల శాస్త్ర భాష్యము లన్నియు ఈ ధాతు విశ్లేషణముతో అర్థ వివరణ గావించి యున్నారు. ఆ విధముగా ఇంకా ఎందరో మహానుభావులు భాష్యములను వార్తీకములను రచించి యున్నారు. కావున  మతముతో సంస్కృత భాషకుగల సంబంధ మెన్నటికిని పోదు. (4) ఇంతవరకు భారతీయ భాషలలో రామాయణ భారత భాగవతములకు అసంఖ్యాక అనువాద గ్రంథములు బహు భాషలలో బయలుదేరినను ఏ యొక ధార్మికవిషయమునగాని భక్తివిషయమునకాని తత్వవిషయమున కాని సందేహము వచ్చినను మూల సంస్కృతగ్రంథమును చూచియే సందేహమును తీర్చుకొనుచున్నారుకాని యీ తీయభాషాగ్రంథములను 
చూచి సందేహమునెవ్వరును తీర్చుకొనుటలేదు. కావున ప్రామాణికత గల మూలసంస్కృత గ్రంథములు చెక్కు చెదరవు. (5) సంస్కృతమువంటి అమూల్యరత్న నిధానమును హిందువుల జీవన విదానముతో ముడిపడి 
యున్నందున అది అమరము. ఆధునిక యుగమున భారతదేశములో ఫ్రాంతీయ భాషలకు సంస్కృతమువలన కలుగు పరిపుష్టి వర్ణనాతీతము. 
ఏభావమునైనను, భావచ్ఛాయనైనను తెలుపగల పదములు సంస్కృతములో సిద్ధములై యుండుటయేకాక అవసరమున కనుకూలముగా  నూతన పదములను సృజించుకొను అవకాశము ఇందున్నంత పుష్కలముగా మరి యేభాషలోను లేదు. ఆయా ధాతువులకు చేర్చబడు ఉపపర్గల వలనను తిఙకృత్ప్రత్యయముల వలనను అనంతపదజాలము కల్పింపబడుట కవకాశమున్నది. అట్లే సుబంత తద్ధిత రూపములును కొల్లలుగా సంపాదింపబడును. ఒక్కధాతువునుండి సుమారు 150 పదములను సృజించు అవకాశము సంస్కృతములో కలదు. ఇట్టి యవకాశము మరి యే భాషలోను లేదు. ఇంత భాగ్యవంతమును, సమృద్ధి మంతమును అయిన భాష ఆధునికయుగములో నిర్వహింపవలసిన కార్య మెంతయో కలదు. బహువిధోద్యమములతోను, వైజ్ఞానిక సంచలనములతోను చైతన్యవంతమైన ఆధునిక కాలములో సంస్కృతము చేయుచున్నట్టియు, చేయగల్గినట్టియు సహాయ మింతింతయని చెప్పజాలము. 1920 వ సంవత్సరమునకు పూర్వము మనదేశములో "అతలాకుతలము”, “మహిళాసమస్య”, దృఢసంకల్పము” మున్నగు పదములకు అర్థమేమని దారినిపోవువాని నెవ్వని నైనను అడుగుచో అతడు తెల్లబోయెడివాడు. నేడు దిన పత్రికలను చదువు సామాన్యజనుడు కూడ వీనియర్ధమును గ్రహించ గల్గుచున్నాడు. మనకు తెలియకుండగనే సంస్కృతము మనకు సహాయము చేయుచు తన విలక్షణప్రభావమును లోకమునకు చాటుచున్నది.

