Thursday, 27 June 2019

కాళిదాసు చెప్పిన చమత్కార శ్లోకము


కాళిదాసు చెప్పిన చమత్కార శ్లోకము
https://cherukurammohan.blogspot.com/2019/06/blog-post_27.html
కాళీదాసు భోజరాజుల మైత్రీ బంధము అజరామరము. భోజునితో ఉన్నది కాళీదాసు-2.
మొదటి కాళీదాసు విక్రమార్కుని కాలము వాడు మరియు రఘువంశాది కావ్యములను, అభిజ్ఞాన శాకుంతలము వంటి నాటకములను వ్రాసిన మహాకవి. కాళీదాసు-2 విద్వద్వరేణ్యుడేగానీ, ఆయన కావ్యములు వ్రాసినట్లు తెలిసిరాదు, కానీ భోజుడు వ్రాసిన రామాయణ చంపు అన్న భోజుని ఆశు కావ్యమునకు సహకారమునందించినాడు అన్న ప్రతీతి కలదు. భోజ కాళీ దాసుల నడుమ ఎన్నో విచిత్ర సంవాదములను సన్నివేశములను చూస్తూ ఉంటాము. అటువంటి వానిలో ఇదీ ఒకటి.
ఒకసారి భోజ రాజు ఒక విచిత్రమైన సమస్య సభికులకు ఇవ్వటము జరిగినది. సముద్రానికి అనేక పర్యాయపదాలలోని 6 పదములను ఒక శ్లోకపాదముగా తీసుకొని పూరించమన్నాడు. అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి: అన్నదే ఆ శ్లోక పాదము.
ఎవరూ పూర్తి చేయలేక పోయినారు సభలో. కాళిదాసు ఒక చక్కటి సన్నివేశమును ఊహించినాడు. ఆ ఊహించిన సన్నివేశము ఇది.
పార్వతికి కోపము వచ్చింది ఎందుకు? ఎందుకు వచ్చిందంటే తనభర్త తనకో సవితి ని తీసుకొని రావడమే గాక ఆమెని నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడు. తన బాధను శూరుడు దేవ సేనాని మరియు తన కుమారుడైన షణ్ముఖుడికి  తన కష్టం చెప్పుకుంది. కుమారుడు పరమశివుడి దగ్గరకు వెళ్లి నాన్నా నీవు అమ్మకు సవితిని తెచ్చుటయేగాక ఆమెను నెత్తిన పెట్టుకోన్నావని అమ్మకు ఎంతో కోపము అంతకు మించిన తాపము కలుగుచున్నది. నువ్వు నెత్తిన పెట్టుకున్న గంగమ్మను విడిచి పెట్టు.  అన్నాడు. అప్పుడు పరమశివుడు కుమారా! చిరకాలంగా నాదగ్గరే ఉంటున్న గంగను ఇప్పుడు నేను వదిలేస్తే పాపం ఎక్కడికి పోతుంది అన్నాడు మహదేవుడు.
తన తల్లి యొక్క సవితిని తండ్రి వెనకేసుకొని రావడం షణ్ముఖుడికి  బొత్తిగా నచ్చలేదు. అందువల్ల కోపముతో ఊగిపోతూ వెళ్లి సముద్రములో దూకమును (నదీనాం సాగరో గతి:) తన ఆరు ముఖాలతో ఒక్కొక్కసారి ఒక్కొక్క సముద్ర పర్యాయ పదమును వాడుతూ 6 చెప్పినాడు. అదే అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి: అంటూ భోజరాజు సభలో ఇచ్చిన సమస్య.
 దానిని కాళీదాసు ఎంత చమత్కారంగా పూరించినాడో చూడండి.
అంబా కుప్యతి తాత మూర్ద్ని విలసత్ గంగేయముత్సృజ్యతాం !
విద్వన్ షణ్ముఖ! కా గతి:మయి చిరాత్ అస్యా: స్థితాయా:వద?
కోపావేశవశాతశేష వదనై:ప్రత్యుత్తరం దత్తవాన్
అంభోధి:జలధి:పయోధిరుధధిః,వారాంనిధి:వారిధి:
నీవు నెత్తిన గంగను పెట్టుకున్నావని అమ్మకు కోపం వచ్చింది.ఈ గంగను విడిచి పెట్టు సర్వం తెలిసిన షణ్ముఖుడా! .పాపం చిరకాలం గానన్ను నమ్ముకొని నా దగ్గరే వుంటున్నది  యిప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుంది? అన్నాడు శివుడు.అప్పుడు షణ్ముఖుడు కోపంతో తన ఆరుముఖాలతో సముద్రం లోకి పొమ్మను.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం అని సముద్రానికి పర్యాయపదాలు ఆరు చెప్పాడు. ఆ అద్భుత మైన ఊహకు, పూరణకు భోజరాజు ఉబ్బి తబ్బిబ్బై సింహాసనం దిగి వచ్చి కాళిదాసును కౌగలించుకొని, ఉచిత రీతిని సత్కరించినాడు.
ఆ శ్లోకార్థము దిగువన ఇవ్వబడినది.
అంబా కుప్యతి =అమ్మకోపిస్తున్నది,
మూర్ద్ని విలసత్ గంగా ఇయం ఉత్సృజ్యతాం ! = నీ శిరసు మీద వున్న గంగ పరిత్యజింప బడుగాక!  
ఇది షణ్ముఖుడు చేప్పిన మాట. ఆ మాటకు బదులుగా శివుడు ఈ విధముగా అంటూవున్నాడు.
విద్వన్  షణ్ముఖ =సర్వము తెలిసిన షణ్ముఖుడా!
మయి చిరాత్  స్థితాయా: -అస్యా: - కా గతి: -వద =నాతోనే చిరకాలంగా వుంటున్న ఈమె గతి ఏమిటి? ఎక్కడికి పోతుంది? చెప్పు అన్నాడు.
ఆమాట విని స్కందుడు అగ్గిమీద గుగ్గిలమైపోయినాడు. అప్పుడు
కోప- ఆవేశవశాత్ - అశేష వదనై: -ప్రత్యుత్తరం దత్తవాన్ = కోపావేశాలతో కూడిన 6 ముఖములు కలవాడగు సుబ్రహ్మణ్యుడు తన ఆరుముఖాలతో సముద్రము లోకి పోయి దూకమను.అని ఆరు సార్లు సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం సముద్రం అని 6 పర్యాయపదములనువాడుతూ ఉచ్చస్వరముతో అన్నాడు.
మహామహితాత్ముల బుద్ధిగున విశేషాలు ఈవిధముగా వుంటాయి. అంతా వాగ్దేవి కరుణ.
స్వస్తి.

