చెరుకు రామ్మోహన్ రావు పద్య మంజరి ,గీతములు,వ్యాసములు (తెలుగు మరియు english),అభిప్రాయములు మొదలగునవి .
Saturday, 30 December 2017
Monday, 25 December 2017
పరమాత్మ సాయుజ్యమునకు మన కృషి (దేవుని చేరుటకు మన ప్రయత్నము)

పరమాత్మ సాయుజ్యమునకు మన
కృషి
https://cherukurammohan.blogspot.com/2017/12/blog-post_25.html
ఆత్మామ్బోధేస్తరంగోSస్మ్యహమితిగమనే భాయయన్నాసనస్థ
సంవిత్సూత్రానివిద్ధో
మణిరహమితి వాస్మీన్ద్రియార్థప్రతీతౌ l
ద్రష్టోSమ్యాత్మలోకాదితిశయన విధౌ మగ్న ఆనందసింధా-
వంతర్నిష్ఠో ముముక్షః స ఖలు
తనుభ్రుతాం యో నయత్యేవమాయుః ll
నీవు నడుస్తూ వున్నపుడు
నిన్ను, ఆత్మ (పరమాత్మ ) అన్న
సముద్రము నుండి బయలుదేరిన అలలా భావించవలెను . ఆభావన నీకార్యములను నియంత్రించి
నిన్ను రుజుమార్గములో నడుపుతుంది. నాకు నేను లేచినాను ఫలానా చోటికి పోతున్నాను
అన్న భ్రమ నుండి బయటపడి, నీవెట్లు తిరిగినా కడలి
కడుపుకే కడకు చేరవలసినది అన్న స్పృహ ఉంచుకొంటే దుష్కార్యకారణభావావేశాములకు
తావుండదు. నీకు, నీవు నడచుచున్నంతసేపూ గుర్తుంచుకొనవలసినది నీ
మూలము అంటే ఆత్మా అను కడలిని. నీవు అలవు మాత్రమే! తిరిగీ
సంద్రమును సంగమించవలసిందే!
నీవు కూర్చున్న సమయమందు
దారము దూర్చిన మణిపూస మాదిరి స్థిరముగా నిలిచిపో! అంటే నీ మనసు నిన్నొదిలి
పయనించకుండా వుండేవిధముగా స్థిరచిత్తునివై కూర్చో, దారానికి కూర్చబడిన మణి తన
పరిమితిలో తానుంటుంది. నీ భావములో ఈ ఆలోచన మెదిలితే
నీవు నిశ్చల చిత్తునివై వుండగలుగుతావు.
నీచర్మ
చక్షువులతో నీకు ప్రీతికరమైన లేక నీ మనసు పడిన వస్తువు అంటే జీవి కావచ్చు నిర్జీవి
కావచ్చు, నీకు కనబడనేలేదను భావమును
ఏర్పరచుకొనగలిగితే నీ ధ్యానదశ భగవంతునికి చేరువైనట్లే! నీ మనసు అచంచలముగా నిలిచి
ఆత్మతో అనుసంధానమైనట్లే!
ఇక నీవు నిదురకు పూనుకొని
పడుకొంటే ఆత్మానంద సాగరములో మునుగుతున్నాను అన్న తలంపుతో నిదురించితే నీ చిత్తము
శివమయమై ఆత్మానంద జలధిలో అన్య చింతన లేక అనన్య ఆనంద పూరితునివై నీ సుషుప్తి
కాలమంతా పరమాత్మ సాయుజ్యమునందే గడుపుతావు.
ఈసనాతన ధర్మము ఒకే విషమును
ప్రతిపాదించుతుంది మరియు అదే విషయమునకు కట్టుబడియుంటుంది, అదేమిటంటే
అనాయేసేన మరణం వినా దైనఎన
జీవితంl
దేహాంతే తవసాయుజ్యం దేహిమే
పార్వతీ పతే ll
‘దేహిమే శ్రీసతీ పతే!’ అని శివకేశవ
భేదమును పాటించేవారు ‘ప్రతినియుక్తము’ చేసుకొన వచ్చును. శివుడు వేరు విష్ణువు వేరు
అన్న సంకుచిత భావము వీడితే ఈ లోకమంతా పరమాత్మ స్వరూపము గానే కనబడుతుంది.
భావమును నా చేతనయిన రీతిలో
తెలిపినాను కానీ నేనూ సాధకుడనే! ఈ జన్మకు సాధించుతానో లేదో కూడా తెలియదు. నాకు
తెలుసు, నా నిష్ఠ చాలదు. అయినా పిన్న
వయస్కులు సాధన మొదలుపెట్టవలెననే బలమైన తలంపు గలవారు, అభినవ విద్యాతీర్థ మహా
స్వామివారు చెప్పిన ఈ శ్లోకమును మనసావాచాకర్మణః ఆచరించుతారనే నమ్మకముతో
తెలుపుచున్నాను.
చెరుకు రామ మోహన్ రావు