అహింసా పరమో ధర్మః
https://cherukurammohan.blogspot.com/2020/08/blog-post.html
‘అహింసా పరమో ధర్మః’
అన్న ఈ శ్లోకపాదమును గాంధీ గారు విరివిగా ఉపయోగించేవారు దాని పూర్తి పాఠమిది అని
కొందరు అహింసాపరమోధర్మః ధర్మోహింసా తథైవచ’ అంటూ ఇటీవల ఆస్య గ్రంధిలో వ్రాసినారు, ‘ఎద్దు
ఈనింది అంటే గాట కట్టివెయమ’న్నట్లు. ఇది తెలుగులోనే కాక హిందీ మరియు ఆంగ్లములో
కూడా కొనసాగినది. ఇప్పుడు ఆ ఉధృతి కొంత తగ్గినది. సామాన్యముగా వ్రాసేవారిలోని ఒక
వర్గము, ఒకరు వ్రాసినది సంగ్రహించి తమ పేరుతో పునః ప్రచురణ చేస్తే, వారు చేసినది
మరియొకరు అఖండ శృంఖలము రీతిలో కొనసాగిస్తూ వుంటారు. ‘పదుగురాడు మాట పాటియై ధరయిల్లు-ఒక్కడాడు
మాట ఎక్కదెందు’ అన్నట్లు అదే నిజమై కూర్చుంటుంది రానురానూ. నిజానికి పైన తెలిపినది
పూర్తి శ్లోకము కాదు అది శ్లోక పాదమే! దానిని జూచి అది పూర్తి శ్లోకము కాదు శ్లోక
పాదమే నని తెలిసినా అసలు ఆవిధమగు పంక్తి కల్గిన శ్లోకము ఒకటుందా అని గూగుల్ లో
వెదకినాను. ఎందఱో పండితులను అడిగినాను. ఎక్కడా కనిపించలేదు ఎవరి ద్వారానూ
తెలియలేదు. చిట్ట చివరకు వేదమూర్తులు మాడుగుల నాగపణి శర్మగారిని అడిగినాను. వారు
అనుశాసనిక పర్వములోని ఒక శ్లోకమును చెప్పి అదికాక వేరేదీ నాకు అగుపించలేదు అని
అన్నారు. ఆ శ్లోకము ఇది.
అహింసా పరమోధర్మ స్తథా2హింసా పరం తపఃl
అహింసా పరమం సత్యం తతో
ధర్మః ప్రవర్తతిll
అహింసా పరమో ధర్మ
స్తథా2హింసా పరో దమఃl
ఆహింసా పరమం దాన మహింసా
పరమం తపఃll (మహాభారతము అనుశాసనిక పర్వము)
ఇది హింస భక్షణాన్ని
గర్హిస్తూ భీష్ముడు యుధిష్ఠిరునితో చెప్పిన మాట.
మన మెదడులో వెంటనే
తళుక్కుమను ప్రశ్న మరి మనము అహింస తప్ప హింసపాటించ కూడదా! అంటే కూడదు అన్నదే
జవాబు. మరి యుద్ధములు చేయ కూడదా! అన్నది తదుపరి ఉదయించే ప్రశ్న. ఎందుకు చేయ కూడదు తప్పక
చేయవలసినదే! అదే కదా భగవద్గీత చెప్పినది. యుద్ధము క్షత్రియుని కర్తవ్యము. అది
జరుగకుండా తగిన చర్యలన్నిటినీ తీసుకొని, అవి ఫలించక పొతే తప్పక యుద్ధము
చేయవలసిందే! అది హింస కానేరదు. మోస పూరితముగా చేత చిక్కించుకొని, శంబాజీని, రంజీత్
సింహుని నరకయాతనలు అనుభవింపజేసిన ఔరంగజేబు చేసినది హింస. అదే యధాదృష్టి గా
యుద్ధము చేసి చంపినా చచ్చినా అది కర్తవ్యమే కానీ హింస కాదు.
గాంధీ గారిని
వెనకేసుకు వచ్చుట నా రచన ఉద్దేశ్యము కాదు. ఎందుకంటే వారు అసలు యుద్ధమే వద్దన్నారు. వారు సత్యాగ్రహ కారణముగా సాధారణ కారావాసము చేయలేదు. 'ఆగాఖాన్ పాలెస్' వారికి, వారివంటి, పాశ్చాత్యుల కంటికి ఆనిన వారికి, అన్ని వసతులు కలిగిన కారాగారము. సాధారణ దేశభక్తులకు సాధారణ చెరసాలలె గతి. ఆవిషయమై అణుమాత్రపు ఆందోళన చేసినట్లు కూడా మనకు పాశ్చాత్యులే, లేక వారి అనుయాయులు వ్రాసిన చరిత్ర పుస్తకములలో మనము చదువలేదు. అహింసా బోధనాప్రభావముచే అశోకుని తరువాత దేశము పరదేశీయుల పరమతస్థుల పాలుబడి పరిపరి విధముల కుక్కలు చింపిన విస్తరి అయినది.