పుట్టపర్తి వారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు:
"నాకు తెలిసినంతలో అన్ని భాషల తత్త్వం ఒక్కటే. సంస్కృతం ఒకటి బాగా వచ్చినట్లయితే, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్‌లో ఏ భాషైనప్పటికిన్నీ కూడా సులభంగా మనిషికి అర్థమవుతుంది. మనిషి నేర్చుకోవచ్చును. French, Latin, Greek, German మొదలైన ఈ భాషలన్నీకూడా,  సంస్కృతంతో సంబంధం 
ఉండేటటువంటి భాషలే. ఉత్తర హిందుస్థానంలో అనేకమైన భాషలు సంస్కృతంతో సంబంధం ఉండేవే.
 సంస్కృతాన్ని బాగా చదువుకోవాలి. అయితే వాడికి philological outlook వుండవలె. అది లేకపోతే కష్టం. భాషా శాస్త్రానికి సంబంధించిన అవుట్‌లుక్ ఉండినట్లైతే సంస్కృతమును పరినిష్ణాతంగా నేర్చుకున్నవాడు ఏ భాషనైనప్పటికినీ సులభంగా నేర్చుకోవచ్చును."
ఆధునిక నాగరికతకును సంస్కృతభాషకును ఇట్టి సంబంధము కలదు. ఇది భారతదేశములోని అన్ని ప్రాంతీయ భాషలకును వర్తించును. కావుననే భారత కేంద్రప్రభుత్వమునకు అధికారభాష కావలసిన హిందీ పదములను స్వీకరింపవలసి నపుడు ముఖ్యముగా సంస్కృతమునుండియు, తరువాత ఇతర భారతీయభాషల నుండియు (...By drawing, where ever necessary or desirable, for the vocabulary, primarily on Sanskrit and secondarily on other languages) స్వీకరింపవలయుననని భారత రాజ్యాంగ ప్రణాళికలో ఉపనిబద్ధమైయున్నది. (Part XVII, Chapter IV, 351)
నేటి భారతీయ భాషాసాహిత్యములతో సంస్కృతమునకు గల గాఢసంబంధము గట్టిగా మనస్సునకు తట్టవలయునన్నచో అప్పుడప్పుడు జరుగుచుండు సర్వప్రాంతీయ కవిసమ్మేళనమములలో పద్యములను మనము వినవచ్చును. ఇంచుమించు అన్ని ప్రాంతీయభాషలలోను అవే సంస్కృత పదములు విననగును; 
భిన్నభారతీయ భాషలనడుమ ఎంత ఐక్యతకలదో స్పష్టముగ గోచరించును.

