Thursday, 9 May 2019

Dr. వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ గారు


Dr. వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్య శర్మ గారు
https://cherukurammohan.blogspot.com/2019/05/dr.html
ఆస్య గ్రంధిలోనికి నేను అడుగు పెట్టేవరకూ వారిని గూర్చి నాకు తెలియదు, నన్ను గూర్చి వారు తెలుసుకొనే అవకాశమేలేదు. కాలంతరములో ఆస్య గ్రంధిలోని మా రచనలు మా ఇరువురినీ దగ్గరకు చేర్చినాయి. నిజానికి మాది పర్వత పరమాణు సారూప్యము, అజగజ సామ్యము, ఆయన నడిచే విజ్ఞాన సర్వస్వము. విషయము ఆస్య గ్రంధిలో ఎవరు వ్రాసినదైనా కానీ, నిర్మొహమాటముగా విమర్శించే వారి తీరు  నాకెంతో నచ్చినది. ఆయన స్వర్గాస్తుడయి ఆయన చేత సందేహములు తీర్చుకొనుటకు దేవేంద్రుడే స్వర్గములోని తన మహాసభలో ఉన్నత స్థానమోసగి సభికునిగా చేసుకోన్నాడేమో!
2013 నుండి 2016 వరకు ఆస్య గ్రందియోక్క రూపురేఖలు వేరు. ఎవరికి ఏ విషయముపై అభినివేశామేక్కువగా వుంటుందో దానిని గూర్చి విశ్లేషణా పూర్వకముగా వివరణాత్మకముగా వ్రాసేవారు. ఆ విషయముపై శ్రద్ధగలిగినవారు. తమతమ అభిప్రాయములతో స్పందించేవారు. సందేహమేర్పడితే అడిగేవారు. ఆ సమయములో శర్మ గారు ప్రతి సందేహాన్నీ సాధికారకారక టిప్పణితో తీర్చేవారు. వారు దానిని ఏకారణము చేతనైన చూచియుండకపోతే ఆ బాధ్యత నేను తీసుకొనేవాడిని.
నేనేదయినా ఒక ముఖ్యమైన విషయముపై వ్రాస్తే తప్పనిసరిగా దానిపై వారి అభిప్రాయము ఉండి తీరవలసినదే! వారు  సద్గురు శివానంద మూర్తిగారి ఆధ్వర్యమున వచ్చే సంచిక ‘సుపథగ’ కు ఆంగ్లములోనూ తెలుగులోనూ వ్యాసములు వ్రాసేవారు. నారచనపై ఎవరయినా కుతర్కము చేస్తే ముందు దానికి జవాబుగా వారి స్పందన ఉండేది. వారి రచనల కుతార్కికులకు నేనూ అదేవిధముగా స్పందించేవాడిని. ఒకరికొకరము యథాదృష్టి అంటే నేరుగా చూచుకొనకపోయినా మామద్యన ఒక ఆత్మీయతాభావము నెలకొనియుండేది. ఆంగ్లములో ‘Historicity’ ని గూర్చి వారు ‘సుపథగ’ కు వ్రాయదొడగిన వ్యాస శృంఖలను నాకు ‘Email’ లో పంపి ఒకసారి చూసి అవసరమున్నచోట మార్పునకు అవకాశము ఉన్నదేమో చూడమన్నారు. నిజానికి ఆయనముందు నేను పిపీలికమును. ఈ విషయము ఆయన యొక్క నిగర్వమును చాటుతుంది. ఇక వారిని గూర్చి ఇది కాక ఇంకాస్త తెలుసుకొందాము.

వీరు ఆది నుండి తుది వరకు చదువులో అగ్ర తాంబూల గ్రహీత. దేశంలో సుప్రసిద్ధమైన భారతీయ విఙ్ఞాన్ సంస్థాన్ (Indian Institute Of Science) విద్యుత్ తాంత్రిక విభాగమునుండి 1964, 1966, 1971 లో BE, ME, PhDలు పొందినారు. 1967లో అక్కడే ఉపన్యాసకునిగా చేరిన వీరు, 2006 లో కంప్యూటర్ సైన్సు మరియు ఆటోమేషన్ విభాగంలో ఆచార్యునిగా పదవీ నివృత్తి పొందినారు. 2012 వరకు అక్కడే INAE Distinguished Professor గా ఉండినారు. ఎన్నో దేశ విదేశ విశ్వ విద్యాలయములకు Visiting Professor గా వుండినారు. సద్గురు శివానంద మూర్తిగారు స్థాపించిన సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు నుండి 2010 విశిష్ట పౌర సన్మానాన్ని అందుకున్నారు. Indian Academy of Science, Indian National Academy of Science మరియు Indian Academy of Engineering లలో విశిష్ట సభ్యునిగా ఎన్నికైనారు. వారు తెలుగు ఇంగ్లీషులలో చరిత్ర, తత్వ శాస్త్రము, సాహిత్య విషయాలపై వ్యాసరచనా వ్యాసంగమును సద్గురువు శివానంద మూర్తిగారి కోరిక మేరకు చేబట్టి నిరాఘాటముగా నిరంతరాయముగా కొనసాగించుచుండినారు.
2017, మె 7 న ఆవ్ష్కరణకు నోచుకొన్న నా పుస్తకములు ‘శంకరదాస ఆష్టోత్తరశ తి’ మరియు ‘సరసరస (వ్యాస సంపుటి)’ లలో ‘శంకరదాస ఆష్టోత్తరశ తి’ కి నేను వారికి తెలిపిన మరురోజుకల్లా తన అభిప్రాయము వ్రాసి email లో పంపిన మహానుభావుడు. వారు తమ అభిప్రాయమును తెలియజేస్తూ వ్రాసిన వారి రచనకు ఉంచిన శీర్షిక ‘ఒక చదువరి అభిప్రాయము’. ఆమహనీయునికి నా సాష్టాంగ పాదాభివందనము. వారు నా పుస్తకముపై అభిప్రాయమును తెలుపుతూ తమ ఉదాత్తతను ఎంత గొప్పగా చాటుకొన్నారో  చూడండి. “పుండరీకము అంటే తామర పువ్వు గుర్తుకొస్తుంది.కానీ బెబ్బులి అన్న అర్థమున్నాడని ఇప్పుడే తెలిసింది.” ఎంతో గొప్పవాడై ఉండికూడా ఆయన ఎంత వినయసంపంనత కలిగియుండినాడో చూడండి. ఆమహనీయునికి మరొక సారి అంజలించుతూ నాయొక్క ‘శంకరదాస ఆష్టోత్తరశతి’ లో వారిని గూర్చి వ్రాసిన ఈ క్రింది పద్యముతో ఈ రచ్జన ముగించుచున్నాను.
సాంకేతికంబైన చదువు నెవ్వరు సాటి
కలన సువిద్య లో గాంచ మేటి
ఆచార్య పదవికే యాతడౌను కిరీటి
సందేహతప్తుని సతత సురటి
సరస గీర్వాణాంధ్ర సాహిత్య ఘనపాఠి
ధర్మ దర్శక మూర్తి ధన్వి ధాటి
విజ్ఞాన మధుపుష్ప విష్టపమ్మున తేటి
వసుధ మేధావిగ్రావంపుకోటి

నాదు ప్రార్థన మన్నించి నలువ రీతి
అట్టి విద్వచ్ఛిరోమణి యాదరాన
వ్రాసె దనమాట, శివునాఙ్ఞ వాటుగొనుచు
శంకరునిదాస విరచిత శతకమునకు
స్వస్తి.