Thursday, 31 October 2019

సంస్కృతము-ఆర్యులు-ద్రావిడులు


సంస్కృతము-ఆర్యులు-ద్రావిడులు

'వేద ప్రసాదం' అన్న సమూహము(Group) 'ద్రావిడ' శబ్దమును గూర్చి ఈ విధముగా ఆస్య గ్రంధి లో తెలియజేసియుండినది.
ఓం.
తరచూ మనము ఆర్యులు వేరే వారు అని. ఇక్కడి వారైన ద్రవిడులపై అధికారము చెలాయిస్తున్నారని అని ఒక సిద్దాంతాన్ని పట్టుకుని ఉగిసలాడే వారి మాటలను,
మనకు కొన్ని అర్దాలు తెలియకపోతే ఇబ్బందిలో పడిపోయి మనము  చెప్పలేకపోతే అది మన చేతగానితనమే గాక మన సంస్కృతికే ఇబ్బంది అవుతుంది.
కాబట్టి అందులో ఒకటయిన ద్రవిడము అను పదానికి అర్ధం ఇక్కడ ఇస్తున్నాం.
చూడగలరు.
_/\_.
ప్రదేశాన్ని బట్టి ఈ ప్రాంతానికి "ద్రవిడం" అని పేరు వచ్చింది.
స్వభావ దృష్ట్యా ఈ భారత ఖండంలో నివసించే వారు అందరు ఆర్యులే!
ప్రత్యేకించి వీరిని(అంటే మనల్ని)మాత్రం ద్రవిడులు అని ఎందుకు అనాలి అంటే మూడు వైపులా నీరు ఉంది కాబట్టి.
ద్రవిడులు ఆర్యులు వేరు వేరు అనీ కొందరు ఆర్యులు కొందరు ద్రవిడులు గా విభజించి గొడవలు పెట్టటం కుట్రలో భాగం అందులో ఇరుక్కుని వేరుగా మాట్లాడకుండా ఉండేందుకు ఈ పోస్ట్.

_/\_

నేను వేద ప్రసాదం వారు ప్రచురించిిన అభిప్రాయముతో ఏకీభవిస్తున్నాను. 'ద్రవ ఇదం ఇది అంతా ద్రవము అంటే నీటి చేత చుట్టి యుండ బడినది అని నా అభిప్రాయము. అదే 'ద్రవిదమై' ఆతరువాత 'ద్రవిడమైనది. 'కృణ్వంతే విశ్వం ఆర్యం అన్నది శాస్త్ర వచనము. ఆర్యం అన్న మాటకు అర్థము పవిత్రమైన అని చంద్రశేఖర సరస్వతులవారు చెప్పగా విన్నాను. అంటే మన పూర్వుల దృక్పథము ఎంత ఉత్కృష్ట మైనదో మనము అర్థము చేసుకో గలుగ వచ్చును.
ద్రావిడ శబ్దాన్ని మొట్విటమొదట కాశ్మీరము వెళ్ళినపుడు అచటి పండితులు అడిగిన ప్రశ్నకు సమాధానముగా తాను ద్రావిడ దేశము నుండి వచ్చినట్లు చెప్పినారు ఆదిశంకరులవారు. తానూ మళయాళ దేశము నుండి వచ్చినట్లు చెప్పుకోనలేదు. అది ఆయన ఔన్నత్యము. ఆ తరువాత ఈ పదమును విరివిగా ఉపయోగించే వారు తమిళులు. వాళ్ళకు ఈ దక్షిణాది భాషలన్నీ తమిళమునుండి లేక మూలద్రావిడము  నుండి వచ్చినాయని వారికి ఒక గ్రుడ్డి నమ్మకము. దీనికి ఊపిరి పోసినది కిరస్తానీ మతప్రచారమునకు వచ్చి, అచట నలుపు రంగు శరీరము ఉన్నవారు ఎక్కువగుటచే వారిలో వర్ణ విచక్షణా బీజములను నూరి పోసి అందుకు తోడుగా వారి భాష సంస్కృత జన్యము కాదు,అది ఒక ప్రత్యెక భాష అని తెలుపుటకు ఈ విధమగు విశ్వప్రయత్నము చేయవలసి వచ్చినది. దీనిని ఆలంబన చేసుకొని మన తెలుగువారిలో కొందరు  తమ తమ Doctorate పట్టాలకొరకు కృషిచేసి మనల నమ్మించుటకు కృషి చేసి కొంతవరకు కృతకృత్యులైనారు. దక్షిణ హిందూదేశ భాషలన్నీ  మూల ద్రావిడ జన్యములను మాటకు  వంత పాడుతూ కొంతమంది తెలుగు భాషా శాస్త్రజ్ఞులు  ఆది ద్రావిడ జన్య భాషలనే ఒక నినాదమును లేవదీసి దానికి అనుకూలముగా ఎన్నో విషయాలను ప్రతిపాదించి అదే ఉండవచ్చును అన్న ఆలోచన మనలో కలిగించినారు. తెలుగులో మొట్టమొదటి doctorate తీసుకొన్న చిలుకూరు నారాయణ రావు గారు తెలుగు సంస్కృత జన్యమని సాధికారకముగా నిరూపించినారు. బహుశా అది చదివినవారట్లుంచి తెలిసిన వారు కూడా తక్కువ. పైగా నేటి ఆంధ్ర భాషజ్ఞులు కొందరు నారాయణరావు గారి ప్రతిపాదన పూర్వపక్షమైపోయింది ఇప్పుడు బూదరాజుగారు, భద్రిరాజు గారు చెప్పినదే వాస్తవము అని అన్నారు. ఈ మాట చెప్పినవారు ఎవరైనా, క్రీడాభిరామము అది వినుగొండ వల్లభారాయలవారే వ్రాసియుండవచ్చు, లేక శ్రీనాథులవారే వ్రాసియుండవచ్చు, వీరికన్నా గొప్పవారు మాత్రము కాదు. వీరి పాండిత్యము అసమానము. తెలుగు ఔన్నత్యమును క్రీడాభిరామములోని ఈ క్రింది పద్యము తెలుపుతుంది గమనించండి.
 జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి దల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? 
అటుపిమ్మట ఈ మాటను మహా పండిత కవియగు శ్రీకృష్ణ దేవరాయలవారు కూడా 