మిగిలనది మరొకమారు.......
5.
సంస్కృతమునకు ప్రాంతీయభాషలతోగల సంబంధమును గురించిన విచారణము ఇంతటితో నాపి సంస్కృత పదముల సహజశక్తిని గురించి యొకింత చర్చింతము.
ఇతర భాషలలో అనేక పదములచే చెప్పవలసిన భావమును సంస్కృతములోని ఒక్క వదము చెప్పగలదు. నాలుగు ఉదాహరణములను మాత్ర మీక్రింద నిచ్చుచున్నాను. దశరథః  = పది దిక్కులకును రథము నడుప గలవాడు. జిగమిషా=పోవలయును అనుకోరిక. రామతే = రామునివలె ఆచరించుచున్నాడు. కేశాకేశి = జుట్టుజుట్టు పట్టుకొని యుద్ధముచేయునట్లు. ఇట్టి శబ్దపటుత్వము నేటి ప్రపంచభాషలలో దేనికిని లేదు. పాము, స్త్రీ మొదలగు అనేక పదములకు వందకు తక్కువ లేకుండా పర్యాయ లేక సమానార్థక పదములు ఉన్నవి. ఇంతియేకాక, రెండు, మూడు అక్షరములు గల చిన్న పదములు గొప్ప భావమును స్ఫురింపజేయుట సంస్కృతములోనే కాంచనగును. ‘ఉమ’ అన్న శబ్దము పార్వతీదేవికి పర్యాయ పదమని మనకు తెలిసిందే! పార్వతిగా ఆతల్లి శివుని హృదయమందు ప్రతిష్ఠించుకొని అంతఃపురము వీడి వనము చేరి తపమాచారింపదలచుతుంది. తల్లిదండ్రులగు హిమవంతుడు మేనక ఆమెను, తపస్సుకు గాను బయటికి వెళ్ళవద్దు అంటారు.  ఇంతపెద్ద భావమునకు ఉపయోగించిన అతిచిన్నమాట ‘ఉమ’. ధర్మ శబ్దమువలన దాని నాచరించువాడు మంచిస్ధితిలో ధరింపబడునని బోధింపబడుచున్నది. రథ్యా శబ్దమువలన పూర్వము వీధులు రథము నడుచుటకు తగినంత వెడల్పుగా 
నుండెనని తెలుపబడును. శరీర శబ్దమువలన నిది శిధిలమైపోవునను (శీర్యతే) తత్వబోధ చేయబడుచున్నది. స్మృతి శబ్దమువలన మనుస్మృత్యాది గ్రంథములు, వేదములను స్మరించుచు వ్రాయబడినవే కాని తత్కర్తల స్వకపోలకల్పితములు కావని తెలియుచున్నది. ఈరీతిగా సంస్కృత శబ్దములకు లోకోత్తరశక్తి కన్పట్టుచున్నది. ఇతర భాషలలో నిది మిక్కిలి తక్కువ.
ప్రపంచములో ఏ భాషలోని పదములకైనను వ్యుత్పత్తికావలసినచో సాధారణముగా ఇతర భాషలలోనికి పోయి
 వెదుకవలసియుండును. ఒక ఇంగ్లీషు పదమునకు వ్యుత్పత్తి కావలసినచో కెల్టిక్, ట్యుటానిక్,  హైజర్మన్, లోజర్మన్, లాటిన్, గ్రీక్ మున్నగువానిలో అది లభించును; అట్లే యితర భాషాపదములకును, ఈ మూలభాషలు అని అనుకొనబడుచున్నవాని పదములకు వ్యుత్పత్తి కావలసినచోకూడ మరొక భాషలో నన్వేషణము చేయవలసియుండును. గ్రీకులోని పదములకు కూడ అనేకములకు సంస్కృతములో వ్యుత్పత్తి లభించును. అసలు ఈ విషయమును India in Greece అన్న గ్రంధరచయిత E. Pococke (UK) తనగ్రంధములో అనేక దృష్టాంతముల ద్వారా నిరూపించుచున్నాడు.
ఒక్క సంస్కృతములోని పదములకు మాత్రము వ్యుత్పత్తి అన్య భాషల కేగనక్కరలేకుండ ఆభాషలోనే లభించును.సంస్కృతముయొక్క సర్వ ప్రాచీనతకును స్వతంత్రతకును ఇది ప్రబల నిదర్శనము. అర్ధముకానివారికి కూడ శ్రవణ సుఖమును గల్గించు భాష సంస్కృతము. సంస్కృత శ్లోకములను విని యానందింపని వాడుండడు. నేటి భాషలలో కాని, గ్రీకు,లాటినులలోగాని సంస్కృత వృత్తములంత 
