Sunday, 7 April 2019

నుదుటి బొట్టు మన సాంప్రదాయము


నుదుటి బొట్టు మన సాంప్రదాయము
https://cherukurammohan.blogspot.com/2019/04/blog-post.html
కను బొమలు రెండు పర్వత శిఖరములుగా భావించుకొంటే ఆరెంటి నడుమన ఉదయించే సూర్యుడు స్త్రీకి కనుబొమల నడుమగల నుదుటి బొట్టవుతాడు. నేటి కార్యాలయ సాంప్రదాయములలో అసలు సూర్యుడు, వెలుతురు, ఆరోగ్యము అన్నవి అగుపించని ఎత్తుకు ఎగిరిపోయినాయి. బొట్టు కూడా అదే ఎత్తుకు చేరుకొనింది. ఆర్జన తప్ప అన్యము అవసరము లేని కాలములో  ఉన్నాము. స్థితి నిరాశ నిస్పృహకు ఆలవాలమైనా. అంధకార బంధురమైన మన జీవన సరళి అను సొరంగమునకు అటువైపు ఎదో ఒక ఆశా కిరణము అగుపించక పోతుందా? అన్న తపనతో ఈ విషయమును మీకు తెలుప ప్రయత్నించుచున్నాను.

అంగుష్ఠః అంటే బొటన వ్రేలు. సంస్కృతములో అంగుష్ఠమన్నది పుంలింగము. దానికి దార్ఢ్యము చాలాఎక్కువ. మిగత నాలుగు వ్రేళ్ళ బలమును అది కలిగియుంటుంది. వ్రేళ్ళు ఏపనిని కూడాబొటనవ్రేలు సాయము లేనిదే చేయలేవు. ఇది హృదయానికి సంకేతము అని పెద్దలు చెప్పినారు. ఇక మిగిలిన నాలుగు వ్రేళ్ళను 'అంగుళ్యః' అంటారు. ఇవి నాలుగు అందంగా ఆకర్షణీయంగా వుంటాయి. బహుశ అందుకేనేమో ఇవి స్త్రీలింగమునకు చెందు పదములు సంస్కృతములో! వీనిలో మొదటి దానిని 'తర్జని' అంటారు.  తర్జనము అంటే భయము బెదురు అని అర్థము. అందుకే అసంకల్పితముగానే మనము కోపములో ఎవరినైనా హెచ్చరించవలసి వస్తే ఆ వ్రేలునే చూపిస్తాము. 'తర్జని' అంటే బెదిరించేది, భయపెట్టేది' అని అర్థము. కొందరు దీనితో బొట్టు పెట్టుకొంటారు.  మనకనుబొమల నడుమ సుషుమ్న నాడి మరియు ఆజ్ఞా చక్రము వుంటాయి.  సుషుమ్న, మన ముక్కు కుడివైపునుండి ఇడ అన్న నాడి నుదుటికి ప్రాకి అక్కడ ఎడమ వైపునుండి వచ్చిన పింగళ అన్న నాడితో కలిసే చోట ఉంటుందని పెద్దలు చెబుతారు.  ఈ తర్జనితో  బొట్టు పెట్టుకొంటే మనకు ఆ బెదిరించే లేక కోపగించుకొనే లేక అసహనమనే లక్షణాలను కలిగిపజేస్తుంది సుషుమ్న వద్దనున్న ఆజ్ఞా చక్రము. కాబట్టి చూపుడు వ్రేలితో బొట్టు పెట్టుకొనరాదు.
   ఇపుడు చివరి వ్రేలును గూర్చి తెలుసుకొందాము. దీనిని సంస్కృతములో 'కనిష్ఠిక' మంటారు. కనిష్ఠము అంటే చిన్నది, బలహీనమైనది (Least, weak) అని అర్థము. ఇక్కడ ఒక్క విషయము  చెప్పవలసి వస్తుంది. వివాహములో వదూవరులకు పాణిగ్రహణము చేయించి నడిపించే సమయములో ఇరువురినీ చిటికెన వ్రేళ్ళు పెనవేసుకొని నడువ మంటారు. ఇది పాణిగ్రహణము కానేరదు. 'కనిష్ఠికా' గ్రహణము ఔతుంది. కావున ఇరువురూ చేతులను చేతులు కలిపి (shake hand లో లాగా) నడిపించాలి. బలహీనమగు వ్రేలితో బొట్టు పెట్టుకోనకూడదు.  ఇక మిగిలి పోయినవి రెండు వ్రేళ్ళు. చిటికెన వ్రేలికి ప్రక్కనున్న వ్రేలును సంస్కృతములో అనామికమంటారు. అనామికము అంటే పేరులేనిది అని అర్థము. అసలు మన వ్యాసమునకు సంబంధము లేక పోయినా ఇక్కడ . 'కనిష్ఠిక' మరియు అనామిక ను గూర్చి ఒక చిన్న కథ చెప్పుకొందాము.
కాళిదాసు ఒక కవితామేరువు. అందుకే విద్వాంసులు ఈ విధముగా అంటారు అన్న ఒక ప్రసిద్ధమైన చాటువు మన మధ్యన ఉంది. పూర్వ కాలము ఒక విద్వత్ కవి పండిత సదస్సులో అందరికన్నా గొప్పయగు ఒక ఐదుగురు కవుల పేర్లు గుర్తించ దలచినారట. అనుకొన్నదే తడవుగా గుర్తుకొచ్చిన మొదటి పేరు కాళిదాసుది. ఆతరువాత ఎవరు అన్నది ఎంత గింజుకొన్నా గుర్తు రాలేదట. దానిని ఈ శ్లోక రూపములో ఎంత హృద్యముగా చెప్పినారో చూడండి:
పురాకవీనాం గణన ప్రసంగే