Saturday, 15 June 2019

బుద్ధిః కర్మానుసారిణీ


బుద్ధిః కర్మానుసారిణీ
https://cherukurammohan.blogspot.com/2019/06/blog-post_15.html

నేను అంటే శరీరం – మనస్సు – బుద్ధి.
శరీరము బాహిరమైనది. దానికి సంజ్ఞలందజేసేది మనసు. దానిని ప్రచోదనము చేసేది బుద్ధి.
 పూర్వజన్మముల కర్మఫల సారాంశమే బుద్ధి. తప్పో ఒప్పో మనసును ప్రేరేపించేది బుద్ధి.
మరి బుద్ధికి కూడా వెనుకల ఒక నడిపే శక్తి అవసరము. పరమేశ్వరునికే పరాశక్తి అవసరమైతే మనమెంత. కావున ఈ బుద్ధిని ఉసిగొల్పుటకు ఏర్పడిన శక్తే కర్మఫలము.
ఒక చిన్న ఉదాహరణ తీసుకొందాము. పదవీ విరమణ చేసిన 65 సంవత్సరముల వ్యక్తి తానూ పనిచేస్తూ వుండిన కార్యాలయము ఇంటికి దూరమైనా అదేపనిగా ఆటో లో వెళ్లి వయసులో ఉన్న పారిశుధ్యపు కార్మికురాలితో పరాచికాలాడేవాడు. ఒకరిద్దరు అతనితో ఇదేమి ఖర్మ అంటే నాకు తెల్లవారితే స్నానము దేవుడు దైవము ఏదీ అనిపించదు, కనిపించదు. ఈమెయే కళ్ళముందు కనిపిస్తుంది. కష్టముమీద కార్యాలయ సమయము వరకు వేచియుండి ఆమెతో పరాచికాలాడుటకు వస్తాను అని చెప్పినాడు. ఈ విషయమును ఇక్కడ నిలిపితే, ఆ వయసు వారందరూ ఆపని చేయుట లేదు. వాళ్ళు గుడి గోపురము, దేవుడు దైవము అంటూ తిరుగుచున్నారు. దీనివల్ల మనకేమి తెలియుచున్నది. బుద్ధిని ప్రేరేపించే శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉన్నది అని తెలియవస్తూవుంది. ఆ శక్తియే వారి వారి కర్మ ఫలము.
భగవద్గీత ఈ క్రింది శ్లోకముతో మొదలౌతుంది.
శ్లో.ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మమకాః పాణ్డవాశ్చైవ కిమ కురవత సంజయ
ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనిస్తే
సంజయా! యుద్ధము చేయ నిచ్చగించినవారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున కూడిన నావారును పాండవులును ఏమి చేసిరి?
ఇందులో అత్యంత గూడార్థము ఇమిడియుంది. ఒకసారి విశ్లేషించుకొందాము.
'క్షి' యనగా నాశము (చెడు కర్మలు చేయుటవల్ల)
'త్ర' అనగా రక్షణ (పుణ్య కార్యములు చేయుటవల్ల) 'కురు' చేయుటవల్ల కలిగించేది. ఆక్షేత్రము వేరేదీ కాదు ఈ శరీరమే. అందువల్ల ఈ శరీరమే కురుక్షేత్రమయ్యింది.