మధురములైన వృత్తములు లేవు. Most musical metres మధురతమ వృత్తములు - ఆని ఎ. ఎ. మాక్డొనెల్ సంస్కృత వృత్తములను వర్ణించి యున్నాడు. భగవద్గీతాది గ్రంథములలోని అనుష్టుప్ శ్లోకములు, మందాక్రాంత, వియోగిని, ధృతవిలంబితము, మాలిని మున్నగు వృత్తములు మధురాతి మధురములై సర్వ మనోరంజక 
శక్తిగలవై యొప్పుచున్నవి. సంస్కృత పండితులు సరస సాహిత్య సల్లాపములను గావింపునపుడు కాని, వేదాంతగోష్ఠిని నెరపునపుడు కాని, పురాణ ప్రవచనము సలుపునపుడు కాని వినునట్టి నవీన విద్యానాగరికతా సంపన్ను లెల్లరును తద్భాషా 
సౌందర్యము నకును, విషయ మహత్త్వ మాధుర్యములకును ముగ్ధులగుటను గాంచుచున్నాము. ఉదాహరణము మల్లాది చంద్రశేఖర శాస్త్రి, సామవేదం వంటి వారి ప్రవచనములే. ఆధునిక సభ్యతలో నెంత ఉన్నతస్థతిలో నున్న వారును ఈ భాషను వాఙ్మయమును నేర్చియుండినచో తమ జన్మ ధన్యమయ్యెడిదని భావించుట సర్వత్ర కాంచనగును. సంస్కృతమునకు గల అద్వితీయ మాధుర్య మహత్త్వముల కిది ప్రబల దర్శనము.వేయేల వైదీకులు వేదమంత్ర పఠనము చేయుచున్నప్పుడు మనకు మంత్రములు రాకపోయినా చెవులు రిక్కించుకొని విందుము. ఇది ఆ భాష యొక్క గొప్పదనము కాదా! ఇట్టి సర్వతోముఖ సౌరభ సౌభాగ్య సంభరిత  సంస్కృతభాష భారత భాగ్యరాశిలో అమూల్యరత్న మగుటయేకాక భారతీయులకు భారతీయతను మరియు భారతీయసంస్క్రుతిని చూపించే అద్దము వంటిది. భూమి పై మానవ సంస్కృతి మొదలైన రోజునుండి మాట్లాడుచూ వచ్చిన భాష యిది. పలువిధము లైన కారణములవల్ల భారతీయులు ఖండ ఖండాంతరములు వ్యాపించి ఈ భాషను వ్యాపింపజేయగా అది రాను రానూ అపభ్రంశమై  స్థానిక భాషలుగా పరివర్తన చెంది యుండవచ్చునని నాయూహ. కొన్ని పదాలు మచ్చుకు :
తమిళం: వాసగం---వాచకమ్, జొదిడమ్---జ్యోతిషమ్, ఆముదం---అమృతమ్,
యందిరం-యంత్రమ్, సంస్కృతమంటే మంటపడే కరుణానిధి గారి బిరుదైన 'కలైజ్ఞర్'=కళాజ్ఞ (ళ) వారి పార్టీ గుర్తు పేరు ‘ఉదయ సూరియన్’(ఉదయ సూర్య) సంస్కృతపదములే!  పూర్తి తమిళపదముగా తోచే ఈ తమిళ చలనచిత్రము పేరు చూడండి. ఈ చిత్రము పేరు ‘పడిక్కాద మేదై’. ఇది తెలుగులో ‘ఆత్మబంధువు’ అను పేరుతో వచ్చింది. ఇప్పుడు ఈ ‘పడిక్కాద మేదై’ లో సంస్కృతము ఎక్కడ ఉన్నదో చూద్దాము. ‘పఠ’ అన్న ధాతు జన్యము ‘పఠన’ అనగా పఢ్ న’ ‘పఢ్’ ‘పడిప్పు’ (తమిళులకు ‘డ’ ‘ఢ’ భేదములేదు). కావున పడిప్పు సంస్కృత పదమే! అదేవిధముగా ‘మేధ’ యొక్క ‘వికృత రూపమే ‘మేదై’.  కానీ చాలామంది తమిళులు పై పదాలన్నీ తమిళ పదాలేయను భ్రమలో నుండుచున్నారు. కారణము వారికి సంస్కృతము అంటరానిది. ఇందులో ద్రావిడ పార్టీల ప్రమేయము వల్ల తమిళులు తప్పుదారి పట్టవలసి వచ్చింది. 9 వ్యాకరణములు కల్గిన ఈ సంస్కృతం లోని మొదటిది తమిళ వ్యాకరణమని చంద్రశేఖర యతీంద్రులు చెప్పగా విన్నాను. నరనరాలలో సంస్కృతమే కలిగిన తెలుగు భాషకు తల్లి సంస్కృతము కాకుండా ఎట్లు పోతుంది. 