తెలిసీ తెలియకుండా మన ఇతిహాసముల
వక్రీకరణ జరిపి అదియే నిజమని నమ్మించి చదివించిన మహానుభావుల చేయిదములు నా మనసుకు నొప్పి కలిగించుటచే ఇది వ్రాయుచున్నాను. ఎంతో మంది మహా
పండితులు దేశమున నిండియున్నారు కానీ వారు ఈ విషయముల జోలికి రారు. ఇప్పుడు
చిన్నమంటగా కనిపించేదే కొంతసేపయిన తరువాత ప్రళయభీకర జ్వాలయై సర్వస్వమునూ
దహించివేస్తుంది. అందుకే ణా ఈ చిన్ని ప్రయత్నము.
పై శ్లోక భావమును తిక్కన
గారు చక్కనైన కందపద్యములో ఈ విధముగా తెలిపినారు.
భూతముల కలుగు నతనికి
భూతములఖిలములునలుగు
భూత హితార్థీ
భూతములకభయమిచ్చిన
పూతాత్మునకభయమిచ్చు భూతావలియున్ (ఆంధ్ర మహా భారతము)
ఇక్కడ ‘అలుగు’ అన్న
మాట రెండు మార్లు ఒకే అర్థములో ఉపయోగింపబడింది. ఇక్కడ అది కోపము అన్న అర్థములో
ప్రయోగింపబడినది. భూతములు అంటే ప్రాణికోటి అని ఇక్కడ అర్థము. ఎవరయినా భూతములపై
అంటే ప్రాణులపై కోపించి వానిని హింసించి, ప్రాణము తీస్తే అవికూడా కోపించి
అట్టివాని ప్రాణమును తీయగాలవు. అందువల్ల అతడు భూతములకు మేలుచేయువానిగా నడచుకొంటే ఆ
ప్రాణులు కూడా అతని ఎన్నో విధముల సహాయమొనరించుతాయి. ఈ క్రింది శ్లోకమును గమనించండి ఎందులోనిది అన్నది నాకు తెలిసి రాలేదు.
అహింసా పరమో ధర్మః సర్వ ప్రాణ భృతాంవర l
తస్మాత్ ప్రాణభృతః సర్వాన్ హిమ్స్యాన్ మానుష క్వచిత్ll
అహింస సర్వ శ్రేష్ఠమైన ధర్మ మార్గము. అందుచే ఎప్పుడయినా ఎక్కడయినా జీవహింస చేయరాదు.
ఇదే విషయము అరణ్య
పర్వములో ధర్మ వ్యాధుని వృత్తాంతములో (ధర్మవ్యాదోపాఖ్యానములో) వస్తుంది. చండాలుడైన
ధర్మ వ్యాధుని వద్దకు బ్రాహ్మణుడు మరియు తపస్వి అయిన కౌశికుడు ధర్మ సూక్ష్మముల
నెరుగుటకు వచ్చిన సందర్భము
హింస అహింస
మహాభారతములోని అరణ్య
పర్వములో ధర్మవ్యాధుడను చండాలుడు కౌశికుడు అన్న బ్రాహ్మణునికి హింస ఆహింసల
గూర్చి ఈ విధముగా ఉపదేశించుతాడు. ఇందు ముఖ్యముగా గమనించవలసినది జ్ఞాన సముపార్జనకు
అధిక అధమ అన్న తారతమ్యములు లేవు. ఆదిశంకరులు కూడా చండాలోస్తు సతు ద్విజోస్తూ
గురురిత్యేషా మనీషా మామ' అని ఆమాటేకదా చెప్పినారు.
ధర్మవ్యాధుడు
కౌశికునితో ఈ విధముగా అంటాడు “అయ్యా!
బ్రాహ్మణులకు స్వాధ్యయనం, తపస్సు, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము పరమ ధర్మము.
క్షత్రియులకు ప్రజా రక్షణ, దండనీతి ధర్మము. శూద్రులకు సేవించుట అంటే సంఘమును సేవించుట అంటే సంఘమునకు
వలయు వసతులు సమకూర్చుట, ధర్మము. మృగ మాంసము విక్రయించుట నా ధర్మము. మిధిలా
నగరాధీశుడైన జనకుడు ఎవరి ధర్మాన్ని వారు మాత్రమే ఆచరించాలని కోరతాడు. జనకుడు
అన్నది ఒక వ్యక్తిపేరు కాదు, మిథిలను ఆయాసమయములలో పరిపాలించే రాజులకు తమ స్వంత
పేర్లున్నా ‘జనక’ అన్న పేరుతో పట్టాభిషిక్తులౌతారు.
