కాళిదాసు చెప్పిన
చమత్కార శ్లోకము
https://cherukurammohan.blogspot.com/2019/06/blog-post_27.html
కాళీదాసు భోజరాజుల మైత్రీ బంధము అజరామరము. భోజునితో ఉన్నది కాళీదాసు-2.
కాళీదాసు భోజరాజుల మైత్రీ బంధము అజరామరము. భోజునితో ఉన్నది కాళీదాసు-2.
మొదటి కాళీదాసు విక్రమార్కుని కాలము వాడు మరియు రఘువంశాది కావ్యములను,
అభిజ్ఞాన శాకుంతలము వంటి నాటకములను వ్రాసిన మహాకవి. కాళీదాసు-2 విద్వద్వరేణ్యుడేగానీ, ఆయన కావ్యములు వ్రాసినట్లు తెలిసిరాదు,
కానీ భోజుడు వ్రాసిన ‘రామాయణ చంపు’ అన్న భోజుని ఆశు కావ్యమునకు సహకారమునందించినాడు అన్న ప్రతీతి కలదు. భోజ కాళీ దాసుల నడుమ ఎన్నో విచిత్ర
సంవాదములను సన్నివేశములను చూస్తూ ఉంటాము. అటువంటి వానిలో ఇదీ ఒకటి.
ఒకసారి భోజ రాజు ఒక విచిత్రమైన సమస్య సభికులకు ఇవ్వటము జరిగినది.
సముద్రానికి అనేక పర్యాయపదాలలోని 6 పదములను ఒక శ్లోకపాదముగా తీసుకొని పూరించమన్నాడు. ‘అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి:’ అన్నదే ఆ శ్లోక పాదము.
ఎవరూ పూర్తి చేయలేక పోయినారు సభలో. కాళిదాసు ఒక చక్కటి సన్నివేశమును ఊహించినాడు.
ఆ ఊహించిన సన్నివేశము ఇది.
పార్వతికి కోపము వచ్చింది ఎందుకు? ఎందుకు వచ్చిందంటే తనభర్త తనకో సవితి ని తీసుకొని రావడమే గాక ఆమెని నెత్తి
మీద పెట్టుకొని కూర్చున్నాడు. తన బాధను శూరుడు దేవ సేనాని మరియు తన కుమారుడైన
షణ్ముఖుడికి తన కష్టం చెప్పుకుంది. కుమారుడు
పరమశివుడి దగ్గరకు వెళ్లి ‘నాన్నా నీవు అమ్మకు సవితిని తెచ్చుటయేగాక ఆమెను నెత్తిన పెట్టుకోన్నావని అమ్మకు
ఎంతో కోపము అంతకు మించిన తాపము కలుగుచున్నది. నువ్వు నెత్తిన పెట్టుకున్న గంగమ్మను
విడిచి పెట్టు.’ అన్నాడు. అప్పుడు పరమశివుడు ‘కుమారా! చిరకాలంగా నాదగ్గరే ఉంటున్న గంగను
ఇప్పుడు నేను వదిలేస్తే పాపం ఎక్కడికి పోతుంది’ అన్నాడు మహదేవుడు.
తన తల్లి యొక్క సవితిని తండ్రి వెనకేసుకొని రావడం షణ్ముఖుడికి బొత్తిగా నచ్చలేదు. అందువల్ల కోపముతో ఊగిపోతూ వెళ్లి సముద్రములో
దూకమును’ (నదీనాం సాగరో గతి:) తన ఆరు ముఖాలతో ఒక్కొక్కసారి ఒక్కొక్క సముద్ర పర్యాయ
పదమును వాడుతూ 6 చెప్పినాడు. అదే ‘అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి:’ అంటూ భోజరాజు సభలో ఇచ్చిన సమస్య.
దానిని కాళీదాసు ఎంత చమత్కారంగా
పూరించినాడో చూడండి.
అంబా కుప్యతి తాత మూర్ద్ని విలసత్ గంగేయముత్సృజ్యతాం !
విద్వన్ షణ్ముఖ! కా గతి:మయి చిరాత్ అస్యా: స్థితాయా:వద?
కోపావేశవశాతశేష వదనై:ప్రత్యుత్తరం దత్తవాన్
అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి:
నీవు నెత్తిన గంగను పెట్టుకున్నావని అమ్మకు కోపం వచ్చింది.ఈ గంగను విడిచి
పెట్టు సర్వం తెలిసిన షణ్ముఖుడా! .పాపం చిరకాలం గానన్ను నమ్ముకొని నా దగ్గరే
వుంటున్నది యిప్పుడు పొమ్మంటే ఎక్కడికి
పోతుంది? అన్నాడు శివుడు.అప్పుడు షణ్ముఖుడు కోపంతో తన ఆరుముఖాలతో సముద్రం లోకి
పొమ్మను.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం అని
సముద్రానికి పర్యాయపదాలు ఆరు చెప్పాడు. ఆ అద్భుత మైన ఊహకు, పూరణకు భోజరాజు ఉబ్బి తబ్బిబ్బై సింహాసనం దిగి వచ్చి కాళిదాసును కౌగలించుకొని,
ఉచిత రీతిని సత్కరించినాడు.
ఆ శ్లోకార్థము దిగువన ఇవ్వబడినది.
అంబా కుప్యతి =అమ్మకోపిస్తున్నది,
మూర్ద్ని విలసత్ గంగా ఇయం ఉత్సృజ్యతాం ! = నీ శిరసు మీద వున్న గంగ
పరిత్యజింప బడుగాక!
ఇది షణ్ముఖుడు చేప్పిన మాట. ఆ మాటకు బదులుగా శివుడు ఈ విధముగా అంటూవున్నాడు.
విద్వన్ షణ్ముఖ =సర్వము తెలిసిన
షణ్ముఖుడా!
మయి చిరాత్ స్థితాయా: -అస్యా: - కా
గతి: -వద =నాతోనే చిరకాలంగా వుంటున్న ఈమె గతి ఏమిటి? ఎక్కడికి పోతుంది? చెప్పు అన్నాడు.
ఆమాట విని స్కందుడు అగ్గిమీద గుగ్గిలమైపోయినాడు. అప్పుడు
కోప- ఆవేశవశాత్ - అశేష వదనై: -ప్రత్యుత్తరం దత్తవాన్ = కోపావేశాలతో కూడిన 6
ముఖములు కలవాడగు సుబ్రహ్మణ్యుడు తన ఆరుముఖాలతో ‘సముద్రము లోకి పోయి దూకమను’.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం
సముద్రం సముద్రం సముద్రం అని 6 పర్యాయపదములనువాడుతూ ఉచ్చస్వరముతో అన్నాడు.
మహామహితాత్ముల బుద్ధిగున విశేషాలు ఈవిధముగా వుంటాయి. అంతా వాగ్దేవి కరుణ.
స్వస్తి.