ఇంకొకమారు ఇంకొంత........
6.
సంస్కృత శబ్దాలు గ్రీకు లాటిన్ జర్మన్ మొదలుగాగల ఎన్నో భాషలలోనికి పుంఖానుపుంఖాలుగా పోయి అక్కడినుండి ఆంగ్లము లోనికి చేరుకొన్నాయి.
ఉదా: నవ = new, పథ =path, తత్=that త్వ= thou, వచస్=voice త్రికోణమితి= Trigonometryఇట్లు మదర్ ఫాదర్, డాటర్, బ్రదర్ మొదలైన పదాలన్నీ కూడా
సంస్కృత జన్యములే. అసలు అంక, బీజ, రేఖ, త్రికోణ ఆదిగా గల అనేక గణిత శాస్త్రములు ఆంగ్లేయులకన్నా వేల సంవత్సరముల పూర్వము పేరును ఆశించకుండా సంస్కృతమున నిక్షిప్తము చేసియుంచిన మహా విజ్ఞానఖనులు ఈ గడ్డ బిడ్డలు.
       ఇంచుమించు క్రి.శ. 800 లో పురుడు పోసుకొన్న నేడు అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లమునకు యిప్పటికీ ఒక నిలకడ గలిగిన వ్యాకరణము లేదు. 30% పదములు లాటిన్ నుండి, మిగిలినవి గ్రీకు, ఫ్రెంచి, జర్మన్, సంస్కృతము, మొదలుగాగల భాషలనుండి తీసుకోన్నవే. తిరిగి వానిలోని చాలా పదములకు మూలము సంస్కృతమే. 17 వ శతాబ్దములో వారి మొదటి నిఘంటువు ప్రచురించినపుడుండిన పద జాలము 3000. ఆ పదకోశము పైగల పేరు ఏమన 'A Table Alphabetical Containing And Teaching The True Writing And Understanding Of Hard Unusual Words of English Borrowed From Hebrew, Greek Or French.' ఇక్కడ ఒక్క విషయము 
మనవి చేసుకొంటాను. ఇది మనసు పెట్టి యోచించితే ఎంతో చింత పడుట కాదు సిగ్గు పడవలసిన విషయము.
 