మమకారము తనవారిపైన చంపుకోలేని ధృతరాష్ట్రుడు అందుకే 'మామకాః' అని వాడినాడు. మామ అంటే ఒకవిధముగా అంతా నాకేకావలెనన్న అత్యాశగా చెప్పుకోనవచ్చును. ఇక 'పాండవాః'
అని కూడా ఆయన వాడుతాడు. 'పాండువు' అంటే తెలుపు స్వచ్చత అని అర్థం. పాండురాజు రక్త హీనత వల్ల పాలిపోయిన శరీరుడై (బొల్లి - తెల్లదనము వల్ల) పాండురాజైనాడు. ఇక పాండు కు 'స్వచ్చత' అన్న అర్థము ఉండుటవల్ల సత్వ గుణ సంపన్నులైన పాండవులు ధర్మ పరులైనందువల్ల ఆమాట ఆయనచే వాడబడినట్లు తెలియుచున్నది కదా!.
కావునకురుక్షేత్ర సంగ్రామ ఉపోద్ఘాతములోనే చెడ్డ పై మంచి గెలుస్తుందని చెడ్డని పుట్టించిన వ్యక్తి(తండ్రి) యే చెప్పినాడంటే భారత కాలములో వైయక్తిక జీవన విదానమేట్లున్నది మనము అర్థము చేసుకోన వచ్చును.
ఈ శరీరిభూమిపై ఉన్నంత కాలము ఈ మంచిచెడుల అంతర్మథనము కొనసాగుతూనే వుంటుంది.
కావున ఈ వివరణను సంగ్రహించితే, 'శ్లోకము', కురుక్షేత్రమగు ఈ శరీరముతో సత్కర్మల నాచరించి దానిని ధర్మ క్షేత్రమొనరించి రజస్తమోగుణములపై సత్వము జయము సాధించవలయునని తెల్పుచున్నదని నా భావము .
భగవద్గీత కర్మ యోగములో కర్మలు చేయక తప్పదు అని పరమాత్ముడు మనకు తెలుపుతాడు. అసలు ఊరక కూర్చునత కూడా ఒక కర్మే. దానికి తగిన సమయములో ఫలితముంటుంది.  ఒకవేళ  కర్మ సత్కర్మయైుతే కర్తకు సత్ఫలితం వస్తుంది. దుష్కర్మ అయితే కర్తకు దుష్ఫలితమే వస్తుంది. అయితే ఈ కర్మఫలాలు కర్మ చేసిన వెనువెంటనే రాకపోవచ్చు, కనిపించపోవచ్చు. అందుకే పుణ్యాలు చేస్తున్నవాళ్లు సుఖాలు పొందుతున్నట్లు కనిపించకపోవడం, పాపాలు చేస్తున్నవాళ్లు కష్టాలు అనుభవిస్తున్నట్లు కనిపించకపోవడం చూస్తుంటాం. ఈ విపరీతమే జనులను పుణ్యకార్యాలను చేయడంలో నిరుత్సాహపరచడం, పాపాలను చేయడంలో ప్రోత్సహించడం చేస్తుంది. దీనిలో మనం చేయగలిగింది ఏదీ లేదు. ప్రకృతి నియమం ఆవిధముగా ఉంది.
ఈ కర్మలను నియంతించేది కూడా ప్రమాత్మయగు అంతరాత్మ. కావున మన కర్మ బుద్ధిని ప్రేరేపించినా ఆవిషయమును అంతరాత్మకు నివేదించి అనుజ్న పొంది చేయవలసి ఉంటుంది.
క్లుప్తముగా తెలిపినాను.
కనుకనే కర్మానుసారాణీ బుద్ధిః అన్నారు.
స్వస్తి.

