Thursday, 19 May 2022

ఆత్మస్తుతి పరనింద

 

ఆత్మస్తుతి పరనింద

https://cherukurammohan.blogspot.com/2022/05/blog-post.html

తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. ఇందులో ఎక్కువ లాభాలున్నాయి. నీవు మాట్లాడినందున నీకు వచ్చేదిలేదు. విన్నందువలన నీ గౌరవము మొక్క పోబోయేదీ లేదు. వినుట వల్ల నీకు అనేక విషయాలు తెలియవచ్చు. వాగుట వల్ల మాత్రము నీవు కొత్తగా ఏమీ తెలుసుకొనే అవకాశమే లేదు. అదీగాక ప్రతివారు మాట్లాడ తలుస్తారు తమకు విషయము నిజముగా తెలిసినా తెలియకున్నా! నీవు ఇతరుల దృష్టిలో మంచివాడవని అనిపించుకోవాలంటే శ్రద్ధగా ఇతరులు చెప్పేది విను.

మంచి తెలుసుకొనగ మారు మాటాడక

శ్రద్ధబూని వినును శాంతముగను

వాక్కు మహిమ నెరుగు  వాగకు గొప్పలు

రామమోహనుక్తి రమ్య సూక్తి

ఎంత మంచిగా వింటే అంత చక్కగా మాట్లాడుతాడు మనిషి, తనవంతు వచ్చినపుడు. 

అప్పుడు స్వోత్కర్షకు తావివ్వడు. విషయమును గూర్చి మాట్లాడవలెను కాబట్టి 

పరనిందకు తావుండదు.   సంభాషణకు వాగ్వాదము పూర్ణబిందువు. అనగా అప్పుడు 

విషయమును గూర్చి గాక తగవులాటలతో తలపట్టుకో వలసి వస్తుంది. ఆతరువాత  

సంభాషణ వక్రగతిని అనుసరించి ‘ఆత్మస్తుతి పరనిందకు దారితీస్తుంది. ఆతరువాత 

జరిగేది పాఠకుల ఊహకే వదలుచున్నాను.  అందుకే శ్రీనాథుడు ఆగ్రహోదగ్రుడై 

రాజమహేంద్రి పండిత వైతండికులను  ఇలా అన్నాడు:

బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు,

శాంతి నిప్పచ్చరంబు ,మచ్చరము ఘనము

కూప మండూకముల బోలె కొంచెమెరిగి

పండితమ్మన్యులైన వైతండికులకు 

అని.

నిప్పచ్చరము అనగా దరిద్రము, అంటే శాంతముగా సాంతము ఆలోచించలేనివాడు అని అర్థము. మచ్చరము అనగాఈర్ష్య. పండితమ్మన్యులు అనగా కుహనా పండితులు అని అర్థము (పండితశ్రేష్ఠులని కాదు). ఇప్పుడు ఆ మహాకవి ఏమంటున్నాడో చూడండి. తనకంటూ ఒక వాదం లేకుండా ఎదుటి వారిని ఖండించడమే ధ్యేయంగా ఆత్మస్తుతి పర నిందతో  .అప్రస్తుత విషయాలు తెచ్చి రాద్ధాంతం చేసేవాళ్ళను  వితండ వాదులు లేక వైతండికులు అంటారు. ఇలాంటి వాళ్ళకు తెలిసినదొక్కటే ‘శేషం కోపపేన పూరయేత్’ అంటే తన మిగిలిన వాదమంతా కోపముతో పూరించవలసినదే!

ఈ సందర్భముగా ఈ శ్లోకమును గమనించండి :

ఆత్మోత్కర్షం న మార్గేత పరేషాం పరనిందయా ।

స్వగుణైరేవ మార్గేత విప్రకర్షం పృథక్ జనాత్ ॥ (మహాభారతము)

ఇతరులను గురించి తేలికగా మాట్లాడి తాను ఏదో గోప్పవాడన్నట్లు చెప్పుకోవడానికి ప్రయత్నించకూడదు.  తనలో ఏమైనా మంచి గుణాలుంటే చూపి వాటిద్వారా ఇతరులకంటే తనకున్న గొప్పతనాన్ని నిరూపించుకొనడానికి ప్రయత్నించాలి.