శర్మణ్య (Germany ) దేశస్థుల  వైమానిక సంస్థ పేరు Lufthansa = లుఫ్త్+హంస. లుఫ్త్ అంటే జర్మన్ భాష లో గాలి (వాయువు )అని అర్థము హంస అంటే మనకు తెలిసినదే, కారణము ఇది సంస్కృత పదము. కావున Lufthansa = వాయు హంస అని అర్థము. అట్లు కాక ఆపడము సంప్పోర్ణ సంస్కృత జన్య పడమనుకొంటే దానిని ‘లుప్తహంస’ గా కూడా భావించవచ్చును. ఎగిరే హంసలను చూడలేము కాబట్టి ఎగిరే తెల్లటి కొంగలబారును ఆకాశములో ఎగిరే సమయములో చూస్తే ఎన్నో విన్యాసాలు చేస్తూ చేస్తూ కనుమరుగౌతాయి. ఆ దృశ్యము చూచుటకే అత్యంత మనోజ్ఞముగా ఉంటుంది. మనము మన సంస్థ కు ఒక భికారి రాజు బొమ్మ తగిలించుకొని 'AIR INDIA' అనే పేరు పెట్టుకొన్నాము.
ఫ్రెంచ్,జర్మన్,స్పెయిన్,గ్రీసు జపాను,కొరియా, చైనా,మొదలగు ఎన్నో దేశములు తమ మాతృభాషలోనే శాస్త్రాభివృధ్ధిని ఇతోధికముగా గావించుకొన్నాయి. దాదాపు 254 దేశములు కలిగిన ఈ ప్రపంచములో ఇంచుమించు 15 దేశాలు మాత్రమే ఆంగ్లము అనర్గళ ముగా మాట్లాడుతాయని విన్నాను. అదే నిజమైతే ఈ దేశము ఆంగ్లము అత్యధిక జనులు మాట్లాడే దేశమౌతుంది. మధ్య తరగతి కుటుంబాలలో పుట్టి కోరిన చదువు చదువుకోలేక సంపాదనే సర్వస్వమని యెంచిన మాకాలము గతించినది. రాబోయే కాలము ఏంతో  విజ్ఞానవంతులైన యువతరానిది. ఈయువత మాకు రానిది లేదు అని ముందుకు అడుగు వెయ గలిగితే మన దేశానికి పురాప్రాభవము ఎటుతిరిగీ సమకూర్చగలరు. 
ప్రపంచ భాషలకాది భాషయైన ఈ సుర భాషను మరచి పర భాషను పట్టుకొని చిరకాలమూ ప్రాకులాడుటకన్నా, మన యువత సంస్కృతము పై పట్టు సాధించి
సర్వ శ్రేష్ఠతను సాధించి, జగదగ్రగామియై నిలుస్తుందని ఆశిస్తున్నాను.  
అతిముఖ్యమయిన మాట, సంస్కృతభాష ప్రపంచాన్ని తనవైపునకు, తిప్పుకుంటోంది.
సంస్కృతభాషను గురించిన  కొన్ని ఆశ్చర్యకర వాస్తవాలను గాంచ ప్రయత్నింతుము. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది.
1. NASA వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే!
2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే.
3. ప్రస్తుతానికి సంస్కృతభాషలో 102, 78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి అని అంచనా! కానీ ఈ సంఖ్యా స్థిరము కాదు. ఈ భాశాయండలి పదములు దాతుజన్యములు కాబట్టి మనము ఎన్నో, ఎన్నెన్నో క్రొత్త పదములను కూడా ఆవిష్కరించవచ్చును.
4. సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు 'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన సమానార్థకాలు ఉన్నవి, పాము, స్త్రీకి ఉన్నట్లే!
5. NASA వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది.
6.1987 లో Forbes మ్యాగజీన్ computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది. ఇక్కడ ఈ విషయమును కొంత విస్తారముగా తెలుప ప్రయత్నించుతాను. కలన యంత్రము యొక్క (Computer Code) ‘యంత్ర భాష’ ద్వైధ సంఖ్యలలో వ్రాస్తారు (Binary Numbers). దాని సంకేతములు 0,1. మహానుభావుడగు పింగళుడు ఈ విషయమును మన ‘ఛందస్సు’లో ఎపుడో చెప్పినాడు. ఆయనా వీనిని గురువు ‘U’ అని లఘువు ‘l’అన్న సాంకేతిక చిహ్నములను వానికి ఏర్పాటు చేసినాడు. (a + b) 2=a2+2ab+b2
అన్న విషయము మనకు తెలిసినదే! ఇప్పుడు ఇక్కడ a=U అనుకొందాము. b=l అనుకొందాము. ఇప్పుడు మనము a,b లను రెండు రెండు ఒక్కొక్క పర్యాయము చొప్పున ప్రస్తారణ (Permutation) చేస్తే అవి ఈ విధముగా ఉంటాయి. aa, bb, ab, ba, bb. aa ను మనము a2 గా వ్రాసుకోవచ్చు, అట్లే bb ని మనము b2 గా వ్రాసుకోవచ్చు. ab అన్నా ba అన్నా విలువ మారదు కాబట్టి అవి అంటే ab, ba లు ab ab ఔతాయి. అంటే అవి 2ab అనేకదా!  a+b కాబట్టి వచ్చిన 3 విలువలను కూడుకొనవలసియుంటుంది. అప్పడు అది a2+2ab+b2 = (a + b)2 ఇదేవిధముగా ab ని చంచల సూత్రము ప్రకారము (Commutative Law) ba గా వ్రాసినా విలువ మారదు. ఇదేవిధముగా (a+b)³ ను సాదించుటకుaaa, bbb ఇట్లు మనము ఎన్నివిధములుగా పౌనఃపున్యములు అంటే ప్రస్తారణలు అంటే Permutations చేయగలమో అవన్నీ సమీకరిచి కూడితే (a+b)³ విలువను సాధించగలుగుతాము.
7. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు.
8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్ఛారణలతో పోల్చితే, నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలో మాత్రమె!
9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావని ఘోషించుచున్నది.
10. సంస్కృతసంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం.
11.జర్మనీ లోని 14 యూనివర్సిటీ లలో సంస్కృతబోధన జరుగుతోంది.
12. NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట. చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థమూ మారదు. ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే 1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే 2.పాఠశాలాం గచ్ఛామి అహం.3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది.
అదే మనము 'Rama Killed Ravana' తీసుకోన్నామంటే  'Killed, Rama Ravana' అర్థము గజిబిజిగా ఉంటుంది. అదే వాక్యమును 'Ravana Killed Rama' గా వ్రాస్తే అర్థము రసాభాసమే అయిపోతుంది. అందుకే
తల్లి తెలుగు భాష తల్లికి తల్లియౌ 
భాష సంస్కృతంబు బాయనట్టి
ఎంగిలీసు జూడు ఎంత సాంకర్యమో 
రామమోహనుక్తి రమ్య సూక్తి
13. ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృతభాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు.
14. NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే!
15.సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలలో ఋజువు పరచుకుని ప్రస్తుతం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించినారు.
16. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో (కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా) Technical Courses లో  సంస్కృతబోధన జరుగుతోంది.
ఇచట అనగా ఈ భారత భూమిన పుట్టిన భాషను అప్రాచ్యులు గుర్తించితే మనము మాత్రము ఆంగ్లము చుట్టూ వెంపర్లాడుతూ ఉన్నాము. పైపై తళుకులపైనున్న వ్యామోహము మన దేశ, మనభాష, మన రీతి, మన ఘనత పై మనకు లేదు. మనపోరుగు రాష్ట్రమైన కేరళ సాంఘీక చలనచిత్రములలో  పూర్తి సంస్కృతములో పాటలు యూసుఫ్ అలీ కెచేరి అనే మహమ్మదీయ సంస్కృత పండితుడు వ్రాసేవాడు. ఆవిధమగు ఒక పాటనయినా మనము చూపగలమా! వెనుకటికి ఎవడో తన పాదములకు తానే మ్రొక్కుకొని ‘నూరేండ్ల ఆయుస్సు’ అని దీవించుకొన్నాడట.
‘మా తాతలు నేతులు నాకినారు మీరు మా మూతులు నాకండి’ అన్న సందేశమును మనము లోకమునకు ఇచ్చి రొమ్ములు చరుచుకొంటున్నాము అన్నది ఎంత త్వరితముగా గుర్తించితే అంత శీఘ్రముగా మన ఆంధ్రమును, అచ్చతెలుగును ఎటూ పోగొట్టుకొన్నాము, సంస్కృతమును బ్రతికించుకోగలిగినవారమౌతాము.