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను,

తెలుగు నాయకుండ తెలుగొకండ,

యెల్ల నృపులు గొలువ యెఱుగనే బాసాడి,

దేశ భాషలందు తెలుగు లెస్స

అన్నది జగద్విఖ్యాతము.

 నేను భాషా శాస్త్రవేత్తను కాను. ప్రత్యేకముగా సంస్కృతము చదువుకోలేదు. కానీ నేను విన్న కన్న కొన్ని విషయాలు మీ దృష్టి లోనికి తెస్తాను. చంద్రశేఖర యతీంద్రులు ధర్మ పరిరక్షకులే గాక మహా పండితులు. వారు చెప్పిన ఒక చిన్న ఉదాహరణను ఇక్కడ ఉటంకించుతాను. ఒక పండిత సమూహము వేద భాష్యము వ్రాయ సంకల్పించి ఒకచోట కూర్చిని వుంటే ఆంజనేయ స్వామి ఒక చిన్న మర్కట రూపములో చెట్టుపై కూర్చొని వేరొక మర్కటమును 'వారేమి చేస్తున్నారుఅని అడిగినారట. అందుకు ఆ మర్కటము వారు వేద భాష్యము వ్రాయబోవు చున్నారని తెలిపిందట. 'వారికి నవ వ్యాకరణములుతెలుసునా అని అడిగినాడట. అది 'శకున శాస్త్రముతెలిసిన ఆ పండిత సమూహము లోని ఒక పండితుడు విన్నాడు. ఆయన తన అనుయాయులతో చెప్పి ఆ పని నుండి విరమింపచేసినాడట. 'శకున శాస్త్రముఅంటే 'జంతు భాష.'

శకునము అంటే పక్షి అని అర్థము. విస్తృతముగా 'శకున శాస్త్రముఅన్న ఈ మాటను 'జంతు భాషకు వాడినారు. సంస్కృతము లో తొమ్మిది వ్యాకరణములు ఉన్నవి. వేద సంస్కృత వ్యాకరణమునకు వాల్మీకి వ్యాస కాళీదాసాది మహాకవులు వాడిన సంస్కృత వ్యాకరణమునకు వ్యత్యాసమున్నదని పెద్దలు చెబితే విన్నాను.కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేదేమంటే సంస్కృతము లోనే తొమ్మిది వ్యాకరణాలున్నయని. అంటే మన భాషలన్నీ వీనిలోని ఏదో ఒక వ్యాకరణ జన్యమే.