స్వధర్మమును ఆచరించని
వాడు కొడుకైనా అతడు శిక్షార్హుడే. కనుక నేను నా ధర్మం ఆచరిస్తున్నాను. కాని నేను
జీవహింస చేయను. ఇతరులు చంపి తెచ్చిన వాటిని మాత్రమే విక్రయిస్తాను. నేను గురువులను, దేవతలను,
అతిధులను పూజిస్తాను.
సత్యమును, శౌచమును
ఆచరిస్తూ అణుకువతో ఉంటాను. బంధువులను ఆదరిస్తాను. ఏకపత్నీ వ్రతుడను. అసూయలేదు,
కోరికలు లేవు, ఇతరులలో దోషం ఎంచను. ఉపవాస
నియమాలతో ఆహారం తీసుకుంటాను. పొగడ్తలకు లొంగను, తెగడ్తలకు కుంగను. అందువలన హీనకులములో పుట్టినా నిర్మలంగా
జీవిస్తున్నాను.
మహాత్మా! నేను
చేస్తున్నది హింస కాదా అని ప్రశ్నించినారు. నా సమాధానమును విన్నారు. ఏది హింస ఏది
అహింస అని చెప్పుట సులభము కాదు. ప్రాణి పుట్టుకకు మరణానికి అతడు చేసిన కర్మలే కారణము.
చంపే వాడు కేవలం నిమిత్త మాత్రుడు. పండ్లు, వేర్లు, ఔషధాలు, శాకములు, జంతువులు ప్రాణులకు ఆహారంగా
భగవంతుడు ఏర్పరచినట్లు వేదములు చెబూతూ ఉన్నాయి. పూర్వం శిబి చక్రవర్తి తనమాంసమును
డేగ రూపంలో ఉన్న ఇంద్రునికి ఇచ్చి పుణ్యం సంపాదించ లేదా!
వేదములు
చదివిన వారు యజ్ఞయాగములు చేస్తూ పశువధ చేస్తారు కదా! పితృ
కార్యాలలో, దైవ
కార్యాలలో మాంసాహారాన్ని ఉంచి మిగిలిన దానిని భుజించడం ధర్మమని ఋషి వాక్కులు చెప్పుట లేదా? రైతులు
నాగలితో దున్నుతున్నప్పుడు ఎన్నో జీవులు నశిస్తాయి కనుక అది హింస కాదా?
మానవులు నడిచేటప్పుడు కాళ్ళ
కింద పడి అనేక జీవులు నశించడం హింస కాదా? నీరు భూమి ఆకాశం జీవులతో నిండి ఉన్నది. మనిషి చేసే ప్రతి
కర్మలో హింస అనివార్యం. ముని వృత్తిని స్వీకరించి అరణ్యాలలో జీవిస్తున్న మునులు
తాము అహింసను ఆచరిస్తున్నామని భ్రమ పడుతుంటారు. వారు భుజించే ఆకులూ, పండ్లూ, కందమూలాలలో కూడా జీవం ఉంది కదా?
కనుక ఈ లోకంలో హింస చేయని
వాడు లేడు. కనుక తెలిసీ జీవులను హింసించక పోవడమే అహింస. ధర్మం పలు విధాలు దాని
సూక్ష్మం గ్రహించడం కష్టం. కనుక వేదవిహతమైనదీ, పెద్దలు చెప్పినదీ, మునులు ఆచరించేదీ గమనించి ధర్మ నిర్ణయం చేయడం ఉత్తమం.
నిజానికి అది ఆ యుగాధర్మము.
కలియుగములో
అగ్నిహోత్రం గవాలంబం సన్యాసం పల పైతృకం |
దేవేరాచ్చ సుతొత్పత్తిః కలౌ పంచ వివర్జయేత్ ||
అగ్నిహోత్రము గోమాంసభక్షణ నిషిద్ధములని శాస్త్ర వచనము. ఇది ఈ యుగ
ధర్మము. ఏయుగములో నయినా ధర్మమునకు గ్లాని జరుగ కూడదు.
కాబట్టి వ్యాసాది మహా పురుషులు చెప్పిన సూక్తులు
అమలులో ఉంచుట మన కర్తవ్యము. మహాపురుషుల మార్గము ఎప్పటికీ ధర్మమార్గము. దానిని అనుసరించవలెను
కానీ అత్తెసరు తెలివితేటలతో శాస్త్రములను దూషించరాదు. అప్పుడే సనాతన ధర్మము సత్యదీధితితో
ప్రకాశించగలదు. కృషి, దీక్ష, పట్టుదలలే మానవ ప్రగతికి
మార్గదర్శకములు. మానవునికి సంతోషకర జీవనానికి సనాతన దర్మము ఉత్తమము.
స్వస్తి.