స్వస్తి. 
తరువాత  సంస్కృత సంస్కృతి అనుబంధము లో మరికొన్ని విషయములు తెలుసుకొందాము. 
సంస్కృత సంస్కృతి అనుబంధము
కీర్తిశేషులు  Dr. Vvs Sarma గారు: 'మీరు సంస్కృతమును గురించి వ్రాయుచున్న వ్యాసావళి ఈతరానికి చాలా ఉపయోగం. ఇంగ్లీషు మీడియం విద్యలో ఇంగ్లీషు నర్సరీ రైముల ఆవశ్యకత ఏమున్నదిఇంగ్లీషు అవసరమే కాని సంస్కృతముమరియొక దేశభాష నేర్చుకొనవలెను. హిందీ Conversational language గా సరిపోతుంది. పారిభాషిక పదాలకు సంస్కృతమే శరణము. ఉపసర్గల వలన అనేక పదములు నిర్ణయించుకోవచ్చును. పాణినిపతంజలిభర్తృహరి -అష్టాధ్యాయిమహాభాష్యమువాక్యపదీయములతో వ్యాకరణము దర్శనమైనది.'
శర్మగారు చెప్పినది అక్షర సత్యము. అత్యంత వాస్తవము. చిన్న పిల్లలు కలిగిన తలిదండ్రులు ఈ వాస్తవాలను చిత్తగించండి ఇప్పుడు పాఠశాలలో చేర్చే పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా నా వద్దకు వస్తే నాకు వీలైనతవరకు తెలుగును రెండవ 
భాషగానైనా తీసుకొమ్మని చెబుతూ వుంటాను. నా మాటకు బలము కలిగించుటకు ఈవిధముగా వాళ్ళతో అంటూవుంటాను. 'గంగి గోవు పాలు...అనే పద్యమో, 'మాటకు ప్రాణము సత్యము...అనే పద్యమో పిల్లలకు బాల్యములోనే నేర్పించితే వారికది జీవితాంతము ఉపయోగ పడుతుంది. కొంచెం పెద్ద పిల్లలైన తరువాత ఏ 'గజేంద్ర మోక్షమో' 'రుక్మిణీ కళ్యాణమొనేర్పించితే భక్తిభావము పెరుగుతుంది కానీ చిన్నపిల్లలకు 'శవ సాహిత్యముతోచదువు మొదలుపెట్టించే kg ల kgల చదువులెందుకు చెప్పించుతారు అని సరదా తో కూడిన వాస్తవాన్ని చెబుతూ వుంటాను. ఊదాహరణకు
Humpty Dumpty sat on a wall,
Humpty Dumpty had a great fll.
All the king's horses and all the king's men
Couldn't put Humpty together again
అదే విధంగా 'జాక్ అండ్ జిల్ హెకరి డికరి ..’ ఇత్యాదులెన్నైనా చచ్చెచిపోతాను గూర్ప్పచి తప్వ చిన్న వయసులో పిల్లలు నేర్చుకోగలిగినది ఏమయినా ఉన్నదా! ఇవి గాక 'జానీ జానీ యస్ పాపాలో కూడా కొడుకు తండ్రికి అబద్ధం చెబుతూవుంటేఆయన హహహా అని నవ్వుతాడు. పిల్లలకు బాల్యములో 'అమరముఒక్కటి నేర్పించుట మొదలిడితే అన్నీ తమకు తామే వస్తాయి.
మరి పిల్లి మెడలో గంట కట్టేదెవరో ...