ఇక తమిళము ను గూర్చి రెండు మాటలు చెప్పుకొందాము. (Southworth suggests that the name comes from tam-mi > tam-i 'self-speak', or 'one's own speech'.)(The Tamil Lexicon of University of Madras defines the word 'Tamil' as 'sweetness'. S.V Subramanian suggests the meaning 'sweet sound' from 'tam'- sweet and 'il'- 'sound'.) ఒకరు (సౌత్ వర్త్) 'సెల్ఫ్ స్పీక్అని ఒకరు 'స్వీట్ సౌండ్అని విశధ పరచినారు. ఇది మూల తమిళము నకు ఆయా పండితులు తెలియబరచిన అర్థము. ఆ పదమునకు ఈ అర్థాలెట్లు అతుకుతాయో! Classified as being part of a Tamil language family, which alongside Tamil proper, also includes the languages of about 35 ethno-linguistic groups such as the Irula and Yerukula languages (see SIL Ethnologue)}.
అసలు శివుడు, స్కందుడు అగస్త్యునికి అందజేసిన భాషగా కూడా దీనిని చెప్పుకొంటారు.  'తోల్కాప్యం'తమ మొదటి గ్రంధముగా చెప్పుకొంటారు. తోల్ అంటే తొలి అని. కాప్యం అంటే కావ్యమని. మరి తొలి కావ్యమకుటమునకే అంటే తొలి పదము లోనే 'కావ్య'మన్న సంస్కృత శబ్దమును వాడితే మరి తొమ్మిది వ్యాకరణముల లోని వ్యాకరణమును ఆధారము చేసుకొనియుండదా. పై పెచ్చు దీనిని రచించిన వారు వింధ్యను దాటి వచ్చిన అగస్త్యులవారు అని వారే చెప్పుకొంటారు.ఆయన రామునికి శస్త్రాస్త్రముల నిచ్చి రావణ వధకు తోడుపడినాడు కానీ రావణునికి సాయం చేయలేదు కదా. అంటే ఆయన ద్రవిడుడుకాడు అని చెప్పుటకు ఈ మాట చెప్పుచున్నాను. చంద్రశేఖర యతీంద్రులే తమిళ వ్యాకరణము ఆ తొమ్మిది లో మొదటిది అని తెలియబరచినారు.

మొన్న వచ్చిన అన్నియన్(అపరిచితుడు) యందిరన్(రోబో) సినిమాలకు వాడిన పేర్లు సంస్కృత నామములే యని వారి తెలిసి ఉండక పోవచ్చు. అన్నియన్"అన్యశబ్ద జన్యముయందిరన్ అంటే యాంత్రికుడు(రోబో) అని. వాళ్ళకు అక్షరాలు తక్కువ కావున వున్న అక్షరాలతో పర భాషా పదాలను విరిచి వారివిగా చేసుకొని విరివిగా తమవే అనుకొని వాడతారు.

ఏది ఎట్లైనా సంస్కృతము లేనిదే ఏ భాష లేదు. అది గ్రీకు లాటినే కానీ కాక. ఈ విషయం 'India In Greece' (By Pococke) చదివితే అర్థమౌతుంది. పై పెచ్చు ఆర్యులు ఎరుపు ద్రవిడులు నలుపు అన్న భావమును కొందరు మహానుభావులు బహిర్గతము చేసినారు. బహుశా వారు రాముడు కృష్ణుడు నలుపేనని మరచి వుంటారు. వేద వ్యాసుని వర్ణించుతూ 'ప్రాంశు పయోదనీల తను భాసితఅని ఆయన నల్లని వాడే అని చెప్పినారు. ద్రౌపది పేరు 'కృష్ణ'. అంటే ఆమె నలుపే. నారాయణుడు నలుపు. మరి ఆర్యులెవరు ద్రావిడులెవారు.
ఏతావాతా నేను చెప్పవచ్చిందేమిటంటే మనము భారతీయులము మనమంతా ఆర్యులము.
హిమాలయము నుండి వింధ్య వరకు ఆర్యావర్తము అని అన్నారు. అది నిజము. వింధ్య హిందూమహా సముద్రపు లోతుల వరకు విస్తరించియున్నది. అంటే ఆసేతు సీతానగ పర్యంతమూ ఆర్యావర్తమే! అదియునుగాక ఈ దేశపు ఆద్యన్తములలోని ప్రతి మానవుని (ఆడ మగ తేడా లేకుండా) DNA ఒకటే నని శాస్త్ర నిరూపణ జరిగినది. కావున అందరమూ ఆర్యులమే! 
స్వస్తి.

Thursday, 24 October 2019

వేదము-గణితము (ఇది ప్రవేశిక మాత్రమే!)