ఈ మాట అర్జునునికి శ్రీ కృష్ణుడు చెప్పినట్లు గుర్తు.

పద్మవ్యూహం లో అభిమన్యుడు మరణించినాడన్న విషయం తెలుసుకున్న అర్జనుడు

అందుకు కారణం ధర్మరాజు అభిమన్యుని పద్మవ్యూహము భేదింప పంపటమేనని తెలిసి బాధపడి

అన్నగారైన ధర్మరాజును హతమారుస్తానని ప్రతిజ్ఞ చేసి  కత్తి పైకెత్తుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు అర్జనుని  వారించి ప్రతిజ్ఞా భంగము కలగకుండుటకు ఒక 

ఉపాయము చెబుతాడు. నిందిస్తే చంపటంతో సమానమని దర్మజుని 

నిందించమంటాడు అప్పుడు అర్జనుడు ధర్మరాజును నిందించటం మొదలు పెడతాడు. 

అంటే పరనింద చేసినాడన్నమాట.మనం ఇన్ని కష్టాల పాలగుటకు కారణము నీవు. నీ వ్యసనము. నీమూలంగానే అరణ్యవాసము అజ్ఞాతవాసము చేసినది. ఇప్పుడు యుద్దములో కూడా నీఉ ప్రోయ్సహించుట చేతనే నా కొడుకును పోగొట్టుకొన్నాను.  అని నోరు నొప్పిపెట్టేటట్లు నిందించినాడు. అంతటితో ఆగక అర్జనుడు తనను తాను పొగుడుకోవటం ప్రారంభించి తాను చేసిన గొప్ప పనులను ఏకరువుపెట్ట ప్రారంభించినాడు. "నేనంతటివాడిని ఇంతటివాడిని అంటూ బాల్యము  నుండీ తాను చేసిన గొప్పపనులను చెప్పుకోసాగినాడు. ఇంతాచెప్పుకొంటూ నేను ఒక్కడినే భారతయుధ్దమును ఒంటిచేత్తో గెలిపిస్తానన్నాడు. అంటే కృష్ణుడు చెప్పిన విధముగా తిట్లతో అన్నను హతమార్చినంతపని చేసినాడు. కారణమేమయినా ఇది ఆత్మస్తుతి పరనిందయే! శ్రీకృష్ణుని ఆదేశముతో, భ్రాతృ దూషణమునాపి  అర్జనుడు ఈ లోకం లోకి వచ్చి ఇంత సేపటినుండీ అన్నగారిని తిట్టినాను. నేను పాపిని నాజన్మకు నిష్కృతి లేదు, నాకు మరణమే శరణమంటూ ఒరలోనుండి కత్తి తీసి తనను హతమార్చుకోబోయినాడు.

అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు నిన్ను నీవు పొగడుకొని చచ్చినవానితో సమమైనావు. తిరిగీ 

వేరుగా చావనవసరము లేదు అన్నాడు. దీనిని బట్టి ‘ఆత్మ స్తుతి పరనింద’ ఎంత చెడ్డ 

పనులో మనము గ్రహించవచ్చును. అవి ఆత్మహత్యా సదృశ్యములు మాత్రమే కానీ అన్యతా 

కాదు. 

మనలను మనం పొగుడుకుంటే మనలను చంపుకున్నట్లే, ఎదుటిపెద్దలను పండితులను 

నిందిస్తే వారిని చంపినట్లే అనుకోని అప్పుడు కూడా మనలను మనమే  

చంపుకొంటున్నాము. అందుచేత సంభాషణలో మనలను మనము గొప్పవారమని, 

 అధికముగా మాట్లాడరాదు. అసలు అధికంగా మాట్లాడటమే తప్పు,అది అనేక అనర్థాలకు ఆలవాలం.

సవ్యమయిన జీవితానికి ఈ సాధనాసూత్రమును. కలకాలమూ గుర్తుంచుకొంటే మంచిది.

స్వస్తి.