కనిష్ఠికాధిష్టిత కాళిదాసా:

అద్ద్యాపి తత్తుల్య కవేరభావేత్
అనామికా సార్థవతీ భభూవ
ప్రాచీన కవులలో గొప్పవారెవరా అని ఒక పెద్ద పండితుడు  వేళ్ళు లెక్కబెట్టుట , చిటికెన వేలితో మొదలుపెడుతూ  కాళిదాసు అన్నారట. తరువాత వ్రేలిని లేపి పేరు చెప్పబోగా కాళిదాసుతో సమానుడైన మరోకవి ఎవరూ తోచక ఆపివేసినాడట. ఆ విధముగా ఆ వ్రేలికి అనామికమ'న్న పేరు సార్థకమయిందట. ఇందులోని చమత్కారము ఏమిటంటే సంస్కృతములో చిటికెన వ్రేలికి ప్రక్కనున్న వ్రేలికి  అనామికము అన్న పేరు మాత్రమే ఉంది. అనామికము అంటే పేరులేనిది అన్నది తాత్పర్యము.
కానీ తెలుగులో ఆ వ్రేలిని ఎంతో గౌరవించి మనము  ఉంగరపు వ్రేలు అంటాము.
ఇప్పుడు పెరులేనిది అన్న మాటకు ఉంగరపు వ్రేలు అన్నది సమన్వయము చేద్దాము. కాళిదాసు తరువాత అంతటి గొప్ప కవి లేడన్నాము కదా! ఒకవేళ ఉంటే, అతనే, ముద్రిక అనగా ఉంగరము ధరించగల యోగ్యుడు. అది జరగని పని కాబట్టి ఆ వ్రేలు 'అనామకము' గానే మిగిలిపోయింది సంస్కృతములో!
ఇక తిరిగీ విషయానికి వస్తే అనామికమునకు పేరే లేదు కావున దాని గుణగణములూ మనకు తెలిసే అవకాశము లేదు. కావున బొట్టు పెట్టుకొనుటకు ఇది కూడా నిషిద్ధము.
ఇక మిగిలినది మధ్యమము. అసలు మధ్యే మార్గము మంచి మార్గము అన్న సామెత ఒకటి మనకుంది. ఇదికాక ఈ మధ్య వ్రేలు పొడవు గానూ బలిష్టముగానూ ఉంటుంది. దీనితో కుంకుమ తీసుకొని ఆడవారు కానీ మగవారుకానీ నుదుటిపై అదిమి పెట్టుకొనుటవల్ల ఆజ్ఞా చక్రమును ఉత్తెజితము చేసినట్లవుతుంది. రోజంతా అది మనకు రక్షగా పనిచేస్తుంది. కాబట్టి నుదుటి బొట్టును ఎప్పుడూ మధ్యవ్రేలుతో అదిమి పెట్టుకొనవలెను. అదే ఒకరు ఇంకొకరికి బొట్టు పెట్టునపుడు  బొటన వ్రేలును ఉపయోగించమని పెద్దల మాట.
కానీ ఈ రోజు ఆడ మొగ ఎవరికీ ఆ కష్టము లేదు. ఎందుకంటే మగవాళ్ళు మానేసి ఒక శతాబ్దము కావస్తూ ఉన్నదేమో! ఆడవారు కూడా 6౦ సంవత్సరముల క్రిందటే కుంకుమ మాని Plastic Stickers ను ప్రత్యామ్నాయముగా చేసుకొన్నారు. నేటి అతివలు ఆ ఖర్చుకూడా తగ్గించుకొని బోసి నుదుటి తో ఉండుటయే బోగొప్ప అని భావించుతున్నారు. ఈ సందర్భములో నాకు గుర్తుకు వస్తున్న ఒక చాటువును తెలుపుతూ విరమించుతాను
చాకివానితోడి జగడాలు పడలేక
సిరిగలాడు పట్టు చీర కట్టె
శివుడు తోలు గప్పె ఛీయని మదిరోశి
భైరవుండు చీర బారవైచె
చాకలితో ఇది చినిగింది, అది పోగొట్టినావు అది ఇంకా తేలేదే అన్న పోరు పడలేక విష్ణువు పట్టు పీతాంబరములు ధరించినాడట, అవి రోజూ ఉతుకనక్కరలేదు అందుకని, అసలు ఉతికే పనే ఉండదు కదా అని శివుడు తోలు చుట్టుకొన్నాడు, అసలు తోలు కూడా ఎల్లకాలమూ ఒంటికి అతుక్కొని ఉంటే వాసన వస్తుందని భైరవుడు అంతా విడిచిన వాడు ఎంత భాగ్యశాలి అనుకొంటూ అదికూడా లేకుండా దిగంబరంగానే ఉండిపోయినాడట. అనేకమంది మన భారతీయ వనితలు బొట్టు విషయములో నేడు భైరవుని POLICY నే అనుసరిస్తున్నారు.
స్వస్తి.