వేదము-గణితము(ఇది ప్రవేశిక మాత్రమే!)
నిజముగా అలెగ్జాండరో ఆయనకు ముందు, తరువాతి తరమువారో మహామ్మదీయులో, ఐరోపావాసులో కేవలము మన ధన మణి వధూగణములనే కాక మన శాస్త్ర గ్రంధములను, వేద శాస్త్ర పండితులను అసంఖ్యాకముగా తమ దేశములకు తరలించుకొని పోయినారు. శాస్త్ర నిధులు చేయి దాటుటచేత నైతేనేమి, శాస్త్రజ్ఞులు అందుబాటులో లేకపోవుట చేత నైతేనేమి, దుష్టపాలనా సర్ప దష్టులమగుట చేత నైతేనేమి  వికసించిన పుష్పవనమై విరితావుల వేదజల్లుచున్న మన బౌద్ధిక, పుస్తక శాస్త్ర సంపద మనము వాడ వీలుకాక వాడిపోయినది.  మనలను ఐరోపా కాలమేఘములు ఆవరించి మన విజ్ఞానమనే నీటిని ఆవిరి చేయుట జరిగింది. ఆ మేఘములు దూర ప్రాంతాలకు పయుఅనించి అక్కడ వర్షించి ఆ భూములను శాస్త్రపరముగా సుభిక్షము చేసినవి.  ఈ రోజు మన పరిస్థితి ఏమిటంటే ‘విస్సన్న చెప్పినది వేదము జేమ్స్ చెప్పినది చరిత్ర’. నేడు మన మనస్థితి ఏమిటంటే కన్ను పోడుచుకొన్నా కానరాని కటిక చీకటిలో కళ్ళులేని కబోదులమై ఎవరో చెప్పుచున్నది శిరౌదార్యమని నమ్మి వారిచ్చిన ఊతకర్ర పట్టుకొని ‘శిగ్గు, ఎగ్గు’ అన్న ఆలోచనకే తావివ్వకుండా నడుస్తున్నాము.
నా వంటి అల్ప జ్ఞానికి వస్తు పుస్తక వనరులూ తక్కువే! వసతీ తక్కువే! వర్ధిల్లు వయసూ తక్కువే! అయినా ఉడుతా భక్తిగా నేను చేసే ప్రయత్నమును ఎంతమందికి హర్షదాయకమో, ఎంతమందిని భారతీయ శాస్త్రాధ్యాయులను చేస్తూ వున్నది అన్నది నా ఊహకందని విషయము.
ఇక గణితమును గూర్చి తెలుసుకొందాము, నాకు తెలిసిన మేరకు తెలుప ప్రయత్నించుతాను.
యథా శిఖా మయూరాణాం నాగానాం మణయో యథాl
తద్వాద్వేదాంగా శాస్త్రాణాం గణితం మూర్ధనిస్థితమ్ll  లగధ మహర్షి
నెమలికి తురాయి అందము. ఎక్కడలేని హుందాతనమును దానికి తెచ్చి పెడుతుంది. అదేవిధముగా జాతి నాగులు పడగపై మణిని కలిగిఉంటాయని పరిశోధకులు ధృవపరచిన వాస్తవము. ఆ ప్రాణులకు అవిఎంత మూర్ధన్యములో  శాస్త్రములకన్నింటికీ గణితము అంత ముఖ్యమైనదని లగధ మహర్షి చెప్పినాడు. ఇదమిద్ధముగా ఈయన కాలము నిర్ణయింపబడకపోయినా క్రీ.పూ. 1400 నుండి 200 వరకు శాస్త్రకారులు ఎవరికీ తోచిన తేదీ వారు చెబుతున్నారు. కానీ ప్రపంచములోని వేరెవ్వరూ చెప్పక ముందే గణితము యొక్క ప్రాశస్త్యమును ఆయన చెప్పగలిగినాడు. అదీ మనకు కావలసినది.
సముద్ర వర్తకము మనతో 7వ శాతాబ్దములోనే అరబ్బులు చేయుచుండెడివారు. మనవారి జ్యోతిష గణిత నైపుణ్యమునకు అచ్చెరువంది వారు 7,8 శతాబ్దములలోనే మన గణిత శాస్త్ర సంపత్తిని మహా పండితుల రూపములోనూ, తాళపత్ర గ్రంధముల రూపములోనూ, పండితులతో సంభాషించుటచేత గ్రహించిన విజ్ఞానముతోనూ తమ దేశామునక్లు పోయి తమ భాషలో గ్రంధములను తయారు చేసుకొన్నారు. నాడు ప్రపంచ ప్రసిద్దమయిన మన భారత విశ్వవిద్యాలయాలలో చదువుటకు వచ్చినవారే కాకుండా, వాణిజ్యము చేయ వచ్చిన వారు, చివరకు మన దేశారాజుల అంతర్గత వైషమ్యముల వల్ల, మనపైకి దండెత్తివచ్చిన విదేశస్థులు మన విద్వాంసులను తమవెంట ముఖ్యముగా అరేబియా దేశమునకు తీసుకుపోయి వారినుండి సంస్కృతము నేర్చుకొని, వారికి అరబ్బీ నేర్పించి తమ భాషలోనికి మన విజ్ఞానమును తర్జుమా చేసుకొన్నారు. ఆవిధముగా జరిగిన ఒక వాస్తవమే ఉజ్జయినిలోని కంకుభట్టు అన్న మహాగణిత పండితుని తమవెంట బాగ్దాదుకు గొంపోయి ఆయన వద్ద ‘అల్-జఫర్’ అన్న వారి దేశస్థుడగు పండితుని ఉంచి మొదటిగా మన గణిత శాస్త్రమును తర్జుమా చేసుకొనుట జరిగినది. ఆ గ్రంథమునకు ఆ పండితుడు ‘అల్-జఫర్’ అన్న తనపేరునే పెట్టుకొన్నాడు.  