Friday, 14 June 2019

భగవద్గీతా ప్రవేశము


భగవద్గీతా ప్రవేశము

ఎందఱో మహనీయులు, మహానుభావులు,మహాగురువులు భాష్యము వ్రాసిన భగవద్గీత తిరిగీ నేను విమర్శనాత్మకంగా తెలియబరచే అవసరము గానీ,శక్తి గానీ భగవంతుడు నాకు ఇవ్వలేదు. అయినా ఒక్క విషయము మాత్రము శ్రద్ధాళువులతో పంచుకోవాలనిపించి ఈ చిన్న ప్రయత్నము.

భారత యుద్ధ వార్తలను ధృతరాష్ట్రునకు చెప్పుటకై వేదవ్యాసులవారు సంజయునికి కురుక్షేత్ర సంగ్రామము వీక్షించగల దివ్య దృష్టి నొసంగి నియమించిరి.

ఈ గీతా ప్రవేశద్వారము వద్ద మొదట నిలిచినది ధృతరాష్ట్రుడు .
ధృతముఅంటే ధరింపబడిన అని అర్థము, రాష్ట్రుడు అంటే రాష్ట్రమును కలిగినవాడు అని అర్థము. అంటే చక్రవర్తి యని అర్థము. ఈ పేరుకు ఇంకొక అర్థమూ వుంది. ధృతమన్న మాటకు ఆనందము అని ఒక అర్థము. రాష్ట్రము అన్న మాటకు ఉత్పాతము అని ఒక అర్థము (బ్రౌణ్య నిఘంటువు). అంటే ఉత్పాతములయందు ఆనందమును పోడువాడు అని. చూచినారా పూర్వము పేరు పెట్టుటలోని సార్థకత. ఆలోచిస్తే భారత యుద్ధమునకు ఈ పేరే దారి తీయించిందేమో అనిపిస్తుంది.

ఇక రెండవ వాడు సంజయుడు. సత్+జయుడు సంజయుడౌతుందని అందరికీ తెలిసిన విషయమే. 'ఏకం సత్' అన్నది వేదం వాక్కు.అంటే ఆ సత్తే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ను జయించినవాడే సంజయుడు. 'ఏకం సత్' అన్నది వేదవాక్కు. అంటే' ఆసత్తే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను జయించినవాడే సంజయుడు. అంటే వ్యాసుడు విష్ణువు యొక్క అంశయే కదా. సంజయుడు ఆయన అనుగ్రహము పొందుట అంటే ఆయనను జయించినట్లే కదా.

భారతము ఇతిహాసమని సోదాహరణముగా పండితులచేత నిరూపింప బడినది. ఇది ఇపుడు నిర్వివాదము. అప్పుడు ఇందులోని పాత్రల పేర్లు కథ కొరకు పెట్టినవి కావని ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. వారి పేర్లు వారి స్వభావమునకు ఎంత అతికినట్లు సరిపోతూ వుందో పైన దొరికిన రెండు మెతుకులు పట్టి చూస్తే తెలుస్తుంది.

కృష్ణుడు అర్జనునకు చేయు గీతోపదేశ మటుంచి ఆ ఉపదేశానికి ఉపోద్ఘాతమునకు , ఒక ఉత్పాతములయందు ఉత్సాహము కల్గినవాడు, ఎట్లు నాంది పలుకుచున్నాడో గమనించండి. భగవద్గీత ధృతరాష్ట్రుడు సంజయున్ని ప్రశ్నించిన ఈ శ్లోకముతో మొదలౌతుంది.

శ్లో.ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మమకాః పాణ్డవాశ్చైవ కిమ కురవత సంజయ

ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనిస్తే

సంజయా! యుద్ధము చేయ నిచ్చగించినవారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున కూడిన నావారును పాండవులును ఏమి చేసిరి?