స్వస్తి.

Opinions of the Learned Lot:

Vvs Sarma

మీరు సంస్కృతమును గురించి వ్రాయుచున్న వ్యాసావళి ఈతరానికి చాలా ఉపయోగం. ఇంగ్లీషుమీడియం విద్యలో ఇంగ్లీషు నర్సరీ రైముల ఆవశ్యకత ఏమున్నది? ఇంగ్లీషు అవసరమే కాని సంస్కృతము, మరియొక దేశభాష నేర్చుకొనవలెను. హిందీ Conversational language గా సరిపోతుంది. పారిభాషిక పదాలకు సంస్కృతమే శరణము. ఉపసర్గల వలన అనేక పదములు నిర్ణయించుకోవచ్చును. పాణిని, పతంజలి, భర్తృహరి -అష్టాధ్యాయి, మహాభాష్యము, వాక్యపదీయములతో వ్యాకరణము దర్శనమైనది.

9y

Dayanand Vallab

Raanunna kaalamlo artificial intelligence lo Samskrutam tappa dikkuleni paristhithi rabovuchunnadani naa abhipraayam. Sahaja bhaasha gaana "pada+artha" padamunaku(Samskrutam loni) arthamuley "padaarthamulu"(lokamloni vasthuvulu). Anthey gani vasthuvu mundu-padam tarvatha kaadu. Ee okka vishayam arthamainacho, sahaja bhaasha ante emito arthamouthundi... Tadvara idi computing losaatileni dikku gaa parinaminchagaladu. Germany mariyu konni IIT Lalo ee dishaga prayatnamu saaguchunnadani vintini. Mee vyaasamu chala viluvainadi. Dhanyavadamulu.

9y

Cheruku Ramamohanrao

నేను ఈ వ్యాసమునకు ఆది లోనే,చదువరులకు సూచన చేసినాను కానీ శర్మగారు,మీలాంటి వాళ్ళు తప్ప ఎవరూ లైకులు తప్ప వారీదిశ లో పయనించ ప్రయత్నిచుతామని వ్రాయకపోవుట దురదృష్టకరము. యువతలో చలనము వస్తేనే సమాజములో చలనము వస్తుంది. వారిలోగల శక్తి ముసలివారిలో వుండదు కదా. చైతన్యమే జీవనము. మీ స్పందన కొందరినన్నా ఉత్తేజితుల చేస్తుందని నా ఆశ .

9yEdited

Krishna Mohan Mocherla

సంస్కృత శబ్దాలు గ్రీకు లాటిన్ జర్మన్ మొదలుగాగల ఎన్నో భాషలలోనికి పుంఖానుపుంఖాలుగా పోయి అక్కడినుండి ఆంగ్లము లోనికి చేరుకొన్నాయి.

ఉదా: నవ = new, పథ =path, తత్=that త్వ= thou, వచస్=voice ఇట్లు మదర్ ఫాదర్ మొదలైన పదాలన్నీ సంస్కృత జన్యములే. Your work is excellent. Unfortunately in Andhra Pradesh students select Sanskrit subject to avoid learning Telugu and gain marks as they can use English script to write. A nice article.

8y

Krishna Mohan Mocherla

Navigator is made up of nav + gati

8y

Cheruku Ramamohanrao

మనసార చదివి నేటి వాస్తవాలను తెలియబరచినారు. ధన్యవాదములు . ఈ చైతన్యము తల్లిదండ్రులలో వస్తే పిల్లలలో కొంత మార్పును మనము చూడగలుగ వచ్చు.

It is all the parents who should take initiative to motivate the children to opt for their mother tongue. The most glaring fact is that if one learns Telugu he can learn any language very easily. It is really a pity that some great scholars of the language, I opine, are instrumental for the deterioration and damage of the language with their concept 'వాడుక భాష'. This made the children to distance themselves from the great 'Granthas' and gradually pushed them into the oblivion. Govt. is another contributor for the decay of the language. Parents contributed their might to demotivate the children to opt for the mother tongue. As you said corporate colleges, for their personal ends encouraged children to take 'Sanskrit', for which they can write answers in English, in lieu of Telugu. In a nut shell, to put all that is written above I am reminded of a poem of Maha Bharata where Arjuna when repents for making Karna slain Krishna says like this:

నరవర నీచే నాచే

వరమడిగిన కుంతిచేత వాసవు చేతన్

ధరచేత భార్గవునిచే

నరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్

8yEdited

Cheruku Ramamohanrao

It is not only navigate there are so many words of the sort.అక్ష =axis బంధ=bind ధామ= domes, domicile etc. there are innumerable no. of words and so many words that are ధాతు జన్యములు which will enable to coin any number of new words.

We need not take 'BANK' into our languages as bank exactly do not convey the meaning of what it is meant for as per the 'Thesaurus' but the two sanskrit words 'వార్దుషి' and 'కుసీదికం' represents the place where monitory transactions take place for 'INTEREST'

8yEdited

Krishna Mohan Mocherla

నరవర నీచే నాచే

వరమడిగిన కుంతిచేత వాసవు చేతన్

ధరచేత భార్గవునిచే

నరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్ __/\__

8y

 




1 comment:

  1. సంస్కృతము మత్తూరులో వాడుక భాష అని తెలిసి ఆశ్చర్యము వేసినది
    సంస్కృతము మృత భాష అంటున్నవారికి మీ ఈ గొప్ప రచన ఒక కనువిప్పు

    ReplyDelete