ఈ విధముగా 9,10 శాతాబ్దములకల్లా మన గణిత శాస్త్రము అరేబియా చేరినది. 11, 12 శతాబ్దములకల్లా  మధ్యధరా సముద్రము (Mediterranean Sea) దాటి అది స్పెయిన్ చేరి 17, 18 శతాబ్దములలో యూరోపు లోని మిగతా దేశములకు అందునా ముఖ్యముగా బ్రిటనుకు చేరింది. వారి నోట ‘అల్-జఫర్’ పడి ‘Alzibra’ అయిపోయింది. అంతకు తప్ప ఆ ఆంగ్ల పదమునకు వేటువంటి వ్యుత్పత్తియు లేదు. వారు మన అంకెలను నేటికీ ‘హింద్సా’ అనే పిలుస్తారు. మన దేశమును ఆక్రమించిన బ్రిటీషువారు Old Wine in New Bottle’ లో మనకిచ్చినారు. అంతా వారే కనిపెట్టినట్లు మనలను నమ్మించి నేర్పించి వారి నామ జపము చేయించినారు. అసలు ఒక ముఖ్య విషయము గమనించండి. వారు మన గణిత సాంకేతిక  పదజాలమును తమ భాషలోనికి మార్చుకొని ఆ సూత్రములన్నింటికీ తమ పేరుతో మన నెత్తిన రుద్దినారు. 1830 కి బ్రిటీష్ వారు మన గణితము మనకు నేర్పి అంతా తమ దయాభిక్షయే అన్నారు.
వారి నుండి అవి గ్రహించి ‘ఆహా పాశ్చాత్యులు ఎంత తెలివైనవారు, ఎంత గొప్పవారు అని తలచుతూ అన్నీ వారిపేరుమీదే నేర్చుకొన్నాము కానీ, ఏ రోజయినా ఇంత తెలివి వాళ్లకు ఏ 16 లేక 17 శతాబ్దములో మాత్రమే ఎట్లు వచ్చింది, ఎందుకు వచ్చింది అని ఆలోచించినామా. ‘ఎద్దు ఈనింది అంటే గాట కట్టెయ్యమనటమే’. మరి మన విజ్ఞానమును వారు గ్రహించి దానికి తమ పేర్లు పెట్టుకోన్నారుకదా!
అదే వరాహ మిహిరుడు తన బృహత్సంహితలో మ్లేచ్చ యవనుల మీద ఎంత గౌరవమును చూపించినారో చూడండి. ముఖ్యముగా అరేబియా ఆచుట్టు ప్రాంతముల వారిని మ్లేచ్చులని, గ్రీకు పౌరులను యవనులని పూర్వము అంటూ వుండేవారు. వారికి జ్యోతిషము పైన మాత్రమే, గణితము కాదు, చెప్పదగిన విజ్ఞానమును ఆర్జించినారు అని తెలియబరచుతూ వారు ఋషి తుల్యులు అని చెప్పి, వారే ఋషి తుల్యులు కదా మరి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, ఇక్కడ చదివి మహోన్నతమైన మ జ్యోతిశ్శాస్త్ర పండితులను ఇంకెంత గౌరవించాలి అని అన్నారు. అది మన సంస్కారము. అంతా మననుండి గ్రహించి వారి పేర్లు పెట్టుకొని మన నెత్తిన రుద్దుట వారి సంస్కారము.
మ్లేచ్ఛాహి యవనాస్తేషు సమ్యక్ శాస్త్రమిదం స్థితంl
ఋషి వత్తే s పి పూజ్యంతే కింపునర్దైవ విద్విజఃll (వరాహమిహిర బృ.సం. 5-32)
అసలు ఈ బృహత్ సంహితకు వ్యాఖ్యానము వ్రాసిన భటోత్పలుడు లేక భట్టోత్పలుడు పాశ్చాత్య వంచకుల ప్రవర్తన ముందే తెలుసునా అన్నట్లు అసలు అప్పటికి కూడా ఆ జ్ఞానము మననుండి వారికెట్లు సంక్రమించినది అన్న విషయమును కూడా వ్రాసినాడు.
తన వ్యాఖ్యానములో ఆయన వ్రాసిన ఈ శ్లోకాలను గమనించండి.
యద్దానవేంద్రాయ మయాయ సూర్యఃl
శాస్త్రం దదౌ సంప్రనతాయ పూర్వంll
విష్ణోర్వశిష్టశ్చ మహర్షి ముఖ్యోl
జ్ఞానామృతం యత్పరమా ససాదll