ఇందులో ఒక అంతరార్థము వున్నది. అదేమిటంటే యుద్ధము చేయ నిచ్చాగించినవారు, యుద్ధము చేయుట సహజమే అయినా, చేయనిర్ణయించుకొన్న ప్రదేశము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము. వామన పురాణములో ఈ విధంగా చెప్పబడింది.కురు మహారాజు తన సామ్రాజ్యమునకు సరియగు రాజధానిని సమకూర్చుకొన సంకల్పించి ఎన్నో ప్రాంతములను వేదికి ఈ ప్రాంతమునకు వచ్చి ఈ ప్రాంతపు ప్రత్యేకతలను ఈ క్రింది విధముగా తెలుసు కొన్నాడు.

ఈ ప్రాంతము,బ్రహ్మ ఎన్నో వేల సంవత్సరములు తపమాచ్రించుతవలన బ్రహ్మ వేడిగానూ,సరస్వతీ నది ఉత్తరవాహినియై ప్రవహిన్చుతవలన ఉత్తరవేదిగానూ, సరస్వతీ యమునా నదుల సంగమము దృష్టావతి గా ఇక్కడ పిలువబడేది. ఈ ప్రాంతము సప్త గుణ సంపన్నమైనదని ఇచ్చట నగరము నేర్పరచ తన అనుచర గణమునకు నిర్దేశించినాడు.ఈ సప్త గునములేమిటివన:1.తపస్సు 2.సత్యము 3.క్షమ 4.దయ 5.శుచి 6.దానము 7. బ్రహ్మచర్యము. ఈ ప్రాంతమును రాజధానిగా ఎన్నుకొన్న తన పరమ భక్తుడైన కురు మహారాజుకు శ్రీ మహావిష్ణువు రెండు వరాలను ప్రసాదించినాడు . 1.ఆ ప్రదేశమికపై కురుక్షేత్రముగా పిలువబడుతుందని
2.అక్కడ మరణించిన వారు స్వర్గవాసులౌతారని.

ఋషులు అనేకక్రతువులను నిర్వహించుట వలనను,వేదవ్యాసులవారు వేదములను ఋగ్ యజుస్ సామ అధర్వణములుగా విభజించుట వల్లను ఈ ప్రదేశమునకు ధర్మక్షేత్రమనే పేరు కూడా స్థిరపడినది. అందువల్లనే ధృతరాష్ట్రుడు 'ధర్మక్షేత్రే' 'కురుక్షేత్రే' వాడినాడని చెప్పవచ్చును.

ఇందులో ఒక గూఢార్థము కూడా ద్యోతకమగుచున్నది. 'క్షి' యనగా నాశము (చెడు కర్మలు చేయుటవల్ల )
'త్ర' అనగా రక్షణ (పుణ్య కార్యములు చేయుటవల్ల) 'కురు' చేయుటవల్ల కలిగించేది.ఆ క్షేత్రము వేరే కాదు ఈ శరీరమే. అందువల్ల ఈ శరీరమే కురుక్షేత్రమయ్యింది.
మమకారము తనవారిపైన చంపుకోలేని ధృతరాష్ట్రుడు అందుకే 'మామకాః' అని వాడియుంటాడు. ఇక 'పాండవాః'
అని కూడా ఆయన వాడుతాడు. 'పాండువు' అంటే తెలుపు స్వచ్చత అని అర్థం. పాండురాజు రక్త హీనత వల్ల పాలిపోయిన శరీరుడై (బొల్లి - తెల్లదనము వల్ల) పాండురాజైనాడు. ఇక పాండు కు 'స్వచ్చత' అన్న అర్థము ఉండుటవల్ల సత్వ గుణ సంపన్నులైన పాండవులు ధర్మ పరులైనందువల్ల ఆమాట ఆయనచే వాడబదినదేమో.
కావునకురుక్షేత్ర సంగ్రామ ఉపోద్ఘాతములోనే చెడ్డ పై మంచి గెలుస్తుందని చెడ్డని పుట్టించిన వ్యక్తి(తండ్రి) యే
చెప్పినాడంటే భారత కాలములో వైయక్తిక జీవన విదానమేట్లున్నది మనము అర్థము చేసుకోన వచ్చును.
ఈ శరీరిభూమిపై ఉన్నంత కాలము ఈ మంచిచెడుల అంతర్మథానము కొనసాగుతూనే వుంటుంది.

కావున ఈ వివరణను సంగ్రహించితే, 'శ్లోకము', కురుక్షేత్రమగు ఈ శరీరముతో సత్కర్మల నాచరించి దానిని ధర్మ క్షేత్రమొనరించి రజస్తమోగుణములపై సత్వము జయము సాధించవలయునని తెల్పుచున్నదని నా భావము .
స్వస్తి.