పరాశారాశ్చాప్యాదిగమ్య సోమాత్ గుహ్యం సురాణెం పరమాద్భుతం యత్l
ప్రకాశయాం చక్రురనుక్రమేణ మహార్ధిమంతో యవనేషు దత్తేll
మొదటి శ్లోకములో అసురుడగు మయుడు ఈ శాస్త్రమును సూర్యుని నుండి పొందినాడు. ఇక్కడ
అసురులు రాక్షసులు కారు. మానవుల వలెనె ఉన్నా పొడవు వెడల్పు ఎక్కువగా ఉండేవారేమో! సూర్యుడు అంటే భానుమండలాధిపతి యగు సూర్యుని ఉపాసించి ఆయన నుండి ఈ విద్యనూ పొందినాడా, లేక ఆ పేరు కల్గిన పండితుని వద్దనుండి గ్రహించినాడా అన్నది ఒక సందేహము. అట్లయినా, ఇట్లయినా, ఎట్లయినా ఈ ఆదాన ప్రదానము మనదేశములోనే జరిగినది. వేరెవ్వరి వద్దనుండీనో  మనము గ్రహించనూ లేదు తస్కరించనూ లేదు.
ఇక మయుడెవరు అన్నది తెలుపవలసి ఉన్నది. గ్రంధ పఠనముచే నేను గ్రహించినది ఏమిటంటే ‘మయ’ అన్నది ఒక సమూహమునకు సంబందించిన శబ్దము. ఎందుకంటే MAXICO అన్నది అసలు మయుల వాసస్తలమని చెప్పుకొన వచ్చును. ఎందుకంటే మయుడు ధర్మరాజుకు నిర్మించి ఇచ్చిన మయసభవంటి విచిత్ర వినూత్న కట్టడములు విమానావతరణ మైదానములు (Air Bases ) మున్నగు అద్భుతమైన కట్టడములను అక్కడ చూడవచ్చు. అంతే కాక వారి పేరుతో Mayan Calendar కూడా ఉండేది. వారు పూర్తిగా ఆ ప్రదేశము నుండి ఎట్లు మాయమై పోయినారో ఇప్పటికీ చరిత్రకు అంతుబట్టని అంశము.
ఇక రెండవ శ్లోకము ఏమి చెబుతూ ఉన్నదంటే  ఈ గ్రహ చలన శాస్త్రమును వశిష్ఠుడు శ్రీమహావిష్ణువు నుండి పొందినాడు. ఆయన మన పంచాంగములోని అధికమాస గణనమును మనకందించిన మహనీయుడు.
అసలు అధికమాసము అన్నది ఏమిటి ఎందుకు అన్న సందేహము ఎందరిలోనో ఉంటుంది. ఎక్కడో ఎవరికో తప్ప పాశ్చాత్య విద్యావిధానముపై ఆధారపడిన మన యువతకు తెలిసే అవకాశము తక్కువ. అందువల్ల ఆవిషయమును ఇక్కడ క్లుప్తముగా వివరించుచున్నాను. మన కాలగణన యందు చంద్ర మానము సౌరమానము అన్న రెండువిధములుగా లెక్కించుతారు. మన పొరుగు రాష్ట్రమయిన తమిళనాడులో సౌరమానము పాటించితే మనము చాంద్రమానము పాటించుతాము. చాంద్రమానము అంటే చంద్రుడు భూమిచుట్టూ తిరుగుటను పరిగణనలోనికి తీసుకొని కాలము నిర్ణయించే పద్ధతి. ఈ విధానములో భూమిని ఊహా కేంద్రముగా భావించి సూర్యుడు దాని చుట్టూ తిరుగుచున్నట్లు భావించి లెక్కలు కడతాము. అదే సౌరమానములో యదార్థముగానే సూర్యుని చుట్టూ జరుగు భూభ్రమణమును పరిగణన లోనికి తీసుకొని లెక్కలు కడతాము. సౌర మానములో సూర్యుని చుట్టూ భూమి 60 మార్లు తిరుగు సమయానికి అంటే 60 నెలలు గడిచే సమయానికి చంద్రుడు భూమిచుట్టూ 62 మార్లు తిరుగుతాడు. ఆ ఎక్కువగా వచ్చిన రెండు నేలలను ఇంచు మించు చాంద్రమానము ప్రకారము 2 1\2 సంవత్సరము గడిచిన పిదప ఫలానా సంవత్సరము, ఫలానా పక్షము, ఫలానా మాసము ఫలానా తిథి నుండి ఇంచుమించు 30 రోజుల కాలమును కలుపుట జరిగినది. ఈ విధముగా 5 సౌర సంవత్సరములు గడిచేసరికల్లా రెండు కాలమానాలూ ఒకటౌతాయి. ఈ క్రియకు ఆద్యుడు వశిష్టుడు. ఆయన ఈ విద్యను శ్రీ మహావిష్ణువు నుండి గ్రహించినాడని ముందే చెప్పుకొన్నాము. ఇక చివరి శ్లోకము యొక్క భావమును గమనించుదాము. అత్యంత రహస్య మైనదీ, పరమాద్భుతమైనదీ యగు ఈ జ్యోతిష శాస్త్రమును సోముడు అన్న మహర్షినుండి పరాశర మహర్షి గ్రహించినాడు. అంత మహత్తు కల్గిన ఈ జ్యోతిశ్చక్ర శాస్త్రాన్ని బుద్ధిమంతులు ఋషి తుల్యులు అగు యవనులు అంటే గ్రీకులు గ్రహించినారు. వాస్తవాన్ని ఇంత నిక్కచ్చిగా చెప్పిన తరువాత కూడా మనము పాశ్చాత్యులమాటే నమ్ముతాము. అది ఈ దేశపు తలరాత.
           ఇపుడు అసలు గ్రీసుకు మన సంస్కృతి ఎట్లు పోయినది అన్న విషయము ప్రసిద్ధ చరిత్రకారుడగు పోకాక్ వ్రాసిన ‘India in Greece’ అన్న ఆంగ్ల పోత్తమును చదివిన తెలియవస్తుంది. మనము నూలు బట్టలు కట్టుకొనే కాలానికి వారిది తోళ్ళు కట్టుకొంటూ వుండిన దేశము. ఇంతా వారు తెలుసుకొన్నది జ్యోతిషమును గూర్చి మాత్రమే. వివిధ వేద గణిత విధానములు వారికి తెలియవు. అవి అరబ్బుల ద్వారాపోయినవే!
ఇపుడు కొందరు మన దేశమునకు చెందిన అత్యంత ప్రతిభావంతులయిన గణిత శాస్త్రజ్ఞుల పేర్లను తెలుసుకొందాము.
మన శాస్త్రజ్ఞుడు            సిద్ధాంతము                కాలము        పాశ్చాత్య శాస్త్రవేత్త-కాలము
బోధాయన సిద్ధాంతము (శుల్బ సూత్రములు)       800 క్రీ.పూ.      పైథాగరస్ థీరం 500 క్రీ.పూ.
గోవింద స్వామి(సందమ్శ న్యాయము)     300 క్రీ.పూ.  న్యూటన్,గాస్(Interpolation) 1670 A.D, ఆర్య భట   (సూర్య సిద్ధాంతము, త్రికోణమితి)  2765 క్రీ.పూ.  కోపర్నికస్ 1500 A.D.
      వటేశ్వర (సందమ్శ* న్యాయము, *పట్టుకారు)       న్యూటన్,గాస్(Interpolation) 1670 A.D,
      మాధవాచార్య (త్రికోణమితి)        1200 క్రీ.శ         టైలర్    1500 A.D.
      ఇంతింత ముందు అంటే ఎన్నో శతాబ్దముల ముందు కనిపెట్టి కూడా ఒక్క సిద్ధాంతమైనా మన శాస్త్రజ్నులపెరుతో లేదు. స్వతంత్రము 72 సంవత్సరముల క్రితము వచ్చికూడా పైన తెలిపిన మన మహనీయుల గూర్చి మనము తెలుసుకొనిందిలేదు. నిజానికి తెలుసుకోవాలని లేదు. శిగ్గుపడవలసిన విషయము. కానీ అదేమిటో మనకు తెలియదు. అదే మన అదృష్టము.
      మహానీయులగు శృంగేరి మఠాధిపతులగు జగద్గురువు కళ్యానానంద భారతీ స్వాములవారు (1929) వారు 'పూర్ణ మీమాంస దర్శనం' అన్న గ్రంధములో అద్వైతమును గణిత శాస్త్రముతో అనుసంధించి నిరూపించినారు. ఇందు అనేక అతిముఖ్య విషయములు ఉన్నాయి కానీ జిజ్ఞాసువుకు విస్తార గణిత శాస్త్రజ్ఞత లేనిదే ఆకళింపు చేసుకోలేడు. అందుచేత ఆ మహనీయుడు నిరూపించిన ఒక విషయమును మీ ముందుంచుతాను. శ్రీ గురజాడ సూర్యనారాయణ మూర్తి గారు వ్రాసిన 'The Two Facets of Geometry' లో ఈ విషయమును జిజ్ఞాసువులు వివరముగా పరిశీలించవచ్చు.
     AN ARC OF UNIT CIRCLE IS EQUAL TO THE UNIT CIRCLE’.
This truth enables us to see the validity of the Vedic statement about Purnam. A 'Unit Circle’ is indeed Purnam.
ఈశావాస్యోపనిషత్తు నందలి శ్లోకము యొక్క అర్థమును గణితము ద్వారా నిరూపించి అద్వైతమునకు గనితమునకు అంతటి అవినాభావ సంబంధము కలదని నిరూపించుట జరిగినది.
ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతేl
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతేll
కడుపులో కలిగిన బాధను వెలిబుచ్చే అవకాశాముగా ఈ విషయమును తీసుకొని గణిత విద్యాతురత కలిగిన యువకులకు సవినయముగా తెలుపుచున్నాను. మీ అంటే మన పూర్వులు అద్వితీయులు అజేయులు, అప్రమేయులు, అఖండులు, అనితరసాధ్య కార్యాచరణ దురంధరులు. వారిని, వారి రచనల గూర్చి పరిశోధించండి. మహానీయులగు కళ్యాణానంద భారతీ స్వాములవారు, భారతీ కృష్ణ తీర్థ స్వాములవారు వంటి వారిని గూర్చి వారి వేద వైదుష్యమును గూర్చి, వేద–శాస్త్ర సమన్వయ విధానముల గూర్చి పరిశోధించి తెలుసుకోండి. సంపాదన ఒక్కటే సర్వస్వము కాదు. ఈ వాస్తవమును ఎంత తొందరగా గ్రహించితే అంత మంచిది.
అదేవిధముగా నేడు విశ్వ విఖ్యాతి గాంచిన పూరీ పీఠమునకు చెందిన నాటి జగద్గురు భారతీ కృష్ణ తీర్థ స్వాముల వారు ‘Vedic Mathematics’ అన్న మహోన్నత గ్రంధమును రచించి మన వేదమునకు, సంస్కృతికి, సంస్కృతమునకు, దేశమునకు, మన విజ్ఞానమునకు విశ్వ వ్యాప్తముగా ఎనలేని ఖ్యాతి తెచ్చినారు. మన దురదృష్టముకొద్దీ వారువ్రాసిన ‘వేద గణిత రెండవ భాగము’ పరశురామ ప్రీతీ యగుటచే ఆ విజ్ఞానమును గ్రహించలేక పోయినాము. ఒక్క మాటలో వారి గొప్పదనము చెప్పవలసి వస్తే వారు తమ 16 సంవత్సరాల వయసులో,  7 M.A. లను, ఆ కాలములో ఆ వెసలుబాటు వుండినది కాబట్టి, ఒకేసారి వ్రాసి ఏడింటిలోనూ University First గా నిలచినారట. ఏరోజయినా మన పాఠ్య పుస్తకములలో ఇటువంటి వారిని గూర్చి చదివినామా! నిద్దర లేచినప్పటినుండి ఏ డేరా బాబా ను గురించో, అసారాం ను గురించో, నిత్యానందను గురించో, ఇటువంటి వారెందరినో గురించి చదువుతాము కానీ ఇటువంటి కారణ జన్ముల గూర్చి చదువము. ఇటువంటి వారు క్రైస్తవములోనూ, ఇస్లాములోనూ కూడా వున్నారు, కానీ వారిని పట్టించుకోము. మనకెంతసేపూ, మనలోని మోసగాళ్ళను దుష్టులను, దుర్మార్గులను ఏరి ఏరి వారిగూర్చిన కథలు చిలువలు పలువలుగా ప్రచారము చేసి, అడుగడుగునా, అణువణువునా  మనమెంత పనికిమాలిన వారమో అన్న విషయమును తెలుసుకొనుటలోనే కాదు కాదు తెలుపుటలోనే ఆనందమును పొందుతాము.
బ్రహ్మ గుప్త, శ్రీశేణ, విష్ణుచంద్ర, లల్లాచార్య, పరాశర, శ్రీపతి, అనంత, ఢుండి రాజ, వరుణ, మహేశ్వర, వావిలాల కొచ్చన్న, నార్మద, పద్మనాభ, రఘునాథ, రామ భట, దామోదర, గంగాధర, మకరంద, కేశవ, గణేశ దైవజ్ఞ, సూర్య, జైసింగ్, మహావీరాచార్య, పావులూరి మల్లన, ఇంకా ఇంకా ఎంతెంత మందో, ప్రముఖులైన మనగణిత శాస్త్రజ్ఞులు. వీరిలో అందరికీ తెలిసి ఉంటుందన్న నమ్మకముతో ఆర్యభట, వరాహ మిహిర, భాస్కర మొదలగు అత్యంత ప్రఖ్యాతుల పేర్లు ఉటంకించలేదు.
ఇప్పటికయినా మనసు మరలించి మంచిని గ్రహించండి. పాశిన కూటికి ప్రాకులాడకుండా పదికాలాలు నిలిచే పంటలను పండిద్దాం.
ఒక్క మాట చెప్పి ఈ వ్యాసమును ఇక్కడ ముగిస్తాను. మన పొరుగు వారయిన పాకిస్తాను,మనకన్నా ఎంతో చిన్న దేశము, చైనా, మనకన్నా ఈ రోజు అన్నిటా మిన్న, రెండూ శత్రు దేశాలే! నిద్దురలేచినప్పటి నుండి పాకిస్తాను పై మన ఆధిక్యతను గూర్చి గుండెలు బాదుకొని చెబుతూ ఉంటాము గానీ  చైనా కన్నా మనము మిన్న అన్న విషయములో ఎన్నడయినా, నోరేత్తుతామా! దేశమును గౌరవించితే, దేశ ప్రగతి అన్న యజ్ఞమునకు మనమూ ఒక సమిధ చేర్చితే దేశముతో బాటూ మనమూ బాగుపడతాము.
స్వస్తి.